
సాక్షి, అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మందుకు పేరు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఆక్సిజన్ స్థాయిలు పెరిగేందుకు కరోనా రోగుల కంట్లో వేసే ఐ డ్రాప్స్కు ఆమోదం తెలిపే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో కొంత పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బొనిగె ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment