
( ఫైల్ ఫోటో )
అమరావతి: అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకని, మరి అటువంటిప్పుడు డెడ్లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమవుతుందా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం జగన్ లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, అమరావతి నిర్మాణం అంశాలపై శనివారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకని పేర్కొన్నారు.
లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏంటి?, కేవలం ఒక్క ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా అని ప్రశ్నించారు. నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చని ఆయన తెలిపారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారన్నారు.
ఇక కొత్త జిల్లాల అంశంపై మాట్లాడుతూ.. ‘కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. ఎప్పడైనా నోటిఫికేషన్ వస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకుని జిల్లాల విభజన చేస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుంది. చిన్న చిన్న మార్పులతోనే నోటిఫికేషన్ వెలవడబోతోంది.
90 శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్, పొలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోటా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయి. మంత్రి వర్గం విస్తరణ మొత్తాన్ని సీఎం చూస్తున్నారు.సీఎం జగన్ సోషల్ జస్టిస్కు అనుగుణంగానే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా క్యాబినెట్ కసరత్తు ఉంటుంది’ అని సజ్జల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment