
సాక్షి, విశాఖపట్నం : పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులు ఈ కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు
కాగా విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయంపై దుండగుల దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అర్ధరాత్రి ఆలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. అనంతరం జై శ్రీరాం నినాదాల మధ్య శిరస్సును ఆలయానికి చేర్చారు. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment