
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్రం స్పష్టం చేసిందని ఏపీ పరిపాలన వికేంద్రీకరణ సాధన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం ప్రకటనను వక్రీకరిస్తూ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 5, 6, 94లలో పేర్కొన్న అంశాలను వక్రీకరిస్తూ అమరావతే ఏకైక రాజధాని అని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన గురువారం ఖండించారు. కొత్త రాజధానిలో హైకోర్టు, రాజ్భవన్, ఇతర కార్యనిర్వాహక హెచ్వోడీలు ఏర్పాటు చేయాలని.. ఆ చట్టంలోని సెక్షన్ 94(3)లో పేర్కొన్నారన్నారు.
ఈ అంశాలను సెక్షన్ 6లో పేర్కొన్న అంశాలతో సమన్వయపరిచి చూడాలన్నారు. రాజదాని ఏర్పాటు కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను పరిశీలించి.. నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని.. సెక్షన్ 6లో స్పష్టం చేశారన్నారు.
ఆ ప్రకారం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో అధికార వ్యవస్థలను వికేంద్రీకరణ విధానంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారన్నారు. ఆ ప్రకారమే వెనుకబడిన ఉత్తరాంధ్రలో పరిపాలన రాజదాని ఏర్పాటుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించాలన్నారు.