archaeological department
-
లంకమల అరణ్యం.. వర్థిల్లిన శైవం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని సిద్దవటం అటవీ ప్రాంతమైన లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక.. ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయన్న ఉత్సుకత పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. కొత్తగా సిద్దవటం అటవీశాఖ క్షేత్రాధికారిణి బి.కళావతి.. వెలుగులోకి తెచ్చిన ఫొటోల ఆధారంగా మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. సాక్షిలో ‘ఆధ్యాత్మిక క్షేత్రం.. లంకమల’ కథనం ద్వారా పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తేవడం తెలిసింది. ప్రస్తుతం ఆ కథనానికి మరింత బలం చేకూర్చే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకే చోట గుహ, బండపై శాసనం, శిథిలమైన శివాలయాల ఆనవాళ్లు, శివుని పాద ముద్రలు, అక్కడే పైనుంచి కిందికి దూమికే జలపాతం.. ఇలా అన్నీ ఆధారాలు వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతానికి కైలాసకోనగా ప్రాచుర్యం ఉంది. అంటే శివుడు నివసించిన ప్రాంతమని అర్థం. కాబట్టి శైవం ఏ స్థాయిలో ఇక్కడ వర్దిల్లిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అందిన ఆధారాలను పురావస్తుశాఖ క్షుణ్ణంగాపరిశీలిస్తోంది. బండలపై ఆధారాలు ఈ ప్రాంతంలో శైవ క్షేత్రం వర్థిల్లిందని.. ఆనాటి శైవులు బండలపై శాసనాలు, ఇతర గీతల ద్వారా వెల్లడవుతోంది. శాసనాలను బట్టి 4వ శతాబ్దినాటి శైవులు ఇక్కడ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు వినియోగించారో.. తెలిపేలా బండలపై వాటి ఆకృతి తెలిపేలా చెక్కారు. మరోచోట శాసనం, పక్కనే శివలింగ ఆకారం ఉన్నాయి. ఇక్కడి శిథిల ఆలయాల నిర్మాణం కోసం చుతురస్రాకారంలో ఉండే బండలను వినియోగించారని, వాటిని బట్టి స్పష్టం అవుతోంది.పై కైలాసం.. జారే జలపాతం శైవ క్షేత్రాలున్నట్టు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే పై కైలాసకోన ఉంది. ఇది అద్భుతమైన జలపాతం. పై నుంచి జలపాతం కిందకు దూకే ప్రాంతం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కొండనడుమ దూకే జలపాత ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తుంది. ఈ జలపాతంపై నుంచి కిందకు జారితే కైలాసానికి చేరినట్టే. అందుకనే దీన్ని పై కైలాసంగా ప్రాచుర్యంలో ఉంది. జలపాతం దిగువన గుహలు, ఆలయాలతో కూడిన ప్రదేశమే దిగువ కైలాసకోన. అక్కడే గుహ.. ఆలయాలులంకమల మొత్తం 36 వేల హెక్టార్ల మేర విస్తరించి ఉండగా.. అందులో సిద్దవటం రేంజి పరిధిలో 26 వేల హెక్టార్ల అభయారణ్యం ఉంది. అడవిలోని కొండూరు బీటులో శైవ క్షేత్ర ఆనవాళ్లు విస్తృతంగా లభ్యమయ్యాయి. దిగువ కైలాసకోనగా పిలువబడే.. ఈ ప్రదేశంలో అర ఎకరం విస్తీర్ణంలో పదికిపైగా శివాలయాల శిథిలాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పునాదుల బండరాళ్లు, వాటి నిర్మాణం కనిపిస్తున్నాయి. పడిపోయిన గోడలు, వాటి శిథిలాలు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుంటే వాటిని ఆలయాలుగా భావిస్తున్నారు. ఈ చోటనే గుహను కూడా గుర్తించారు. ఆలయాల వద్ద పూజల నిర్వహణ, గుహలో సిద్దులు, యోగులు తపస్సు చేసుకునే వారు. ఇక్కడే శివుడ్ని ఆరాధిస్తున్న వీరుడి విగ్రహం లభ్యమైంది. ఈ ప్రాంతం దిగువ కైలాసకోనగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఈ అడవికి సమీపంలో సిద్దవటం గ్రామం ఉంది. అంటే సిద్దులకు ఈ ప్రాంతం నివాసమని భావిస్తున్నారు. దీనివల్లె సిద్దవటం అని పేరొచ్చిందని చెబుతారు. -
అదిగో.. నాలుగో శతాబ్దపు మానవుల జాడలు
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రేంజిలోని లంకమల అభయారణ్యంలో గురువారం వెలుగుచూసిన శిలా శాసనాలు 4–15 శతాబ్దాల మధ్య కాలపు అతి పురాతన మానవ ఆనవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా రాయలసీమలో శంఖు లిపి ఆనవాళ్లు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. తొలిసారిగా ఈ అటవీ ప్రాంతంలో ఈ ఆనవాళ్లు లభించడం చాలా అరుదైన విషయమని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అటవీ శాఖాధికారుల ద్వారా వెలుగులోకి వచ్చిన 15 శాసనాల్లో కొన్నింటిని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. మునిరత్నంరెడ్డి తర్జుమా చేశారు. ఐదు శాసనాలను శుక్రవారం అధ్యయనం చేయగా, తొలిసారి రాయలసీమలో లభ్యమైన శంఖు లిపి శాసనాల అధ్యయనం అంత సులువుగా సాధ్యంకాదని తేల్చారు. ఒకేచోట వేర్వేరు శతాబ్దాలకు చెందిన లిపి ఆధారాలు ఉండటం విశేషం. కొండూరు, రోళ్లబోడు, ముత్తుకూరు, మద్దూరు, సిద్ధవటం అభయారణ్య ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన శాసనాల్లో చిన్నచిన్న పదాలు మాత్రమే ఉన్నాయి. దీని ఆధారంగా పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులకు ఆ కాలంనాటి వ్యక్తులు, వాళ్ల ఉనికి చాటుకోవడం కోసం లంకమల అభయారణ్యంలో ఎవరు ఉండేవారో తెలిసేలా వారి పేర్లను ఇలా బండలపై చెక్కి ఉంటారని నిర్థారించారు. బ్రాహ్మీ లిపిలో ‘చంద్రహాస’.. అభయారణ్యంలో బండరాయిపై లభ్యమైన శాసనాల్లో బ్రాహ్మీ లిపి ఉంది. 4, 5, 6 శతాబ్దాల మధ్య ఈ లిపి మనుగడ సాగించింది. ఈ లిపిలో చంద్రహాస అని పేరు చెక్కి ఉంది. అంటే.. ఇతను ఈ అటవీ ప్రాంతంలో నివసించి.. ఈ ప్రాంతం తనదిగా భవిష్యత్తు తరాలకు తెలిసేలా బ్రాహ్మీ లిపిలో రాతిపై శాసనం చెక్కినట్లు నిర్ధారించారు. సంస్కృత భాష– నాగర లిపి మరో బండరాయిపై.. సంస్కృత భాష కలిసిన నాగర లిపిలో శాసనం చెక్కారు. ఇందులో రెండు పేర్లు ప్రస్తావించారు. ఎనిమిదో శతాబ్దిలో ‘శ్రీ విశిష్ట కంకణ దారి’ అని చెక్కి ఉంది. ఇది కూడా పేరుకు సంబంధించిన శాసనంగా తేల్చారు. ఇతను అప్పట్లో ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తన గురించి తెలిపేలా ఈ శాసనం వేసుకున్నట్లు నిర్థారించారు. ఇందులోనే 15వ శతాబ్దికి చెందిన సంస్కృత భాషలో ‘స్థల కర చానప్ప’ పేరు కూడా చెక్కి ఉంది. సంస్కృతంలో బ్రాహ్మీ లిపి.. ఇక నాలుగు–ఐదు శతాబ్దాలకు చెందిన సంస్కృతంలో ఉన్న బ్రాహ్మిలిపిని కూడా కనుగొన్నారు. ఈ భాష, లిపి కలయికతో ఉన్న శాసనంలో ‘యే ధర్మజ’ అన్న పేరు ఉంది. ఇతను ఈ ప్రాంత నివాసిగా శాసనం వేయించుకున్నట్లు తేల్చారు. వారంతా శైవభక్తులు.. లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చిన శాసనాల ఆధారంగా అప్పటి మానవులు శైవభక్తులుగా గుర్తించారు. అప్పట్లో వీరు బుద్ధ–జైన మతాలను వ్యతిరేకించే వారని.. దీనిబట్టి నాటి శైవ ధర్మాన్ని వ్యాపింపజేశారని వీటి ఆధారంగా అధ్యయనం చేశారు. ఒక శాసనం పక్కన శివలింగ ఆకారం చెక్కి ఉండడంతో దీన్నిబట్టి నాటే మత పరిస్థితులను అంచనా వేశారు. లిపి పరిణామ క్రమం.. లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చిన శాసనాలు ఓ కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. అదేంటంటే.. లిపి పరిణామ క్రమం. 4, 5, 6 శతాబ్దాలకు చెందిన బ్రాహ్మిలిపి, 4, 5, 6, 7, 8 శతాబ్దాలకు చెందిన సంస్కృత భాష, 6, 7, 8 శతాబ్దాలకు చెందిన నాగర లిపి, 14వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపి.. ఈ మొత్తం లిపి, భాషతో కూడిన శాసనాలు లభించాయి. ఇది అరుదైన విషయం. దీంతో లంకమల అభయారణ్యం లిపి పరిణామ క్రమానికి సాక్ష్యంగా నిలిచింది.శంఖు లిపి అతి కష్టంఏపీలో ఆంధ్ర ప్రాంతంలో శంఖు లిపి వెలుగుచూసింది. రాయలసీమలో మొదటిసారిగా లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆరో శతాబ్దానికి చెందిన శంఖు లిపి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. దీంతో ఆ కాలంలో మానవ మనుగడపై సరైన ఆధారాల్లేవు. ఇప్పుడు లంకమలలో వెలుగు చూడటంవల్ల దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. లంకమల అభయారణ్యం మానవ మనుగడపై పరిశోధన కేంద్రంగా మారబోతోంది. వెలుగు చూసిన శాసనాల్లో 4 నుంచి 15వ శతాబ్ది మధ్య మానవ పరిణామక్రమం.. లిపి పరిణామ క్రమంపై లోతైన అధ్యయనానికి భారతీయ పురావస్తు శాఖ సిద్ధమవుతోంది. -
చరిత్రకు సాక్ష్యం.. క్రీస్తుపూర్వపు సమాధులు
అద్దంకి: పురావస్తులోనూ, ఇటు తెలుగు సాహిత్యంలోనూ బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం ఎంతో పేరెన్నికగన్నది. అద్దంకి, బల్లికురవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తుపూర్వం నాటి సమాధులు తరచూ వెలుగుచూస్తుండడంతో ఈప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుంచి 5వ శతాబ్ద ప్రాంతంలో నివసించిన వారి మృతదేహాలకు సంబంధించిన పెద్దపెద్ద సమాధుల (రాక్షస గూళ్లు)ను స్థానిక శాసన, పురావస్తు పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి గుర్తించి పురావస్తు శాఖకు సమాచారమిచ్చారు. పురాతన సమాధులున్న ప్రాంతాలివే.. అద్దంకి మండలంలోని దేవనువకొండ, పేరాయిపాలెం, అద్దంకి కొండ, ధర్మవరం (జంగమహేశ్వర అగ్రహారం), మణికేశ్వరం, రామకూరు, మార్టూరు మండలంలోని ద్రోణాదుల, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి గ్రామాల్లోని కొండ దిగువ భాగాల్లో క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 5వ శతాబ్ద కాలంలో నివసించిన మానవుల సమాధులు ఐదారేళ్లుగా బయటపడుతూ వస్తున్నాయి. నాటి మనుషుల ఎత్తు ఏడడుగుల పైనే.. క్రీస్తుం పూర్వం ఇక్కడ నివసించిన మనుషుల ఎత్తు ఏడడుగుల ఎత్తుకు పైమాటే అనేది ఇక్కడ లభించిన సమాధుల పొడవును బట్టి పరి«శోధకులు అంచనా వేస్తున్నారు. ఇవి ఏడడుగుల పొడవు, నాలుగడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉన్నాయి. సమాధికి మూడువైపులా పలకరాళ్లు, పైన ఒక పలకరాయి మూతపెట్టి.. సమాధి తలభాగంలో అప్పట్లో తయారుచేసిన కుండలో మరో చిన్న కుండ పెట్టి అందులో ఆనాడు వారు పండించిన కొర్రలు, జొన్నలు, రాగులను ఉంచారు. దీనిబట్టి ఆ రోజుల్లో ఇవే వారి ఆహారమని అర్థమవుతోంది. పోడు వ్యవసాయం.. ఇక అప్పట్లో అద్దంకి గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం మొత్తం అడవులతో నిండి ఉండేదని తెలుస్తోంది. ఇక్కడ నివసించిన సంచార జాతులు అడవుల్లోని చెట్లను నరుక్కుని అక్కడే ఉండేవారు. ఆధిపత్య పోరులో యుద్ధాలు జరిగే సమయంలో ముందుగానే సమాధులను తయారుచేసి ఉంచి, మరణించిన వారి మృతదేహాలను వాటిల్లో ఉంచేవారని తెలుస్తోంది. ఈ సమా«ధులపై మట్టివేసి పూడ్చిన తరువాత పైభాగంలో గుండ్రని ఆకారంలో రాళ్లను పాతేవారు. ఇదిలా ఉంటే.. క్రీస్తు పూర్వంలోనే నాగరికత ఉందని చెప్పడానికి ఈ సమాధులే నిదర్శనం. సమాధుల తలభాగంలో ఉంచిన మట్టి కుండలు (మృణ్మయ పాత్రలు) ఇప్పటికీ చెక్కుచెదరక (తవ్వకాల్లో పగిలిపోయాయి) ఉన్నాయి. ఈ కుండలు కొన్ని పూర్తిగా ఎర్రగానూ, మరికొన్ని సగభాగం వరకు ఎర్రగా ఉండి, మిగిలిన సగం నల్లగా ఉన్నాయి. పైభాగంలో నగిషీలు చెక్కిఉంచారు. తవ్వకాలు జరిపితే మరిన్ని ఆనవాళ్లు.. పురాతన సమాధులు బయటపడిన ప్రదేశాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే మరిన్ని ఆనవాళ్లు లభించడమే కాక, భావితరాలకు నాటి విశేషాలు అందించిన వారమవుతాం. అద్దంకి చరిత్ర ఇప్పటి తరానికే కాగా దేశం నలుమూలలా చాటి చెప్పాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం నడుం బిగించాలి. – విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, శాసన పరిశోధకుడు, రచయిత -
MP: ‘భోజ్శాల’ కాంప్లెక్సులో ఆర్కియాలజీ సర్వే
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్లోని వివాదాస్పద భోజ్శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్సులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య డజను మంది ఆర్కియాలజీ సిబ్బంది, ధార్ జిల్లా అధికారులు సర్వే మొదలు పెట్టారు. సర్వే జరుగుతుండగా ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతా డ్రిల్ చేపట్టారు. ‘2022 మేలో మేం ఆర్కియాలజీ సర్వే కోసం కోర్టులో పిటిషన్ వేశాం. కార్బన్ డేటింగ్ సహా పూర్తిస్థాయి టెక్నాలజీ వాడి సర్వే చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సర్వే మొదలైంది. ఆరు వారాల తర్వాత సర్వే నివేదిక వస్తుంది’ అని భోజ్శాల సర్వే కోసం పిటిషన్ వేసిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ ఆశిశ్ గోయెల్ చెప్పారు. కాగా, మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు -
అడవిలో అనంత చరిత్ర.. ప్రకాశం జిల్లాలో బయటపడ్డ ఆధారాలు!
కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు.. శాయపునాయుడి వంశస్తుల పాలనలో ఎందరో చక్రవర్తులు, మహారాజులు నడయాడిన నేల పశ్చిమ ప్రకాశం. గతమెంతో ఘనమైన చరిత్రను నింపుకుంది ఈ ప్రాంతం. దట్టమైన అటవీప్రాంతం.. కొండలు.. కోనలు.. లోయలు.. ఇరుకైన రహదార్లు ఉన్న నల్లమల అటవీ ప్రాంతం ఆనాడు రక్షణ కవచంగా ఉండేది. చరిత్రకారులపరిశోధనల్లో లభ్యమవుతున్న పలు శాసనాలు వీటిని ధ్రువీకరిస్తున్నాయి. 5 వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగానికి చెందిన పురాతన మానవుల సమాధులు సైతం ఇక్కడ బయటపడ్డాయి. ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతంలోని ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందా మరి.. – ఒంగోలు డెస్క్ యర్రగొండపాలెం మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తురిమెళ్ల శ్రీనివాస్ చేసిన పలు పరిశోధనల్లో శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే శాసనాలు లభ్యమయ్యాయి. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ధ్రువీకరించారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు పురాతన, చారిత్రక నేపథ్యముంది. ఈ ప్రాంతాన్ని కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు, అలాగే శాయపునాయుడి వంశస్తులు పాలించారని తెలియజేసే ఎన్నో ఆధారాలు పదిలంగా ఉన్నాయి. 11వ శతాబ్దం ప్రారంభానికి చెందిన కొత్తిపి చాళుక్యుల సామ్రాజ్యానికి చెందిన శాసనం పుల్లలచెరువు మండలం శతకోడులో లభ్యమైంది. కొచ్చెర్లకోట రామలింగేశ్వరస్వామి ఆలయంలో లభ్యమైన కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలం నాటి శాసనం విజయనగర సామ్రాజ్యంలో రెండో బుక్కరాయల కుమారుడు మొదటి దేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చివెళ్లారు. ఇందుకు సంబంధించి యర్రగొండపాలెం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతమైన పొన్నలబైలు వద్ద శాసనం లభ్యమైంది. 12, 13వ శతాబ్దాల్లో పాలించిన కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ప్రతాపరుద్రుని శాసనం దొనకొండ మండలం కొచ్చెర్లకోట శివాలయం సమీపంలో బయటపడింది. ఈ ప్రాంతానికి రుద్రమదేవి, అంబదేవుడు, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు వచ్చి వెళ్లినట్టు శాసనం ద్వారా తెలుస్తోంది. దూపాడు పరగణా, కొచ్చెర్లపాడు సీమ పేరుతో కాకతీయులు పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక విజయనగర రాజులు పాలన మొదలైంది. శాయపునాయుడి వంశస్తులు(కమ్మరాజులు) శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యంలో దూపాడు పరగణా సంస్థానాధీశులు. వీరు దట్టమైన అటవీ ప్రాంతంలో దద్దనాల వద్ద కోట నిర్మించుకున్నారు. పెద్ద పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1512లో కృష్ణదేవరాయలు శాయపునాయుడి వంశస్తులను పాలించమని అవకాశమిచ్చారు. ఆ తర్వాత తురుష్కుల దాడిలో మొత్తం పట్టణంతోపాటు, కోట ధ్వంసమైంది. తర్వాత వారు యర్రగొండపాలెం వచ్చారు. ఇందుకు సంబంధించి బోయలపల్లి వద్ద శాసనం లభ్యమైంది. దద్దణాల కోటలో పెద్ద కోనేరు ఉంది. ఇక్కడ రోళ్లు ఇప్పటికీ ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన గజపతి రాజు తెలుగు రాయుడు పెద్ద చెరువు కట్టించారు. శ్రీశైలం వయా త్రిపురాంతకం పూర్వం ఎందరో మహరాజులు, వర్తకులు త్రిపురాంతకం మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. త్రిపురాంతకం నుంచి అమానిగుడిపాడు, దద్దనాల, పాలంక మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. వీరు తమ సైన్యం, గుర్రాలు, ఏనుగులు సేదతీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. సైనికుల కోసం సానికవరం, గుర్రాలు కట్టేసేందుకు గుర్రపుశాల, ఏనుగుల కోసం ఏనుగులదిన్నెపాడు ప్రాంతాలు ఉండేవి. దోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండలాల్లో ఇప్పటికీ అదే పేర్లతో గ్రామాలు ఉన్నాయి. చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు కొత్త రాతియుగం ఆనవాళ్లు పుల్లలచెరువు మండలంలోని చక్రాలబోడు వద్ద కొత్త రాతియుగానికి చెందిన ఐదు వేల ఏళ్లనాటి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇక్కడ పురాతన మానవుల సమాధులను ఇటీవల గుర్తించారు. కొండ రాళ్లపై ఆనాటి మానవులు చెక్కిన ఎద్దులు, మేకలు, మనుషుల ఆకృతులు వెలుగుచూశాయి. అలాగే త్రిపురాంతకం మండలం బొంకురవారిపాలెం వద్ద ఒకటో శతాబ్దం నాటి బౌద్ద శిల్పం లభ్యమైంది. చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు శత్రుజాడ కనిపెట్టేలా.. ఇరుకుదారులు.. కొండాకోనలు ఉండటంతో శత్రువుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు చక్రవర్తులు ఆనాడు ఈ ప్రాంతాన్ని రక్షణ కవచంగా వినియోగించుకున్నారు. ఇక్కడ అనేక బురుజులు సైతం నిర్మించుకున్నారు. మొదటి దేవరాయలు తరుచూ ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుండేవారని తెలుస్తోంది. ఈ దట్టమైన కీకారణ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు తమ ప్రాంతంగా నిర్ధారించుకున్నారు కూడా. నల్లమల శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి దేవరాయలు కాలనికి చెందిన ఒక శాసనం లభ్యమవడంతో ఈ విషయాలు అవగతమవుతున్నాయి. నలురుగురు శిల్పులు చెక్కిన త్రిపురాంతకేశ్వరాలయం 13వ శతాబ్దానికి చెందిన శాసనం త్రిపురాంతకం కొండపైన బయటపడింది. దీని ఆధారంగా ఇక్కడ త్రిపురాంతకేశ్వరుని ఆలయ నిర్మాణానికి ఆనాడు ప్రముఖ శిల్పులుగా పేరొందిన హరిజేతి, రామజేతి, ధగజేతి, సింఘన కృషి చేశారు. ఇందుకు సంబంధించి తెలుగు, సంస్కృతంలో వీరి పేర్లతో ఉన్న చిత్రాలు లభ్యమయ్యాయి. ఆసక్తితోనే చారిత్రక పరిశోధన కురిచేడు మండలంలో ఒక దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్న సమయంలో సత్రం నిర్మిస్తుండగా కొన్ని పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి చారిత్రక పరిశోధనపై ఆసక్తి పెరిగింది. గుంటూరుకు చెందిన చరిత్రకారుడు మనిమేల శివశంకర్ ప్రోత్సాహంతో చరిత్రపై పరిశోధన కొనసాగించా. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఎపిగ్రాఫికా–తెలంగాణికా అనే పుస్తకంలో నేను కనుగొన్న కాకతీయ కాలం నాటి శాసనాన్ని ముద్రించారు. అలాగే మొదటి దేవరాయలు కాలానికి చెందిన శాసనానికి కరెంట్ అఫైర్స్లో స్థానం దక్కింది. తాను గుర్తించిన శాసనాలన్నీ భారత ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపగా ధ్రువీకరించి పరిశోధన దిశగా ప్రోత్సహించారు. – తురిమెళ్ల శ్రీనివాస్, చరిత్రకారుడు, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్, యర్రగొండపాలెం -
కళ్లకు కట్టినట్టు సాక్ష్యాలు.. తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తోన్న మన చరిత్ర
సాక్షి, నాగర్కర్నూల్: తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లు, పురాతన మూలాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా గ్రామాలకు ఉన్న పేర్లు ఎలా వచ్చాయి.. గతంలో ఎలాంటి చరిత్ర ఉండేదన్న ఆసక్తికరమైన అంశాలపై అధ్యయనం కొనసాగుతోంది. జిల్లాలో ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెబ్బేటి మల్లికార్జున్ను నియమించగా.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల నుంచి ఆరుగురు అధ్యాపకులు సభ్యులుగా ఉన్నారు. వెలుగులోకి కొత్త చరిత్ర.. జిల్లాలో నెల రోజులుగా మన ఊరు– మన చరిత్ర కార్యక్రమ అధ్యయన బృందం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. వాటి చరిత్రను అవలోకనం చేసుకునేందుకు గ్రామాల్లో వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి ఫొటోలతో సహా పుస్తకాల్లో నిక్షిప్తం చేసే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామం చుట్టుపక్కల గొలుసుకట్టు చెరువులతోపాటు కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను గుర్తించారు. ఆలయాల వద్ద ఆనాటి కాలంలో తవ్విన పురాతన బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడి పురాతన ఆలయంలోని శివలింగం తెలుపు రంగులో ఉండటం విశేషం. అంతకు ముందు ఈ గ్రామం పేరు తుర్కలపల్లిగా ఉండగా ఈ శివలింగం కారణంగానే మహదేవునిపేటగా స్థిరపడినట్టు బృందం సభ్యులు గుర్తించారు. ఈ గ్రామంలో హిందు, ముస్లిం గురువులు వేర్వేరుగా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ అక్కడే సమాధి అయ్యారని తెలుసుకున్నారు. ఈ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని బృందం సభ్యులు అభివర్ణిస్తున్నారు. ● గంగారం సమీపంలోని గుట్టల నుంచి ఎత్తైన రాళ్లను పగులగొట్టి నందివడ్డెమాన్ ఆలయాలను నిర్మించినట్టు తెలుసుకున్నారు. వడ్డెమాన్లోని త్రికూట ఆలయాల వద్దనున్న బుద్ధుడి ప్రతిమను బట్టి అక్కడ బౌద్ధమతం సైతం విలసిల్లిందని అధ్యాపకులు భావిస్తున్నారు. గ్రామాల్లో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమం ‘ఇక్కడ కనిపిస్తున్నది బిజినేపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని అటవీప్రాంతం. చరిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందిన నందివడ్డెమాన్లోని ఆలయాలు, పురాతన కోట నిర్మాణం కోసం ఇక్కడి రాళ్లనే వినియోగించారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన రాళ్లను పగులగొట్టిన ఆనవాళ్లు ఇప్పటికీ నాటి చరిత్రకు ఆధారంగా నిలుస్తున్నాయి’. ‘ఈ ఫొటోలో రాజసంగా కనిపిస్తున్న భవనం జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని పురాతన కోట. సుమారు 1625 సంవత్సరం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు ఈ కోట కేంద్రంగా రెడ్లు పాలన సాగించేవారు. వట్టెం కేంద్రంగా కొంతకాలం పాటు రెడ్డి వంశస్తుల పాలన సాగిందని మన ఊరు– మన చరిత్ర పరిశోధన బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. మరింత లోతుగా పరిశోధన చేస్తే చాలా వరకు చరిత్ర బయటపడుతుందని వారు చెబుతున్నారు.’ ఆలయాలపై ప్రధాన దృష్టి.. గ్రామాల చరిత్రతోపాటు ఆయా గ్రామాల్లోని ఆలయాలపై సమగ్రంగా దృష్టిసారించి అధ్యయనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లిలో ఉన్న నారసింహుని ఆలయానికి సంబంధించిన 1171 నాటి శాసనాన్ని గుర్తించారు. 12వ శతాబ్దంలోనే 500 ఎకరాల భూమిని ఆలయానికి దానం ఇచ్చినట్టుగా శాసనంలో పేర్కొని ఉంది. ● ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరెలా వచ్చింది.. గ్రామానికి ఉన్న ప్రధాన చారిత్రక మూలాలేంటి అన్నదానిపై పరిశోధన మొదలవుతుంది. క్రమంగా గ్రామ భౌగోళిక నైసర్గిక స్వరూపం, సమీపంలో ఉన్న వాగులు, సెలయేర్లు, చెరువులు, కొండల వంటి వివరాలను సమగ్రంగా తెలుసుకుని పొందుపరుస్తారు. ● గ్రామంలోని పురాతన ఆలయాలు, వాటి చరిత్ర, మతసామరస్యం వంటి అంశాలను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆసక్తికర విషయాలు.. మన ఊరు– మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గ్రామాల వారీగా చరిత్రను తెలుసుకునేందుకు అధ్యయనాన్ని మొదలుపెట్టాం. క్షేత్రస్థాయి సందర్శనలో పలు గ్రామాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మనకు తెలియని ఎంతో చరిత్ర దాగి ఉంది. వివిధ వర్గాల సహకారంతో విడతల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత తరం వారిలో తమ ఊరి పట్ల మమకారం మరింత పెరుగుతుంది. – మల్లికార్జున్,ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ -
AP: పురావస్తు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలకు (మ్యూజియాలకు) ప్రభుత్వం కొత్తకళ తీసుకురానుంది. శిథిలావస్థలోని మ్యూజియం భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మ్యూజియాల్లో అంతర్జాతీయస్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఆంటిక్విటీస్ (పురాతన వస్తువులు) డిస్ప్లే చేసేలా ప్రత్యేకదృష్టి సారిం చింది. తాజాగా విశాఖపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరుతో స్టేట్ మ్యూజియాన్ని నిరి్మంచనుంది. మరోవైపు కడపలోని భగవాన్ మహావీర్ మ్యూజియం, గుంటూరులోని బుద్ధశ్రీ మ్యూజియం, కర్నూలులోని జిల్లా మ్యూజియాల్లో కొత్త భవనాలు, ఇతర అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున డీపీఆర్లను రూపొందించింది. శాసనాల పరిరక్షణకు.. రాష్ట్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో లక్షలాది శాసనాలు, ఎస్టేంపేజీలు (శాసనాల కాపీలు) ఉన్నాయి. వీటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు, రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ‘శాసన మ్యూజియం’ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. తద్వారా ఇప్పటివరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకేవేదికపై ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. పెండింగ్లో రూ.436.50 కోట్ల డీపీఆర్లు రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలతో పాటు వారసత్వ నగరాల అభివృద్ధి, ఆంటిక్విటీస్ డిజిటలైజే‹Ùకు సంబంధించి రూ.436.50 కోట్ల డీపీఆర్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రూ.400 కోట్లతో రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా తీర్చిదిద్దనున్నారు. వైఎస్సార్ జిల్లాలోని మైలవరం, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, జిల్లా కేంద్రం కాడినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్ మ్యూజియాల డీపీఆర్లకు అనుమతులు రావాల్సి ఉంది. మ్యూజియాల్లో ప్రవేశపెట్టే అంతర్జాతీయస్థాయి సాంకేతికత ఇలా.. - ఇంటరాక్టివ్ రెస్పాన్సివ్ డిజిటల్ వాల్ - వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ - ఇంటరాక్టివ్ డిస్ప్లే కియోస్క్ - ఆడియో–వీడియో టెక్నాలజీ - ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ బుక్ వారసత్వ విలువలను ప్రోత్సహించాలి ఏపీలోని మ్యూజియాలను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. మన అద్భుతమైన సంస్కృతి, వారసత్వ విలువలను ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని డీపీఆర్లు కేంద్రానికి పంపగా.. కొత్తగా మరో నాలుగు మ్యూజియాలకు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇకపై సామాజిక మాధ్యమాల ద్వారా మన మ్యూజియాల్లోని విశిష్టతను ప్రచారం చేయనున్నాం. – జి.వాణీమోహన్, కమిషనర్, పురావస్తుశాఖ -
వైఎస్సార్ జిల్లాలో బయటపడ్డ భూ గృహం
కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగర సమీపంలో భూ గృహం వెలుగు చూసింది. ఓ యూట్యూబర్ ముందుగా దానిని గమనించి కథనాలు ప్రసారం చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. నగరానికి దాదాపు 25 కి.మీ దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం, పైగా శ్మశానం కావడంతో అటువైపు ఎవరూ వెళ్లరు. అయితే యూట్యూబర్ వెలుగులోకి తేవడంతో దానిపై ఎవరికి వారు కథనాలు, ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కారాగారమని, ఖైదీలను అక్కడ చిత్రహింసలు పెట్టేవారని, సమీపంలో బుగ్గవంక ప్రాజెక్టు ఉండటంతో ఆ గృహం నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన సంపు అయి ఉండొచ్చని ప్రచారాలు సాగాయి. నవాబులు లేదా బ్రిటీషు కాలం నాటి రాచభవనాల వరండాలను పోలి ఉందని మరికొందరంటున్నారు. సైనికులు తలదాచుకునే బంకర్ అయి ఉండొచ్చని చరిత్రకారులు, పురావస్తుశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సైనిక పటాలాలకు అనుకూలంగా రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మించుకుంటారని కూడా వారు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో వెళ్లి పరిశీలిస్తామని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. -
భాగ్యనగర చరిత్రకు చెదలు.. పట్టించుకోని అధికారులు
సాక్షి, చార్మినార్( హైదరాబాద్): పాతబస్తీలోని హెరిటేజ్ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. పురాతన కట్టడాల పరిరక్షణను సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పాతబస్తీ ప్రజలంటున్నారు. ► గతేడాది జోరుగా కురిసిన భారీ వర్షాలకు నిజాం పాలకుల నివాస గృహమైన చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ గోడ కిటికి కూలిపోయింది. ►అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది. ► అలాగే ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా సతీమణి సర్దార్ బేగం చార్మినార్లోని సర్దార్ మహాల్ భవనంలో నివాసముండేది. ► నిజాం కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ► శాలిబండలోని క్లాక్ టవర్, సిటీ కాలేజీ భవనాలు ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ►శాలిబండ క్లాక్ టవర్ను అనుకొని ప్రైవేట్ వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ► దీని మరమ్మతు పనులు గతంలో ప్రారంభమైనప్పటికీ..నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ► సిటీ కాలేజీ భవనం కప్పు పూర్తిగా శిథిలాస్థకు చేరుకోవడంతో వర్షా కాలంలో వరద నీరు గదుల్లోకి చేరుకుంటోందని సంబంధిత అధికారులు,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచిపోయినా మరమ్మతులకు నోచుకోని చౌమహల్లా ప్యాలెస్.... యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌథం చౌమహల్లా ప్యాలెస్లోగతేడాది జూన్ 27న కిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న ప్రహరీ పైభాగంలోని కిటికి దిమ్మె కూలి కింద పడింది. మరమ్మతు పనుల కోసం ఏర్పాటు చేసిన సపోర్టుగా ఇనుప రాడ్లు తప్ప.. ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఆనాటి హెరిటేజ్ కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ..ఆ దిశలో పనులు జరగడం లేదు. నిజాం ప్రభువుల నివాస గృహం.. నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. ► దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. ► ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. ► వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ►ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. ►1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారం ఏర్పాటు చేశారు. ► విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్లో ఆతిథ్య మిచ్చేవారు. శిథిలావస్థకు చేరిన సర్దార్ మహల్... జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ (సర్దార్ మహల్) భవన సముదాయం శిథి శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి మరమ్మత్తులు చేయడం లేదు. భవనంలోని నిజాం కాలం నాటి చెక్క మెట్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ విరిగిపోయిన మెట్లపై నుంచే ప్రజలు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. -
400 ఏళ్ల చరిత్ర.. ముట్టుకుంటే ఊడిపోతోంది
సాక్షి, హైదరాబాద్: బాగా పాతబడిపోవటం, వాహన కాలుష్య ప్రభావం.. వెరసి చార్మినార్ కట్టడం పైపూత అత్యంత బలహీనంగా మారిపోతోంది. ఇప్పుడు కట్టడంలోని చాలా ప్రాంతాల్లో ముట్టుకుంటే చాలు పొరలుపొరలుగా మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య బాగా పెరిగిపోయింది. దాదాపు ఒక అంగుళం నుంచి రెండు అంగుళాల మేర కట్టడంపైనున్న డంగు సున్నం పూత అత్యంత బలహీనంగా మారినట్టు కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం గుర్తించింది. దీంతో అత్యవసర చర్యలు ప్రారంభించింది. కట్టడంలో ఏయే ప్రాంతాల్లో డంగుసున్నం పొరలు బలహీనంగా మారాయో గుర్తించి అంతమేర దాన్ని తొలగించి సంప్రదాయ డంగుసున్నం మిశ్రమాన్ని మెత్తే పని ప్రారంభించారు. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పై పొర తొలగించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది. సీనియర్ కన్సర్వేషన్ అసిస్టెంట్ భానుప్రకాశ్ వర్మ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ఆరు నెలలపాటు పనులు.. చార్మినార్ పరిరక్షణ చర్యలు తరచూ జరిగేవే. అయితే ఒకేసారి కావాల్సినన్ని నిధులు ఇవ్వకపోవడంతో మధ్యమధ్య విరామం ఇస్తూ పనులు చేస్తున్నారు. ఇది కూడా సమస్యలకు కారణమవుతోంది. రెండేళ్లక్రితం మరమ్మతు పనులు నిర్వహించారు. అప్పట్లో రెండు దఫాల్లో రూ.35 లక్షలు రావటంతో వాటితో పనులు చేసి ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కేంద్రం కొన్ని నిధులు ఇవ్వటంతో వాటితో అత్యవసరంగా పనులు ప్రారంభించారు. విరామం లేకుండా పనులు జరిగితే దాదాపు ఏడాదిన్నర కాలంలో మొత్తం పనులు పూర్తవుతాయి. రెండేళ్ల క్రితం మొదటి అంతస్తు నుంచి మినార్ల వరకు పరిరక్షణ చర్యలు పూర్తి చేశారు. ఇప్పుడు దిగువ భాగంలో పనులు ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల క్రితం పనులు చేసిన చోట కూడా మట్టి రాలిపోతోంది. అప్పట్లో లేపనంలాగా అద్దిన పైపూత పటిష్టంగానే ఉన్నా... దానిలోపలి సున్నం మిశ్రమం బలహీనంగా మారటంతో పై పూత ఊడిపోతోంది. ఎందుకీ సమస్య.. కులీకుతుబ్షా 1591లో దీన్ని నిర్మాణం చేపట్టారు. 430 ఏళ్లు గడుస్తున్నందున స్వతహాగా కట్టడం మట్టి భాగం బలహీనపడింది. అయినప్పటికీ అది లోపలి రాతి నిర్మాణాలు పట్టుకుని నిలిచిఉంటుంది. కానీ.. దశాబ్దాలుగా కట్టడానికి అతి చేరువగా వాహనాలు తిరుగుతుండటంతో కాలుష్యం కాటేస్తోంది. వానాకాలంలో తడితో కలిసి రసాయన చర్య ఏర్పడి క్రమంగా గోడల డంగు సున్నం పొరలు బలహీనపడిపోయాయి. దీంతో పటుత్వం కోల్పోయి మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో సమస్య బాగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో పై పూతను తొలగించి కొత్త మిశ్రమాన్ని పూసి, ఆయా ప్రాంతాల్లో ఉండాల్సిన నగిషీలను తిరిగి ఏర్పాటు చేయనున్నారు. సోమవారం నుంచి ఆ పనులు మొదలు కానున్నాయి. తొలుత లాడ్బజార్ వైపు భాగానికి పనులు చేపట్టనున్నట్టు సమాచారం. -
ఈ శవపేటికలు చరిత్రను తిరగరాస్తాయి..!
కైరో: ఈజిప్టు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పిరమిడ్లు, మమ్మీలు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అంటున్నారు ఆర్కియాలజిస్టులు. సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని గుర్తించింది. ఈజిప్టు పాత సామ్రాజ్యం(ఓల్డ్ కింగ్డమ్) ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్ సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణలని గుర్తించింది. 'చరిత్రను తిరిగరాస్తుంది' న్యూ కింగ్డమ్ (క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం)నాటి 50 కి పైగా చెక్క శవపెటికలు భూమికి 40 అడుగుల లోతులో ఈ శ్మశానవాటికలో బయపటడినట్లు హవాస్ న్యూస్ ఏజెన్సీకి ఏఎఫ్పీకి వెల్లడించారు. "ఈ ఆవిష్కరణ సక్కారా చరిత్రను.. మరి ముఖ్యంగా 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన న్యూ కింగ్డమ్ చరిత్రను తిరిగరాస్తుంది" అన్నారు. (చదవండి: ప్రైవేట్ ఫొటోషూట్.. మోడల్ అరెస్టు!) ఇంకా ఏమి కనుగొన్నారు తన బృందం శవపేటికలతో పాటు మొత్తం 22 బాణాలను కనుగొన్నట్లు హవాస్ వెల్లడించారు. వాటిలో ఒకదాని మీద "సైనికుడు, పక్కనే విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉన్న అతని యుద్ధ గొడ్డలి ఉంది" అన్నారు. వీటితో పాటు ఒక రాతి శవపేటికను కూడా గుర్తించామని హవాస్ వెల్లడించారు. అలాగే చనిపోయినవారి పుస్తకంలోని(బుక్ ఆఫ్ ది డెడ్) 17 వ అధ్యాయాన్ని కలిగి ఉన్న ఐదు మీటర్ల పొడవున్న పురాతన పత్రం, ఆ కాలంలో ఉపయోగించిన మాస్క్లు, చెక్క పడవలు, పురాతన ఈజిప్షియన్లు ఆడటానికి ఉపయోగించే ఆట వస్తువులు వంటివి లభ్యమయ్యాయి అని తెలిపారు. ఇదే ప్రధాన ఆవిష్కరణ ఎందుకు ఈజిప్ట్ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ శనివారం సక్కారాలో గుర్తించిన "ప్రధాన ఆవిష్కరణలు" గురించి ప్రకటించింది. ‘‘ఇది చాలా అరుదైన, క్రొత్త ఆవిష్కరణ. ఎందుకంటే మేము కనుగొన్న చాలా కళాఖండాలు న్యూ కింగ్డమ్(క్రొత్త రాజ్యం)కి చెందినవి. అయితే ప్రస్తుతం సక్కారాలో గుర్తించినవి మాత్రం సాధారణంగా క్రీ.పూ 500 కాలానికి చెందినవి’’ అని తెలిపింది. ఇక్కడ ఇటీవలి సంవత్సరాలలో అనేక తవ్వకాలు జరిగాయి. (చదవండి: 2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!) బయటపడిన పురాతన ఆలయం ఇక ఇక్కడ జరిపిన తవ్వకాల్లో హవస్ ఒక పురాతన ఆలయం కూడా బయటపడింది. ఇది "కింగ్ టెటి భార్య క్వీన్ నిరిట్ యొక్క అంత్యక్రియల ఆలయం" అని పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పురాతన ఈజిప్టులో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణాల్లో ఒకటి అయిన జొజర్ స్టెప్ పిరమిడ్ సక్కరా ప్రాంతంలోనే ఉంది. -
చార్మినార్ మరమ్మతులకు ఆలయ స్థపతులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న చార్మినార్ కట్టడానికి దేవాలయాల స్థపతులు మరమ్మతులు చేయబోతున్నారు. గత నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ ఈ చారిత్రక కట్టడానికి మక్కా మసీదు వైపు ఉన్న మినార్ డిజైన్ లోంచి ఓ భాగం ఊడి కింద పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు మీటర్ల మేర ఈ భారీ పెచ్చు ఉన్నట్టుండి ఊడి కింద పడింది. అంతకుముందు కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతంలోని సన్నటి పగుళ్ల నుంచి నీటిని భారీగా పీల్చుకోవటంతో అక్కడి డంగు సున్నంతో రూపొందించిన నగిషీల భాగం బాగా బరువెక్కి ఊడిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఆ పెచ్చు ఊడిపోయిన చోట మళ్లీ సంప్రదాయరీతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి నగిషీలు అద్దాల్సి ఉంది. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం నిపుణులే దాన్ని పూర్తి చేస్తారని అనుకున్నా, ఆ విభాగం తాజాగా ఆ పనిని దేవాలయాల స్థపతులకు అప్పగించింది. తమిళనాడుకు చెందిన ఆ స్థపతుల బృందం ఆది, సోమవారాల్లో నగరానికి రానుంది. ఆ వెంటనే పనులు మొదలుపెడతారు. గతంలో ఈ స్థపతులకు ఇలాంటి పనులు చేసిన అనుభవం ఉండటంతో వారికే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఏడెనిమిదేళ్ల క్రితం చార్మినార్కు చిన్నచిన్న డిజైన్లు ఊడిపోవటంతో వీరితోనే చేయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రిలో పురాతన దేవాలయాల పునరుద్ధరణలో కూడా వీరు డంగు సున్నంతో పనులు చేశారు. చార్మినార్కు కూడా ఇప్పుడు సూక్ష నగిషీలు అద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారైతేనే సరిగ్గా చేయగలరని నిర్ణయించి పనులు అప్పగించారు. మరో పది రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఈలోపే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డంగు సున్నం, నల్లబెల్లం, కరక్కాయ పొడి, రాతి పొడి, గుడ్డు సొనలతో కూడిన మిశ్రమాన్ని ఈ పనుల్లో వినియోగించనున్నారు. కట్టడంలోని చాలా భాగాల్లో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ పెచ్చు ఊడిన ప్రాంతంలో కూడా మరికొన్ని పగుళ్లున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పుడు పూడ్చేయనున్నారు. లేకుంటే మరిన్ని పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉంది. త్వరలో ఢిల్లీ నుంచి అధికారులు చార్మినార్ పెచ్చు ఊడి పడడానికి కారణమైన పగుళ్లు ఎందుకు ఏర్పడ్డాయనే విషయంలో మరింత లోతుగా పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఏఎస్ఐ ఉన్నతాధికారులు త్వరలో నిపుణులతో కలిసి రానున్నారు. పెచ్చు ఊడిపడిన వెంటనే కొందరు నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లారు. వారి నుంచి ఇంకా నివేదిక రాలేదు. కట్టడం చుట్టూ ఏర్పడ్డ వైబ్రేషన్ల వల్లే పగుళ్లు ఏర్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. చార్మినార్ చుట్టూ దశాబ్దాలుగా వాహనాలు తిరుగుతుండటం, ఇటీవల పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కట్టడానికి అతి చేరువగా భారీ యంత్రాలతో పనులు చేపట్టడం వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మరమ్మతు పనులు చేపట్టాలని తొలుత భావించారు. కానీ వర్షాకాలం ముంచుకు రావడంతో వెంటనే మరమ్మతులు జరపకుంటే మరిన్ని పెచ్చులూడే ప్రమాదం ఉండటంతో వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ స్కానర్ సాయంతో కట్టడంలో ఎక్కడెక్కడ పగుళ్లున్నాయో గుర్తించనున్నారు. -
చూస్తే ‘డంగు’ అయిపోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా వెలుగు చూడని బుద్ధుడిదిగా భావిస్తున్న భారీ గార ప్రతిమ (డంగుసున్నంతో రూపొందిన) వెలుగు చూసింది. ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తుశకం మూడో శతాబ్దంలో దీన్ని రూపొందించినట్లు పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్తూప కేంద్రమైన ఫణిగిరిలో శుక్రవారం ఈ అద్భుతం బయల్పడింది. ఫణిగిరి బౌద్ధ స్తూపం ప్రాంగణంలో ఫిబ్రవరి నుంచి పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. బౌద్ధ స్తూపం, చైత్యాలు, బుద్ధుడి ధాతువు, బుద్ధుడి జీవిత చరిత్రను కళ్లముందు నిలిపే అద్భుత చెక్కడాలను గతంలో వెలికి తీశారు. ఆ తర్వాత తవ్వకాలు నిలిపివేశారు. ఇటీవల హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తుశాఖ) ఏఎస్ఐ నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరిలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించింది. ఈ క్రమంలో శుక్రవారం దాదాపు ఆరడగుల పొడవున్న బుద్ధుడి ఆకారం వెలుగు చూసింది. ఆ ప్రతిమ వెనుక భాగం మాత్రమే కన్పిస్తోంది. దాన్ని చూస్తే నిలబడి ఉన్న బుద్ధుడి ఆకారంగానే కనిపిస్తోంది. అయితే బుద్ధుడి జీవిత చరిత్రలో ఒక ఘట్టానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. బుద్ధుడి చరిత్రలో ఉండే రాజులకు సంబంధించినదై కూడా ఉంటుందనే మరో అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై అలంకరణ గుర్తులున్నాయి. సాధారణంగా బుద్ధుడి శరీరంపై ఎక్కడా అలంకరణ ఉండదు. కంకణాలు, ముంజేతి అలంకరణలు కనిపిస్తున్నందున అది బుద్ధుడిగా మారకముందు రూపమై ఉంటుందని, లేదంటే ఇతర రాజులకు సంబంధించినదై ఉంటుం దని తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్న హెరిటేజ్ తెలంగాణ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు పేర్కొంటున్నారు. ఆ విగ్రహం ముందు భాగం చూస్తేగాని కచ్చితమైన రూపాన్ని ప్రకటించలేమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా.. పురాతన కాలం నాటి కట్టడాలున్న ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో డంగు సున్నంతో రూపొందించిన శిల్పాలు వెలుగు చూడటం సహజం. కానీ ఇవి రెండడుగుల కంటే ఎక్కువ పొడవున్న దాఖలాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కానీ తొలిసారి మానవుడి సహజ ఎత్తు పరిమాణంలో ఉండే సున్నం (గార) ప్రతిమ వెలుగుచూసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఆరడగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు కనిపించలేదని నాగరాజు, విశ్రాంత అధికారులు రంగాచార్యులు, తవ్వకంలో పాలుపంచుకున్న భానుమూర్తిలు వెల్లడించారు. ఇది చాలా అరుదైన ప్రతిమగా వారు అభివర్ణించారు. లోన ఇటుకలు.. ఈ విగ్రహాన్ని తొలుత ఇటుకలతో నిర్మించి దానిపై మందంగా డంగు సున్నం మిశ్రమ లేపనంతో ఆకృతి తెచ్చారు. ఆ విగ్రహానికి పలు ప్రాంతాల్లో రంధ్రాలున్నాయి. దానికి చేరువలో భారీ గోడ ఉన్న ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. అంటే ఆ విగ్రహాన్ని ప్రత్యేక పద్ధతిలో గోడకు అమర్చి ఉంటారని, అది గోడతోపాటు అలాగే కూలిపోయి భూగర్భంలో ఉండిపోయి ఉంటుందని భావిస్తున్నారు. వెలికి తీసే తరుణంలో అది ముక్కలు కానుంది. దాన్ని తిరిగి పూర్వపు పద్ధతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించనున్నారు. ఇందుకోసం విగ్రహాన్ని వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు. విగ్రహం పగుళ్ల ఆధారంగా నంబర్లు వేశారు. వెలికి తీశాక అ ముక్కలను హైదరాబాద్ తరలించి ఫొటో డాక్యుమెంటేషన్ ఆధారంగా డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించి పూర్వరూపం తెస్తారు. ఈ భారీ విగ్రహం వెలుగు చూసిన విషయాన్ని వెంటనే హెరిటేజ్ తెలంగాణ ఇన్చార్జి డైరెక్టర్ సునీత భగవత్ దృష్టికి తీసుకెళ్లామని, ఆమె సూచనల మేరకు నిపుణులతో చర్చించి దాన్ని హైదరాబాద్ తరలింపు, సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నాగరాజు పేర్కొన్నారు. అపూర్వ గుర్తు ఆ విగ్రహం వెలుగు చూసిన వెంటనే మా సిబ్బంది నా దృష్టికి తెచ్చారు. అది అతి అరుదైన ప్రతిమగా వారు చెప్పారు. కానీ పూర్తిగా వెలికి తీశాక గాని వివరాలు తెలియవు. ఇప్పటి వరకైతే అది చరిత్రకు సంబంధించి అపూర్వ గుర్తుగా భావిస్తున్నాం. తవ్వకాలు కొనసాగించి అక్కడ ఇంకా ఏమున్నాయో గుర్తిస్తాం. శనివారం కొన్ని వివరాలు వెల్లడవుతాయి. సునీత భగవత్, ఇన్చార్జి డైరెక్టర్ -
దేవుడక్కడ.. గంటలు ఇక్కడ
దేవాలయానికి వెళ్లగానే భక్తులు స్వామి విగ్రహం ముందు నిలబడి.. అప్రయత్నంగానే దైవం ముందున్న గంటను మోగిస్తారు. ఆలయం అనగానే దేవుడి ప్రతిరూపం కళ్లముందు కదలాడితే, అలయ పవిత్ర గంటల శబ్దం చెవుల్లో మారుమోగుతుంది. గంట మోగిస్తే దేవుడు తమ కోరికను ఆలకిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గంట సరిగ్గా గర్భాలయం ముందు మూలవిరాట్టుకు ఎదురుగా ఉంటుంది. కానీ, చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొలనుపాక దేవాలయం పరిస్థితి వేరు. ఆ ఆలయ గంటలు మోగిస్తే గర్భాలయంలోని స్వామికి వినిపించవు. విచిత్రంగా, విడ్డూరంగా అనిపించినా ఇది నిజం....ఎందుకంటే.. ఆలయాలు కొలనుపాకలో ఉంటే, ఆ గుడి గంటలు అక్కడికి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్లో ఉన్నాయి. గంటలు దేవాలయంలో ఉండాలిగాని, హైదరాబాద్లో ఉండటమేంటన్న గందరగోళానికి పురావస్తుశాఖ నిర్వాకమే కారణం. – సాక్షి, హైదరాబాద్ ఇదీ సంగతి... కొలనుపాక అనగానే ప్రపంచ ఖ్యాతి పొందిన అద్భుత జైన దేవాలయం మదిలో మెదులుతుంది. ప్రస్తుత యాదాద్రి– భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు సమీపంలో ఈ గ్రామముంది. రాష్ట్రకూటులు పదో శతాబ్దంలో ఇక్కడ విశాలమైన జైన దేవాలయాన్ని నిర్మించారు. అందులో ఐదడుగుల పచ్చరాతి మహావీరుని విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. రాష్ట్రకూటుల తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన కళ్యాణి చాళుక్యులు పదకొండో శతాబ్దంలో దానికి చేరువలో సోమేశ్వరాలయం, పక్కనే వీరనారాయణస్వామి ఆల యాలను నిర్మించారు. వెరసి ఇది జైన, శైవ, వైష్ణవ సంప్రదాయంతో వర్ధిల్లిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. శైవంలో కాలకమైన పంచ ఆచార్యుల్లో రేణుకాచార్య మనుగడ సాగించింది కొలనుపాకలోనే అన్న ఆధారాలుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులొస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి జైన భక్తులు కొలనుపాకకు వచ్చి సేదతీరుతారు. ఈ ఆలయాలకు చెందిన రెండు భారీ గంటలు ఆలయాలకు దూరంగా హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉండిపోయాయి. నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో జైన ఆలయం ధ్వంసమైంది. మిగతా కొన్ని నిర్మాణాలు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 1970లలో అక్కడ జరిపిన అన్వేషణలో ఆలయాలకు చెందిన భాగాలు, ఇతర వస్తువులు వెలుగుచూశాయి. నాడు ధ్వంసమైన జైన దేవాలయం స్థలంలో తర్వాత పాలరాతి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడది జైన భక్తుల ఇలవేల్పు. అక్కడికి సమీపంలో ఊబదిబ్బగా పేర్కొనే వాగు ఇసుకలో 2 భారీ గంటలు లభించాయి. కంచుతో రూపొందిన ఈ గంటలు అద్భుత శిల్పకళానైపుణ్యంతో వెలుగొందుతున్నాయి. ఈ రెండు కూడా కంచుతో రూపొందిన బరువైన గంటలు. వాటిని మోగిస్తే వచ్చే శబ్ద తరంగాలు వినసొంపుగా చాలాదూరం వినిపిస్తాయి. వాటి ని అప్పట్లో స్టేట్ మ్యూజియంకు తరలించి మరిచిపోయారు. ఐదారేళ్లుగా వీటిని తిరిగి ఆలయాలకు తరలించాలన్న విన్నపం భక్తుల నుంచి వస్తోంది. ఇవి ఆ ఆలయాలకు చెందినవే కావటంతో వాటిని మళ్లీ ఆలయాల్లో ఏర్పాటు చేయాలి. కానీ విలువైన ఆ గంటలను స్మగ్లర్ల బారి నుంచి కాపాడాలంటే భద్రత అవసరం. ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దుస్థితిలో ఉన్న పురావస్తుశాఖ వాటిని కాపాడలేనని చేతులెత్తేసింది. కాపలా సిబ్బంది ఖర్చులు భరించే స్తోమత లేనందున వాటిని మ్యూజియంలోనే ఉంచి చేతులు దులిపేసుకుంది. గంటపై శాసనం... సాధారణంగా శాసనాలు రాళ్లు, రాతి పత్రాలపై రాస్తారు. కానీ ఈ రెండు గంటల్లో ఓ దానిపై శాసనం లిఖించి ఉండటం విశేషం. ‘స్వస్తిశ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ’అని కన్నడలో లిఖించి ఉంది. కండప్ప నాయకరు కొల్లిపాక స్వామి సోమేశ్వరదేవుడికి విరాళంగా ఇచ్చిందన్న అర్ధం. కాశీ కొలనుపాక బింభావతి పట్టణంగా చరిత్రలో కొలనుపాక వెలుగొందింది. కళ్యాణి చాళుక్యుల హయాంలో రెండో రాజధానిగా కూడా భాసిల్లింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీనిపేరు కొల్లిపాకైగా ఉంది. కాకతీయ రుద్రదేవుని శాసనంలో కొల్లిపాక అని ఉంది. ఇలా ఈ పేరు రూపాంతరం చెందుతూ కొలనుపాకగా స్థిరపడింది. ఈ గంటల్లో ఒకదానిపై అంజలి ముద్ర, అక్షమాల, గిండి ధరించి పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మ, పరుశు, పాశం, దంతం, మోదుకం ధరించి లలితాసనంలో ఉన్న గణపతి, రెండు చేతులు అంజలి ముద్ర, మరో రెండు చేతుల్లో శంఖుచక్రాలు ధరించిన విష్ణువు, అభయహస్తం, శ్రీఫలం, శూలం, ఖట్వాంగం ధరించిన శివుడు ప్రతిరూపాలున్నాయి. మరో గంటపై ఆసీనుడైన బ్రహ్మ, విష్ణు, సూర్యుడు, గణపతి విగ్రహాలున్నాయి. కొంతమంది భక్తులకు ఈ గంటల ఖ్యాతి తెలిసి చూసేందుకు ఆలయాలకు వెళ్తున్నారు. కానీ అవి హైదరాబాద్లో ఉన్నాయని తెలిసి తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. వాటిని వెంటనే కొలనుపాక ఆలయంలో ఏర్పాటు చేసి తగు భద్రత కల్పించాలి. అలనాటి ఆ గంటలు మోగించి ఆధ్యాత్మికానందం పొందే అవకాశాన్ని భక్తులకు కల్పించాలి. – రత్నాకరరెడ్డి ఔత్సాహిక పరిశోధకుడు -
అపురూప కళా వైభవానికి ఆదరణ కరువు
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొండలు. అబ్బురపరిచే శిల్ప సంపద. ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలతో కళకళలాడిన శివాలయం.. నేడు శిథిలావస్థకు చేరుకుంది. కాకతీయ శిల్పకళా ప్రతిభకు తార్కాణంగా నిలి చిన ఈ ఆలయం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండ లంలోని గొడిశాల గ్రామంలో ఉంది. తూర్పు ము ఖం కలిగి ఉన్న ఈ దేవాలయం నక్షత్రం ఆకారంలో ఉంది. ముఖ మండపానికి ఉత్తర, పడమర, దక్షిణ దిక్కల్లో గర్భగుడులు ఉండగా తూర్పు దిక్కున ప్రవే శ మండపం ఉంది. ఈ మూడు గర్భగుడుల్లో శివుడిని లింగం రూపంలో ప్రతిష్టించారు. పురావస్తు శాఖ పట్టించుకోకపోవడంతో శిల్ప సంపద చెల్లాచెదురు గా పడి ఉంది. ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని పునర్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలుగు పద్యాలతో శాసనం.. గొడిశాల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నాయి. పురాతన శాసనాల్లో గొడిశాల గ్రామాన్ని ఉప్పరపల్లిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ.1236 కాకతీయ గణపతి దేవుడి కాలంలో గ్రాంధిక భాషలో కావ్య శైలిలో వేయించిన శాసనం ఒకటి ఉంది. తెలు గు పద్యాలతో ప్రారంభమైన ఈ శాసనంలో వినాయకుడు, దుర్గ, వరాహ రూపంలో ఉన్న విష్ణు మూర్తిని, సూర్యుడిని స్తుతించారు. రాజనాయకుడు, రవ్వ మాంబ దంపతులకు జన్మించిన కాటయ..పంచ లింగాలతో ఈ శివాలయాలను నిర్మించాడు. ఆలయ నిర్మాణం మాత్రమే కాకుండా చెరువులను కూడా తవ్వించాడు. ధూప దీప నైవేద్యాల కోసం బ్రాహ్మణులకు పించరపల్లి అనే గ్రామా న్ని దానంగా ఇచ్చాడు. తాటి వనాన్ని, అంగడి సుం కాన్ని, మామిడి తోటలను కూడా దానం చేశాడు. రుద్రదేవుడి, గణపతి దేవుడి ప్రశంసలతోపాటు కాట య గురించి కూడా శాసనంలో వర్ణించారు. శాసనం చివరి భాగంలో ఈ ఆలయానికి గణపతి దేవ చక్రవర్తి కూడా భూ దానం చేసినట్లు రాశారు. శాసనంలో పేర్కొన్న పంచ లింగాలలో 3 త్రికుటాలయంలో ఉండగా, మరో 2 పక్కనే ఉన్న వేర్వేరు ఆలయాల్లో ప్రతిష్టించి ఉన్నాయి. (ప్రస్తుతం పునర్ నిర్మాణం కోసం ఆలయ స్తంభాలన్నీ విప్పి పెట్టారు). ఢిల్లీ సుల్తానులకు, కాకతీయులకు యుద్ధం జరిగిన ప్రదేశం.. ఉప్పరపల్లి గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1303లో ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ.. మాలిక్ ఫక్రోద్దిన్, జునాఖాన్ల నాయకత్వంలో ఓరుగల్లు పైకి మొదటిసారి తన సేనలను దండయాత్రకు పం పాడు. కాకతీయ సైన్యాలు పోతుగంటి మైలి, రేచర్ల వెన్న భూపాలుడు, మంగయ దేవుడు ఇతర సేనాల నాయకత్వంలో ఇక్కడే అడ్డుకుని తిప్పి పంపారు. పునర్నిర్మాణ పనులు చేపట్టాలి.. చారిత్రక నేపథ్యం ఉన్న కాకతీయ ఆలయం నేడు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఆలయం చుట్టు పక్కల అనేక వందల స్తంభాలు, శిథిలాలు పడి ఉన్నాయి. ఇప్పటికైనా పురావస్తు శాఖ స్పందించి ఆలయాన్ని పునర్ నిర్మించాలి. – రామోజు హరగోపాల్, తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ -
యుద్ధం గెలిస్తే.. నాణేలపై ముద్ర పడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోలాహలం.. గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.. అంతవరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది.. ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలు మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలను నిలిపేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లకముందు రాచరిక వ్యవస్థలో ఏం జరిగేది..? బలమున్నోడిదే రాజ్యం. రాజ్యాల మీదకు దండెత్తి విజయం సాధించి ఆ ప్రాంతాన్ని తన ఏలుబడిలో కలిపేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకునేవారు. ఈ క్రమంలో ఆ రాజు వెంటనే చేసే పనేంటో తెలుసా? అంతవరకు చలా‘మణి’లో ఉన్న నాణేలపై తన ‘మార్కు’ముద్రించటమే.. ఆలస్యమవుతుందనే పునర్ ముద్రణ.. ఆనాడు నాణేలకు ఎంతో ప్రాధాన్యముండేది. ఏ రాజైన సరే తన రాజ వంశం, దైవం.. వంటి సొంత చిహ్నాలని నాణేలపై ముద్రించి చలామణి చేసేవారు. మరో రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు, కొత్త ప్రాంతంలో తమ నాణేలు చలామణి చేసేందుకు కొంత సమయం పడుతుంది. నాణేల ముద్రణ, అందుకు సరిపడా ముద్రణాలయాల ఏర్పాటు, జనంలోకి తరలింపు.. ఇవన్నీ జరిగేందుకు సమయం అవసరం. కొత్త నాణేలు వచ్చే వరకు, పాత రాజులు అమలు చేసిన నాణేలనే కొనసాగించేవారు. అయితే వాటిపై తమ చిహ్నాలను ముద్రించేవారు. చలామణిలో ఉన్న పాత నాణేలను తెప్పించి వాటిపై తమ చిహ్నాలను ముద్రించి పంపేవారు. వీటికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రాంతాల తవ్వకాల్లో ఇలాంటి నాణేలు వెలుగు చూశాయి. వాటి వల్లనే నాటి సంఘటనలు వెలుగు చూశాయి. వెరసి చరిత్రకు అవి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు అలాంటి అరుదైన కొన్ని నాణేలు లభించాయి. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో... సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ స్తూపం, బౌద్ధ విహారాలు వెలుగు చూసిన చోట పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. వీటిల్లో కొత్త విహారాలు, నాటి వస్తువుల అవశేషాలు, నాణేలు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కొన్ని నాణేలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. సీసంతో తయారైన ఆ నాణేలు శాతవాహనకాలానికి చెందినవిగా తెలుస్తున్నాయి. శాతవాహన నాణేలకు వీటికి కొంత తేడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిపై శాతవాహన చిహ్నాలతో పాటు ఇతర కొన్ని చిహ్నాలున్నాయి. దీంతో.. శాతవాహనులు ఇతర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో, పాత రాజు చలామణి చేసిన నాణేలపై తమ చిహ్నాలను పునర్ ముద్రించి అమలులోకి తెచ్చినవిగా చరిత్రకారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వీటిపై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటి వివరాలు వెలుగులోకి వస్తే శాతవాహనుల కాలానికి సంబంధించి మరికొన్ని కొత్త వివరాలు వెలుగుచూస్తాయి. క్రీ.పూ.5వ శతాబ్దంలోనే.. దేశంలో నాణేల చలామణి క్రీ.పూ.5వ శతాబ్దంలో మొదలైంది. మగధ సామ్రాజ్యంలో 3.4 గ్రాముల బరువు తూగే వెండి నాణేల ముద్రణ మొదలైందప్పుడే. మగధ పాలకులు నాణేలపై సూర్యుడి గుర్తుతో పాటు 6 ఆయుధాల ఆకృతులను ముద్రించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వీటితోపాటు మరికొన్ని చిహ్నాలున్నా, అవి మారుతూ వచ్చాయి. తదనంతరం నంద సామ్రాజ్యాధీశులు దాన్ని కొనసాగించారు. క్రీ.పూ. 2, 3 శతాబ్దాల్లో రోమన్, గ్రీకుతో వాణిజ్యం పెరిగిన తర్వాత నాణేల ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆ తర్వాత సీసం నాణేలు వచ్చాయి. కుషాన్స్ హయాంలో బంగారు నాణేలు మొదలయ్యాయి. తర్వాత మౌర్యులు, దక్షిణాదిన మౌర్యులను ఓడించి శాతవాహనులు నాణేలను ప్రారంభించారు. ఇందులో మౌర్యులను ఓడించి వారి నాణేలపై తమ చిహ్నాలను శాతవాహనులు వేసుకున్నారని ఆధారాలు లభించాయి. రెండు చోట్లనే వెలుగులోకి... మరో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాత నాణేలపై కొత్త రాజులు తమ చిహ్నాలను ముద్రించిన ఉదంతానికి సంబంధించి మన దగ్గర ఇప్పటికి 2 చోట్ల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 2 కూడా శాతవాహన కాలానికి సంబంధించినవే కావడం విశేషం. శాతవాహనుల తొలి రాజధానిగా పేర్కొంటున్న కోటిలింగాల వద్ద, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మస్కి (రాయచూరు సమీపం) వద్ద జరిపిన తవ్వకాల్లో ఇలాంటి నాణేలు లభించాయి. దక్షిణ భారతం కూడా మౌర్యుల పాలనలో ఉందనటానికి ఇవే ఆధారాలుగా మిగిలాయి. ఈ రెండు చోట్ల జరిపిన తవ్వకాల్లో మౌర్యులు చలామణి చేసి న వెండి నాణేలు బయటపడ్డాయి. ఇవి పంచ్ మార్క్డ్ నాణేలు. వీటికి మరోవైపు శాతవాహనులు ముద్రించిన ఏనుగు ఆకృతి కనిపించింది. మౌర్యులను ఓడించి ఆ ప్రాంతాన్ని శాతవాహనులు తమ అధీనంలోకి తెచ్చుకుని మౌర్యుల నాణేలపై తమ గుర్తులను పునర్ముద్రించారని చరిత్రకారులు తేల్చారు. ఈ రెండు చోట్ల తప్ప అలాంటి నాణేలు వెలుగు చూడలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి కౌంటర్ మార్క్ డ్ నాణేలు వెలుగు చూడటంతో చరిత్రకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫణిగిరిలో లభించిన నాణేలు సీసం ముడిపదార్థంగా రూపొందినవి. దీంతో అవి కొంతమేర చెదిరిపోయి ఉండటంతో వాటిపై చిహ్నాలు అస్పష్టంగా కనిపిస్తున్నా యి. ప్రత్యేక పద్ధతుల్లో వాటిని పరిశోధించాల్సి ఉంది. -
ఇటుకపై ఇటుక పేర్చి!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జైన మతం ఇక్కడ వర్ధిల్లింది.. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేల ఇది.. జైనులకు ఎంతో ప్రీతిపాత్ర మైన ఆలయం ఇది.. వారికి ప్రధాన స్థిరనివాసంగా ప్రత్యేకతను చాటుకుంది. ఎంతో ప్రత్యేకంగా కేవలం ఇటుకలతో ఎన్నో శతాబ్దాల కిందట నిర్మితమై అలరారింది. తనకంటూ చరిత్రలో ఓ పేజీని లిఖించుకుంది. అదే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లిలో ఉన్న గొల్లత్త గుడి. ఎన్నో ప్రత్యేకతలు.. దాదాపు 65 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. 8వ శతాబ్దంలో రాష్ట్ర కూటులు ఈ గుడిని నిర్మిం చినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు చెబుతు న్నారు. చాలా అరుదుగా ఇటుకలతో 7వ లేదా 8వ శతాబ్దంలో జరిగినట్లు భావిస్తున్నారు. గార అలంకరణలకు సంబంధించిన ఇటుకల నిర్మాణం. 40 అడుగుల నిలువెత్తు గోపురం గొల్లత్త గుడికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇటుకలతో నిర్మితమైన అత్యంత పురాతన ఆలయాలు దేశంలో రెండే రెండు ఉన్నాయని, వాటిలో ఈ గొల్లత్త గుడి ఒకటని పేర్కొంటున్నారు. మరొకటి ఉత్తర ప్రదేశ్లోని కాన్పూరులోని భీతర్గావ్ శివారులో ఉంది. ఈ గుడిని 1600 ఏళ్ల కింద 58 అడుగుల ఎత్తులో కుమారగుప్తుడి కాలంలో నిర్మిత మైంది. ఆలయ నిర్మాణం 8 ఎకరాల్లో ఉండగా, పాదాల గుట్ట సుమారు రెండు ఎకరాల్లో ఉంది. జైనుల ధాన్య భాండాగారంగా పేరు గాంచిన గొల్లత్తగుడి ఆలయంలో ఒకప్పుడు బంగారు కుండలు ఉండేవని స్థానికులు చెబుతారు. గుడి వెనుక భాగంలో అప్పటి నగిషీల జాడలు ఇంకా స్పష్టంగా ఉండటం విశేషం. జైనుల స్థిర నివాసం.. జైనీయుల స్థిర నివాస కేంద్రంగా ఈ గుడికి గుర్తింపు ఉన్నది. అంతేకాకుండా జైనీయులకు ధాన్యాగారంగా వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా జైనులకు రెండు ప్రధాన పట్టణాలు ఉండగా.. అందులో గొల్లత్తగుడి ఒక్కటి. వందల ఏళ్ల కింద ఇది జైన మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చర్రితకారులు చెబుతున్నారు. ఇక్కడ గతంలో అనేక పురావస్తు అన్వేషణలు, తవ్వకాలు జరిగాయి. పురాతన కాలం నాటి మట్టిపెంకులు, ఇటుకలతో పాటు నల్ల రంగులో ఉన్న బూడిద తవ్వకాల్లో వెలుగు చూశాయి. వాటిని పరిరక్షించేందుకు పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. ఇక్కడ లభించిన 5 అడుగుల ఎత్తున్న జైన తీర్థంకరుల విగ్రహాల్లో ఒకదాన్ని హైదరాబాద్లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో, మరొక దాన్ని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. ఇదే ప్రాంతంలో హిందూ దేవాలయం అవశేషాలు, మధ్యయుగ కాలం నాటి మహావీర, పార్శ్వనాథ శిల్పాలు బయటపడ్డాయి. పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు ఆలయ పూర్వవైభవానికి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇటుకల గోపురం చెక్కుచెదరకుండానే పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. శాస్త్రీయమైన పద్ధతులతో పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను క్షేత్రస్థాయిలో సేకరించారు. ఆలయ రక్షణకు సుమారు రూ.36 లక్షలతో ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిచేశారు. ఎలా చేరుకోవాలి? జడ్చర్ల నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్నగర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గొల్లత్త గుడి ఉంది. రైలు, రోడ్డుమార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మహబూబ్నగర్ వైపు నుంచి రావాలనుకునే వారు జడ్చర్ల వెళ్లి అక్కడినుంచి అల్వాన్పల్లి చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే జడ్చర్ల స్టేషన్లో దిగి, అక్కడి నుంచి ఆటోలలో ఆలయానికి వెళ్లొచ్చు. -
అద్భుత శిల్పాల నెలవు
సాక్షి, హైదరాబాద్: అక్కడి శిల్పాలు చరిత్రను కళ్లకు కదలాడేలా చేస్తాయి. నాటి జీవన విధానాన్ని గుర్తుకు తెస్తాయి. శిల్పులు చెక్కిన కళారూపాలు ఔరా! అనిపిస్తాయి. సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఇలా ఎలా చెక్కారబ్బా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఇలాంటి శిల్పాలు చూడాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకకు వెళ్లాల్సిందే. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న జైన దేవాలయానికి కొలనుపాక ప్రసిద్ధి. దక్షిణ భారత్లోని ప్రముఖ జైన కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి మ్యూజియంలో అరుదైన 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుడి విగ్రహం ఉంది. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల రెండవ రాజధానిగా కొలనుపాక ఉండేది. ఆ కాలంలో ఈ గ్రామం జైనుల మత కేంద్రంగా వర్ధిల్లింది. ఇక్కడ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పురాతన సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకోవాలని అనుకునే వారికి అద్భుత మ్యూజియం ఇది. వెయ్యి సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న స్మారక శిలలు లేదా వీరగల్లులుగా పిలిచే విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. హిందూ, జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, ఇతర వస్తువులున్నాయి. 6 నుంచి 16వ శతాబ్దాల కాలం నాటి మహావీర, మత్స్యవల్లభ, చాముండి, నంది లాంటి ముఖ్య శిల్పాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ శిల్పాలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసింది. ఇందులో కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుంచి, సమీప గ్రామాల నుంచి సేకరించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. చాళుక్య, కాకతీయ శైలికి సంబంధించిన 100కుపైగా శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యమైన విగ్రహాలు... క్రీ.శ.1076–1127 మధ్య కాలంలో కొలనుపాకని పరిపాలించిన త్రిభువనమల్ల రాజు వేయించిన విజయ స్తంభం. దీనికి నాలుగు వైపులా శాసనం ఉండటం విశేషం. చాళుక్యుల కాలం నాటి వినాయక, నటరాజ విగ్రహాలు, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వీరగల్లు, మహిషాసురమర్ధిని విగ్రహాలు, కాకతీయుల కాలం నాటి చాముండి విగ్రహం, నంది, వజ్రపాణి విగ్రహం, విజయ నగర కాలం నాటి కోదండ రామస్వామి విగ్రహం చూడొచ్చు. చాళుక్యుల కాలం నాటి మహావీరుని విగ్రహం యోగముద్రలో ఉంటుంది. ఎలా చేరుకోవాలి? హైదరాబాద్ నుంచి కొలనుపాక 79 కిలో మీటర్లు పర్యాటకులు హైదరాబాద్ నుంచి బస్సు లేదా రైలులో ఆలేరు వరకుచేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. మ్యూజియం ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి శుక్రవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. ప్రవేశం ఉచితం. -
కాలగర్భంలో కళా వైభవం!
