
సాక్షి, తిరుపతి: చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను.. అంతెందుకు ఒక దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తిరుపతి పర్యటన సందర్భంగా.. తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. ‘‘చదువు అనేది గొప్ప ఆస్తి.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి. తలరాతలు మార్చేసే శక్తి చదువుకు ఉందని నమ్మే వ్యక్తిని నేను. 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం సంతోషంగా ఉంద’’ని సీఎం జగన్ తెలిపారు.
గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చింది. పాదయాత్రలో ఎన్నో కష్టాలను కళ్లారా చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదనుకున్నా. అందుకే.. విద్యార్థులకు లబ్ధి చేకూరే పథకాలతో గొప్ప విప్లవం తీసుకొచ్చాం అన్నారు సీఎం జగన్. విద్యాదీవెన అనేది రాష్ట్రంలోనే గొప్ప పథకం అని, అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. అరకోర ఫీజులతో, రీయంబర్స్మెంట్లతో గత ప్రభుత్వం వ్యవహరిస్తే.. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించి మరీ విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఏంటో మీరే గమనించడని తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం జగన్ కోరారు. అంతేకాదు గతంలోని ప్రభుత్వం.. ఇప్పుడున్న పథకాల్లాంటివి ఏమైనా ప్రవేశపెట్టిందా? అని అడిగారు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment