నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే : సీఎం జగన్‌ | CM Jagan Hold Review Meeting On Drug Control Administration | Sakshi
Sakshi News home page

నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే : సీఎం జగన్‌

Published Mon, Aug 3 2020 8:05 PM | Last Updated on Mon, Aug 3 2020 8:57 PM

CM Jagan Hold Review Meeting On Drug Control Administration - Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డ్రంగ్‌ కంట్రోల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో  డైరెక్టర్‌ జనరల్, డ్రగ్స్‌ అండ్‌ కాపీరైట్‌ రవిశంకర్‌ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్కెట్‌లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. 
(చదవండి : ప్రముఖ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు)

రాష్ట్రంలో 285కిపైగా యూనిట్లు,34వేలకు పైగా జౌషధాలు అమ్మే దుకాణాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పరిమితమైన మానవవనరులు, ల్యాబ్‌ కెపాసిటీ స్వల్పంగా ఉందని, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. డ్రగ్‌ కంట్రోల్‌ కార్యకలపాలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ జౌషధాలను అరికట్టాల్సిందేని సీఎం జగన్‌ తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రగ్‌ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు. (చదవండి : ‘చంద్రబాబూ నమ్మకం ఉంటే.. మా సవాల్‌ స్వీకరించు’)

విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్ధ్యం పెంపునకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. డ్రగ్‌ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై దృష్టిపెట్టాలని  సూచించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గొప్ప విధానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. థర్ట్‌ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు. మందు దుకాణాల వద్దే కంప్లైంట్‌ ఎవరికి చేయాలి? ఏ నంబర్‌కు చేయాలన్న సమాచారాన్ని ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మందులపైనా కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు.నకిలీ మందుల తయారీ, విక్రయం, నాణ్యతలేని మందుల తయారీ విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు అందించాలని సీఎం జగన్‌ సూచించారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు డిజిటిల్‌ పద్ధతిలో నిక్షిప్తం, వీటిపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు నివేదన అదించాలన్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు సిబ్బంది పూర్తిస్థాయి పరిజ్ఞానంపై శిక్షణ, కొత్త ప్రొసీజర్స్‌పైన పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు నెలరోజుల్లో పై అంశాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement