
దీక్షలో పాల్గొన్న న్యాయవాదులు
కర్నూలు(సెంట్రల్): ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాల్సిందేనని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది జయరాజు డిమాండ్ చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలని న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఆదివారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలుకు హైకోర్టును తరలించే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు.
సీఎం వైఎస్ జగన్ హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు సానుకూలంగా ఉన్నా ప్రతిపక్ష పార్టీలు అమరావతి భ్రమలో ఉన్నాయన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలన్నారు. దీనిని అమలు చేయకుండా గతంలో చంద్రబాబు సీమకు అన్యాయం చేశారన్నారు.
దీక్షల్లో న్యాయవాదులు శ్రీనివాసులు, సోమశేఖర్, కె.రవికుమార్, ఎం.సుంకన్న, ఎం.మహావిష్ణు విజయలక్ష్మి కూర్చున్నారు. వారికి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కె.రంగడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రావిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, వెంకటస్వామి, సుబ్బయ్య మద్దతు తెలిపారు.