అద్భుత శిల్పకళా సంపద మట్టిలో కలిసిపోతోంది. నిత్యం పూజలు, అభిషేకాలతో విలసిల్లిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. చరిత్ర కాలగర్భంలో సమాధి అవుతోంది. తెలంగాణలో గుప్తనిధుల తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. జంతు బలులు చేయడానికీ వెనుకాడటం లేదు. దీంతో కాకతీయులు, రాష్ట్ర కూటులు, చాళుక్యుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న అనేక ఆలయాలు, ఉప ఆలయాలు శిథిలమైపోయాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాల ప్రస్తుత పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ శిథిలావస్థలో రామప్ప ఆలయాలు కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం రామప్ప ఆలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఒక్కటి. రామప్ప ఆలయంతోపాటు దాని చుట్టు పక్కల కిలోమీటర్ దూరంలో 20 ఉప ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయాలు ఆదరణ కరువై శిథిలమవుతున్నాయి. ఘనకీర్తి గల చారిత్రక ఆలయంలోని స్తంభాలు కూలిపోతున్నాయి. కొన్ని కట్టడాలపై మొలచిన పిచ్చి మొక్కల మధ్య శిల్పాలన్నీ వెలవెలబోతున్నాయి. అప్రమత్తమవ్వాలి దేవాలయాలను పరిరక్షించుకోవడంలో ప్రజల పాత్ర ముఖ్యమైంది. గ్రామాల్లోని యువత ఆలయాల్లో తవ్వకాలు వంటి చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాలను సంరక్షించుకోవాలి. పండుగలు, జాతరలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల వైపు చూడటం కాదు.. నిత్యం వాటిపై పరిశీలన ఉండాలి. పురాతన సంపద పరిరక్షణ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ కూలిన 36 మీటర్ల ప్రాకారం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోని రామప్ప ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కట్టడాలు కూలిపోతున్నా పురావస్తు శాఖలో చలనం కనిపించడంలేదు. దీంతో గత రెండేళ్లుగా రామప్ప ఆలయం శిథిలమవుతోందని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది. ఇటీవల సిబార (సున్నము, ఇసుక, బెల్లం, కరక్కాయల మిశ్రమం) పద్ధతిలో ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 16 ఉప ఆలయాలు కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. వీటిలో కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం కోసం కూలగొట్టి.. శిలలను కుప్పలుగా పోశారు. యాకూబ్సాబ్ స్థలంలో ఉన్న శివాలయం పూర్తిగా కూలిపోయింది. గుప్తనిధుల కోసం గర్భగుడిని గునపాలతో తవ్వేశారు. చాలా చోట్ల గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండేవారే ఇలాంటి వారికి సహకరిస్తున్నారని పలు కేసుల్లో జరిగిన విచారణలో తేలింది. శిల్ప సౌందర్యానికి ప్రతీకలు కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దాన్ని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపం నిర్మించారు. రామప్ప చుట్టూ ఉన్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్సాబ్ గుడి, త్రికూ ట ఆలయంతోపాటు అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప సరస్సు కట్టపై కల్యాణ మంటపం, కాటేజీల పక్కన త్రికూటాలయం, మరో రెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప ఆలయం ఉన్న పాలంపేటలో మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. లక్ష్మీ దేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు శిల్ప సౌందర్యానికి, కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతాయి. ప్రస్తుతం ఆ శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడు స్తూ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గణపురంలోని కోటగుళ్లు, కటాక్షపూర్లోని ఆలయాలు శిథిలమవుతున్నాయి. -
అరుదైన గుహాలయాలు
సాక్షి, హైదరాబాద్: పురావస్తు శాఖ నిర్లక్ష్యం, గ్రామస్తుల అవగాహనా రాహిత్యంతో దేశంలోనే చారిత్రక ప్రదేశంగా పేరొందాల్సిన అడవి సోమనపల్లి గుహాలయాలు వాటి సహజత్వం కోల్పోయాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా అభివృద్ధికి పూనుకున్నారు. అవగాహనా లోపం తో వందల ఏళ్ల నాటి గుహలు అందంగా కనపడాలనే ఉద్దేశంతో సున్నం వేశారు. దాంతో వాటి సహజ అస్తిత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఒకటిగా పేరొందాల్సిన ఆలయం ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో విస్తరించిన అడవుల్లో ఉన్న ప్రాచీన సంపదపై సాక్షి ప్రత్యేక కథనం.. కొండను తొలిచి..అందంగా మలిచి.. మంథనికి 22 కిలోమీటర్ల దూరంలోని అడవి సోమన పల్లి గుట్టపై శిలను తొలిచి నిర్మించిన నాలుగు గుహాలయాలు ప్రాచీన భారతీయ వాస్తు శిల్పానికి చిహ్నాలుగా నిలిచాయి. తాడిచెర్ల వద్ద బస్సు దిగి, దట్టమైన అర ణ్యం గుండా నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రయా ణించి ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. కొండపై ఉన్న పెద్ద శిలను తొలచగా ఏర్పడిన ఈ నాలుగు గుహలు పడమటి ముఖాన్ని కలిగి మానేరు నదికి ఎదురుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే ప్రకృతి దృశ్యాలు రమణీయంగా కనిపిస్తాయి. స్థానికంగా నైనిగుళ్లు అని పిలువబడే ఈ శివాలయాల కొలతలు ఒక్కరీతిగా లేవు. నాణ్యమైన శిల కాకపోవడం, శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే చల్లని గాలులకు తట్టుకోలేక ఈ గుహాలయాలు క్రమేణా శిథిలమవుతున్నాయి. విజయవాడకు సమీపంలోని మొగల్రాజపురంలో చెక్కబడిన విష్ణుకుండినుల కాలపు గుహాలయాల వలె ఇక్కడి గుహాలయాలు కూడా గర్భగృహం, దాని ముందు మంటపమున్నట్లు తొలచబడిఉన్నాయి. ఆకర్షించే వర్ణ చిత్రాలు ఈ మండపం గోడలు ఎలాంటి అలంకారాలు లేకుండా సాదాగా ఉన్నా, మంటపం పైకప్పు (సీలింగ్) సన్నని సున్నపు పొరతో చదును చేయబడి, దానిపై వర్ణచిత్రాలున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రాల పొరలు కాలక్రమేణా ఊడిపోయి ప్రస్తుతం నలుపు, ఎరుపు, నీలం, పసుపు పచ్చని రంగులలో కొన్ని అస్పష్టమైన గుర్తులు మిగిలాయి. అక్కడక్కడ మిగిలిన వర్ణచిత్రాలలో నర్తకి, యుద్ధ దృశ్యాలు, అశ్వ రథాలు విలుకాండ్రు, రాజభవనాలు చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ గుహలకు ముందున్న గోడపై పదవ, 11వ శతాబ్దపు తెలుగు లిపి లక్షణాలతో రెండు చిన్న శాసనాలున్నాయి. మొదటి అసంపూర్ణ శాసనంపై ఎక్కుటేవిమున అనే వ్యక్తి శివలింగానికి రామేశ్వరుడని నామకరణం చేసి దేవుని ప్రతిష్టించాడని, కెంపెన అనే వ్యక్తి రాతిని తొలచినట్లు తెలపబడింది. రామేశ్వరుని ఆల య ధూపదీప నైవేద్యాలకు పెనుకంటి ముచ్చిరెడ్డి అనే వ్యక్తి భూదాన మిచ్చినట్లు రెండో శాసనం తెలుపుతుంది. ఈ గుహాలయాలు విజయవాడకు సమీపాన ఉండవల్లి కొండలపై ఉన్న గుహాలయాలను పోలిఉన్నాయి. కానీ వీటిని ఉండవల్లిలోని 5 అంతస్తులు అనంతశయన గుడితో పోల్చలేమని, కళారీతులను బట్టి ఈ గుహలు క్రీ.శ ఏడో, 8వ శతాబ్దాలకు చెందినవని చారిత్రక పరిశోధకులు ఎన్.ఎస్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చారిత్రక కట్టడాలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య పేర్కొన్నారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ ఈ ప్రదేశం వివరాలు లేవని చెప్పారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. చెదిరిపోతున్న శాసనాలు శివరాత్రి వేడుకల సందర్భంగా గ్రామస్తులు ఈ ఆలయ అభివృద్ధి కోసం పూనుకున్నారు. ఆలయానికి వెళ్ళేందుకు అనుగుణంగా నడక దారిని ఏర్పాటు చేసుకున్నారు. పురావస్తు శాఖ పట్టించుకోక పోవడం, చారిత్రక సంపదపై అవగాహన లేకపోవడంతో గుహలకు సున్నం వేశారు. దీనివల్ల గుహల పైభాగంలో ఉన్న రాతి చిత్రాలు పాడవ్వడమేకాక, దాని చారిత్రక ప్రాధాన్యం కోల్పోయింది. ఇంత ప్రాచీన చరిత్ర, ప్రాధాన్యత కలిగిన ఈ గుహల వివరాలు అటు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, ఇటు రాష్ట్ర పురావస్తు శాఖలోకానీ లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి మాట అటుంచి కనీసం ఇలాంటి ప్రాంతం ఒకటుంది అన్న విషయం చుట్టు పక్కల గ్రామాల ప్రజలకి సైతం తెలియకపోవడం శోచనీయం. రాష్ట్ర పురావస్తు శాఖ ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మరోసారి సున్నం, రంగులు వేయకుండా చర్యలు చేపట్టాలని పలువురు చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు . -
కాపురం గుట్టల్లో కాకతీయ స్థావరం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కోటకు ఆవల కాకతీయుల సైనిక రహస్య స్థావరం ఉండేదా? గోదావరి తీరాన చిట్టడివిలో రెండవ ప్రతాపరుద్రుడు శత్రువు గుర్తించని వనదుర్గం కట్టాడా? కాకతీయుల సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఈ సైన్యంతోనే అల్లావుద్దీన్ ఖిల్జి సేనాని మాలిక్ కాఫర్పై దాడి చేశాడా?.. యువ చారిత్రక పరిశోధకుడు అరవింద్ ఆర్య పరిశోధనలు అవుననే సమాధానమిస్తున్నాయి. శత్రువుల రాకను ముందే పసిగట్టడానికి కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ పటిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కోసం నలువైపులా నిర్మించిన బురుజుల ఆధారాలు లభ్యమయ్యాయి. ముందే పసిగట్టేందుకు.. కాకతీయ సామ్రాజ్యంపై శత్రు రాజుల కన్నెప్పుడూ ఉండేది. ఢిల్లీ సుల్తాన్లు 5 సార్లు కాకతీయ సామ్రాజ్య ఆక్రమణకు దండెత్తారు. ఈ 5 మార్లు సుల్తాన్ల సైన్యం గోదావరి మీదుగానే ప్రయాణం చేసి ఓరుగల్లు రాజ్య ప్రవేశం చేసింది. దీంతో పరాయి సైన్యం రాకను ముందే పసిగట్టి నిలువరించేందుకు రెండవ ప్రతాప రుద్రుడు ఓరుగల్లు కోటకు ఉత్తర దిక్కున 140 కి.మీ దూరంలో కాపురం, వల్లూరు, ప్రతాపగిరి, నందిగామ గొంతెమ్మ గుట్టల మీద రహస్య స్థావరాలు ఏర్పాటు చేసిన చారిత్రక ఆనవాళ్లు వెలుగుచూశాయి. 200 మందికి పైగా సైనికులకు ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచేర్లకు 3 కిలోమీటర్ల దూరంలో కాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరికి కాస్త దూరంలో దట్టమైన అడవిలో మూడు కొండలు కనబడుతుంటాయి. శిల్పి పనిగట్టుకొని ఉలితో చెక్కిన తరహాలో ఈ గుట్టలున్నాయి. ఆ కొండల పైభాగంలో ఆలయం, సహజంగా ఏర్పడ్డ రాతి గోడ, ఆ పక్కనే మానవ నిర్మిత కోట గోడలు, బురుజులు, పెద్ద రాతి స్తంభాలు, కుండ పెంకులు లభ్యమయ్యాయి. వాన నీటి నిల్వ కోసం కొండ పైభాగంలో నాడు నిర్మించుకున్న బావుల లాంటి నిర్మాణాలు నేటి చెక్ డ్యాంలను తలపిస్తాయి. గుట్టల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాలు, సైనికుల నివాసానికి కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపున గుహలున్నాయి. రెండు కొండలను కలుపుతూ సుమారు 500 మీటర్ల మేర సహజ సిద్ధంగా ఏర్పాటైన రాతి గోడ ఉంది. ఈ రెండు గుహలలో 200 మందికి పైగా సైనికులు నివాసం ఉండేందుకు సరిపడేంత స్థలం గుర్తించారు. గరుడ విగ్రహం, సైనిక గుహ ముఖ భాగం మూడంచెల భద్రత రక్షణ కోసం కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెల్లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతి గోడలు, సైనికుల పహారా కోసం నలువైపులా బురుజులు ఉన్నాయి. సైనికుల అవసరాల కోసం కొండ పైభాగంలో 1వ, 2వ కోటగోడల మధ్య రెండు చెక్ డ్యాంలను పోలి ఉన్న బావులు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడ నిర్మించుకున్నారు. సుల్తానులను నిలువరించడానికే కొండ మీద దొరికిన చారిత్రక ఆనవాళ్లు, అక్కడి చుట్టు పక్కల గ్రామాల్లోని జన బాహుళ్యం నుంచి సేకరించిన సాంస్కృతిక ఆనవాళ్ల ఆధారంగా ఇక్క డ కాకతీయుల రహస్య సైనిక స్థావరం ఉందనే అంచనాకు వచ్చాం. గోదావరి నది మీదుగా ఢిల్లీ సుల్తానులు పదే పదే దండెత్తుతుండటంతో కాకతీయులు దీనిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. – అరవింద్ ఆర్య పరికి, చరిత్ర యువ పరిశోధకుడు సైనిక స్థావరాలు ఉండొచ్చు కొండ మీద దొరికన ఆనవాళ్ల ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఉండొ చ్చని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి సరైన చారిత్రక అవగాహన లేదు. చారిత్రక, సాంస్కృతిక, అజ్ఞాత చరిత్ర ఇక్కడ దాగి ఉంది. పురావస్తు శాఖ అధికారులు పూర్తిగా పరిశోధన చేసి ఈ ప్రాంత చరిత్ర, కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలి. – ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్రావు -
ఇటుకలు ‘గుటకేశారు’!
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో శాతవాహనుల కాలం నాటి ఇటుకలు మాయమయ్యాయి. సమీప ప్రాంతాల్లోని ప్రజలు తమ సొంత నిర్మాణాల కోసం పాతకాలం నాటి గోడల్ని ధ్వంసం చేసి వాటిని తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పురావస్తు శాఖ.. వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలో తెలియక తలపట్టుకుంటోంది. బయటికి చెబితే తమకే చెడ్డ పేరొస్తుందని దొరికిన ఇటు కల్ని గుట్టుచప్పుడు కాకుండా స్వాధీనం చేసుకుంటూ రికార్డు చేసే పనిలో పడ్డారు అధికారులు. 70 ఎకరాల్లో.. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో శాతవాహనుల కాలం నాటి నిర్మాణాలున్న ప్రాంతంలో 1955 నుంచి 1981 మధ్య ప్రాంతంలో పురా వస్తు శాఖ ఐదారు దఫాలు తవ్వకాలు జరిపింది. ఆ సమయంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో నిర్మాణాలు వెలుగు చూశాయి. దాదాపు 3 వేలకుపైగా శాతవాహనుల, రోమన్ నాణేలు బయటపడ్డాయి. కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత అక్కడ తవ్వకాలు జరగలేదు. దీంతో అక్కడ 70 ఎకరాల భూములు సేకరించి నిర్మాణాలు పరిరక్షించాలని అప్పటి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలోనే ఇటీవల తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ.. అప్పట్లో తవ్వకాల్లో వెలుగు చూసిన నిర్మాణాలు అదృశ్యమైనట్లు గుర్తించింది. ఓ ఊళ్లో దేవాలయానికి.. ఇటీవల ఓ ఊళ్లో శాతవాహనుల కాలం నాటి ఇటుకల రాశి కనిపించింది. అక్కడి ఓ దేవాలయాన్ని పునర్ నిర్మించేందుకు కూల్చడంతో ఆ ఇటుకలు బయటపడ్డాయి. అవన్నీ పెద్దబొంకూరు నిర్మాణాల్లోని ఇటుకలుగా అధికారులు గుర్తించారు. గోడలు ధ్వంసం చేసి ఆ ఇటుకలు తీసుకెళ్లి గుడి నిర్మించారని తేల్చారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని వివరాలు రికార్డు చేశారు. అలాగే కొన్ని ఊళ్లలో ఇళ్లు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలకు ఈ ఇటుకలు వాడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. శాతవాహన కాలం నాటి ఆ ఇటుకల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. అయినా ఇప్పటికీ అవి దృఢంగా ఉన్నాయి. 58 అంగుళాల పొడవు, 26 అంగుళాల వెడల్పు, 8 అంగుళాల మందంతో మనం వాడే సాధారణ ఇటుకకు మూడు, నాలుగు రెట్లు పెద్దగా ఉంటాయి ఆ ఇటుకలు. అలనాటి నిర్మాణాలు వేల ఏళ్ల పాటు మనగలగడంలో వీటిదే ప్రధాన పాత్ర. కోటిలింగాల వద్ద కూడా.. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల వద్ద కూడా తవ్వకాల్లో భారీ నిర్మాణాలు వెలుగు చూశాయి. కానీ ఇటీవల పుష్కరాల సమయంలో పార్కింగ్ కోసం పదెకరాల స్థలంలో భూమిని చదును చేసి రోలర్తో తొక్కిం చారు. దీంతో దిగువనున్న నిర్మాణాలు భూగర్భంలోనే ధ్వంసమై ఉంటాయని భావిస్తున్నారు. ధూళికట్టలో అద్భుత బుద్ధ స్థూపం ఉన్న ప్రాంతానికి కిలోమీటరు దూరంలో శాతవాహనుల కాలం నిర్మాణాలు, కోటగోడ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనూ చాలా వరకు నిర్మాణాలు ధ్వంస మయ్యాయి. ఫణిగిరి, గాజులబండ, కర్ణమామిడిల్లోనూ నిర్మాణాలు ధ్వంసమవుతూనే ఉన్నాయి. -
'పెద్దబొంకూరు'పై గద్దల కన్ను
సాక్షి, హైదరాబాద్: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశంపై నేతల కన్ను పడింది. పురావస్తు శాఖ దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అతికష్టం మీద సేకరించిన భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టే వంకతో భూమిని సొంతం చేసుకునే ప్లాన్ వేశారు. అందులో క్రీడా మైదానం, దాని ఆసరాగా వాణిజ్య సముదాయం నిర్మించాలని ఆ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఈ భూమి ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకు నేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక పెద్దబొంకూరులో జరుగుతున్న వ్యవహారమిది. చారిత్రక ప్రాధాన్యం పెద్దబొంకూరుకు చారిత్రకంగా చాలా ప్రాధాన్యముందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. దీనికి పది కిలోమీటర్ల దూరంలో ధూళికట్టలో బౌద్ధ స్తూపం ఉంది. దక్షిణ భారత దేశంలో లభించిన బౌద్ధ ప్రాంతాల్లో ఇది అత్యంత కీలకమైంది. శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ స్తూపాలు, ఇతర నిర్మాణాలు కట్టించారు. దానికి అనుబంధంగానే పెద్దబొంకూరును తీర్చి దిద్దారు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ చారిత్రక అవశేషాలున్నట్టు గుర్తించి ఐదు దఫాల్లో తవ్వకాలు జరిపారు. అందులో ఏకంగా ఐదు వేల వరకు నాణేలు లభించాయి. కొన్ని రోమన్ బంగారు నాణేలు కూడా దొరకటంతో ఇది వాణిజ్య కేంద్రమన్న ఉద్దేశంతో తవ్వకాలు కొనసాగించారు. విశాలంగా ఉన్న హాళ్లు, ఇతర గదుల అవశేషాలు, 22 బావులు ఉన్నట్టు తేలింది. ఇది నాణేల ముద్రణ జరిగే కేంద్రంగా వాడుకుని ఉంటారని భావించారు. అయితే తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. ఆ 40 ఎకరాలు భవిష్యత్తులో పెద్దబొంకూరు ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు జరపాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే 68 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. నెల రోజుల క్రితం అక్కడ మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఆ భూమిపై నేతల కన్ను పడింది. ఇప్పటి వరకు జరిగిన అన్వేషణను చాలించి మిగతా ఖాళీ భూమిని అప్పగిస్తే ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందంటూ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో 25 ఎకరాల్లో తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మూడెకరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నందున అంతవరకు భూమి అట్టిపెట్టుకుని మిగతా 40 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్న ఒత్తిడి ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఉన్న భూమి కావడంతో అక్కడ స్టేడియం.. దానికి అనుబంధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మింపచేస్తే తమకు గిట్టుబాటు అవుతుందన్న ఆలోచనలో వారున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు ఉన్నతస్థాయి నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ప్రస్తుతం సచివాలయం స్థాయిలో ఆ మేరకు వ్యవహారం సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారులు పూర్తిస్థాయి తవ్వకాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో చిన్నచిన్న ట్రెంచ్లు తవ్వి నిర్మాణాల ఆనవాళ్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఆ ట్రెంచుల్లో కూడా నాటి పూసలు, ఇతర అవశేషాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. అయితే ట్రెంచుల్లో పెద్దగా అవశేషాల జాడ లేనందున మిగతా భూముల్లో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పురావస్తు శాఖ నుంచి వ్యక్తమయ్యేలా నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. సైట్ మ్యూజియం నిర్మించాల్సిన స్థలం సమీపంలోనే ఉన్న ధూళికట్ట వద్ద తవ్వకాలు జరిపినప్పుడు చారిత్రకంగా ఎంతో విలువైన శాతవాహనుల ఆధారాలు లభించాయి. వాటిని సందర్శకులు తిలకించే అవకాశమే లేకుండా పోయింది. ఆ ఆధారాలన్నీ పురావస్తు శాఖ స్టోర్ రూమ్లో మగ్గిపోతున్నాయి. ధూళికట్ట ప్రధాన రహదారికి దూరంగా ఉన్నందున, అక్కడి ఆధారాలు, పెద్దబొంకూరు తవ్వకాల్లో లభించిన ఆధారాలను.. జాతీయ రహదారిపై ఉన్న పెద్దబొంకూరు వద్ద సైట్ మ్యూజియం నిర్మించి ప్రదర్శనకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పురావస్తు శాఖ వద్ద పెండింగులోనే ఉండిపోయింది. తవ్వకాలు కొనసాగుతున్న ప్రాంతం -
విదేశాలకు తరలిపోయిన శ్రీవారి ఆభరణాలు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆభరణాలు ఎప్పుడో ఇతర దేశాలకు తరలిపోయాయని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి బాంబు పేల్చారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన అనేక ఆభరణాలు, నాణేలు కూడా ఇప్పుడు లేవని తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న దానిపై పురావస్తు శాఖ గతంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ సభ్యులు నెల రోజులపాటు పరిశీలించి చాలా ఆభరణాలు, నాణేలు లేనట్టు గుర్తించారని చెప్పారు. చాలా ఆభరణాలు, నాణేలను కరగబెట్టినట్టు కమిటీ సభ్యులు తేల్చారని వివరించారు. ‘పాత మిరాశీదారీ వ్యవస్థ సమయంలోనో.. అంతకుముందో చాలా నాణేలు కరగబెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సతీసమేతంగా తిరుమల పర్యటనకు వచ్చి ఎన్నో ఆభరణాలు, నాణేలు స్వామివారికి కానుకగా ఇచ్చారు. విచారణ చేస్తే వాటికి సరైన రికార్డులు కూడా లేవని తేలింది’అని తెలిపారు. వివిధ శాసనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాల గురించి పురావస్తు శాఖ ‘గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ డొనేట్ బై కృష్ణదేవరాయల్ టూ ఆంధ్రా టెంపుల్స్’పేరుతో ఒక పుస్తకం ప్రచురించినట్టు చెప్పారు. రాయల వారు ఏ సమయంలో పర్యటించారు? ఏ కానుకలు సమర్పించారన్నది శాసనాల్లో స్పష్టంగా పేర్కొన్నారని.. వాటి వివరాలతో పుస్తకం ప్రచురించినట్టు వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎంతో విలువైన నాణేలు, వజ్రవైడూర్యాలు సమర్పించారని వీటిలో కొన్ని పర్షియన్ దేశాలకు, మరికొన్ని అరబ్ దేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నో ముత్యాలను ఇంగ్లండ్కు తరలించుకుపోయిందని, అవన్నీ అక్కడ భద్రంగా ఉన్నాయన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ విడిపోయినప్పుడు ఎన్నో ఆభరణాలు ఆ ప్రాంతంలో ఉండిపోయాయని, వాటిని అక్కడ నుంచి రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగలేదని చెప్పారు. రోమన్, శాతవాహన కాలం నాటి కొన్ని నాణేలు ఇప్పటికీ టీటీడీ మ్యూజియంలో ఉన్నాయని వెల్లడించారు. -
హెరిటేజ్ తెలంగాణతో సర్వతో‘భద్రం’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తింపు పొందిన సర్వతోభద్ర ఆలయ పునర్నిర్మాణ బాధ్యత నుంచి ప్రభుత్వం దేవాదాయ శాఖను తప్పించింది. ఆలయ ప్రత్యేకతలను దెబ్బతీసేలా దేవాదాయ శాఖ పనులు చేస్తుండటాన్ని ‘సాక్షి’వెలుగులోకి తేవడంతో.. సర్కారు స్పందించింది. ఈ పనులను హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తు విభాగం)కు అప్పగించింది. ఈ పనుల కోసం దేవాదాయ శాఖకు మంజూరు చేసిన నిధులను కూడా పురావస్తు శాఖకే అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ విశిష్టత దెబ్బతినకుండా.. పూర్తిగా రాతి నిర్మాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు పురావస్తుశాఖ సిద్ధమైంది. ఆలయానికి దూరంగా ఆర్కేడ్ భూపాలపల్లి జిల్లా నయన్పాక గ్రామంలో పురాతన సర్వతోభద్ర ఆలయాన్ని ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. దానిని పునరుద్ధరించి పునర్వైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. దేవాదాయ శాఖకు బాధ్యత అప్పగించింది. కానీ దేవాదాయ శాఖ అధికారులు పురాతన ఆలయ విశిష్టతనే దెబ్బతీసేలా రాళ్ల తొలగింపు, కాంక్రీటుతో పనుల వంటివి చేపట్టారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ఇటీవల కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సర్కారు పునరుద్ధరణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి తప్పించి.. హెరిటేజ్ తెలంగాణకు అప్పగించింది. చర్యలు చేపట్టిన పురావస్తు శాఖ సర్వతోభద్ర ఆలయం అతి పురాతన నిర్మాణం కావడంతో.. దాని ప్రత్యేకత దెబ్బతినేలా, దాన్ని అనుకుని కొత్త నిర్మాణాలేవీ చేపట్టడానికి వీలు లేదు. దీంతో ప్రధాన ఆలయానికి చుట్టూ 60 అడుగుల దూరంలో చతురస్రాకారంలో భారీ ఆర్కేడ్ (మంటపం తరహాలో) నిర్మించాలని పురావస్తు శాఖ అధికారులు యోచిస్తున్నారు. అది కూడా పూర్తిగా రాతి నిర్మాణంగా ఉండనుంది. ఆలయానికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నందున ఆర్కేడ్ నాలుగు వైపులా ప్రత్యేక బాటలు ఏర్పాటు చేస్తారు. మధ్యలో పచ్చిక బయలు, పూల చెట్లు ఏర్పాటు చేస్తారు. ఇక ఈశాన్య దిశలో ఉన్న కోనేరులో పూడిక తీసి పునరుద్ధరిస్తారు. ఇక ఆర్కేడ్ వెలుపల భక్తులు, పర్యాటకుల వసతి కోసం ఇతర నిర్మాణాలను చేపడతారు. ఇక ఆలయ శిఖరంపై భాగాన ఇటుకలు పడిపోయి ఉన్నాయి. దీంతో అదే పరిమాణంలో కొత్త ఇటుకలు తయారు చేయించి.. శిథిలమైన చోట ఏర్పాటు చేసి, డంగుసున్నంతో పునరుద్ధరించ నున్నారు. -
చారిత్రక వనం..పునర్వైభవానికి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: గురుత్వాకర్షణ శక్తితో నీటిని విరజిమ్మే ఫౌంటెన్.. నలువైపులా ఉద్యానవనం.. కాలిబాటలు.. అందమైన పూల చెట్లు.. చుట్టూ ఉన్న చెరువుల నుంచి నీటిని తరలించే కాలువలు.. టెర్రకోట పైపులైన్లు.. పూదోట అందాల్ని తిలకించేందుకు ప్రత్యేకంగా ఓ బారాదరి (పెవిలియన్).. గోల్కొండ నయా ఖిల్లాలో 450 ఏళ్ల కిందటి అద్భుత ఉద్యానవనం ప్రత్యేకతలివి. తాజ్మహల్ ముందు ఉన్న మొఘల్ గార్డెన్కు మాతృకగా భావించే ఈ ఉద్యానవనం.. కాలక్రమేణా భూగర్భంలో కలసింది. తాజాగా దానిని పునరుద్ధరించేందుకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. గోల్కొండ కోటకు మరోవైపున.. కాకతీయుల నుంచి గోల్కొండను స్వాధీనం చేసుకున్నాక దానికి కొత్తరూపు ఇచ్చే క్రమంలో కుతుబ్షాహీలు నయాఖిల్లాను నిర్మించారు. అందులో అద్భుత ఉద్యానవనాన్ని నిర్మించారు. 1590 సంవత్సరం అనంతరం అసఫ్జాహీల పాలన మొదలయ్యాక ఉద్యానవనం కనుమరుగైంది. కొన్నేళ్ల కింద ఈ ప్రాంతంలో గోల్ఫ్కోర్టు నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నపుడు ఉద్యానవనం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టులు కృష్ణయ్య, తాహెర్లు తవ్వకాలు జరిపి పర్షియా గార్డెన్ ఆనవాళ్లను వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మిలింద్ కుమార్ చావ్లే.. ఈ ఉద్యానవనానికి పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న శాతం చెరువు నుంచి నీటిని తీసుకొచ్చే కాలువల్లో మిగిలిన భాగాన్ని పునరుద్ధరించారు. బారాదరిని డంగు సున్నంతో బాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఏ ఇతర తవ్వకాలకు కొత్త అనుమతులు కోరకుండా.. కేవలం ఈ ఒక్కపనికే అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇక చుట్టూ ఉన్న భూముల్లో ఇంకా నిర్మాణాలేమైనా ఉండిపోయా యా అన్న సందేహం మేరకు జీఐఎస్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను చెన్నై ఐఐటీకి అప్పగించారు. భూమిలో పూడుకుపోయిన కట్టడాలు, నాటి వస్తువులు, నాణేల వంటివి ఏవి ఉన్నా దానితో గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. శిథిలమైన ఉద్యానవనం కట్టడాలు అతిథులు కూర్చునేందుకు నిర్మించిన బారాదరి -
తాజ్మహల్కు నిర్లక్ష్యం కాటు
కాలం చెక్కిట ఘనీభవించిన కన్నీటిచుక్కగా, ధవళకాంతుల దివ్య మందిరంగా ఎందరెం దరినో పరవశింపజేసే తాజ్మహల్... దాన్ని కాపాడి రక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారుల మనసుల్ని కాస్తయినా కదిలించలేకపోతున్నది. తాజ్ కళాకాంతులు క్షీణిస్తున్నాయని, అది క్రమేపీ పసుపు రంగుకు మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఆ శాఖకు చీవాట్లు పెట్టింది. ఆ అపురూప కట్టడాన్ని పరిరక్షించడం చేతగాకపోతే ఆ బాధ్యతనుంచి తప్పుకోండని అధికారు లను మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహానికి కారణముంది. తాజ్మహల్కు ముప్పు ముంచుకొస్తున్నదని పర్యావరణవేత్తలు దాదాపు పాతికేళ్లనుంచి ఆందోళనపడుతు న్నారు. ఈ విషయంలో ఏదో ఒక చర్య తీసుకుని రక్షించమని ప్రభుత్వాలను వేడుకుంటు న్నారు. అయినా ఫలితం శూన్యం. చివరకు వారు 1996లో సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫౌండ్రీలను అక్కడినుంచి తరలించాలని, సమీపంలోని రిఫైన రీల నిర్వహణకు సహజవాయువును వినియోగించాలని అప్పట్లో కోర్టు సూచించింది. కానీ ఆ ఆదేశాలను గానీ, ఆ తర్వాత పలు సందర్భాల్లో చేసిన సూచనలను గానీ ప్రభుత్వాలు సరిగా పట్టించుకున్న దాఖలా లేదు. నిరుడు ఒక హోటల్ నిర్మాణం కోసం తాజ్ పరిసరాల్లో దాదాపు 25 వృక్షాలను కూల్చారు. దానిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారిస్తుండగానే ఉత్తరప్రదేశ్ లోని మధురకూ, ఢిల్లీకి మధ్య రైల్వే ట్రాక్ నిర్మించడానికి 400 చెట్లు కొట్టేయవలసి ఉంటుందని, ఇందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరుతూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి బదులు ఆ చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయదల్చుకున్నా మని చెబితే సరిపోతుంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఈ అఫిడవిట్ దానికెంత ఆగ్రహం తెప్పించిందో అర్ధమవుతుంది. ప్రపంచంలో ఏమూలకెళ్లినా తాజ్మహల్ను భారత్కు పర్యాయపదంగా చెప్పుకుంటారు. ఏటా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక కట్టడాల్లో అగ్రస్థానం తాజ్మహల్దే. ఏడు ప్రపంచ వింతల్లో అదొకటి. అంతర్జాతీయ సంస్థ యునెస్కో దాన్ని ప్రపంచ వారసత్వ సంప దగా గుర్తించింది. ఆ అద్భుతానికి ఇన్ని రకాల గుర్తింపు ఉన్నా ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీ మోత’ అన్నట్టు ఇక్కడి పాలకులకు మాత్రం దానిపై ఆసక్తిగానీ, అనురక్తిగానీ ఉండటం లేదు. బుధవారం సుప్రీంకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది. తాజ్మహల్ రక్షణకు ఏం చేయా లన్న విషయంలో పురావస్తు శాఖను పక్కనబెట్టి అంతర్జాతీయ నిపుణుల సహాయసహకా రాలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ శాఖ ఎంత ఘనంగా పనిచేస్తున్నదో చెప్పడానికి ఇది చాలు. కీటకాలు, శైవలాలు దాన్ని దెబ్బతీస్తున్నాయని పురావస్తు శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ధర్మాసనం విశ్వసించలేదు. సమీపాన ఉన్న యమునా నది నీరు నిలిచి పోయి నాచు పట్టడం వల్ల దాని ప్రభావం తాజ్పై పడుతున్నదని ఆ శాఖ చెప్పింది. నీరు నాచుపట్టడం నిజమే అయినా... అది ఎగిరొచ్చి తాజ్ను దెబ్బతీస్తుందా అని న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 17 వ శతాబ్దంలో నిర్మించిన ఈ పాలరాతి కట్టడం వాయు కాలు ష్యంతో వన్నె కోల్పోతున్నది. కాలుష్యం కాటుకు మనుషుల ప్రాణాలే రాలిపడుతున్నప్పుడు కట్టడాల గురించి చెప్పేదేముంది? గాలిలో గంధకం, నత్రజని తదితర ఉద్గారాల పరిమా ణాలు పరిమితికి మించి ఉన్నాయని, అప్పుడప్పుడు కురిసే ఆమ్ల వర్షాలు తాజ్ అందాన్ని పాడు చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఆ పాలరాతి కట్టడం చుట్టూ భారీ సంఖ్యలో మొక్కలు పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు నిరుడు వార్తలొచ్చాయి. అయితే ఇన్నేళ్లుగా జరి గిన విధ్వంసాన్ని అవి ఇప్పటికప్పుడు పూడ్చలేవు. అందుకు చాలా కాలం పడుతుంది. చారిత్రక కట్టడాలను శిథిల, నిర్జీవ రూపాలుగా చూడకూడదు. అవి కేవలం గత కాలపు కళా కౌశలానికి, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, అప్పటి వాస్తు శాస్త్ర వైభవానికి మాత్రమే ప్రతీకలు కావు. అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవిగా మాత్రమే వాటిని చూస్తే సరిపోదు. అవి మన వారసత్వ సంపద. వందల ఏళ్లనాటి చరిత్రకూ, సంస్కృతికీ సజీవ సాక్ష్యాలు. ఆనాటి విలువలకు నకళ్లు. ఇప్పటి మన అవసరాలతో, మనకుండే అభిప్రాయాలతో కాక వాటిని చరి త్రకు దర్పణాలుగా గుర్తించగలిగితే ఆ కట్టడాల గొప్పతనం అర్ధమవుతుంది. వాటి సంరక్షణ ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది. మిగిలినవారి మాటెలా ఉన్నా... పురావస్తు శాఖలో పనిచేసేవారికి, ఆ శాఖను పర్యవేక్షించే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చరిత్రపైనా, సంస్కృతిపైనా ఆపేక్ష ఉండాలి. చారిత్రక కట్టడాలను తగు జాగ్రత్తలతో కాపాడి భవిష్య త్తరాలకు భద్రంగా అప్పజెప్పాలన్న స్పృహ ఉండాలి. మన పురావస్తు శాఖకు 157 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఏం ప్రయోజనం? ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన తాజ్ మహల్కే పురావస్తు శాఖ ఈ గతి పట్టించింది. ఇక ఇతర కట్టడాల పరిరక్షణ విషయం చెప్పేదే ముంది? యుమునా నది తీరం వ్యర్థాలకు నిలయంగా మారింది. అక్కడ కొన్ని దశాబ్దాలుగా కర్మాగారాలకు అనుమతులీయడం వల్ల ఆ వ్యర్థాలన్నీ వచ్చి దాన్లో కలుస్తున్నాయి. ఆ కర్మా గారాలు వదిలే పొగ తాజ్మహల్ను కమ్ముతోంది. దశాబ్దాలు గడుస్తున్నా వాటి దుష్ప్రభా వాన్ని కాస్తయినా నివారించడానికి ప్రయత్నించకపోవడం నేరం కాదా? కేంద్రంలో ఎవరున్నా తాజ్ పట్ల నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. రెండేళ్లక్రితం సిరియాలోని పురాతన నగరం పాల్మై రాను ఐఎస్ ఉగ్రవాదులు ముట్టడించి, అందులోని కొత్త రాతియుగంనాటి అపురూప కళాఖం డాలను, అనంతరకాలంలో నిర్మించిన భవంతులను ధ్వంసం చేశారని విన్నప్పుడు ఎందరెంద రికో మనస్సు చివుక్కుమంది. మన నిర్లక్ష్యం ఇక్కడి చారిత్రక కట్టడాలకు అచ్చం అదే గతి పట్టి స్తున్నదని అర్ధమైతే వాటిపట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అందరికీ తెలుస్తుంది. -
టీటీడీ వివాదం.. శ్రీలక్ష్మి బదిలీ
-
టీటీడీ వివాదం.. శ్రీలక్ష్మి బదిలీ
సాక్షి, అమరావతి : పురావస్తు శాఖ ఇటీవల టీటీడీకి జారీ చేసిన సర్క్యులర్పై వివాదం చెలరేగటంతో ఆశాఖ అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ టి.శ్రీలక్ష్మిని చెన్నైకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో చెన్నైలో పని చేస్తున్న రామన్ను నియమించారు. తిరుమల దేవాలయాలను చారిత్రక కట్టడాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఈ నెల 5వ తేదీన సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి టీటీడీ కార్యనిర్వహణాధికారికి సర్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో వెంటనే సర్క్యులర్ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తిరుమల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేస్తోందని బహిరంగంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో చేసేది ఏమీలేక కేంద్ర ప్రభుత్వం శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేసింది. -
శ్రీవారి ఆలయంపై కేంద్రం కుట్ర
తిరుపతి కల్చరల్: తిరుమల శ్రీవారి ఆలయంపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారమిక్కడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీలోని ఐఏఎస్ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫలితంగానే శ్రీవారి సొమ్ము, ఆస్తులపై పురావస్తు శాఖ కన్నుపడిందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి పురావస్తు శాఖ టీటీడీ ఈవోకు లేఖ రాయడం, వెంటనే ఉపసంహరించుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పురావస్తు శాఖ లేఖ రాయడం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు. తిరుమల కొండపైన పురాతన కట్టడాలు తొలగించాలన్నా, నిర్మించాలన్నా ఆగమ సలహామండలి సూచనలను టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. -
టీటీడీలో పురావస్తు లేఖ కలకలం
సాక్షి, తిరుమల: టీటీడీకి భారత పురావస్తు శాఖ శుక్రవారం రాసిన లేఖ కలకలం రేపింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షిత సంపదగా గుర్తించాలని పురావస్తు శాఖ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఆలయ చారిత్రక ప్రాధాన్యతాంశాలను పరిశీలించేలా, దాన్ని రక్షిత సంపదగా గుర్తించేలా తమ శాఖ ప్రతినిధులకు సహకరించాలని పురావస్తు శాఖ నుంచి టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్కు లేఖ అందింది. అయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ శనివారం స్పష్టం చేశారు. అనంతరం టీటీడీ ఈవోకు పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు భారత పురావస్తు శాఖ అధికారిణి టి.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం లేఖ విడుదల చేశారు. దీనిపై టీటీడీ ఈవో హర్షం వ్యక్తం చేశారు. -
టీటీడీపై కేంద్రం పెత్తనం.. అంతలోనే వెనక్కి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమల్లోని ఇతర ఆలయాలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే తిరుమలలోని పలు ఆలయాలు, వాటి చరిత్రను కేంద్ర పురవాస్తు శాఖ పరిశీలించింది. ఆలయాలు, నిర్మాణాలు పూర్వకాలంలో నిర్మాణమైనట్లుగా పురావస్తు శాఖ వెల్లడించింది. వీటితో పాటు ఇతర ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని టీటీడీ ఈవోకు కేంద్ర పురవాస్తు శాఖ లేఖ రాసింది. దీంతో టీటీడీ రాష్ట్ర పురవాస్తు శాఖకు వివరాలు అందించినట్లు సమాచారం. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ వెల్లడించింది. పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, భక్తులు ఇచ్చిన విలువైన కానుకలు సరిగ్గా భద్రపరచట్లేదని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోవట్లేదనే ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకొన్నట్లు కేంద్ర పురావస్తు శాఖ ప్రకటించింది. దీంతో తిరుమలలోని పురాతన కట్టడాలు అన్నింటిని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకొనే అవకాశం ఉంది. అయితే టీటీడీ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందలేదని, అందిన వెంటనే అధికారులు తిరుమలలో సందర్శించే అవకాశం ఉన్నట్లు పురావస్తు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిశీలన అనంతరం పలు కట్టడాలను ఆధీనంలోకి తీసుకొనే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపై కేంద్రం పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు. అదంతా అబద్ధం : ఎంపీ జీవీఎల్ నరసింహరావు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్న ప్రచారం అబద్ధమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ విషయంపై కేంద్ర సాంస్కృతిక శాఖా అధికారులతో మాట్లాడామని, అటువంటి అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. దేవస్థానం నుంచి కేంద్రం జోక్యం కోరితే పరిశీలిస్తారని తెలిపారు. కేవలం రాజకీయ దురుద్ధేశంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. అంతలోనే వెనక్కి తగ్గిన కేంద్రం : తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమలలోని ఆలయాలను ఆధీనంలోకి తీసుకోవటంపై కేంద్రం వెనక్కి తగ్గింది. పురావస్తు శాఖ ఢిల్లీ నుండి విజయవాడ కార్యాలయానికి పంపిన లేఖను కేంద్ర పురావస్తు శాఖ వెనక్కు తీసుకోనుందని, ఈ మేరకు తమకు సమాచారం వచ్చినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. సమాచారం లోపం కారణంగానే ఈవోకు లేఖ పంపామంటూ పురావస్తు శాఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. -
సర్వతో 'ఛి'ద్రాలయం
సాక్షి, హైదరాబాద్: చుట్టూ భారీ బండరాయి.. దానిపై భారీ శిఖరంతో ఆలయం.. నాలుగు వైపులా నాలుగు ద్వారాలు.. ఒక్కో ద్వారం నుంచి వెళ్తే ఒక్కో రూపంలో స్వామి దర్శనం.. తూర్పు వైపు లక్ష్మీ నరసింహుడు, పశ్చిమాన నాగలి ధరించిన బలరాముడు, దక్షిణాన వేణుగోపాల స్వామి, ఉత్తరాన సీతారామలక్ష్మణులు.. చుట్టూ విస్తరించిన బండరాయి మధ్య భాగాన్నే విగ్రహంగా మలిచారు నాటి శిల్పులు.. వందల ఏళ్లనాటి ఈ అరుదైన కట్టడం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దాని ప్రత్యేకత, గొప్పతనంపై అవగాహన లేని దేవాదాయ శాఖ.. అభివృద్ధి పేరుతో ధ్వంసరచన మొదలుపెట్టింది. వెలకట్టలేని ఆ నిర్మాణాలను అపురూపంగా మరమ్మతు చేయాల్సింది పోయి, నిర్మాణ ప్రత్యేకతలు నాశనమయ్యేలా అడ్డగోలు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. భూపాలపల్లి జిల్లా నయన్పాకలో సర్వతోభద్ర నమూనాలో నిర్మితమైన ఆలయ దీన గాథ ఇది. ‘సాక్షి’ కథనంతో.. బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఆలయంపై గతేడాది నవంబర్లో ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించింది. పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులుతో కలసి అమెరికా ప్రొఫెసర్ వ్యాగనార్ ఈ ఆలయాన్ని సందర్శించి నిర్మాణ రహస్యాలను వెలుగులోకి తేవడాన్ని ఉటంకిస్తూ కథనం సాగింది. ఆలయాన్ని చూసి మంత్రముగ్ధుడైన వ్యాగనార్.. ఇది అత్యంత అరుదైన అద్భుత నిర్మాణంగా పేర్కొన్నారు. దీనికి అలనాటి పద్ధతిలోనే మరమ్మతు చేసి భావితరాలకు అందించాలని సూచించారు. దీంతో స్పందించిన స్పీకర్ మ ధుసూదనాచారి.. ఆలయ పురోభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. అయితే ఆలయాన్ని మరమ్మతు చేసి భావితరాలకు అందిం చాల్సింది పోయి ఆ ప్రత్యేకతల్నే నాశనం చేసేలా ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టారు అధికారులు. నిబంధనలు పక్కనబెట్టి.. పురాతన కట్టడాల మరమ్మతు, పునరుద్ధరణకు ప్రత్యేక నిబంధనలున్నాయి. అప్పట్లో పెద్ద రాళ్లు, ఇటుకలు, డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, గుడ్డు సొన, రాతిపొడి మిశ్రమంతో నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి వాటికి మరమ్మతును ఆ మిశ్రమంతోనే పూర్తి చేయాలి. చార్మి నార్, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం సహా ఏ చిన్న నిర్మాణాలైనా ఇదే నిబంధన. కట్టడం నిర్మాణ విశిష్టత దెబ్బతినకుండా, పురావస్తు శాఖ నిపుణుల పర్యవేక్షణలోనే పనులు జరగాలి. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. ఆలయాన్ని అప్పగించాలని ఏఎస్ఐ కోరుతున్నందున నిధులు దానికి మళ్లించి పనులు చేయించాలని చరిత్రకారులు కోరుతున్నారు. ఆలయ గోపురాన్ని 15.2 అడుగుల ఎత్తు భారీ రాయితో, ఆ పైన 30 అడుగుల ఎత్తు పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించారు. కొంతభాగం తప్ప మిగతా ఇటుక నిర్మాణం ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రాతి నిర్మాణం వరకు ఉంచి, పైన ఉన్న ఇటుక నిర్మాణాన్ని తొలగించబోతున్నారు. కానీ నాటి ఇటుక నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండా దెబ్బతిన్న భాగాన్ని ఆ నమూనా ఇటుకలు రూపొందించి అప్పట్లో వాడిన మిశ్రమంతో మరమ్మతు చేయాలి. ఏం చేస్తున్నారు? దేవాలయానికి నాలుగు వైపులా 25 అడుగుల వెడల్పుతో ప్రాకార మండపాలు నిర్మించనున్నారు. అయితే నాటి ఆలయ భాగం మూసుకుపోయేలా, దాన్ని ఆనుకుని కొత్త నిర్మాణం చేపట్టరాదు. ఇప్పటి నిర్మాణాలు సిమెంటుతో చేపడతారు కాబట్టి ఆలయ ప్రత్యేకత కోల్పోయే అవకాశం ఉంది. ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించనున్నారు. ఇందుకు జిల్లా నిధులు రూ.13 లక్షలు ఖర్చు చేయనున్నారు. అయితే ఆలయానికి సంబంధించి రెండున్నర ఎకరాల భూమి వరకు గోడ నిర్మించాల్సి ఉండగా, దాన్ని తగ్గించి ఆలయానికి చేరువగా నిర్మించాలని యోచిస్తున్నారు. దేవాలయానికి చేరువగా భారీ కమ్యూనిటీ హాలు కూడా నిర్మించనున్నారు. ఇందుకు సింగరేణి సంస్థ రూ.75 లక్షలు వెచ్చించనుంది. మండపం ఫ్లోరింగుపై పూర్తిగా టైల్స్ అమర్చనున్నారు. ఇందుకోసం బ్లాస్టింగ్ చేస్తూ రాయిని పగులగొడుతున్నారు. కానీ ఇక్కడే ఈ ఆలయ ప్రత్యేకత ఉంది. చుట్టూ విస్తరించిన భారీ అఖండ రాయిపైనే ఆలయం నిర్మించారు. మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఆ గుట్ట రాతి భాగాన్నే విగ్రహాలుగా మలిచారు. ఆలయం చుట్టూ ఉన్న రాయిని తొలగించి టైల్స్ వేస్తే ఆలయం అసలు ప్రత్యేకత నాశనం అయ్యే అవకాశం ఉంది. బ్లాస్టింగ్ వల్ల ఆలయ ఉనికికి ప్రమాదం పొంచి ఉంది. ఈ మరమ్మతులకు దేవాదాయ శాఖ రూ.2 కోట్లు వెచ్చిస్తోంది. -
షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా?
-
తాజ్మహల్ మాదే: షాజహాన్ విల్లు ఉందా ?
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు షాజహాన్ అప్పట్లో వక్ఫ్నామాను తమకు అనుకూలంగా జారీచేశారని తెలిపింది. వాదనలు విన్న కోర్టు షాజహాన్ సంతకంతో జారీచేసిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. తాజ్ హక్కులపై యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, భారత పురావస్తు శాఖల మధ్య కేసు నడుస్తోంది. తాజ్ తమ పేరిట రిజిస్టర్ చేయాలని వక్ఫ్ బోర్డు ఉత్తర్వులు జారీచేయగా దాన్ని సవాలుచేస్తూ భారత పురావస్తు శాఖ 2010లో సుప్రీంలో కేసు వేసింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. 1658లో గృహనిర్బంధంలో ఉన్న షాజహాన్ తాజ్ హక్కుల్ని ఎలా రాసిచ్చారని వక్ఫ్ లాయర్ను ప్రశ్నించారు. -
ఈ మహావీరుడు సరిహద్దు బాధితుడు!
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొలువుదీరిన 24 మంది తీర్థంకరులు.. రెండువైపులా వింజామరలు పట్టుకుని ఉపచారాలు చేస్తున్న గంధర్వులు.. తలపైన త్రిఛత్ర ఛాయ.. దాని దిగువన ఎనిమిది తలల శేషుడు.. ఎత్తయిన పీఠం.. దానిపై ధ్యానముద్రలో మహావీరుడు! కళ్యాణ చాళుక్యుల హయాంలో 12వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న అద్భుత విగ్రహమిది. ఇది ఏ తవ్వకాల్లో దొరికిందో, మట్టిలో కూరు కుపోయి ఉందో కాదు. ఇప్పటికీ భక్తుల పూజలందుకుంటున్న ఈ విగ్రహం ఓ దేవాలయంలో కొలువుదీరి ఉంది. ఇది జైనుల ఆలయం. మహావీరుడి ఉత్సవ మూర్తిగా వెలుగొందుతున్న మందిరం. కానీ ఆలయ ముఖద్వారంపై ‘గౌతమ బుద్ధుడు’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. భక్తులు అది బుద్ధుడి విగ్రహంగానే భావించి జ్యోతి వెలిగిస్తూ పూజిస్తున్నారు. మరి మహావీరుడిని బుద్ధుడిగా ఎందుకు ఆరాధిస్తున్నట్టు...?? రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండటమే ఆ దేవాలయానికి శాపమైంది. ఈ ఆలయ భూభాగం కర్ణాటక పరిధిలో ఉన్నా ఊరుఊరంతా తెలుగువారే. దీంతో కర్ణాటక పురావస్తు శాఖ దీన్ని గాలికొదిలేసింది. ఊరంతా తెలుగువారైనా.. భూభాగం సరిహద్దుకు కాస్త ఆవల ఉండటంతో ఇటు తెలంగాణ పురావస్తుశాఖ నిస్సహాయంగా ఉండిపోయింది. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ మందిరంపై కనీస పరిశోధనలు కూడా జరగలేదు. చుట్టుపక్కల ఎలాంటి తవ్వకాలు, ఇతర శాసనాలు, విగ్రహాల అన్వేషణ చేయలేదు. ఫలితంగా... అది మహావీర దేవాలయం అని కూడా స్థానికులకు తెలియకుండా పోయింది. విగ్రహాకృతి ఆధారంగా బుద్ధుడిదిగా భావిస్తూ వస్తున్నారు. ముందుభాగాన్ని రంగులతో అలంకరించి పండుగలప్పుడు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అరుదైన, అపురూపమైన విగ్రహంగా చరిత్రకారులు భావిస్తున్నా ‘సరిహద్దు’ శాపంతో ఆ మందిరం మరుగునపడిపోయింది. కనీసం దాన్ని రక్షిత కట్టడంగా కూడా కర్ణాటక గుర్తించటం లేదు. ఎక్కడుంది ఆ గ్రామం? వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామా నికి రెండు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ –కర్ణాటక సరిహద్దు ఉంది. అక్కడ్నుంచి కొన్ని మీటర్ల దూరంలో కర్ణాటక భూభాగంలో ఉన్న గ్రామమే మిర్యాన్. ఇది కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి తహసీల్ పరిధిలోకి వస్తుంది. పేరుకు ఈ గ్రామం కర్ణాటక భూభాగంలో ఉన్నా.. గ్రామస్తులంతా తెలుగువారే. అక్కడి పోలీసుస్టేషన్ సమీపంలో ఉన్న ఈ దేవాలయంపై ‘గౌతమ బుద్ధుడు’ అని తాటికాయంత తెలుగు అక్షరాలు కనిపిస్తాయి. అందులో కొలువుదీరిందే ఈ మహావీరుడి మూర్తి. నిజాం సంస్థానం ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా నిజాం పాలనలో ఉండేది. అప్పట్లో తెలుగువారే ఉండటంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ వారే ఉంటున్నారు. జైన ఆరాధకులైన కళ్యాణ చాళుక్యులు ఎన్నో జైన మందిరాలు నిర్మించారు. అందులో ఇది ఒకటి. ఇప్పటికీ ఓవైపు మందిర అసలు నిర్మాణం తాలూకు రాళ్లవరస కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో దాన్ని ధ్వంసం చేయటంతో స్థానికులే చిన్నగా, సాధారణ రాళ్లతో తోచిన విధంగా పునర్నిర్మించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ‘‘ఇది వందల ఏళ్లనాటి గుడి. ఇక్కడి విగ్రహం అందంగా ఉంటుంది. చాళుక్యుల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతారు. కానీ ఎప్పుడూ పురావస్తు శాఖ అధికారులు రాలేదు. కనీసం తెలంగాణ పురావస్తుశాఖ అయినా, లేదంటే కేంద్ర పురావస్తు శాఖ అయినా పట్టించుకోవాలి’’ – యాహమత్ ఖాన్, మిర్యాన్ గ్రామస్తుడు ‘‘యాభై ఏళ్ల క్రితం వరకు దేశవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ ఉత్సవాలు చేసిన తీరును నా కళ్లారా చూశాను. ఆ తర్వాత జనం రావటం తగ్గింది. అసలు ఇక్కడ గుడి ఉందనే విషయం కూడా ఇప్పుడు మరిచిపోయారు. దీన్ని అభివృద్ధి చేస్తే మా ఊరు కూడా బాగుపడుతుంది’’ – ఖాజా బీ, స్థానికురాలు -
34 ఏళ్ల తర్వాత ఖజానాను తెరుస్తున్నారు!
భువనేశ్వర్: పూరీలోని ప్రఖ్యాత జగన్నాథస్వామి ఆలయం రత్న భండార్(ఖజానా)ను దాదాపు 34 ఏళ్ల తర్వాత తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఆలయ నిర్వాహకులకు అనుమతిచ్చింది. రత్న భండార్ పటిష్టత, భద్రతల్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) పరీక్షిస్తుందని ఆలయ ప్రధాన నిర్వహణాధికారి పీకే జెనా తెలిపారు. ఖజానాలోని సంపదను లెక్కించబోమని స్పష్టం చేశారు. భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన ఆభరణాలు, రాళ్లను ఈ ఖజానాలో భద్రపర్చినట్లు వెల్లడించారు. రత్న భండార్ను తెరవడంపై గురువారం ఆలయ పూజారులతో చర్చించి విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. 1984లో ఈ ఆలయంలో పనిచేసిన ఆర్.ఎన్.మిశ్రా మాట్లాడుతూ.. అప్పట్లో ఖజానాలోని 7 గదుల్లో మూడింటినే తాము తెరవగలిగామని చెప్పా రు. తనిఖీల కోసం నాలుగో గదికి దగ్గరకు వెళ్లగానే పాములు బుసలుకొట్టిన శబ్దాలు విన్పించాయన్నా రు. జగన్నాథస్వామి ఆలయ పునరుద్ధరణ పనుల్ని ఒడిశా హైకోర్టు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. -
దత్తతకి తాజ్
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా చిరకాలం మిగిలిపోవడానికి ఏం చేయాలి ? పండువెన్నెల్లో వెండికొండలా మళ్లీ మెరవాలంటే ఏం చర్యలుతీసుకోవాలి ? కాలుష్యంకోరల్లో చిక్కుకొని, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ ప్రమాదంలో ఉన్న మన చారిత్రక సంపద తాజ్మహల్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టే ఉన్నాయి. అందుకే తాజ్ని దత్తతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్మహల్ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్మహల్ని కూడా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అలా తీసుకున్న వారు తాజ్ నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి.ఇప్పటికే తాజ్ని దత్తత తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో జీఎంఆర్ గ్రూప్, ఐటీసీ లిమిటెడ్లు రేసులో ముందున్నాయి. తాజ్ను దత్తతకిస్తే దాని పరిరక్షణలో ఇక పురావస్తు శాఖ పాత్ర పరిమితమైపోతోంది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో ఏముంది ? మన దేశంలో ఎన్నో వారసత్వ కట్టడాలు జీర్ణా వస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవడం పురావస్తు శాఖకు తలకు మించిన భారంగా మారింది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సహకారంతో సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కార్పొరేట్ కంపెనీలన్నీ తమకు వచ్చిన లాభాల్లో 2 శాతం సేవా కార్యక్రమాలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ బడ్జెట్ని చారిత్రక కట్టడాలపై కూడా ఖర్చు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చారిత్రక కట్టడాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజ్పై జీఎంఆర్ విజన్ డాక్యుమెంట్ తాజ్మహల్కి ఉన్న చారిత్రక ప్రా«ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని మొదట ఈ పథకం కింద చేర్చలేదు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యజమాని జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజ్మహల్ని దత్తత తీసుకుంటామంటూ పర్యాటక శాఖకు దరఖాస్తు చేసుకుంది. దానిని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో వివరిస్తూ ఒక నివేదిక రూపొందించింది. తాజ్మహల్ నుంచి ఆగ్రా కోటని కలిపే తాజ్ కారిడార్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామని ఆ నివేదికలో పేర్కొంది. మరోవైపు వినియోగదారుల ఉత్పత్తులు, సిగరెట్ల కంపెనీ ఐటీసీ కూడా తాజ్ని దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక అధికార బృందం వారి నివేదికలను పరిశీలించిన తర్వాత ఎవరికి దత్తతకివ్వాలో నిర్ణయిస్తుంది. తాజ్తో పాటుగా ఎర్రకోట, ఇతిమాద్–ఉద్–దౌలా కూడా దత్తతకివ్వాలని జీఎంఆర్ కోరుతోంది. మరోవైపు ఐటీసీ కంపెనీ హైదరాబాద్లో చార్మినార్, ఆంధ్రప్రదేశ్లోని రాతి ఆలయాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 వారసత్వ కట్టడాలను దత్తత తీసుకోవడానికి వివిధ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఈ పాచిక వయసు రెండువేల ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో రాష్ట్ర పురావస్తు శాఖ (హెరిటేజ్ తెలంగాణ) తాజాగా చేపట్టిన తవ్వకాల్లో ఈ వస్తువులు వెలుగు చూశాయి. ఐదు దశాబ్దాల కాలంలో ఇక్కడ మూడు నాలుగు పర్యాయాలు తవ్వకాలు జరిపారు. అప్పట్లో వేల సంఖ్యలో శాతవాహన, రోమన్సహా పలు దేశాల నాణేలు వెలుగు చూశాయి. దీంతో ఇది శాతవాహనకాలం నాటి ప్రధాన వర్తక కేంద్రంగా భావిస్తున్నారు. నాణేల ముద్రణ కేంద్రం కూడా అయి ఉంటుందన్న అనుమానాలూ ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితమే తవ్వకాలు మొదలు కాగా, కొన్ని మట్టి పాత్రలు, ఇతర అవశేషాలు, నాటి గోడల ఆనవాళ్లు కనిపించాయి. కానీ రెండు రోజుల క్రితం అలనాటి పాచిక, ఓ రాగి నాణెం వెలుగుచూశాయి. నాణెం చాలాకాలం మట్టిలో ఉండటంతో దానిపై ముద్రలు, అక్షరాలు చెదిరిపోయి స్పష్టంగా కనిపించటం లేదు. గత నెల పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి ఈ తవ్వకాలు ప్రారంభించారు. ఆ శాఖ సహాయ సంచాలకులు రాములు నాయక్ నేతృత్వంలో జరుగుతున్న తవ్వకాలను శాఖ విశ్రాంత ఉప సంచాలకులు రంగాచార్యులు, సహాయ సంచాలకులు నాగరాజు, విశ్రాంత అధికారి భానుమూర్తి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిపిన తవ్వకాల్లో, వేల ఏళ్లనాడే ఇక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు గుర్తించారు. నీటి వనరులకోసం ప్రత్యేక ఏర్పాటు, నీటి తరలింపు చానళ్లు కనిపించాయి. వాటికి వాడిన ఇటుకలతోపాటు, అత్యంత నునుపుగా పాత్రల తయారీని బట్టి ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. కానీ తవ్వకాలు చాలా పరిమితంగా నిర్వహించటంతో పెద్దగా చారిత్రక ఆధారాలు దొరకలేదు. ఇది అతి చిన్న మట్టిపాత్ర. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ మనుగడలో ఉన్న గురిగి (చిన్న మట్టిపాత్ర) కంటే పరిమాణంలో చిన్నగా ఉన్న ఈ పాత్ర కూడా శాతవాహనుల కాలం నాటిదే. రెండు అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ఈ పాత్ర కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. విలువైన ఆధారాలు దొరికే అవకాశం ‘‘ఇక్కడ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి విలువైన సమాచారం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి నాణేల కోసం వెదుకుతున్నాం. నాణేలతో కొత్త కోణాలు వెలుగు చూస్తాయి. ఇక నాటి వస్తువులు, నిర్మాణ పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి, పాత్రలు, సాహిత్యానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకవచ్చు. రెండుమూడు నెలల పాటు తవ్వకాలు జరుగుతాయి’’ – విశాలాచ్చి, సంచాలకురాలు -
పర్యాటకానికి మొండిచెయ్యి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకోగలిగే ప్రాంతాలు ఉన్నప్పటికీ... వసతుల కరువు, ప్రచార లేమితో ప్రయోజనం ఉండడం లేదు. అయినా పర్యాటకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో నామమాత్రంగా నిధులు కేటాయించింది. పర్యాటక శాఖకు కేవలం రూ.107 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ ప్రగతి పద్దు కింద కేటాయించిన నిధులు రూ.80 కోట్లే. కనీసం రూ.500 కోట్లు ఇవ్వాలని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదు. వృద్ధ కళాకారుల పింఛన్కు రూ.6.75 కోట్లు, సాంస్కతిక అకాడమీలకు సాయంగా రూ.4 కోట్లు, సాంస్కృతిక ఉత్సవాలకు రూ.15 కోట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథికి రూ.18 కోట్లు కేటాయించింది. పురావస్తు శాఖకు నామమాత్రమే రాష్ట్రంలో ఎన్నో చారిత్రక విశిష్టతలున్న ప్రాంతాలు, నిర్మాణాలు ఉన్నా.. ఆలనాపాలనా లేక దెబ్బతింటున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ నిధులు, సిబ్బంది లేక నిస్తేజంగా మారింది. ఇలాంటి సమయంలోనూ పురావస్తు శాఖను పట్టించుకోని ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో నామమాత్రంగా రూ.కోటి మాత్రమే కేటాయించింది. గతేడాది కూడా ఇలాగే తక్కువ నిధులు ఇచ్చినా.. అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకుని అదనంగా నిధులు విడుదల చేయించుకున్నారు. ఆ నిధులతో కొత్త ప్రాంతాల్లో చారిత్రక తవ్వకాలు, మ్యూజియంలలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. -
రుద్రమకోటలో అతి పురాతన సమాధులు
కుక్కునూరు : ప్రపంచంలో కెల్లా అతిపురాతనమైన సమాధులు ఈజిప్టు తర్వాత వేలేరుపాడు మండలంలోని రుద్రమకోటలో ఉన్నాయని పురావస్తుశాఖ కమిషనర్ వాణీమోహన్ అన్నారు. బుధవారం రుద్రమకోటలోని పురాతన సమాధుల తవ్వకాలను థాయిలాండ్, దక్షిణకొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్కు చెందిన అంతర్జాతీయ ఆర్కియాలజిస్టులతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మూడునెలలుగా ఇక్కడ పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన వస్తువులు, ఆదిమానవుల అవశేషాలు, వారు వాడిన వస్తువులు తదితర సామగ్రిని పోలవరం, రాజమండ్రిల్లో మ్యూజియాలు ఏర్పాటుచేసి ప్రదర్శనకు ఉంచుతామన్నారు. అవశేషాలను హైదరాబాద్కు తరలించి వాటి డీఎన్ఏలపై పరిశోధనలు చేసి అప్పటి మానవుల ఆహారపు అలవాట్లు, జీవన విధానం తదితర విషయాలు తెలుసుకుంటామన్నారు. కొన్ని అవశేషాలను పూనేలోని ఆర్కియాలజీ కేంద్రానికి తరలించామన్నారు. ఇక్కడి సమాధులు క్రీస్తు పూర్వం వెయ్యి ఏళ్ల ముందువని, అప్పటి మహిళలు వాడిన పూసలను కార్మేలియన్ రాయి నుంచి తయారుచేశారని చెప్పారు. కార్మేలియన్ రాయి గుజరాత్లో మాత్ర మే లభిస్తుందని, దీని ద్వారా రుద్రమకోట నుంచి గుజ రాత్కు వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. విదేశీ ఆర్కియాలజిస్టులు మాట్లాడుతూ తవ్వకాల్లో దొరికిన ఎముకలను బట్టి చూస్తే అప్పటివారు దృఢమైన శరీరాకృతిని కలిగి ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. పొక్లయిన్ సా యంతో తప్ప మోయలేని బండరాళ్లను సమాధుల మీద ఏర్పాటుచేసిన విధానం చూస్తే వారు ఎంత బలవంతులో అర్థం చేసుకోవచ్చన్నారు. రుద్రమకోట అద్భుతమైన చరి త్రగల గ్రామామన్నారు. ఆర్కియాలిజీ పరిశోధన కళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, పురావస్తుశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
5 వేల ఏళ్లనాటి ప్రాచీన ఆవాసాలు
వెంకటగిరి: భారతదేశంలోనే అరుదైన ఇసుక దిబ్బల్లో బృహత్ శిలాయుగపు నాటి నివాసం, సమాధులు ఉన్న ప్రాంతాన్ని చిల్లకూరు మండలం లింగవరం వద్ద వెంకటగిరికి చెందిన చరిత్ర పరిశోధకుడు షేక్ రసూల్ అహ్మద్ కనుగొన్నారు. భారతీయ పురాతత్వశాఖ దక్షిణ విభాగం అసిస్టెంట్ ఎపిగ్రఫిస్ట్ ఏసుబాబులో కలిసి మళ్లీ సందర్శించి అవశేషాలను పరిశీలించి నిర్ధారించారు. సోమవారం చరిత్రకారుడు షేక్ రసూల్ అహ్మద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బృహత్ శిలాయుగం నాటి అవశేషాలు భారతదేశం అంతటా లభించినప్పటికీ, లింగవరంలో లభించిన అవశేషాలు ఇసుక దిబ్బల్లో మూడు అడుగుల నుంచి 15 అడుగుల లోతుల్లో మూడు స్థలాల్లో లభించడం గమనార్హమని తెలిపారు. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఇసుక దిబ్బల్లో లభిస్తున్న అవశేషాలు అన్నీ ప్రీహిస్టారిక్ (ఆదిమ మానవుల) కాలం నాటివిగా గుర్తించారు. అయితే బృహత్ శిలాయుగం నాటి అవశేషాలు లభించడం భారతదేశంలో మొట్టమొదటి స్థావరం లింగవరం అన్నారు. ఈ ప్రాంతంలో లభించిన కుండలు, సమాధులు తమిళనాడు రాష్ట్రంలోని ఆదిచెన్నలూరులో లభించిన కుండ సమాధులను పోలి ఉన్నప్పటికీ కొంతమేర ప్రాతీయ వైవిధ్యం కలిగి ఉన్నాయని రసూల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. -
మూటకట్టి.. మూలనేసి..
సాక్షి, హైదరాబాద్: తవ్వకాల్లో వేల ఏళ్ల నాటి వస్తువులు, పనిముట్లు బయటపడ్డాయి.. అధికారుల్లో ఆసక్తి పెరిగి ఇంకాస్త శోధించారు.. ఈసారి చెక్కలకు అద్దాలు బిగించి రూపొందించిన షోకేసులు బయటపడ్డాయి.. మరికాస్త వెతగ్గా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కుర్చీలు, బల్లలు కనిపించాయి.. చారిత్రక అన్వేషణల్లో వస్తువులు బయటపడే కొద్దీ సంబరపడే అధికారులు ఇక్కడ మాత్రం వస్తువులు బయటపడే కొద్దీ అవాక్కయ్యారు.. ఎందుకనుకుంటున్నారా..? ఇవన్నీ ఎక్కడో చారిత్రక ప్రదేశంలో దొరికినవనుకుంటే పొరపాటే.. పురావస్తు శాఖ సంచాలకుల కార్యాలయం ‘షెడ్డు’లో బయటపడ్డాయి. విలువైన వస్తువులను గతంలో పనిచేసిన అధికారులు తమ నిర్లక్ష్యానికి బలిచేసిన తీరుతో కొత్త అధికారులు విస్తుపోయారు. వేల ఏళ్లనాటి వస్తువులను మూటకట్టి పడేయడంతో అనేక వస్తువులు ధ్వంసమయ్యాయి. చారిత్రక సాక్ష్యాలు చెదిరిపోయాయి. అన్నీ తెలిసీ గాలికొదిలారు.. తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో ముఖ్యమైన చోట్ల సైట్ మ్యూజియంలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఉదా.. ధూళికట్టలో బౌద్ధ స్థూపం లభించింది. అక్కడి తవ్వకాల్లో వెలుగుచూసిన వస్తువులతో సైట్ మ్యూజియం ఏర్పాటు చేస్తే, అక్కడికి వచ్చే సందర్శకులకు ఆ చరిత్ర కళ్లకు కడుతుంది. ఇలాంటి సైట్ మ్యూజియంలు ఏర్పాటు చేయాలంటే ఆయా తవ్వకాల్లో వెలుగుచూసిన వస్తువులు భద్రపరచాలి. కానీ వాటిల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. తవ్వకాలు వెలుగుచూసిన నాటి వస్తువులు చిన్న పెంకు కూడా పురావస్తు శాఖ దృష్టిలో విలువైనదే. భవిష్యత్ అధ్యయనాలకు అవి ఆధారమవుతాయి. అవి ధ్వంసమయితే అధ్యయనాలు జరగవు. ఈ విషయం తెలిసీ అధికారులు నిర్లక్ష్యంగా వాటిని గాలికొదిలేశారు. పాతవి లేవనుకొని.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించే సమయంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. వేల ఏళ్ల నాటి దేవాలయాలూ మునిగిపోయాయి. ఆ సమయంలో అధికారులు కొన్ని విప్పి మరోచోట పునర్ నిర్మించారు. మరో 100 వరకు దేవాలయాల నమూనాలు గ్రానైట్ రాళ్లతో రూపొందించి మ్యూజియంలో భద్రపరిచారు. ఆ తరహాలో భవిష్యత్లో దేవాలయాలు నిర్మించాలనేది నాటి ఆలోచన. దేవాదాయ శాఖ రూ.లక్షలు వెచ్చించి ఆ నమూనాలకు చెక్కలు, అద్దాలతో షోకేసులు రూపొందించింది. కొంతకాలం తర్వాత ఆ నమూనాలను హైదరాబాద్ హెరిటేజ్ మ్యూజియంకు తరలించారు. అప్పుడు ఆ షోకేసులను షెడ్డులో ఉంచారు. కానీ ఇప్పటి అధికారులకు పాత షోకేసుల విషయం తెలియక భారీ వ్యయంతో కొత్త షోకేసులు ఆర్డరిచ్చారు. కొద్దిరోజుల క్రితం హెరిటేజ్ తెలంగాణ సంచాలకులు విశాలాచ్చి ఆ షెడ్డులో ఏమున్నాయో చూడాలంటూ సిబ్బందిని పురమాయించడంతో ఏళ్ల తర్వాత తాళాలు తీసి ఒక్కో వస్తువును పరిశీలించి కంగుతిన్నారు. షోకేసులు సహా వెలకట్టలేని పురాతన సంపద చాలా వరకు ధ్వంసమైనట్లు గుర్తించారు. పదిలంగా ఉన్న వాటిని వేరుచేసి అదే షెడ్డులో జాగ్రత్తగా భద్రపరిచే చర్యలు చేపట్టారు. ధ్వంసమైనవాటిని తరలించారు. -
వాణిజ్యానికి పేరు.. పెద్దబొంకూరు!
సాక్షి, హైదరాబాద్: మట్టిని ముట్టుకుంటే నాణేలు తగులుతున్నాయి. ఇప్పటివరకు 30 వేలకు పైచిలుకు లభించాయి. ఏంటా అని తవ్వి చూస్తే 20 మీటర్ల పొడవున్న ఓ భారీ భవంతి ఆనవాళ్లు తేలాయి.. మరికాస్త శోధిస్తే కొన్ని గదుల రూపురేఖలూ కనిపించాయి. ఆ పక్కన మంచినీటి బావులు.. వాటికి నాణ్యమైన ఇటుకల అమరిక.. అక్కడి నుంచి నీటిని తరలించే కాలువలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. వెరసి అదో పట్టణమే. నాణేలు, నిర్మాణాల సరళిని పరిశీలిస్తే అది క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య కాలానివని తేలింది. తొలి శాతవాహన కాలానికి చెందినదని ప్రాథమికంగా రూఢీ అయింది. శాతవాహనుల జాడలు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రాంతం పెద్దబొంకూరు. శాతవాహన చరిత్రకు కీలక ఆధారాలు చెప్పే నేల. శాతవాహన కాలంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. అందుకే అక్కడ రోమ్ వంటి విదేశీ ప్రాంతాల నాణేలు లభించాయి. రోమన్ ప్రాంతాలతో శాతవాహనులు పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ వాణిజ్యానికి ప్రధాన కేంద్రమే ఇదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహన సామ్రాజ్యంలో మింట్ (నాణేల తయారీ కర్మాగారం)లు ఉండేవి. పూర్వపు మెదక్ జిల్లా కొండాపూర్ ప్రధాన మింట్ కాగా, అనుబంధంగా మరికొన్ని ఉండేవి. అందులో ఇది కూడా ఓ మింట్ అయి ఉండొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. 1950– 1965 మధ్య కాలంలో ఇక్కడ తొలిసారి తవ్వకాలు జరిపారు. అప్పుడు ప్రాథమికంగా కొన్నిచోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి గొప్ప చారిత్రక ఆనవాళ్లను గుర్తించింది. కానీ అది ముందుకు సాగలేదు. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ ప్రాంతం చారిత్రక నేపథ్యమేంటో తేల్చబోతున్నారు. అప్పట్లోనే భూగర్భ డ్రైనేజీ 2 వేల ఏళ్ల క్రితమే అక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు తేలింది. ఆవాసాల ముందు నుంచి భూగర్భం గుండా మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటై ఉంది. ప్రాకృత భాష, బ్రాహ్మి లిపి వాడుకలో ఉన్నట్టు తేలింది. ఇనుము, వెండి, రాగి లోహాలను వస్తువుల తయారీకి వినియోగించారు. విరివిగా సీసం వస్తువులు వాడారు. రోమ్ వంటి ప్రాంతాల నుంచి సీసం దిగుమతి చేసుకున్నారు. భారీ మట్టి పాత్రల్లో ముడి సీసం చుట్టలు లభించాయి. శాతవాహన చరిత్రకు ఇదో మలుపు ‘తెలంగాణ చరిత్రలో శాతవాహన పాలన కీలకం. అంతకు పూర్వం వివరాలు అస్పష్టం. వాటికి సమాధానం చెప్పేవి పెద్దబొంకూరు వంటి ప్రాంతాలే. గతంలో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. తర్వాత కొత్త ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి భూమి పొరల్లో దాగున్న చరిత్రను వెలుగులోకి తెస్తాం’ –విశాలాచ్చి, హెరిటేజ్ తెలంగాణ సంచాలకులు వెలుగు చూసిన కొన్ని నాణేలు -
డీడీ ఎక్కడండి.. ఎక్కడో పోయిందండి!
సాక్షి, హైదరాబాద్: పురావస్తు శాఖలో పెద్ద సంఖ్యలో డిమాండ్ డ్రాఫ్టులు గల్లంతయ్యాయి. అవి ఏ పని కోసం సంబంధించినవో వివరించే కొన్ని ఫైళ్లు కూడా మాయమయ్యాయి. అందులో కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కాంట్రాక్టర్లు వారి డీడీల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం 12వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం నుంచి పురావస్తు శాఖకు భారీ మొత్తాన్ని కేటాయించింది. ఆ శాఖ పరిధిలోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీటిని ఖర్చు చేయాలి. దాదాపు రూ.70 కోట్ల వరకు ఈ రూపంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టారు. పనుల టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) దాఖలు చేయాల్సి ఉంటుంది. దీన్ని డీడీ, చెక్కులు, బ్యాంకు గ్యారంటీ రూపంలో చెల్లిస్తారు. ఆ పని విలువలో రెండున్నరశాతం వరకు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు మాత్రం నిర్ధారిత కాలం తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఇలా 12, 13వ ఆర్థిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన టెండర్లతో పాటు కాంట్రాక్టర్లు ఈఎండీని డీడీల రూపంలో చెల్లించారు. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు జరిగింది. బ్యాంకులో వేయక ఏం చేసినట్లు.. సాధారణంగా ఈఎండీ తాలూకు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీని కూడా ఆయా శాఖలు ఖర్చు చేసుకుంటాయి. అవసరం వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు నిర్ధారిత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. కానీ పురావస్తు శాఖలో మాత్రం ఆ ఈఎండీ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది. ఆ డీడీలను అలాగే ఫైళ్లలో ఉంచేశారని, ఇప్పుడు ఆ ఫైళ్లతో పాటు అవి కనిపించటం లేదని తెలుస్తోంది. పనులు పూర్తి కావటంతో కాంట్రాక్టర్లు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది. అప్పుడు కాని గల్లంతైన సంగతిని గుర్తించలేదు. ఈ డీడీల విలువ ఎంతో కూడా తెలియకుండా అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. ఈ మొత్తం తిరిగి చెల్లించాలని తెలంగాణ, ఆంధ్ర పురావస్తు కార్యాలయాల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి పెరుగుతుండటంతో ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ‘ఈ ఫైళ్లను మాకు ఇవ్వలేదు, అవి తెలంగాణ కార్యాలయంలోనే ఉన్నాయి. ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదు’అని ఏపీకి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
ఏడో శతాబ్దం నాటిది
సాక్షి, హైదరాబాద్: ఓ గొప్ప చారిత్రక వారసత్వ కేంద్రమది.. ఆదిమానవుల కాలం నుంచి మహారాజ్యాల పాలనకు సంబంధించిన ఎన్నో ఆధారాలు అక్కడ కొలువయ్యాయి. కానీ విచక్షణ లేకుండా సాగిన తవ్వకాలతో మొత్తం నాశనమయ్యాయి. జనగామ సమీపంలో తాజాగా వెలుగు చూసిన పురాతన నిర్మాణ అవశేషాలను ప్రాథమికంగా పరిశీలించిన పురావస్తు శాఖ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పెంబర్తి శివారు ఎల్లంలలో వెలుగుచూసిన పురాతన ఇటుక గోడను పురావస్తు శాఖ అధికారి భానుమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు. ఆ నిర్మాణం ఏ కాలానికి చెందిందో తేల్చనప్పటికీ.. అది దాదాపు ఏడో శతాబ్దానికి చెందిన కట్టడంలాగా ఉందని అధికారులు గుర్తించారు. ఇటుకల తీరు, నిర్మాణ పద్ధతి ఆధారంగా చాళుక్యుల కాలం నాటిది కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటుక గోడపైన రెండు మీటర్లకుపైగా ఎత్తుతో భారీగా ఇసుక మేట వేసి ఉందని, దాన్ని తొలగిస్తే గాని సరైన అంచనా రాదని వారు పేర్కొంటున్నారు. చుట్టూ తవ్వకాలు జరిపితేనే ఆ నిర్మాణం పూర్తిగా వెలుగు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. బుధవారం మరింత మేర తవ్వగా తొమ్మిది ఇటుక నిర్మాణ వరసలు వెలుగు చూశాయి. ఈ వివరాలతో రెండు రోజుల్లో పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చికి నివేదిక ఇస్తానని భానుమూర్తి తెలిపారు. గోడ అవశేషమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో మరెన్నో ఆధారాలు కనిపించాయి. ఆదిమానవుల ఆవాసం, వివిధ అవసరాల కోసం రూపొందించిన రాతి గుంతలు, వినియోగించిన వస్తువులు, సమాధులు కనిపించాయి. వాటిలో చాలావరకు దెబ్బతిన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలకు వెంటనే అనుమతించి పనులు చేపడితే నాటి నిర్మాణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
చెన్నంపల్లి కోటలోకి పురావస్తు శాఖ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు/తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంచెన్నంపల్లి కోటలో తవ్వకాలపై ఎట్టకేలకు పురావస్తుశాఖ రంగంలోకి దిగనుంది. తవ్వకాలను ఆ శాఖకు అప్పగించనున్నట్టు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ప్రకటించారు. ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో ఏనుగు దంతాలు, ఎర్రటి ఇటుకలు, సొరంగమార్గం బయటపడిందన్నారు. చారిత్రక ఆనవాళ్లు లభిస్తున్న నేపథ్యంలోనే పురావస్తు శాఖకు తవ్వకాలను అప్పగించనున్నట్టు స్పష్టం చేశారు. వాస్తవానికి రాత్రి సమయాల్లో అధికారులు తవ్వకాలకు సిద్ధం కావడం, గ్రామస్తులు తిరుగుబాటు చేయడం.. అనంతరం తూతూమంత్రంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టడంపై విమర్శలు మొదలయ్యాయి. కనీసం పురావస్తు శాఖ అధికారులకు తెలియకుండా ఒక ప్రైవేటు ఏజెన్సీ దరఖాస్తు నేపథ్యంలోనే తవ్వకాలు చేపట్టడం ఇలా అన్ని విషయాలపై ‘సాక్షి’వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. గ్రామ కంఠం భూమిపై కన్ను! తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలోని భూమి గ్రామ కంఠానికి చెందినది. రెవెన్యూ రికార్డుల్లో తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామంలోని 607 సర్వే నంబరుకు చెందిన 102.54 ఎకరాల భూమిలోనే ఇదీ ఉంది. ఈ ప్రకారం ఆ భూమిపై పూర్తి అధికారం పంచాయతీకే ఉంటుంది. అలాంటిది పంచాయతీకే తెలియకుండా తవ్వకాలు చేపట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మొదట్లో గుప్త నిధులని పేర్కొన్న అధికారులు చివరకు ఖనిజాల కోసమంటూ మాటమార్చారు. ఇక్కడ విలువైన ఖనిజాలు ఉన్నాయని ఏ సర్వే చెప్పిందనే విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. ఈ సర్వే నంబర్లో తమకు లీజు ఇవ్వాలంటూ భూగర్భ గనుల శాఖకు అక్టోబర్లో కొందరు దరఖాస్తు చేసుకున్న విషయం కూడా ఈ సందర్భంగా వెలుగు చూసింది. గ్రామ కంఠానికి చెందిన స్థలంలో తవ్వకాలు చేపట్టేటప్పుడు కనీసం పంచాయతీకి సమాచారం ఇవ్వకపోవడంపై స్థానికులు నిలదీస్తున్నారు. ఇలా అన్ని రకాల ఒత్తిడి పెరగడంతో ఇప్పుడు పురావస్తు శాఖను రంగంలోకి దింపుతున్నారు. ప్రమాదకరరీతిలో తవ్వకాలు చెన్నంపల్లి కోటలో అధికారులు చేపట్టిన తవ్వకాలు ప్రమాదకరరీతిలో సాగుతున్నాయి. బండరాళ్ల కింద ఉన్న రాళ్లు, మట్టిని తొలగించగా ఏర్పడిన సొరంగంలో కూలీలు పనిచేస్తున్నారు. తవ్వకాల వద్ద బండ రాళ్లు ఉండడంతో వాటి కింద పనులు చేస్తున్న కూలీలు ఎప్పుడు.. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పక్కనే ఓ బండరాయి జారిపడేటట్లు ఉండటంతో దానికి తాడు కట్టారు. అధికారులు అక్కడ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
చెన్నంపల్లి కోటలో ‘సర్కార్’ దొంగలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గుప్త నిధుల కోసం ఓ చారిత్రక కట్టడంలో అక్రమ తవ్వకాలు జరుగుతుండడం సంచ లనంగా మారింది. పురాతన కట్టడాల వద్ద తవ్వకాలు జరిపేటపుడు పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వాలన్న సంగతినీ పక్కన పెట్టేశారు. నిధులున్నాయి.. తవ్వుకుంటాం అని ఓ ప్రైవేటు ఏజెన్సీ అడగ్గానే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అనుమతించే సిందట. లిఖితపూర్వకమైన ఆదేశాలేవీ లేవు. కేవలం మౌఖిక ఆదేశాలే. దీనిపై ఆర్డీవో ఒకమాట చెబుతుండగా కలెక్టర్ మరోమాట చెబుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనక అధికారపార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందని వినిపిస్తోంది. గ్రామస్తులు గొడవచేయడంతో తూతూమంత్రంగా గ్రామ సభ నిర్వహించి మమ అనిపించారు. అయితే తవ్వకాలు మాత్రం ఆపలేదు. గ్రామస్తుల హడావుడి ఉంటే తాత్కాలికంగా విరామమిస్తూ మరలా కొనసాగిస్తున్నారు.. రాత్రిపూట కూడా తవ్వ కాలు సాగిస్తున్నారు. అధికారుల అండదండలతో.. పోలీసుల పహారా మధ్య తవ్వకాలు అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఇంతకీ ఈ కోట ఎక్కడుందా అనుకుంటు న్నారా.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లోని చెన్నంపల్లి కోట ఇది. ఈ నెల 13 నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. గతంలోనూ విఫలయత్నాలు.. చెన్నంపల్లి కోటలో భారీగా నిధి నిక్షేపాలున్నాయన్న ప్రచారం ఇప్పటిది కాదు. గతంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. పదేళ్లుగా కొందరు స్థానికుల సాయంతో తవ్వ కాలకు ప్రయత్నిస్తూనే వచ్చారు. 2006లో ఓసారి రాత్రిపూట తవ్వకాలు జరుపుతుం డగా.. గ్రామస్తులు అప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీకి తెలియజేశారు. దాంతో నిధి ఉందని ప్రచారం జరుగుతున్న ప్రాంతం వద్ద తవ్వ కాలు జరిపేందుకు వీలులేకుండా స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల చేత పెద్ద బండరాయి వేయించారు. ఆ తరువాత కూడా పలుమార్లు రాత్రి సమయాల్లో తవ్వకాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. 2014,15లోనూ ఇదేవిధంగా తవ్వకాలు జరిపారు. ఎవరి ప్రయత్నాలూ ఫలించలేదు. ప్రైవేటు ఏజెన్సీకి సీఎంఓ అనుమతి ప్రస్తుతం తవ్వకాలు చేపడతామని సీఎంఓకు ఒక ప్రైవేటు ఏజెన్సీ దరఖాస్తు చేసుకోగా అనుమతిస్తూ జిల్లా యంత్రాంగానికి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చేశాయి.. అయితే మౌఖిక ఆదేశాలతోనే అధికారులు తవ్వకాలు ప్రారం భించారు. ఈ విషయాన్ని స్వయంగా కలెక్టరే ఒప్పుకోవడం గమనార్హం. మరోవైపు తవ్వ కాలు చేపట్టే ముందు అధికారులు కనీసం గ్రామసభ కూడా నిర్వహించలేదు. మొదటి రోజు (ఈ నెల 13) ఏకపక్షంగా తవ్వకాలకు పూనుకున్నారు. దీనిపై గ్రామస్తులు అభ్యంత రాలు తెలిపి తవ్వకాలను అడ్డుకోవడంతో రెండోరోజు గ్రామసభ పెట్టారు. ఇందులోనూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయ త్నం చేయలేదు. అనుమతులు చూపాలంటూ అధికారులను గ్రామస్తులు, వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులు నిలదీసినా ఖాతరు చేయ కుండా.. ‘కమిటీ పర్యవేక్షణ’ పేరిట పనులు కొనసాగించారు. ఇక కోట కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల పరిధిలో లేనప్పటికీ ఇటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేటప్పుడు రెవెన్యూ, మైనింగ్తో పాటు పురావస్తు శాఖ సిబ్బంది కూడా అక్కడ ఉండాలి. అయితే.. ఈ కోట విషయంలో మైనింగ్, రెవెన్యూ అధికారులే ఉంటున్నారు. పురావస్తు శాఖకు సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాం గం ఇవ్వకుండా తవ్వకాలు ప్రారంభించారు. ఇక తవ్వకాలు చేపట్టరాదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో కొద్దిమందిని కమిటీలో నియమించారు. మౌఖిక ఆదేశాల మేరకేనన్న కలెక్టర్ చెన్నంపల్లి కోటలో అధికారులు చేపడుతున్న తవ్వకాల వ్యవహారం మొదటినుంచి అను మానాలను రేకెత్తిస్తోంది. తవ్వకాలు చేపట్టే సమయంలో గ్రామస్తులు నిలదీసినప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెన్నంపల్లి కోటను సందర్శించి.. అధికారులను నిలదీయగా తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ చెప్పిన ఆర్డీఓ.. ఆ పత్రాలు చూపమంటే మాత్రం పట్టించు కోలేదు. ఇదే విషయమై కలెక్టర్ సత్యనారాయణను వైఎస్సార్ సీపీ బృందం సోమవారం కలసి ప్రశ్నించగా.. మౌఖిక ఆదేశాలతోనే తవ్వకాలు చేపడుతున్నామని వెల్లడించారు. అక్కడ పురావస్తు శాఖ సిబ్బంది లేరని అంగీకరించారు. తవ్వకాల విషయాన్ని పురా వస్తు శాఖ దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ బృందానికి హామీ ఇచ్చారు. ఈ విధంగా లిఖిత పూర్వక ఆదేశాలు ఉన్నాయని ఒకసారి, లేవని మరోసారి అధికారులు పేర్కొనడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో సదరు ప్రైవేటు సంస్థ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలకు రాత్రి సమ యాల్లో కూడా తవ్వకాలు చేపడుతుండటం బలం చేకూరుస్తోంది. ఆగని తవ్వకాలు: చెన్నంపల్లి కోటలో అధికారులు చేపట్టిన గుప్త నిధుల తవ్వకాలు ఆగేలా లేవు. సోమవారం తవ్వకాల్ని ఆపేసిన అధికారులు.. మంగళవా రం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారం భించారు. తవ్వకాలు జరుపుతున్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆరు రోజు లుగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య నియో జకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ అండ్ జియాలజీ ఏడీ నటరాజ్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. మొదట్లో ఎవరికీ చెప్ప కుండా, హడావుడిగా తవ్వకాలు జరిపారు. అనుమతులపై గ్రామ స్తులు నిల దీయడంతో మరుసటి రోజు (ఈ నెల 14న) కమిటీ వేయడంతో పాటు గతంలో తవ్వ కాలు జరిపిన వ్యక్తుల సహకారం తీసుకుంటున్నారు. తవ్వకాల్లో ఎముకలు, మెత్తటి నల్లమట్టి బయటపడ్డాయి. నీటిఊట కూడా వచ్చింది. మంగళవారం సాయంత్రం ఆర్డీఓ కోటపైకి వచ్చిన తర్వాత తవ్వకాలు తిరిగి ప్రారంభించారు. ఇదీ చెన్నంపల్లి కోట చరిత్ర.. గోల్కొండ సుల్తాన్, పోర్చు గీసు వారు ఏకమై దాడులు చేస్తున్న నేపథ్యంలో 1584–1614 మధ్య విజయనగర రాజులు గుత్తి కోటను వదిలి.. అక్కడున్న సంప ద, ఆయుధాలను ఓ రహస్య కోటకు తరలించినట్లు చరిత్ర చెబుతోంది. గుత్తి కోటకు సమీపం లో ఉన్న స్వర్ణగిరి (ఇప్పటి జొన్నగిరి) మీదుగా చెన్నంప ల్లి కోటకు చేరుకునే విధంగా సొరంగ మార్గాన్ని తవ్వించారు. చెన్నంప ల్లిలో వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పెద్ద కోటను ఏర్పాటుచేశారు. విజయనగర రాజులు ఆదోని, రాయచూరు, గుత్తి, బళ్లారి తదితర కోటల్లో వజ్ర వైఢూర్యాలు, అపార సంపదను భద్రపరిచారని, ఇలా భద్రపరచిన వాటిలో చెన్నంపల్లి కోట కూడా ఒకటని అంటున్నారు. ఈ కోటలో విజయనగర పాలనకు సంబంధించిన శిలా శాసనాలు, దేవతా విగ్రహాలు కనిపించడం అందుకు ఊతమిస్తోంది. -
ఫైలు అటకెక్కింది.. రామప్ప గోడ కూలింది
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత రామప్ప దేవాలయం విషయంలో కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధికారుల నిర్లక్ష్యంతో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఆలయ ప్రహరీ గోడ దాదాపు 40 మీటర్ల మేర కుప్పకూలింది. మరో 30 మీటర్ల మేర ఏ క్షణంలోనైనా కూలేలా తయారైంది. పత్రికల్లోని వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రశ్నించటంతో రూ.2 కోట్లతో పునర్ నిర్మించేందుకు ఏఎస్ఐ అధికారులు సిద్ధమయ్యారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ హోదా కోసం యునెస్కోకు ప్రతిపాదించిన నేపథ్యంలో మరింత స్పష్టంగా దరఖాస్తు సమర్పించేందుకు యునెస్కో కన్సల్టెంట్, ప్రఖ్యాత నర్తకి, ఆర్కిటెక్ట్ చూడామణి నందగోపాల్ బృందం అధ్యయనం జరిపిన మూడు రోజులకే గోడ కూలడం గమనార్హం. జూన్లోనే ఏఎస్ఐ రాష్ట్ర సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలన్ చౌలే స్థానిక అధికారులతో కలసి ఆలయాన్ని పరిశీలించారు. అప్పుడే ప్రహరీ కూలే స్థితిలో ఉందని, అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే సకాలంలో దాన్ని పరిశీలించక పెండింగులో పెట్టినట్లు సమాచారం. మళ్లీ పాత పద్ధతిలో మరమ్మతులు.. ఈ ఆలయం శాండ్బాక్స్ టెక్నాలజీతో కాకతీయుల కాలంలో నిర్మితమైంది. ప్రహరీ నిర్మాణంలోనూ అప్పట్లో ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. దాదాపు మీటరున్నర మేర పునాదిపై గోడను నిర్మించారు. గోడను వెలుపల, లోపల భాగంలో రెండు పొరల చొప్పున నిర్మించి మధ్యలో ఓ మీటర్ మేర ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఇసుక నింపి పైభాగంలో అడ్డురాళ్లతో అనుసంధానించారు. ఇప్పుడు అదే పద్ధతిలో దాన్ని పునర్ నిర్మించారు. ఇప్పుడు ఆ రెండు గోడ పొరల మధ్య ఇసుక బదులు ఇటుకలు వాడాలని వరంగల్ నిట్ సూచించటంతో ఆ ఇటుకల తయారీకి ఏఎస్ఐ ఆర్డరిచ్చింది. ఇసుక రాతిని వినియోగిస్తారు. మధ్యలో సిమెంటు బదులు డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి, గుడ్డుసొనల మిశ్రమాన్ని వినియోగించనున్నారు. ఈశాన్యం వైపు మరో 30 మీటర్ల గోడ ప్రమాదకరంగా మారటంతో దాన్ని కూల్చేసి తిరిగి నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని తాజాగా అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర కార్యాలయానికి పంపారు. -
రామప్ప ఆలయాన్ని పరిరక్షించండి
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి చారిత్రక రామప్ప ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చారిత్రక చిహ్నాల్లో రామప్ప ఆలయం ఒకటని, దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, అందుకు కేంద్ర పురావస్తు శాఖ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయ ప్రహరీ ఇటీవల వర్షాలకు కూలిపోవడం, ఆలయ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. త్రికల్లో వచ్చిన కథనాన్ని చదివిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు లేఖ ద్వారా ఈ విషయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. పిల్ కమిటీ దాన్ని పరిశీలించి సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని నిర్ణయించింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. వర్షాలకు దెబ్బతిన్న తూర్పు వైపు ప్రాకారానికి మరమ్మతులు చేస్తామని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ హామీ ఇచ్చారు. రామప్ప ఆలయ పరిరక్షణపై విట్ (వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ప్రొఫెసర్లు, సివిల్ ఇంజనీర్ల బృందం చేసిన సిఫార్సుల నివేదిక పురావస్తు శాఖకు అందిందని, దీనిపై తీసుకోబోయే చర్యల్ని వివరించే కౌంటర్ పిటిషన్ దాఖలుకు వ్యవధి కావాలని ఆయన కోరారు. దీంతో విచారణ డిసెంబర్ 12కి వాయిదా పడింది. -
గుట్ట..గుడిగా మారింది!
సాక్షి, హైదరాబాద్: గుట్ట మీద గుడి కట్టడం సాధారణమే.. కానీ గుట్టనే గుడిగా మలచడం విచిత్రం. అందులోనూ గుట్టలో భాగమైన రాతినే చెక్కి దేవతా విగ్రహాలను తీర్చిదిద్దడం.. దాని నుంచి వెలువడిన రాళ్లనే పేర్చి గుడిని నిర్మించడం మాత్రం అబ్బురమే. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయన్పాక గ్రామశివారులోని గుట్ట మీద ఉన్న సర్వతోభద్ర ఆలయం ప్రత్యేకత ఇది. దేశంలోనే ప్రత్యేక తరహాలో రూపుదిద్దుకున్న ఈ మందిరం కొత్తగా కనుగొన్నదేమీ కాదు. వందల ఏళ్లుగా స్థానికులకు సుపరిచితమే అయిన ఈ ఆలయం నిర్మాణంలోని ప్రత్యేకత తాజాగా నిపుణుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా.. సాధారణంగా ఆలయాల నిర్మాణంలో.. గర్భాలయాన్ని, దానికి ఆనుకుని మంటపాన్ని నిర్మిస్తారు. తర్వాత చుట్టూ గోడతో ఆలయ ఆవరణను ఏర్పాటు చేస్తారు. ఎక్కడో రూపొందించిన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారు. కానీ నయన్పాక సర్వతోభద్ర ఆలయం ఇందుకు విభిన్నంగా ఉంటుంది. గుట్టపై మధ్యభాగంలో ఆలయం ఉంటుంది. ఇది కేవలం గర్భాలయం మాత్రమే. దానికే నాలుగువైపులా ఐదున్నర అడుగుల ఎత్తులో ద్వారాలు ఉంటాయి. లోపల మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో విగ్రహం ఉంటుంది. ఇది ఒక విగ్రహం కాదు.. ఒకే రాతిపై నాలుగు వైపులా దేవతా విగ్రహాలను చెక్కారు. ఒక్కో ద్వారం నుంచి ఒక్కోవైపున్న దేవతా విగ్రహాలు కనిపిస్తుంటాయి. తూర్పు ద్వారం నుంచి ఉగ్ర నరసింహస్వామి, దక్షిణ ద్వారం నుంచి కాళీయమర్థనం భంగిమలో వేణుగోపాలస్వామి, పశ్చిమం వైపు బలరాముడు, ఉత్తర దిశలో సీతారామలక్ష్మణుల రూపాలు దర్శనమిస్తాయి. ఇలా ఉండడం వల్లే దీనిని సర్వతోభద్ర నమూనా ఆలయంగా పిలుచుకుంటారు. అమెరికా ప్రొఫెసర్ పరిశీలనతో.. సర్వతోభద్ర ఆలయంలోని విగ్రహాలను ఇప్పటివరకు మామూలుగా ప్రతిష్టించినవిగానే భావించారు. కానీ కొద్దిరోజుల క్రితం వరంగల్ పర్యటనకు వచ్చిన అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ బి వ్యాగనర్, పురావస్తు శాఖ రిటైర్డ్ అధికారి రంగాచార్యులుతో కలసి ఈ ఆలయాన్ని పరిశీలించి.. దాని ప్రత్యేకతలను గుర్తించారు. ఆ విగ్రహం ఎక్కడి నుంచో తెచ్చి ప్రతిష్టించినది కాదని... ఆలయం నిలిచి ఉన్న గుట్ట భాగాన్నే విగ్రహంగా మలిచారని తేల్చారు. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారన్న విషయంలో స్పష్టత లేదు. ఇది వైష్ణవ సంప్రదాయ సర్వతోభద్ర ఆలయం కావటంతో కాకతీయుల కాలం తర్వాత నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడి కోనేరు మట్టితో పూడుకుపోయి ఉంది. దానిని తవ్వి పరిశీలిస్తే ఆధారాలు దొరకవచ్చని అంటున్నారు. ఏమిటీ ప్రత్యేకత..? గుట్టపై మధ్యలో ఎత్తుగా ఉన్న భాగాన్ని ఎంపిక చేసి దాదాపు నాలుగున్నర అడుగుల ఎత్తుతో నాలుగు వైపులా నాలుగు విగ్రహాలుగా చెక్కారు. అంటే ఆ విగ్రహాల భాగం నేరుగా గుట్టరాయే. ఇక విగ్రహం చుట్టూ ఉన్న రాతిని సమంగా చెక్కి బల్లపరుపుగా మార్చారు. ఇలా చెక్కగా వచ్చిన రాళ్లతోనే ఆ విగ్రహం చుట్టూ.. దాదాపు 20 అడుగుల ఎత్తుతో గర్భాలయాన్ని నిర్మించారు. తర్వాత దానిపై మరో 30 అడుగుల ఎత్తుతో ఇటుకలతో గోపురం నిర్మించారు. ఆలయం ఉండేది అంతే.. మండపం అంటూ ఏమీ లేదు. ముందువైపు మాత్రం విశాలమైన కోనేరును నిర్మించారు. ఇలా గుట్టరాతిలోనే విగ్రహం చెక్కి ఉన్న దేవాలయం ఇప్పటివరకు రికార్డు కాలేదని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక విగ్రహంపై భాగంలో స్తూపాకారంలో మరో రాతి భాగాన్ని విడిగా ఏర్పాటు చేశారు. గతంలో దొంగలు గుప్తనిధుల తవ్వకాలంటూ ఆ భాగాన్ని పక్కకు పడేశారు. భూపాలపల్లి ప్రాంతంలోని జెన్కో కేంద్రం సిబ్బంది భారీ క్రేన్ తెచ్చి దాన్ని మళ్లీ విగ్రహం పైభాగంలో అమర్చారు. ఇదో గొప్ప నిర్మాణం నేను భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో మందిరాలపై పరిశోధన చేశా. ఈ తరహా సర్వతోభద్ర దేవాలయాన్ని ఎక్కడా చూడలేదు. ఇంజనీరింగ్ నైపుణ్యం పరంగా ఇదో గొప్ప కట్టడం. దీన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది.. – అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ బీ వ్యాగనర్ పురావస్తు శాఖ ఆసక్తి ఈ ఆలయాన్ని 1992లో నాటి పురావస్తు సహాయ సంచాలకుడు ఎన్.రామకృష్ణరావు తొలిసారి వెలుగులోకి తెచ్చారు. అప్పటివరకు ఇది స్థానికులకే పరిచయం. తర్వాత శాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగాచార్యులు ఆధ్వర్యంలో ఇంటాక్ సంస్థ దీన్ని సర్వే చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కానీ ఇప్పటివరకు పురావస్తుశాఖ దీన్ని రక్షిత కట్టడంగా గుర్తించలేదు. దీంతో క్రమంగా ఆలయం ధ్వంసమవుతోంది. చెట్లు పెరిగి గోపురం దెబ్బతింటోంది. అయితే తాజాగా అమెరికన్ ప్రొఫెసర్ ఈ ఆలయ ప్రత్యేకతను గుర్తించిన నేపథ్యంలో... దీనిపై కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఆసక్తి ప్రదర్శిస్తోంది. -
రామప్ప ఆలయ దుస్థితిపై స్పందన
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పాలంపేట గ్రామ పరిధిలో ఉన్న కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయ దుస్థితిపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను హైకోర్టు తనంతట తానుగా(సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. దీనిలో కేంద్ర పురావస్తు శాఖ కార్యదర్శి, పురావస్తు, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, రాష్ట్ర పురావస్తు శాఖ కార్యదర్శి, డైరెక్టర్, జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఇటీవల కురిసిన వర్షాలకు రామప్ప దేవాలయ ప్రహరి కూలిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతో ఆలయం శిథిలమైపోతోంది. దీనిపై ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని చూసిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు రామప్ప దేవాలయ దుస్థితిని లేఖ రూపంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిని ఆయన పిల్ కమిటీకి నివేదించగా, కమిటీలో సభ్యులందరూ కూడా ఈ కథనాన్ని పిల్గా పరిగణించాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో పత్రికా కథనాలను పిల్గా తీసుకోవాలని రిజిస్ట్రీని ఏసీజే ఆదేశించగా, వీటిని పిల్గా మలిచారు. -
మెట్ల దారులు.. మహా‘బావులు’
విశాలమైన ప్రాంగణం.. చుట్టూ శిల్ప సౌందర్యంతో కొలువు దీరిన నాలుగు మంటపాలు.. ఒక్కో మంటపం పక్కనుంచి దిగువకు రెండేసి మెట్ల దారులు.. మధ్యలో మళ్లీ మంటపం.. దాని పక్కన నాలుగు చొప్పున గదులు.. ఒకవైపు లోనికి చొచ్చుకొచ్చిన భారీ అరుగు.. దానిపై నుంచుని చూస్తే నిర్మాణం మొత్తం కనిపించే ఏర్పాటు.. తిరగేసిన పిరమిడ్ ఆకృతిలో దిగువకు మెట్ల నిర్మాణం..! ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ సమీపంలోని కిచ్చనపల్లిలోని మెట్లబావి ఇది!! అసలు దీన్ని ఎవరు నిర్మించారు.. ఎందుకు నిర్మించారన్న విషయం అధికారికంగా ఇప్పటి వరకు వెలుగుచూడలేదు.. పురావస్తుశాఖ రక్షిత కట్టడాల జాబితాలో కూడా అది లేదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఇలాంటి బావులెన్నో. దేవాలయాలకు అనుబంధంగా కోనేరు, పుష్కరిణులుగా కొన్ని ఉండగా మరికొన్ని విడిగా ఉన్నాయి. అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు అధికారికంగా లెక్క లేదు. ఆలనాపాలనా లేకపోవటంతో వాటిలో కొన్ని రూపుకోల్పోగా, మరికొన్ని కనుమరుగయ్యాయి. ఇప్పటికీ దాదాపు వంద వరకు భద్రంగానే ఉన్నట్టు అంచనా. వాటికి మరమ్మతు చేస్తే మరికొన్ని వందల ఏళ్ల వరకు ఠీవిగా నిలిచి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాణీ కీ వావ్.. ఎనిమిది అంతస్తులు, చూడచక్కని శిల్పాలతో తీర్చిదిద్దిన అద్భుత నిర్మాణం.. ఓ ప్యాలెస్ నిర్మాణంలో ఉండే పనితనం దాని సొంతం.. ఇంతా చేస్తే అదో దిగుడు మెట్ల బావి! కానీ ప్రపంచఖ్యాతి దాని సొంతం. గుజరాత్లో కొలువుదీరిన ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు క్యూ కడతారు. పురాతన మెట్ల బావులనగానే మనకు టక్కున గుర్తొచ్చే ప్రాంతాలు గుజరాత్, రాజస్తాన్. మరి అలాంటి అద్భుత బావులు ఆ రాష్ట్రాలకే పరిమితమా?కానే కాదు.. అందమైన, అంతకుమించి అద్భుతమైన మెట్ల బావులు మనకూ సొంతమే. ఒకటి కాదు రెండు కాదు.. వందకు పైగా చారిత్రక మెట్ల బావులు తెలంగాణలో అలరారుతున్నాయన్న సంగతి మీకు తెలుసా? వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ అరుదైన, అబ్బురపరిచే బావుల గురించి చాలామందికి తెలియదు. వీటిపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘పురాతన మెట్ల బావుల విషయంలో తీసుకుంటున్న చర్యలేంటి’అన్నది ఆ లేఖ సారాంశం. నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరాన్ని ఉటంకిస్తూ పీఎంవో రాష్ట్రానికి లేఖ రాయడంతో ప్రభుత్వం తొలిసారి ఈ చారిత్రక మెట్లబావులపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బావులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చబోతోంది. ఓ ఆర్కిటెక్ట్ చొరవతో.. రాష్ట్రంలో మెట్లబావుల లెక్కతీసి వాటి వివరాలను జనం ముందుంచేందుకు 15 మంది ఆర్కిటెక్టులు ఓ బృందంగా పనిచేస్తున్నారు. ‘ది హైదరాబాద్ డిజైన్ ఫోరం’అధ్యక్షుడు యశ్వంత్ రామమూర్తి ఆధ్వర్యంలో ఈ బృందం పనిచేస్తోంది. ఓ పనిపై యశ్వంత్ రామమూర్తి ఆందోల్ సమీపంలోని కిచ్చనపల్లికి వెళ్లగా అక్కడి మెట్ల బావి చూసి అబ్బురపడ్డారు. తర్వాత వరంగల్ శివారులో కూడా ఇలాంటి బావి చూసి ఆలోచనలో పడ్డారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి బావులు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు మరికొందరు ఔత్సాహిక ఆర్కిటెక్టులు జత కలిశారు. అలా 15 మంది బృందంగా ఏర్పడి మొదట్లో జేఎన్టీయూ విద్యార్థుల సాయంతో సర్వే మొదలుపెట్టారు. ఇప్పుడు వారే సొంతంగా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 70 బావులను స్వయంగా చూసి డాక్యుమెంటేషన్ చేశారు. మరో 30 బావులున్నట్టు గుర్తించి వాటి అన్వేషణలో ఉన్నారు. వీటిల్లో ప్రధానమైన 30 బావుల్ని ఎంపిక చేసి కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా అవి ఏ కాలానికి చెందినవో శాస్త్రీయ పద్ధతిలో రూఢీ చేయబోతున్నారు. ఈ మొత్తం వివరాలతో ఓ పుస్తకం రూపొందించి ప్రజల ముందుంచాలన్నది ఈ బృందం ప్రయత్నం. గుజరాత్, రాజస్తాన్లలోనే కాదు.. తెలంగాణలోనూ గొప్ప మెట్ల బావులున్నాయని తేల్చబోతున్నారు. పురావస్తు శాఖ కూడా వీరికి సహకరిస్తోంది. సామాన్యుడి లేఖతో.. నిధులు, సిబ్బంది లేక కునారిల్లుతున్న పురావస్తు శాఖ.. తాను గుర్తించిన రక్షిత కట్టడాలను కూడా పరిరక్షించే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటంతో ఆ శాఖ ఇప్పటికే చాలా విషయాల్లో చేతులెత్తేసింది. ఆర్కిటెక్ట్ల బృందం చేస్తున్న సర్వే గురించి తెలుసుకున్న ఎన్.సాయికుమార్ అనే సామాజిక కార్యకర్త ఇటీవల నేరుగా ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.‘తెలంగాణలో వంద వరకు పురాతన మెట్లబావులున్నట్టు తెలుస్తోంది. నిర్వహణ లేక కనుమరుగవుతున్నాయి. వాటిని సంరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి’అని అందులో కోరారు. దాన్ని పరిశీలించిన ప్రధాని కార్యాలయం.. ఆ బావుల సంరక్షణ, కార్యాచరణ వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం వెంటనే పురావస్తు శాఖను ఆదేశించటంతో ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికీ ఉపయోగమే.. ఈ బావులన్నీ ఊట ఆధారంగా నిర్మితమైనవే. వాటిని పునరుద్ధరిస్తే జల సంపదకు కేంద్రాలుగా మారతాయి. వరంగల్ శివారులోని పెద్ద మెట్లబావిని ఇటీవల బాగుచేసేందుకు నీటిని తోడటం పెద్ద సమస్యగా మారింది. తోడిన కొద్దీ ఊటతో నిండిపోయింది. ఊటలను పునరుద్ధరిస్తే ఇవి ఆ ప్రాంతంలోని వారికి తాగునీటిని సరఫరా చేయగలుగుతాయని నిపుణులంటున్నారు. ఒక్కోటి ఓ అద్భుతం గొప్ప ఇంజనీరింగ్ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఆ బావులు చూస్తే అబ్బురమనిపిస్తుంది. వందల ఏళ్ల క్రితం నిర్మించినా కొన్ని ఇప్పటికీ గొప్పగానే నిలిచి ఉన్నాయి. కొన్ని కబ్జా అయి రూపుకోల్పోయాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకు సహకారంగా ఉండేలా మేం డాక్యుమెంటేషన్ చేస్తున్నాం –రామమూర్తి ‘ది హైదరాబాద్ డిజైన్ ఫోరమ్’అధ్యక్షుడు -
చీమలతోనే చిక్కు..
సాక్షి, వరంగల్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. చీమల కారణంగా ఈ ఆలయం గోడలు రోజురోజుకూ కుంగిపోతున్నాయి. క్రమంగా రెండు మూడేళ్లకు ఒకటి వంతున ఆలయానికి సంబంధించిన గోడలు, గోపురాలు, ద్వారాలు కూలిపోతున్నాయి. ఈ ఆలయం పునాదుల్లో ఉపయోగించిన ఇసుకను చీమలు తోడేస్తుండటంతో నిర్మాణంలోని పటిష్టత తగ్గిపోతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడిగా పిలువబడే రామలింగేశ్వరాలయం ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఆలయం నిదర్శనం. ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. ప్రధానంగా మదనికలు, నాగిని శిల్పాలను చూసేందుకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారు. కాకతీయులు భారీ ఆలయాల నిర్మాణంలో సాధారణ పద్ధతికి భిన్నంగా శాండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. పునాదిలో బలమైన రాళ్లను కాకుండా ఇసుకను ఉపయోగించారు. ఇసుక పునాదిపై రాతి శిల్పాలను పేర్చుకుంటూ ఆలయాన్ని నిర్మించారు. దీంతో కొన్నేళ్లుగా ఈ ఆలయానికి చీమల బెడద పట్టుకుంది. నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. చీమలు నిత్యం పునాదుల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నాయి. దీంతో పునాది డొల్లగా మారుతోంది. ఫలితంగా ఈ పునాదిపై ఉన్న బరువైన శిలలు, శిల్పాల బరువుకు పునాది కుంగిపోతోంది. అధికారులేమో చీమలు పునాది నుంచి బయటకు తోడేస్తున్న ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే.. చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. నష్టం జరిగినా అదేతీరు.. పునాదుల్లో ఇసుక బయటకు రావడంతో బలహీనమైన పునాదిపై బరువైన రాళ్లు (శిల్పాలు) ఉండడంతో క్రమంగా కుంగిపోతున్నాయి. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువై ఆలయ గోడలు కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం ఆలయ ప్రాంగణంలో ఉన్న కామేశ్వరాలయం ఒకవైపునకు ఒరిగి పోయింది. దీంతో ఆలయానికి సంబంధించి శిల్పాలను తొలగిచారు. తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పినా... పదేళ్లలో ఎటువంటి పురోగతి లేదు. తొలగించిన శిల్పాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. అనంతరం 2013లో రామప్ప ఆలయం తూర్పు ముఖ ద్వారం కూలిపోయింది. తాజాగా ప్రహరీ గోడలు కూలిపోయాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. రామప్ప ఆలయ నిర్వహణపై పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై చరిత్రకారులు మండిపడుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్ట్ నాగరాజు రామప్ప ఆలయంపై భద్రత, నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై సమాచారం హక్కు చట్టం ద్వారా 2016 ఏప్రిల్లో వివరాలు కోరారు. 2016 మేలో పురావస్తుశాఖ అధికారులిచ్చిన సమాధానంలో ఆలయ భద్రత, మనుగడ కోసం ఎటువంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం లేదని స్పష్టమైంది. పదేళ్లు దాటినా కామేశ్వరాలయం పునరుద్ధరణకు ఒక్క పైసా నిధులు కేటాయించలేదు. అంతేకాదు, రామప్ప ప్రధాన ఆలయంతోపాటు ఆరు ఆలయాలను గుర్తించామని చెప్పినా వాటి పరిరక్షణ కోసం ఇప్పటివరకు పురావస్తుశాఖ నుంచి ఎలాంటి పనీ జరగలేదు. -
భారీ ఇటుకలు.. మట్టి పూసలు
మంచిర్యాల జిల్లా కర్ణమామిడిలో శాతవాహనులకు ముందునాటి ఆనవాళ్లు - పురావస్తు తవ్వకాల్లో బయటపడిన భారీ ఇటుకలు - టెర్రకోట మట్టి పూసలు, పాత్రలు, పెంకుల ముక్కలు కూడా.. - ఈ ప్రాంతాన్ని మూడు దశాబ్దాల కిందే గుర్తించినా ప్రభుత్వాల నిర్లక్ష్యం - దెబ్బతిన్న పురావస్తు సంపద.. - తాజా తవ్వకాల్లో వెలుగు చూస్తున్నది అవశేషాలే! సాక్షి, హైదరాబాద్, మంచిర్యాల రూరల్: పెద్ద పెద్ద ఇటుకలు.. ఒక్కోటి 60 సెంటీమీటర్ల పొడవు.. అంటే ఇప్పుడు మనం వాడే ఇటుకలకు మూడింతలు పెద్దవి.. ఎరుపురంగులో గట్టిగా ఉన్నాయి.. ఇంకేం స్థానికులు దొరికినవి దొరికినట్లుగా తీసుకెళ్లి ఇళ్ల నిర్మాణంలో వాడేసుకున్నారు. మరి ఆ ఇటుకలు ఎప్పటివో తెలుసా..? సుమారు 2,000 ఏళ్ల కిందటి నాటివి. శాతవాహనుల తొలి రాజధానికి చేరువలో ఉన్న ఓ పట్టణానికి సంబంధించిన నిర్మాణాలవి. ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం సాగుభూమిగా మారిపోయింది. ఇక్కడి చారిత్రక సంపద దెబ్బతిన్నది. తీరా ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు ప్రారంభించేసరికి గోడల దిగువభాగాలే మిగిలాయి. శనివారం పురావస్తు శాఖ తవ్వకాల్లో శాతవాహనుల నాటి ఇటు క గోడను, టెర్రకోట మట్టి పూసలు బయటపడ్డాయి. మూడున్నర దశాబ్దాల కిందే గుర్తించినా.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి శివారులో గోదావరి నది ఒడ్డున పాటిగడ్డ ప్రాంతం ఉంది. ప్రస్తుతం ఇది ఎల్లంపల్లి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో అతి పురాతన పట్టణం ఉండేదని దాదాపు మూడున్నర దశాబ్దాల కింద.. అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో గుర్తిం చారు. ఆ ఆనవాళ్లు శాతవాహనుల కంటే ముందునాటివని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రాంతంలో శాతవాహనుల కంటే ముందు రాజ్యం ఉండేదా, లేక శాతవాహనుల రాజధానికి అనుబంధంగా నిర్మి తమైన పట్టణమా అన్న దిశగా పరిశోధన చేశారు. అయితే ఆ తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. మన చరిత్రలో కొత్త అంశం మరుగున పడిపోయింది. బ్యాక్వాటర్లో మునిగిపోవడంతో.. ఇటీవలే పురావస్తు శాఖ డైరెక్టర్ విశాలాక్షి కర్ణమామిడి ప్రత్యేకతపై దృష్టి సారించి.. తవ్వకాల కోసం కేంద్రం నుంచి అనుమతి పొందారు. కానీ ఆ ప్రాంతం ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్వాటర్లో మునిగిపోయి ఉండటంతో తవ్వకాలు సాధ్యం కాలేదు. జూన్లో నీటి నిల్వ తగ్గి ఈ ప్రాంతం బయడపడటంతో తవ్వకాలు మొదలుపెట్టినా.. భారీ వర్షాలతో బురదమయం కావటంతో నిలిపివేశారు. కొద్దిరోజులుగా వర్షాలు నిలిచిపోవడంతో తిరిగి మూడు రోజుల కింద తవ్వకాలు చేపట్టారు. పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు నాగరాజు, ఆ శాఖ రిటైర్డ్ అధికారి భానుమూర్తిల ఆధ్వర్యంలో శనివారం జరిపిన అన్వేషణలో.. భారీ నిర్మాణానికి చెందిన పురాతన గోడ, పాత్రల అవశేషాలు, టెర్రకోట మట్టి పూసలు బయటపడ్డాయి. 60 సెంటీమీటర్ల పొడవు, 28 సెంటీమీటర్ల వెడల్పు, 8 సెంటీమీటర్ల మందం ఉన్న ఇటుకలతో ఈ గోడను నిర్మించినట్టు గుర్తించారు. ఆ ఇటుకలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. గోడ సమీపంలో ఇంటి పైకప్పు కోసం వాడే పెంకులు, టైల్స్ ముక్కలు కూడా దొరికాయి. అయితే ఈ గోడ కేవలం 3 వరుసల ఇటుకలతో 30 సెంటీమీటర్ల ఎత్తుతో మాత్రమే మిగిలింది. ఇవి గోడ దిగువ భాగం ఇటుకలని.. పైన ఉన్న ఇటుకలను రైతులు వ్యవసాయం చేస్తున్న సందర్భంలో పెకలించి తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఐదెకరాల్లో తవ్వకాలు ఈ ప్రాంతం దాదాపు 40 ఎకýరాలుండగా.. ప్రస్తుతం ఐదెకరాల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించి, పని ప్రారంభించారు. శనివారం పలు ఆధారాలు వెలుగుచూడటంతో.. ముందుముందు మరిన్ని విశేషాలు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తవ్వకాలు చేపట్టామని.. 15 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 20 రోజులపాటు తవ్వకాలు చేపడతామని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు వెల్లడించారు. మళ్లీ వర్షాలు కురిసేలోపు వీలైనంత మేర తవ్వకాలు జరపాలని భావిస్తున్నామని శాఖ అధికారి నాగరాజు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మళ్లీ నిండితే.. వచ్చే ఎండాకాలంలో తవ్వకాలు పూర్తి చేస్తామన్నారు. చాలా వరకు ధ్వంసమయ్యాయి ‘‘1980 ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని నాటి డైరెక్టర్ కృష్ణశాస్త్రితో కలసి పరిశీలించినప్పుడు గోడ ఆనవాళ్లు భద్రంగా ఉన్నాయి. అప్పుడే తవ్వకాలు జరిపి ఉంటే అప్పటి నిర్మాణాలు, విశేషాలు వెలుగుచూసి ఉండేవి. ఇప్పుడు గోడలు చాలావరకు ధ్వంసమయ్యాయి. మిగిలిన నిర్మాణ భాగాలను పరిరక్షించేందుకు చర్యలు చేపడతాం..’’ – పురావస్తు శాఖ రిటైర్డ్ ఉద్యోగి, తవ్వకాల బృందం సభ్యుడు భానుమూర్తి -
శాతవాహనుల నగరం వెలుగుచూసేనా?
సాక్షి,మంచిర్యాల: రెండువేల సంవత్సరాల నాటి శాతవాహ నుల వర్తక, వాణిజ్య నగరం కర్ణమామిడి చరిత్రను వెలికి తీసేందుకు పురా వస్తు శాఖ చేస్తున్న ప్రయత్నాలకు వాతావ రణం అనుకూలించడం లేదు. ఎల్లంపల్లి ప్రాజె క్టులో ముంపు నకు గురైన ఈ ప్రాంతం నీటి నిల్వలు తగ్గడంతో ఇటీవలే తేలింది. ఈ మేరకు 6వ తేదీన పురావస్తు శాఖ తవ్వకాలు ప్రారంభించగా.. అదే రోజు రాత్రి నుంచి కురు స్తున్న వర్షాలు తవ్వకాలకు అడ్డంకిగా మారాయి. వర్షం కురిసినప్పుడు ఇక్కడి నేల బంకగా మారుతుందని, తవ్వకాలు జరిపితే పురా తన నాణేలు, ఇతర వస్తువుల ఆనవాళ్లు దొరకవని అధికారు లు చెబుతున్నారు. 45 రోజులపాటు 15 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరపాలనేది ప్రణాళిక కాగా, వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం నుంచి తవ్వకాలు కొనసాగిస్తామని పురావస్తు శాఖ అధికారి రాములు నాయక్ తెలిపారు. -
మన చరిత్రలో కీలక ‘పాత్ర’!
♦ పూర్వీకుల గుట్టువిప్పే ఆధారాలు ♦ పాల్మాకుల, నర్మెట్ట తవ్వకాల్లో కీలక అవశేషాలు ♦ మూడు వేల ఏళ్లకు పైవేనంటున్న పురావస్తు శాఖ సాక్షి, హైదరాబాద్ వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతానికి మానవుల వలస, అందులో కొన్ని తెగలు తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయిన దాఖలాలపై అస్పష్టమైన సమా చారం గతంలోనే బయటపడింది. ఇప్పుడు దాన్ని నిరూపించే విలువైన పరిశోధన అవశేషాలను తెలంగాణ పురావస్తు శాఖ గుర్తించింది. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా నంగునూను ప్రాంతంలోని నర్మెట్ట, పాల్మాకుల గ్రామ శివార్లలో జరిపిన తవ్వకాల్లో లభించిన అవశేషాలను అత్యంత విలువైనవని పురావస్తు శాఖ గుర్తించింది. ఇక్కడ లభించిన ఆదిమానవుల సమాధు లను తవ్వి కచ్చితమైన సమాచారాన్ని అందించే అవశేషాలు, అత్యంత అరుదైన పనిముట్లు, వాడుక సామగ్రిని సేకరించింది. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు... తెలంగాణ పూర్వ చరిత్రలో కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. మధ్య ఆసియా నుంచి వలసలు..! గతంలో సిద్దిపేట సమీపంలోని పుల్లూరు శివారులో జరిపిన తవ్వకాల్లో లభించిన ఎముకల డీఎన్ఏలను సీసీఎంబీ విశ్లేషించి ఇటీవలే నివేదిక సమర్పించింది. ఆ డీఎన్ఏ మూలాలు ప్రస్తుత మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వ్యక్తుల డీఎన్ఏతో సరిపోలినట్టు తేల్చారు. అంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు దాని ఆధారంగా గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ డీఎన్ఏ జాడ మళ్లీ ఇక్కడ గుర్తించలేదు. అంటే.. వలస వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా జరిపిన తవ్వకాల్లో అలాంటి వాటిని నివృత్తి చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా తవ్వకాల్లో ఓ కుండలో మనిషికి సంబంధించి ఏమాత్రం చెక్కు చెదరని పుర్రె సహా ఇతర ప్రధాన ఎముకలు భద్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇన్ని అవశేషాలు ఎక్కడా దొరకలేదు. ఈ ఎముకల డీఎన్ఏలను తేల్చేందుకు త్వరలో సీసీఎంబీ రెండో విడత పరిశోధనలు ప్రారంభించనుంది. ఈ వస్తువులను గన్ఫౌండ్రిలోని పురావస్తు శాఖ సంచాలకుల కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీశైలం పెవిలియన్ మ్యూజియంలో వారం రోజుల పాటు ప్రజల సందర్శనకు ఉంచారు. గది.. అందులో మరో గది.. అవశేషాలు ఇక తవ్వకాల్లో వెలుగు చూసిన సమాధి నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంది. తిరగేసిన స్వస్తిక్ ఆకృతిలో... గది, అందులో మరో గది నిర్మించి దానిలో అవశేషాలు భద్రపరిచి ఉన్నాయి. గతంలో ఈ తరహా నిర్మాణం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తొలిసారి కనుగొన్నారు. ‘ఓ మనిషికి చెందిన పూర్తి ఎముకల నిర్మాణం ఓ కుండలో భద్రంగా ఉంది. ఇప్పటి వరకు అలాంటి అవశేషాలు లభించలేదు. భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఎముకలతో చేసిన ఆభరణాలు కూడా తొలిసారిగా దొరికాయి’అని పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చి పేర్కొన్నారు. -
టిప్పు తుపాకీ మాయం?
15 ఏళ్లకు పైగా కనిపించని ‘మైసూర్ పులి’ ఆయుధం ఈస్టిండియా కంపెనీ కూటమిలో భాగంగా టిప్పును ఓడించాక నిజాంకు దక్కిన తుపాకీ మ్యూజియానికి బహుమతిగా అందజేత స్టోర్లో ఉందంటున్నా బయటపెట్టని పురావస్తు శాఖ ఇప్పటి వరకు దృష్టి సారించని తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తాను వేటాడదలచుకున్న జంతువుపై పంజా విసిరేందుకు పులి కాచుక్కూర్చుంటుంది.. శత్రువును మట్టుబెట్టడంలో తన పంథా అదేనని చాటేందుకు ‘మైసూర్ పులి’ టిప్పు సుల్తాన్ తన తుపాకీపై పులి బొమ్మను చెక్కించాడు. 1799తో టిప్పు సుల్తాన్ జీవితం ముగిసిపోయింది. మరి ఆయన ముచ్చటపడి తయారు చేయించుకున్న ఆ తుపాకీ ఎక్కడుంది? టిప్పు సామ్రాజ్యం ‘మైసూరు’లోనో.. ఆ ప్రాంతమున్న కర్ణాటక రాజధాని బెంగళూరులోనో కాదు.. మన భాగ్యనగరం హైదరాబాద్లో ఆ తుపాకీ ఉంది. కాదు ఉండేది.. ఇప్పుడు ‘అదృశ్యమైంది’. అదృశ్యమవడం ఏమిటనేదానికి పురావస్తు శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది. ఎటు పోయింది?: టిప్పు సుల్తాన్ చేతిలో ఎంతో ఠీవిగా గర్జించిన ఆ తుపాకీ.. దాదాపు 15 ఏళ్ల కిందటి వరకు నాంపల్లిలోని ైవె ఎస్సార్ స్టేట్ మ్యూజియం సెంట్రల్ హాల్లో గంభీరంగా దర్శనమిచ్చింది. కానీ తర్వాత మాయమైపోయింది. అసలు సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించే పురాతన వస్తువుల జాబితాలో ఆ చారిత్రక తుపాకీ టాప్లో నిలిచింది. అయితే టిప్పు తుపాకీ స్టోర్లో ఉందని అధికారులు చెబుతున్నారు. మరి అంత ప్రాధాన్యమున్న పురాతన సంపదను ఎందుకు దాచి పెట్టారనే దానికి మాత్రం సమాధానం లేదు. నిజంగా స్టోర్లో ఉందా, లేదా అన్నదానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కూడా ఇక్కడి చారిత్రక ప్రాధాన్యమున్న సంపద లెక్కలను ప్రభుత్వం తేల్చలేకపోయింది. ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమీక్ష కూడా జరగలేదు. ఉన్నట్టుండి గల్లంతు... టిప్పు సుల్తాన్ దాదాపు 1790 ప్రాంతంలో ప్రత్యేక నిపుణులతో ఈ తుపాకీని రూపొందించుకున్నారని చరిత్ర చెబుతోంది. కర్ర, బంగారం, వెండి, ఉక్కుతో దానిని రూపొందించారు. ఆ తుపాకీ బట్ (కలపతో చేసిన వెనుకభాగం)పై వేటలో నిమగ్నమైన పులి బొమ్మ ఉంటుంది. దాని కళ్లు మెరిసేలా బంగారంతో రూపొందించారు. టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ఆ తుపాకీని ధరించేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈస్టిండియా కంపెనీ, మరాఠాలు, నిజాం సైన్యం కూటమితో జరిగిన యుద్ధంలో టిప్పు ఓటమిపాలైనప్పుడు.. ఆ తుపాకీతోపాటు కొంత యుద్ధ సామగ్రిని నిజాం సైన్యం స్వాధీనం చేసుకుందని, వాటిని హైదరాబాద్కు తరలించి మ్యూజియంలో భద్రపరిచారని అంటారు. అనంతర కాలంలో స్టేట్ మ్యూజియం ఏర్పాటు చేసినప్పుడు నిజాం ఆ తుపాకీని ప్రత్యేకంగా బహూకరించాడని చెబుతారు. అప్పటి నుంచి మ్యూజియం దిగువ భాగంలోని సెంట్రల్ హాల్లో టిప్పు తుపాకీని ప్రదర్శనకు ఉంచారు. సందర్శకులు ప్రత్యేకంగా దాన్ని చూసేందుకు బారులు తీరేవారు. ఇప్పటికీ కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే సందర్శకులు టిప్పు తుపాకీ గురించి మ్యూజియం సిబ్బందిని ఆరా తీస్తుండటం గమనార్హం. కానీ చాలా కాలంగా అది కనిపించడం లేదు. దాన్ని త్వరలోనే సందర్శనకు ఏర్పాటు చేస్తామంటూనే దాదాపు పదిహేనేళ్లుగా వాయిదా వేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే బుద్ధుడికి సంబంధించిన మ్యూజియం రూపొందించే క్రమంలో టిప్పు తుపాకీతోపాటు కొంత యుద్ధ సామగ్రిని కూడా తరలించారని... తర్వాత వాటి కోసం ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయలేక స్టోర్లో పడేశారని కొందరు సిబ్బంది అంటున్నారు. అధికారులు మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పటం లేదు. -
పజ్జూరులో తొలి యుగ ఆనవాళ్లు..!
♦ పురాతన ఆవాస ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లా పజ్జూరు గ్రామం ♦ 25 ఎకరాల విస్తీర్ణంలో శోధిస్తే నాటి 2వ శతాబ్ద చరిత్ర వెలుగులోకి.. ♦ తవ్వకాలకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ♦14 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశానికి త్వరలోనే పరిష్కారం ♦ నేడు సందర్శించనున్న రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ ♦ స్థానికులు సహకరిస్తే ఆధారాలు లభిస్తాయంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఒకటి, రెండు శతాబ్దాల జీవన శైలిని కళ్లకు కట్టే చారిత్రక ఆధారాలకు నల్లగొండ జిల్లా నెలవు కానుంది. తొలి చారిత్రక యుగంలో మానవులు వాడిన ఆయుధాలు, అలంకరణలు, ఆభరణాలు ఎన్నో లభించిన నీలగిరిలో మళ్లీ అలాంటి ఆధారాలే లభించనున్నాయని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రమైన నల్లగొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తి మండలం పజ్జూరు శివారులోని పాటిమీద ఉన్న 25 ఎకరాల విస్తీర్ణం లో తొలిచారిత్రక యుగం నాటి ఆవాస ప్రాంతం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో లభించిన విగ్రహాలు, ప్రతిమలు, ఆభరణాల ఆధారం గా ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు అనేక సార్లు ఆర్కియాలజికల్ ఇండియా (ఏఎస్ఐ) అనుమతి కోరినా 14 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. అయితే, ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఏఎస్ఐ అనుమతి లభించడంతో త్వరలోనే ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు లభిస్తాయని పురావస్తు శాఖ అధికారులు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి. బ్రహ్మచారి గురువారం పజ్జూరు లో ఉన్న ఈ క్షేత్రాన్ని పరిశీలించనున్నారు. మూడు నెలల క్రితమే.. ఇక్కడి చారిత్రక ఆధారాలపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు శాఖ అధికారులు మూడు నెలల క్రితం ఇక్కడ పరిశోధన చేశారు. పురావస్తు శాఖ జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ పి. నాగరాజు అక్కడకు వెళ్లి పజ్జూరు పాటి మీద ఉన్న ఆ క్షేత్రాన్ని పరిశీలించారు. అప్పుడు ఆ క్షేత్రంలో ప్రాథమిక స్థాయి ఆధారాలు లభించాయి. ఎర్రని, నల్లని కుండ పెంకులు, అప్పటి మహిళలు అలంకరణ కోసం ఉపయోగించే పూసలు, ఇతర ఆభరణాలు దొరికాయి. అప్పట్లో మహిళలు ఎలా ఉండేవారో ప్రతిబింబించే మృణ్మయ (టైట) ప్రతిమ కూడా లభించింది. చెవి రింగులు కూడా దొరికాయి. ఇక్కడ ఓ బౌద్ధ స్థూపం ఉందని, అయితే అది పూర్తిగా ధ్వంసమైయిందని అధికారులు చెబుతున్నారు. పొలాల్లో అప్పుడప్పుడు దొరుకుతున్న చారిత్రక ఆనవాళ్లు ఏంటో అర్థం కాక రైతులు వాటిని పారేసేవారని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. స్థానికులు ఇచిచన ఈ ఆధారాల మేరకు జిల్లా పురావస్తుశాఖ అధికారులు ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కోరారు. 1941లోనే తొలి తవ్వక ఆధారాలు నల్లగొండ జిల్లాలో ఇప్పటికే శాతవాహనులు, ఇక్ష్వాకులు, మహాక్షత్రీయులు, మహా తలవరీ యులు, రోమన్ సామ్రాజ్యాల ఆనవాళ్లు లభిం చాయి. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో ఆయా రాజ్యాల్లో వాడిన నాణేలు, గారప్రతిమలు, బుద్ధుని జీవనశైలిని ఆవిష్కరించే సున్నపురాయి పలకలు లభించాయి. తొలుత 1941-44 మధ్య కాలం లో (స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ సామ్రా జ్య కాలంలోనే) ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా అనుమతి మేరకు 2000 సంవత్సరం నుంచి ఈ తవ్వకాలు దఫదఫాలుగా జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో బంగారు, రాగి, సీసం, వెండి, పుటిన్తో తయారు చేసిన నాణేలు లభించాయి. ఆనాటి ఎగేట్, చెట్, లాపిస్లాజిలీ అనే అలంకరణ ఆభరణ సామగ్రి, మట్టిపూసలు కూడా దొరికాయి. ఇక్ష్వాక వంశస్తుడు వీరపురుష దత్తుని రాజ్యం లో చెక్కించిన గౌతమ బుద్ధుడి జీవనగాధలను ప్రతిబింబించే సున్నపు రాయి పలకలు లభిం చాయి. బుద్ధుడి జననం, మహాభినిష్ర్కమ ణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరి నిర్వాణం విశేషాలను ఈ పలకల్లో పొందుపర్చారు. ఆమె నమ్మకం.. వారి పూనకం వాస్తవానికి ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న విషయం నాటకీయ పరిస్థితిలో వెలుగులోకి వచ్చింది. 2001లో పజ్జూరు గ్రామంలో ఓ రైతు పొలంలో దేవతను పోలిన విగ్రహం లభించింది. ఈ విగ్రహం చూసిన వారంతా పూనకం పొందుతుండడంతో ఆమె నమ్మకం.. వారి పూనకం అంటూ గ్రామంలో వదంతులు వచ్చాయి. చివరకు అది 10,11 శతాబ్దాల్లో పూజలందుకున్న భైరవమూర్తి విగ్రహమని తేలింది. దీనిగురించి తెలుసుకున్న అప్పటి ఆర్కియాలజీ డెరైక్టర్ రాంలక్ష్మణ్ ఈ ప్రాంతం వాసే కావడంతో.. ఆయన హైదరాబాద్ నుంచి భానుమూర్తి అనే అధికారిని పరిశోధన కోసం పంపారు. ఆయన ఈ విగ్రహాన్ని పరిశీలించి తొలి చారిత్రక యుగ ఆనవాళ్లను గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ తవ్వకాల కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూనే ఉన్నా.. ఇప్పటికి మోక్షం కలగడం విశేషం. చారిత్రక ఆనవాళ్లు లభించాయి ‘పజ్జూరు పాటి మీద తొలి చారిత్రక యుగ ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతంలో ఒకటి, రెండు శతాబ్దాలకు చెందిన ఆవాస ప్రాంతం ఉందనేది మా అభిప్రాయం. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతి వచ్చింది. స్థానికులు సహకరిస్తే రెండు, మూడు నెలల్లో చారిత్రక ఆధారాలను వెలుగులోకి తెస్తాం.’ - పి. నాగరాజు, అసిస్టెంట్ై డెరెక్టర్, పురావస్తు శాఖ, నల్లగొండ ఆమనగల్లులో 8, 9 శతాబ్దాల విగ్రహాలు వేములపల్లి : నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో గల గుట్టపై ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాలలో 8, 9 శతాబ్దాలకు చెందిన దేవతా విగ్రహాలను గుర్తించినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన గడ్డం రాంస్వరూప్రెడ్డి విజ్ఞప్తి మేరకు బుధవారం పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పి.నాగరాజు ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలలోని శాసనాలు, దేవతా విగ్రహాలను పరిశీలించారు. 1300 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాలలో ఉందన్నారు. ఆలయ నిర్వహణకు ఎవరెవరు ఎంత భూమిని విరాళంగా ఇచ్చారన్న అంశం కూడా వీటిలో ఉందన్నారు. 15 రోజుల్లో పూర్తిస్థాయి పరిశోధన అనంతరం స్పష్టత వస్తుందన్నారు. 8, 9 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్ధిని, నంది, బ్రహ్మ, వల్లీ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను తాము గుర్తించినట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలోరెండు శాసనాలను గుర్తించామని వీటిని రాష్ట్ర కూటులు వేసినట్లుగా తెలుస్తోందన్నారు. భావితరాలకు వీటి గురించి తెలిపేందుకు సిమెంటు దిమ్మెలపై శాసనాలు, విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పురావస్తుశాఖ అధికారి వెంట తెలంగాణ చరిత్ర పరిశోధన బృందం సభ్యుడు హరగోపాల్ తదితరులు ఉన్నారు. -
ఆలయంలో వెయ్యి టన్నుల బంగారు నిధి?
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ నిధిలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు చెబుతున్నారు. వెయ్యి టన్నులా? అసలు అంత బంగారం ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. అయితే ఉన్నా ఉండవచ్చు అంటున్నారు. కేరళలోని త్రివేండ్రం పద్మనాభస్వామి ఆలయంలో వెలుగు చూడలేదా? అని ప్రశ్నిస్తున్నారు. దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్భక్ష్ సింగ్ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఈ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్ సర్కారు చెబుతున్నారు. ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు. ఉన్నావ్ ప్రాంతంలో స్వామి శోభన్ సర్కారుకు మంచి పేరుంది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. అందుకే అక్కడివారు ఆయన మాటలు నమ్ముతున్నారు. పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో అక్కడ తవ్వకాలను ఈ నెల 18 నుంచి చేపట్టనున్నారు. ఈ నిధి చుట్లూ రాజు ఆత్మ తిరుగుతోందని స్వామి అంటున్నారు. తనకు విముక్తి కల్పించాలని ఆ ఆత్మ కోరుతున్నట్లు స్వామీజీ చెప్తున్నారు. బంగారం నిధి ఉందని తెలియడంతో ఎక్కడెక్కడో ఉంటున్న దౌండియా ఖేరా గ్రామస్తులు ఇప్పుడు ఊరికి చేరుకుంటున్నారు. నిధి విషయం తెలిసినప్పటి నుంచి ఊళ్లో మగవాళ్లందరూ పనులు మానేసి గుడి చుట్టు కాపలా కాస్తున్నారు. ఇక తమ దశ తిరిగిపోయినట్లు వారు ఊహించుకుంటున్నారు.