
మదనపల్లె రూరల్(అన్నమయ్య జిల్లా) : భర్త వేధింపులు భరించలేక, క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం చింతామణికి చెందిన రాణి(30) భర్తతో విడాకులు తీసుకుని కుమార్తె లేఖన, కుమారుడు సుమిత్తో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట సత్యసాయిజిల్లా పాలసముద్రం మండలం బోయలపల్లెకు చెందిన డ్రైవర్ అశోక్తో రాణికి పరిచయం ఏర్పడి సహజీవనం చేసేంతవరకు వెళ్లింది. అయితే అశోక్కు అంతకు మునుపే తంబళ్లపల్లెకు చెందిన మౌనిషాతో వివాహమైంది.
ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. కొద్దిరోజుల క్రితం అశోక్కు ప్రమాదంలో కాలు విరగడంతో రాణి దగ్గరుండి చికిత్స చేయించి, కోలుకున్నాక స్వగ్రామంలో విడిచిపెట్టింది. తల్లిదండ్రుల సూచన మేరకు అశోక్తో సహజీవనం వద్దనుకుని బెంగళూరుకు వెళ్లి కూలిపనులు చేసుకుంటోంది. ఈనెల 22న గురువారం అశోక్ రాణికి ఫోన్చేసి నీతో మాట్లాడాలని కోరడంతో కుమార్తె లేఖనను వెంటతీసుకుని 23 వ తేదీ శుక్రవారం మదనపల్లెకు వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నాక, తమ బంధం కొనసాగింపు విషయమై గొడవపడ్డారు. నీ వేధింపులు నేను భరించలేనంటూ మనస్తాపంతో రాణి కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
దీంతో ఆమె కోసం పట్టణమంతా వెతికి కనిపించకపోవడంతో రాత్రి ఊరికి వెళ్లేందుకు అశోక్ ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. బస్టాండ్లో రాణి కనిపించడంతో మరోసారి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆవేశంతో రాణి బస్టాండ్ వెనుక వైపు ఉన్న కోమటివానిచెరువు కట్ట వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన. ప్రమాదంలో ఆమె శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, టూటౌన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది.