
కాకినాడలో ఓ మహిళ ఘాతుకం
అత్తింటి వేధింపులే కారణమని
మృతురాలి తల్లి ఆరోపణ
కాకినాడ క్రైం: కన్న పేగుని చిదిమేసి తానూ తనువు చాలించిన తల్లి హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, రాజమహేంద్రవరానికి చెందిన గుడేటి రమ్యదీప్తి(30)కి ఐదేళ్ల క్రితం కాకినాడ రేచర్లపేట దౌర్లవారి వీధికి చెందిన రాజాల శరత్తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కియాన్ ప్రశాంత్ ఉన్నాడు. రెండు నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తన కుమారుడితో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చింది.
అక్కడ ఒకటిన్నర నెలల పాటు ఉండి, సుమారు పది రోజుల క్రితం కాకినాడలోని అత్తయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. ఏమైందో, ఏమో మంగళవారం రాత్రి నిద్రపోయేందుకు కుమారుడితో కలిసి తన గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి దీప్తి అత్తయ్య, ఆడపడుచు కిటికీ నుంచి గదిలోకి చూశారు. దీప్తి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె కుమారుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా.. దీప్తి అప్పటికే చనిపోయి ఉంది. బాలుడు ప్రశాంత్కు ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి.
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ ఇన్చార్జి సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకు ముందు తన కుమారుడి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, ఊపిరాడకుండా చేసి ఉంటుందని గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నామని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని సీఐ చెప్పారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాఉంటే, అత్త, ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేకున్నానని దీప్తి తమకు వాయిస్ మెజేస్లు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడిందని దీప్తి తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.