లంకమల అరణ్యం.. వర్థిల్లిన శైవం | More than ten Shiva temples in Kondur Beatu | Sakshi
Sakshi News home page

లంకమల అరణ్యం.. వర్థిల్లిన శైవం

Published Thu, Feb 13 2025 5:35 AM | Last Updated on Thu, Feb 13 2025 5:35 AM

More than ten Shiva temples in Kondur Beatu

కొండూరు బీటులో పదికిపైగా శివాలయాలు  

ఆలయాల పక్కనే వెలుగులోకి వచ్చిన గుహలు 

4వ శతాబ్దిలో శైవం వర్థిల్లిన ఆనవాళ్లు 

పక్కనే రాతిబండపై ఆయుధాల గుర్తులు 

ఇక్కడే శివుని పాదముద్రలు, బండపై శాసనాలు 

ఈ ప్రాంతమే కైలాసకోనగా ప్రాచుర్యం

బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని సిద్దవటం అటవీ ప్రాంతమైన లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక.. ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయన్న ఉత్సుకత పెరు­గుతోంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విష­యం బయ­టికి వస్తోంది. కొత్తగా సిద్దవటం అటవీశాఖ క్షేత్రాధికారిణి బి.కళావతి.. వెలుగులోకి తెచ్చిన ఫొటోల ఆధారంగా మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచంలోకి వ­చ్చాయి. 

సాక్షిలో ‘ఆధ్యాత్మిక క్షేత్రం.. లంకమల’ కథ­నం ద్వా­రా పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తేవ­డం తెలిసింది. ప్రస్తుతం ఆ కథనానికి మరింత బలం చేకూర్చే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకే చోట గుహ, బండపై శాసనం, శిథిలమైన శివాలయాల ఆనవాళ్లు, శివుని పాద ముద్రలు, అక్కడే పైనుంచి కిందికి దూమికే జలపాతం.. ఇలా అన్నీ ఆధారాలు వెలు­గులోకి వచ్చిన ఈ ప్రాంతానికి కైలాసకోనగా ప్రాచు­ర్యం ఉంది. 

అంటే శివుడు నివసించిన ప్రాంతమని అర్థం. కాబట్టి శైవం ఏ స్థాయిలో ఇక్కడ వర్దిల్లిందో దీ­న్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అందిన ఆధా­రాల­ను పురావస్తుశాఖ క్షుణ్ణంగాపరిశీలిస్తోంది.  

బండలపై ఆధారాలు 
ఈ ప్రాంతంలో శైవ క్షేత్రం వర్థిల్లిందని.. ఆనాటి శైవులు బండలపై శాసనాలు, ఇతర గీతల ద్వారా వెల్లడవుతోంది. శాసనాలను బట్టి 4వ శతాబ్దినాటి శైవులు ఇక్కడ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు వినియోగించారో.. తెలిపేలా బండలపై వాటి ఆకృతి తెలిపేలా చెక్కారు. మరోచోట శాసనం, పక్కనే శివలింగ ఆకారం ఉన్నాయి. ఇక్కడి శిథిల ఆలయాల నిర్మాణం కోసం చుతురస్రాకారంలో ఉండే బండలను వినియోగించారని, వాటిని బట్టి స్పష్టం అవుతోంది.

పై కైలాసం.. జారే జలపాతం 
శైవ క్షేత్రాలున్నట్టు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే పై కైలాసకోన ఉంది. ఇది అద్భుతమైన జలపాతం. పై నుంచి జలపాతం కిందకు దూకే ప్రాంతం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కొండనడుమ దూకే జలపాత ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తుంది. ఈ జలపాతంపై నుంచి కిందకు జారితే కైలాసానికి చేరినట్టే. అందుకనే దీన్ని పై కైలాసంగా ప్రాచుర్యంలో ఉంది. జలపాతం దిగువన గుహలు, ఆలయాలతో కూడిన ప్రదేశమే దిగువ కైలాసకోన.  

అక్కడే గుహ.. ఆలయాలు
లంకమల మొత్తం 36 వేల హెక్టార్ల మేర విస్తరించి ఉండగా.. అందులో సిద్దవటం రేంజి పరిధిలో 26 వేల హెక్టార్ల అభయారణ్యం ఉంది. అడవిలో­ని కొండూరు బీటులో శైవ క్షేత్ర ఆనవాళ్లు విస్తృతంగా లభ్యమయ్యాయి. దిగు­వ కైలాసకోనగా పిలువబడే.. ఈ ప్రదేశంలో అర ఎకరం విస్తీర్ణంలో పదికిపైగా శివాలయాల శిథిలాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పునాదుల బండరాళ్లు, వాటి నిర్మాణం కనిపిస్తున్నాయి. 

పడిపోయిన గోడలు, వాటి శిథిలాలు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుంటే వాటిని ఆలయాలుగా భావిస్తున్నారు. ఈ చోటనే గుహను కూడా గుర్తించారు. ఆలయాల వద్ద పూజల నిర్వహణ, గుహలో సిద్దులు, యోగులు తపస్సు చేసుకునే వారు. ఇక్కడే శివుడ్ని ఆరాధిస్తున్న వీరుడి విగ్రహం లభ్యమైంది. 

ఈ ప్రాంతం దిగువ కైలాసకోనగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఈ అడవికి సమీపంలో సిద్దవటం గ్రామం ఉంది. అంటే సిద్దులకు ఈ ప్రాంతం నివాసమని భావిస్తున్నారు. దీనివల్లె సిద్దవటం అని పేరొచ్చిందని చెబుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement