
రెండురోజులు విస్తారంగా వానలు
విస్తరించనున్న రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి. అనేకచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
సోమవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, మంగళవారం అల్లూరి, శ్రీసత్యసాయి, వైఎస్సార్, తిరుపతి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కాకినాడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment