lord rama
-
లవణాసుర సంహారం
కృతయుగంలో లోల అనే దానవ స్త్రీ ఉండేది. ఆమె కొడుకు మధువు. దానవుడే అయినా మధువు ధర్మం తప్పక దేవతలతో మైత్రి కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను ఆదరించేవాడు. ఆపన్నులను ఆదుకునేవాడు. మధువు పరమశివుడి కోసం తపస్సు చేశాడు. పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. తన శూలం నుంచి మరో శూలాన్ని పుట్టించి, వరప్రసాదంగా ఇచ్చాడు. ‘నువ్వు దేవ బ్రాహ్మణులకు అపచారం చేయనంత కాలం ఈ శూలం నీ వద్ద ఉంటుంది. ఇది నీ శత్రువులను నాశనం చేస్తుంది’ చెప్పాడు పరమశివుడు.‘పరమేశ్వరా! ఈ శూలం నా వంశంలో కొనసాగేలా అనుగ్రహించు’ ప్రార్థించాడు మధువు.‘అది కుదరదు. నీ కొడుకు వరకు మాత్రం ఉంటుంది’ అన్నాడు శివుడు.తర్వాత మధువు ఒక సుందర ప్రదేశంలో భవంతిని, దాని చుట్టూ సుందర నగరాన్ని నిర్మించుకున్నాడు. కుంభీనసి అనే దానవకాంతను పెళ్లాడాడు. కొంతకాలానికి వారిద్దరికీ లవణుడు పుట్టాడు.పెరిగి పెద్దయ్యే కొద్ది లవణుడు దుష్టుడిగా తయారయ్యాడు. కొడుకు చేష్టలకు మధువు కలతచెందేవాడు. కొంతకాలానికి మధువు తనకు శివుడు ప్రసాదించిన శూలాన్ని కొడుక్కు అప్పగించి, వరుణ లోకానికి వెళ్లిపోయాడు.తండ్రి నుంచి శివప్రసాదిత శూలం చేజిక్కిన తర్వాత లవణుడి ఆగడాలు మరింతగా శ్రుతిమించాయి. అతడిని ఎదిరించడానికి రాజులందరూ భయపడేవారు. రావణ సంహారం తర్వాత అయోధ్యలో కొలువుదీరిన రాముడి వద్దకు ఒకనాడు కొందరు మునులు, బ్రాహ్మణులు వచ్చి, లవణుడి ఆగడాలను గురించి మొరబెట్టుకున్నారు. ‘రామా! లవణాసురుడు నానాటికీ శ్రుతి మించుతున్నాడు. ఎందరో రాజులను వేడుకున్నాం. వారందరూ అతడిని ఎదిరించడానికి భయపడుతున్నారు. రావణుడిని సంహరించిన నువ్వే మాకు దిక్కు అని నీ వద్దకు వచ్చాం’ అని చెప్పారు.వారి మొర విన్న రాముడు తన తమ్ముళ్లను పిలిచాడు.‘మీలో ఎవరు లవణుడిని సంహరించడానికి వెళతారు?’ అని అడిగాడు.ముందుగా భరతుడు ‘నేను వెళతా’ అంటూ సిద్ధపడ్డాడు. అంతలో శత్రుఘ్నుడు కలగజేసుకుని, ‘అన్నా! నువ్వు అరణ్యవాసం చేసి, అయోధ్యకు తిరిగి వచ్చేంత వరకు భరతుడు నానా కష్టాలు పడ్డాడు. ఇకనైనా భరతుణ్ణి సుఖంగా ఉండనివ్వు. నేను వెళ్లి లవణాసురుణ్ణి చంపి వస్తాను’ అని చెప్పాడు. ‘తమ్ముడా! నువ్వు సర్వసమర్థుడివి. నువ్వా రాక్షసుణ్ణి చంపి, అతడి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించుకో’ అన్నాడు. వెంటనే పురోహితులను పిలిపించి, శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేశాడు. ‘లవణుడి వద్ద శివప్రసాదిత శూలం ఉంటుంది. దానిని అతడు ఇంటివద్ద వదిలి, దూరంగా వెళ్లినప్పుడే అదను చూసి అతణ్ణి చంపాలి’ అని చెప్పి, అనేక దివ్యాస్త్రాలను తమ్ముడికి ఇచ్చాడు.శత్రుఘ్నుడు చతురంగ బలగాలతో బయలుదేరాడు. లవణుడు ఆహారం కోసం బయటకు వెళ్లి, పట్టణానికి తిరిగి వచ్చేసరికి పట్టణ ప్రవేశద్వారం వద్ద శత్రుఘ్నుడు ధనుర్బాణాలు ధరించి నిలిచి ఉన్నాడు. చుట్టూ సైన్యం మోహరించి ఉంది. ‘ఎవడ్రా నువ్వు? ఆయుధాలతో నా పట్టణం ముందు నిలబడ్డావు. నీలాంటి వాళ్లెందరో నాకు ఆహారమైపోయారు. మర్యాదగా అడ్డు తొలగు’అన్నాడు లవణుడు. ‘నేను దశరథ పుత్రుణ్ణి. శ్రీరాముడి తమ్ముణ్ణి. నీతో యుద్ధానికి వచ్చాను’ నిదానంగా బదులిచ్చాడు శత్రుఘ్నుడు.‘అలాగా! నా మేనమామ రావణుణ్ణి చంపినవాడి తమ్ముడివన్నమాట! నీ కోరిక తప్పక తీరుస్తాను. లోపలకు వెళ్లి నా ఆయుధాన్ని తెచ్చుకోనీ’ అన్నాడు. ‘చేతికి చిక్కిన శత్రువును విడిచిపెట్టేంత అమాయకుణ్ణి కాదు. ఇప్పుడే నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను’ అంటూ శత్రుఘ్నుడు ధనుష్టంకారం చేశాడు. చిర్రెత్తిపోయిన లవణుడు పక్కనే ఉన్న భారీ చెట్టునొకటి పెరికి, శత్రుఘ్నుడి మీదకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం మొదలైంది. చెట్లతో లవణుడు, బాణాలతో శత్రుఘ్నుడు హోరాహోరీగా పోరాడారు. పరస్పరం గాయపరచుకున్నారు. లవణుడు విసిరిన భారీ చెట్టు శత్రుఘ్నుడి తలను తాకడంతో అతడు స్పృహ తప్పాడు.శత్రుఘ్నుడు మరణించాడని తలచిన లవణుడు తన శూలం కోసం ఇంటికి పోకుండా, అక్కడే ఉండి తెచ్చుకున్న ఆహారం తినడం ప్రారంభించాడు.ఈలోగా స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు తనకు రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, లవణుడి మీదకు వదిలాడు. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకొచ్చిన ఆ దివ్యాస్త్రం లవణుడి గుండెల్లోంచి దూసుకుపోయి, పాతాళానికి వెళ్లి తిరిగి వచ్చి శత్రుఘ్నుడి అమ్ముల పొదిలోకి చేరింది. లవణుడు హాహాకారాలు చేస్తూ మరణించాడు. -
ముద్దాయిలకు 4 లక్షల చెక్కులు ఇదేనా మీ ప్రభుత్వ సంస్కారం బొత్స సూటి ప్రశ్న
-
ఈ పసివాడు.. యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి?
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు."చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు -
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
Quiz On Lord Rama: శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
నేడు శ్రీరామ నవమి.. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు?... శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఈ కింద లింక్ క్లిక్ చేసి క్విజ్లో పాల్గొనండి.. -
Sri Rama Navami 2024: వెండితెర శ్రీరామచంద్రులు వీరే
శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మొదలు ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. ♦తొలిసారి టాలీవుడ్ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు ♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. ♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్లో కనిపించాడు ఎన్టీఆర్. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. ♦ఎన్టీఆర్ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్ రాముడి గెటప్ వేశాడు. ♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ♦ టాలీవుడ్ సొగ్గాడు శోభన్ బాబు కూడా రాముడి గెటప్లో ఆకట్టుకున్నాడు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ♦ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ♦ కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది. ♦శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’చిత్రంలో ప్రభాస్ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. -
Sri Rama Navami 2024: శ్రీరామనవమి ముహూర్తం, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి విషిష్టత ఏంటో తెలుసుకుందాం. అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ,పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 2024లో రామ నవమి ఎప్పుడు? చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ 9, మంగళవారం ప్రారంభమయ్యాయి.ఏప్రిల్ 17 న రామ నవమి పండుగతో ముగుస్తాయి. రామ నవమి శుభ ముహూర్తం రామ నవమి, ఏప్రిల్ 17,బుధవారం. ముహూర్తం - ఉదయం 11:03 -మధ్యాహ్నం 01:38 వరకువ్యవధి - 02 గంటల 35 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో, శ్రీరాముని జన్మదినోత్స వేడుకలు కోలాహలంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు.ఈ ఏడాది ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామజన్మభూమి దేవాలయంలో రామ్ లల్లా తొలి వేడుకులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. సీతారామకళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు అయిన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగింట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. రామ భక్తులు రామాయణం భాగవత గ్రంథాలను పఠిస్తారు. సీతారామ లక్ష్మణులతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. వడపప్పు, పానకం పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట. అందుకే శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది. -
న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ రామ మయం!
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాసులు భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్లోని బిల్బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ఇక భారీ స్కీన్ను ఏర్పాటు చేసిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం. (చదవండి: మస్కట్లో సంక్రాంతి సంబరాలు) -
Ayodhya Ram Mandir: మన రాముడొచ్చాడు
జగదానందకారకం.. దివ్యమంగళ స్వరూపం.. మందస్మిత వదనం.. చేత బంగారు ధనుస్సు, బాణం.. స్వర్ణవజ్రాభరణాలు, తులసీమాలల అలంకారం.. కార్యక్రమ ప్రధాన యజమాని (కర్త) హోదాలో ఐదేళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరిగింది. సోమవారం గర్భాలయం లోపల నరేంద్ర మోదీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకన్ల వ్యవధిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించి, విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ‘మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడం’టూ ప్రధాని అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన మరుక్షణమే దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధాని మోదీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకొని, పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో జటాయువు పక్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రతువు పూర్తికాగానే మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షను విరమించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను ప్రధాని మోదీ ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆయన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ప్రసంగించారు. సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యకు మన రాముడు వచ్చేశాడని ప్రధానమంత్రినరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సాకారమైన వేళ ప్రతి పౌరుడు ఇకపై దేశ భవిష్యత్ నిర్మాణ మార్గాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశ పురోగమనానికి, ప్రగతికి రామ మందిరం గొప్ప సాక్షిగా ఉంటుందని చెప్పారు. ‘వికసిత్ భారత్’కు ఈ రామ మందిరం సాక్షి అవుతుందని పేర్కొన్నారు. రాముడు ఈ దేశ విశ్వాసం, ఆలోచన, చట్టం, ప్రతిష్ట, వైభవం అని ఉద్ఘాటించారు. రాముడి ప్రభావం ఈ భూమిపై వేల సంవత్సరాలు పాటు కొనసాగిందని గుర్తుచేశారు. ఇదే సరైన సమయమని, రాబోయే వెయ్యేళ్ల భారతదేశానికి పునాది వేయాలని సూచించారు. అయోధ్య ఆలయంలోసోమవారం రామ్లల్లా ప్రాణప్రతిష్ట అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ అతిథులు, ప్రముఖులు, సాధుసంతులు, భక్త జనులను ఉద్దేశించి దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. భవ్య మందిరం నిర్మాణం పూర్తయ్యిందని, ఒక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. బలమైన, సమర్థవంతమైన, దివ్య, భవ్య భారతదేశాన్ని నిర్మించడానికి మనం ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ప్రజల మనస్సాక్షిలో రాముడి ఆదర్శం ఉండాలని ఉద్బోధించారు. అయోధ్య సభలో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రజల త్యాగానికి నా కృతజ్ఞతలు ‘‘సమిష్టి తత్వంతో సంఘటితంగా, సమర్థవంతంగా పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇది భారతదేశ సమయం. దేశం మరింత ముందుకు సాగబోతోంది. శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఇక్కడికి చేరుకున్నాం. మనమందరం ఈ యుగం కోసం, ఈ కాలం కోసం ఎదురు చూశాం. ఇప్పుడు మనం పరుగు ఆపబోం. అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. రామాలయాన్ని సుసాధ్యం చేసిన ప్రజల త్యాగానికి నా కృతజ్ఞతలు. సాధువులు, కర సేవకులు, రామభక్తులకు నా అభినందనలు. ఇది కేవలం శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట మాత్రమే కాదు. శ్రీరాముడి రూపంలో వ్యక్తమయ్యే భారతీయ సంస్కృతిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిష్టించుకొనే కార్యక్రమం. మానవీయ విలువలు, అత్యున్నత ఆశయాలకు భారతీయ సంస్కృతి ప్రతిరూపం. ఇది యావత్ ప్రపంచానికీ అవసరం. ఇది రాముడి రూపంలో ఉన్న జాతీయ చైతన్య ఆలయం. శ్రీరాముడు భారతదేశ విశ్వాసం, పునాది, ఆలోచన, చట్టం, స్పృహ, ఆలోచన, ప్రతిష్ట, కీర్తి. రామ్ అనేది ఓ ప్రవాహం, ఓ ప్రభావం, ఓ నీతి, విశ్వవ్యాప్త ఆత్మ. శ్రీరాముని ప్రాణప్రతిష్ట ప్రభావం వేల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నూతన కాలచక్రానికి నాంది శతాబ్దాల ఎదురు చూపులు, ఎన్నో బలిదానాలు, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సుల తర్వాత ఎట్టకేలకు రాముడు మళ్లీ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ శుభ సందర్భాన దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మన రామ్లల్లా ఇకపై డేరాలో ఉండడు. దివ్య మందిరంలో ఆయనకు శాశ్వత స్థానం లభించింది. జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక, నవశకానికి నాంది. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. రామజన్మభూమి ఆలయ పూజ, అభివృద్ధి పనులు దేశ పౌరుల్లో కొత్త శక్తిని నింపాయి. రామ భగవానుడి ఆశీర్వాదం వల్లే ఈ మహత్తర సందర్భానికి మనం సాక్షిగా ఉన్నాం. రోజులు, దిశలు, ఆకాశాలు సహా ప్రతిదీ ఈ రోజు దైవత్వంతో నిండి ఉంది. ఇది సాధారణ కాలం కాదు. కాలక్రమేణా ముద్రించబడుతున్న చెరగని స్మృతి మార్గం. బానిస మనస్తత్వపు సంకెళ్లను తెంచుకుని, గత అనుభవాల నుంచి స్ఫూర్తి పొంది, చరిత్రను లిఖించే గొప్ప సందర్భమిది. భారతీయుల హృదయాల్లో కొలువయ్యాడు బాలరాముడి ప్రాణప్రతిష్టతో చిన్న చిన్న గ్రామాలతో సహా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. దేవాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం ఈ రోజు దీపావళిని జరుపుకుంటోంది. సాయంత్రం వేళల్లో ప్రతి ఇంట్లో ‘రామజ్యోతి’ వెలిగించబోతున్నారు. రామసేతు ప్రారంభ బిందువు అయిన అరిచల్ మునైలో ఇటీవల పర్యటించా. రాముడు పాదం మోపిన అన్ని పవిత్ర ప్రదేశాలను 11 రోజుల అనుష్ఠాన సమయంలో సందర్శించా. నాసిక్లోని పంచవటీ ధామ్, కేరళలోని త్రిప్రయార్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి, శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వా మి దేవాలయం, రామేశ్వరంలోని శ్రీరామనాథస్వామి దేవాలయం, ధనుషో్కటీని సందర్శించా. సముద్రం నుండి సరయూ నది వరకు నా ప్రయా ణం సాగింది. రఘుకులోత్తమ రాముడు భారతదేశ ఆత్మకు చెందిన ప్రతి కణంతో అనుసంధానమై ఉన్నాడు. రాముడు భారతీయుల హృదయాల్లో కొలువయ్యాడు. భారతదేశంలో ఎక్కడైనా ప్రతి ఒక్కరి మనస్సాక్షిలో ఏకత్వ భావన కనిపిసుంది. సామూహికతకు ఇంతకంటే కచ్చితమైన సూత్రం మరొకటి లేదు. శ్రీరామ కథను అనేక భాషల్లో నేను ఆలకించాను. మన సంప్రదాయాలు, పండుగల్లో రాముడు ఉన్నాడు. ప్రతి యుగంలో ప్రజలు రాముడిని తలిచారు. తమదైన శైలిలో, మాటల్లో ఆ భగవంతుడిని వ్యక్తీకరించారు. ఈ ‘రామ్రస్’ జీవన ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. రామకథ అనంతం. రామాయణం అంతులేనిది. రాముడి ఆదర్శాలు, విలువలు, బోధనలు ప్రతిచోటా ఒకే విధంగా ఉంటాయి. ప్రతి ప్రయత్నానికీ బలం, సహకారం ప్రతి భారతీయుడిలోని భక్తి, సేవ, అంకితభావం, ఏకత్వం, ఐక్యత అనే భావాలు సమర్థవంతమైన, గొప్ప, దైవిక భారతావనికి ఆధారమవుతాయి. ప్రజలు దేవుడి నుండి దేశానికి(దేవ్ టూ దేశ్), రాముడి నుండి రాజ్యానికి(రామ్ టూ రా్ర‹Ù్ట) చైతన్యాన్ని విస్తరింపజేయాలి. రామభక్త హనుమాన్ సేవ, భక్తి, అంకితభావాన్ని చూసి ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చు. దేశంలో నిరాశకు తావు లేదు. తమ ను తాము చిన్నవారుగా, సామాన్యులుగా భావించే వారు రామాయణంలో రామయ్యకు ఉడుత అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. సంకోచాన్ని వదులుకోవాలి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ప్రయ త్నానికీ బలం, సహకారం ఉంటుంది. విపరీతమైన జ్ఞానం, అపారమైన శక్తి కలిగిన లంకా«దీశుడు రావణుడితో పోరాడి ఓడిపోతానని తెలిసి కూడా చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వర్తించిన జటాయువును ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుత అమృత కాలంలో యువత అకుంఠిత విశ్వాసంతో ముందుకు సాగాలి. సంప్రదాయ స్వచ్ఛత, ఆధునికతలను మేళవించడం ద్వారా భారతదేశం తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. శ్రీరాముడి తోడ్పాటు, ఆశీస్సులతో దేశం కోసం పని చేస్తామంటూ మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు శ్రీరాముడి ప్రతి పనిలో హనుమంతుడి ఉనికి తప్పనిసరిగా ఉంటుంది. సీతమ్మతోపాటు హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడిని సైతం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఈ ఆలయ నిర్మాణ ప్రధాన ఘట్టంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర మరువలేనిది. రామయ్యా.. నన్ను క్షమించు. అయోధ్యలో ఆలయ నిర్మాణం, ప్రాణప్రతిష్ట ఆలస్యమైనందుకు ప్రభు శ్రీరాముడిని క్షమాపణలు కోరుతున్నా. మన ప్రయత్నాలు, త్యాగాలు, తపస్సులో ఏదో లోటు జరిగిన కారణంగానే ఇన్ని శతాబ్దాలుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయలేకపోయాం. రామ్లల్లా ప్రాణప్రతిష్టతో నేడు ఆ లోటు తీరింది. శ్రీరాముడు మనల్ని తప్పకుండా ఈ రోజు క్షమిస్తాడని నమ్ముతున్నా. రామాయణ కాలంలో అయోధ్య నగరం శ్రీరాముడితో 14 ఏళ్ల పాటు వియోగం పొందింది. ఈ యుగంలో అయోధ్యవాసులు, దేశ ప్రజలు రాముడి వియోగాన్ని వందల ఏళ్లపాటు అనుభవించారు. మన దేశ రాజ్యాంగం అసలు ప్రతిలో శ్రీరాముడు ఉన్నప్పటికీ, మందిర నిర్మాణం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. న్యాయం గౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచినందుకు భారతదేశ న్యాయ వ్యవస్థకు నా ధన్యవాదాలు. శ్రీరాముడి ఆలయ నిర్మాణం రాజ్యాంగబద్ధంగానే జరిగింది. దైవ ఆశీర్వాదం, దైవిక ఆత్మల వల్లనే మందిర నిర్మాణం పూర్తయ్యింది. నిప్పు కాదు శక్తి పుట్టింది శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భం కేవలం విజయానికి సంబంధించిన అంశం కాదు. ఇది వినయానికి సంబంధించినది. రామ్లల్లా ఆలయ నిర్మాణం శాంతి, సహనం, పరస్పర సామరస్యం, భారతీయ సమాజంలోని సమన్వయానికి ప్రతీక. అయోధ్యలో ఆలయం నిర్మిస్తే దేశం అగ్నిగుండం అవుతుందని కొందరు హెచ్చరించారు. పునరాలోచన చేయాలని వారిని కోరుతున్నా. ఈ కట్టడం వల్ల ఏ నిప్పూ పుట్టడం లేదు, శక్తి పుట్టడం చూస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు బాటలో ముందుకు సాగేందుకు రామమందిరం సమాజంలోని ప్రతి వర్గానికీ స్ఫూర్తినిస్తోంది. రాముడు నిప్పు కాదు.. అతడొక శక్తి. అతడు వివాదం కాదు.. పరిష్కారం. రాముడు మనకు మాత్రమే కాదు, అందరికీ చెందినవాడు. రాముడు అనంతుడు. ‘వసుదైవ కుటుంబకమ్’ ఆలోచనే రామ్లల్లా ప్రాణప్రతిష్ట. దేశంలో నేడు నిరాశావాదానికి చోటు లేదు. హనుమ, ఉడత, జటాయువుల నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకుందాం. శతాబ్దాల ఎదురుచూపులు, ఎన్నో బలిదానాలు, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సుల తర్వాత ఎట్టకేలకు రాముడు మళ్లీ అయోధ్యకు చేరుకున్నాడు. మన రామ్లల్లా ఇకపై డేరాలో ఉండడు. దివ్య మందిరంలో ఆయనకు శాశ్వత స్థానం లభించింది. జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక, నవశకానికి నాంది. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ‘వికసిత్ భారత్’కు ఈ రామ మందిరం సాక్షి. భవ్య మందిర నిర్మాణం పూర్తయింది. ఇక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఇది భారతదేశ సమయం. – ప్రధాని మోదీ -
Ayodhya: బియ్యపు గింజలతో సీతారాముడు, అయోధ్య..
సాక్షి, హన్మకొండ: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. దీంతో, దేశమంతా రామనామ స్మరణ వినపడుతోంది. మరోవైపు.. కొందరు కళాకారులు రాముడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ కళాకారుడు బియ్యం గింజలతో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడి బొమ్మలు వేసి తన భక్తిని చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే ఒప్పంద ఉపాధ్యాయుడు బియ్యం గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయము నిర్మించి చూపర్లను ఆకట్టు కుంటున్నాడు. బియ్యం గింజలతో వారు చిత్రాలను గీసి రంగులు అద్దాడు. దీంతో, స్వామి వారి ఫొటో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 130 కోట్ల ప్రజలు నివసిస్తున్న శ్రీరామచంద్ర ప్రభు జన్మించిన అయోధ్యలో రాముడి విగ్ర ప్రతిష్ట ప్రారంభ మహోత్సవం జరుగుతోంది. హిందూ ప్రజల కళలు నెరవేరుతున్న సందర్భంగా హిందువుల ఆరాధ్య దైవం రాముడిని స్మరించుకుంటున్నాను. ఉడతా భక్తితో ఈ పేదవాడు బియ్యపు గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయంను నిర్మించి భగవంతునికి సమర్పిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
Ayodhya: గర్భిణిల ఎదురుచూపు.. బాలుడైతే..
సాక్షి, మహబూబాబాద్: భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ జరుగుతోంది. మరోవైపు.. తెలంగాణలోని మహబూబాబాద్ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గడియల కోసం కొందరు గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో తమ బిడ్డలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రసవల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శుభ గడియ కోసం గర్భిణీల వేచిచూస్తున్నారు. ఈ సమయంలో ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు. కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. ఇక, పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు. -
'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్?
ఓ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'హనుమాన్' నామజపమే వినిపిస్తోంది. స్టార్ హీరో గానీ డైరెక్టర్ గానీ లేకుండా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో ఇక్కడ, ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'హనుమాన్' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించాడు. అంటే 'హనుమాన్'లానే మరిన్ని సూపర్ హీరో చిత్రాల్ని ఓ ఫ్రాంచైజీలో భాగంగా రిలీజ్ చేస్తారు. తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ ఉన్నట్లు రాబోయే చిత్రాల్లో మన దేవుళ్ల రిఫరెన్సులు ఉండటం పక్కా. (ఇదీ చదవండి: Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!) అలానే 'హనుమాన్' చిత్ర క్లైమాక్స్లో 'జై హనుమాన్' అనే మరో సినిమా 2025లో రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ వచ్చాయి. మెగాహీరో రామ్ చరణ్.. ఆ పాత్రలో నటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్'లోని సెకండాఫ్లో చరణ్ గెటప్ గుర్తుచేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతమున్న హీరోల్లో రాముడి పాత్రలు ఎవరికి సూట్ అవుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ చరణ్ గనుక ప్రశాంత్ వర్మ తీసే సినిమాలో రాముడి పాత్ర వేస్తే మాత్రం అది వేరే లెవల్ మూవీ కావొచ్చనమాట. అయితే ప్రస్తుతానికైతే ఇది రూమర్లానే కనిపిస్తుంది. ఒకవేళ నిజమైతే మాత్రం ఫ్యాన్స్కి అంతకు మించిన పండగ మరొకటి ఉండదేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
శ్రీరాముడిపై NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు
-
అయోధ్య విగ్రహాల కోసం.. సాలిగ్రామ శిలలతోనే ఎందుకంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయం కోసం భారీ రాతి శిలలు.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. ఆదివారం నేపాల్ నుంచి బయల్దేరిన ట్రక్కు.. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవాళ(గురువారం ఫిబ్రవరి 2) అయోధ్యలో అడుగుపెట్టింది. పూజారులు, స్థానికులు దండలేసి.. ఆ పవిత్రమైన రాళ్లను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అప్పజెప్పారు. వాటిని రామ్ సేవక్ పురంలో భద్రపరిచారు ట్రస్ట్ నిర్వాహకులు. మరి వీటికి ఎందుకంత ప్రత్యేకతో చూద్దాం.. ప్రధాన ఆలయంలోని శ్రీరామ, జానకీ విగ్రహాలను చెక్కేందుకు వీటిని ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు రాళ్లలో ఒకటి 30 టన్నులు, మరొకటి 15 టన్నుల వరకు బరువు ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. నేపాల్లోని మయాగ్డి-ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కలి గండకి నది ఒడ్డున ఉన్న జలపాతం చెంత నుంచి ఈ రెండు భారీ శిలలను తెప్పించారు. అంతకు ముందు సీత జన్మస్థలంగా భావించే జనక్పూర్(నేపాల్)లో వీటికి ప్రత్యేక పూజలు జరిగాయి కూడా. శాలిగ్రాముల ప్రత్యేకత ఏంటంటే.. సాలిగ్రామ (శాలిగ్రామ).. సాలిగ్రామ శిలలని కూడా పిలుస్తారు. నేపాల్ గంకీ రాష్ట్రంలో.. దామోదర్ కుండ్ నుంచి గండకీ నది ఉద్భవిస్తుంది. గండకీ నదికి ఉపనది అయిన కలి గండకీ ప్రవాహ తీరంలోనే ఇవి కనిపిస్తాయి. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ శిలలను విష్ణు మూర్తికి ప్రతీకలుగా భావిస్తారు. వాస్తవానికి.. ఇవి డెవోనియన్-క్రెటేషియస్ కాలానికి చెందిన అమ్మోనైట్ షెల్ శిలాజాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయి. హిందువులు ఈ శిలాజాలను పవిత్రమైనవిగా గౌరవిస్తారు. ఎందుకంటే.. మధ్వాచార్య, అస్తమూర్తి(వ్యాసదేవ) నుండి అందుకున్నాడని, అందుకు వాటిపై ఉండే విష్ణు చిహ్నాలు, ముఖ్యంగా శంఖాన్ని పోలి ఉండడమే కారణమని భావిస్తారు. అదీ కాకుండా.. జానకీ మాత జన్మించిన నేల కావడంతో ఈ శిలలకు ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడ ఉన్న శిలలకు కోట్లాది ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ విగ్రహాలు కూడా.. ఉడుపి కృష్ణ మఠంలో కృష్ణ విగ్రహం, బృందావనంలోని రాధా రామన్ ఆలయం, తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం, గర్వాల్లోని బద్రినాథ్ ఆలయంలోని విగ్రహాలు సాలిగ్రామ్ శిలలతోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. దేవీ భాగవతా పురాణా, బ్రహ్మవైవర్థ పురాణా, శివ పురాణాలలో సాలిగ్రామ శిలల ప్రస్తావన కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఆదిశంకర రచనలలోనూ.. సాలిగ్రామ(శాలిగ్రామ) శిలల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని 1.6.1వ శ్లోకం, బ్రహ్మ సూత్రాలలోని 1.3.14 శ్లోకాలకు ఆదిశంకర తన విష్ణువు ఆరాధనలో శిల ఉపయోగించడం సుప్రసిద్ధ హిందూ ఆచారంగా ఉండేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇవేకాదు.. చాలాచోట్ల సాలిగ్రామ శిలలు కొన్ని నకిలీవి వాడుకలో ఉండడం గమనార్హం. -
అప్పుడు ఆప్తుడే.. మరిప్పుడో..!!!
Chaganti Koteswara Rao: కమలములు నీటబాసిన/కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్/ తమ తమ నెలవులు దప్పిన/ తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ...అన్నాడు బద్దెన సుమతీ శతకంలో. నీళ్ళల్లో ఉన్న తామర మొగ్గ విచ్చుకోవడానికి కారణమయిన సూర్యనారాయణుడు, అదే తామరతూడును నీళ్ళల్లో నుంచి తీసి ఒడ్డున పెడితే ...ఆయన వాడివేడి కిరణాలు సోకి అది వాడిపోతుంది, కమలాప్తుడు అంటే నీళ్ళల్లో ఉన్న కమలానికి బంధువు, నీళ్ళనుంచి బయటికి వచ్చిన పిదప శత్రువయిపోయాడు. విభీషణుడు రావణునికి సోదరుడు. కానీ ఎప్పుడూ ధర్మంవైపే నిలబడతాడు. అన్నగారు అధర్మానికి పాల్పడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. అలా చెప్పే వారు మన శ్రేయోభిలాషులని గుర్తించకపోతే చాలా ప్రమాదకరం. హనుమ రాయబారం తరువాత రావణాసురుడు కోపంతో హనుమ కంఠాన్ని నరికేయమన్నాడు. ఆయన్ని సంహరించబోతున్నారు. విభీషణుడు జోక్యం చేసుకొన్నాడు. ‘అన్నయ్యా! నీకు తెలియని ధర్మం లేదు కదా... అతను దూత. ఎవరో చెప్పి పంపినవి ఆయన చెబుతున్నాడు. అవి దూత అభిప్రాయాలు కావు కదా. దూత పరిధి దాటాడనిపిస్తే స్వల్పంగా శిక్షించవచ్చు. అంతేకానీ సంహరిస్తానంటే ఎలా..? పైగా నీవితన్ని సంహరిస్తే నీ అభిప్రాయాలు అవతలివారికి ఎలా చేరవేయగలవు? కాబట్టి వద్దు.. అన్నాడు. రావణుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అటువంటి ధర్మాత్ముడు పక్కన ఉన్నంతకాలం ... ఉపద్రవాలు ప్రాణాంతకం కాకుండా ఉన్నాయి. కానీ తరువాత జరిగిన పరిణామాలవల్ల విభీషణుడు రాముడి పక్కన చేరిపోయాడు. ఇంద్రజిత్తు రాముడిపై యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బ్రహ్మగారు ఒకానొకప్పుడు ఆయనకు వరం ఇస్తూ...‘‘నికుంభిలా (దట్టమైన అడవిలో ఉన్న ఒక దేవాలయం. అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరం) కు వెళ్ళి హోమం చెయ్యి. దానిలోంచి వచ్చిన రథం మీద కూర్చొని యుద్ధానికి బయల్దేరితే... నువ్వు మేఘాలలో ఉండి దుర్నిరీక్షవుడవుతావు. నిన్ను యుద్ధంలో గెలవడం ఎవరికీ సాధ్యం కాదు.’’ అని వరమిస్తూనే...‘‘నువ్వు నికుంభిలా చేరకపోయినా, చేరి హోమాన్ని పూర్తి చేయలేక పోయినా, నువ్వు ఆయుధాన్ని ధరించి ఉండగా నీపై యుద్ధానికి వచ్చినవాడే నీ ప్రాణాలను హరిస్తాడని గుర్తించు’’ అని హెచ్చరించాడు. ఈ రహస్యం విభీషణుడికి తెలుసు. ఇప్పుడాయన రాముడి పక్షంలో ఉన్నాడు. అదంతా రాముడికి తెలిపి... ఇపుడు ఇంద్రజిత్తు నికుంభిలా చేరుకున్నాడు... అని కూడా చెప్పి రాముడి ఆజ్ఞతో లక్ష్మణస్వామిని తీసుకొని వెళ్ళాడు. ఇంద్రజిత్తు హోమాన్ని మధ్యలోనే ఆపేసి యుద్ధానికి వచ్చాడు. ఆ తరువాత లక్ష్మణుడి చేతిలో చచ్చాడు. అంటే విభీషణుడు స్థానం తప్పిన కారణంగా లంకకు, రావణాసురుడికి చేటు వచ్చింది. అందుకే బద్దెన చెప్పింది.. ఒక్కొక్కసారి ఒక్కొక్కస్థానంలో మిత్రుడిగా ఉన్నవాడు, స్థానం తప్పితే శత్రువయిపోతాడు. మన పక్కన ఉన్నవారిలో మన శ్రేయస్సు కోరి కొన్ని కఠినమైన సలహాలు ఇచ్చినా, వాటిని పరిశీలించి ఓర్పుతో, విచక్షణతో మసలుకొన్నప్పుడు అవాంఛిత ప్రమాదాలు మాత్రం ఎదురుకాకుండా ఉంటాయన్నదే బద్దెన ఇస్తున్న సలహా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: మంచి మాట..: ఏది నిజమైన సంపద? -
Lord Ram: రాముడిపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వారికి.. కొందరు దేవుడు ఉన్నాడని నమ్మితే.. మరికొందరూ లేడని వాదిస్తారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్లో చోటుచేసుకుంది. రాముడి విషయంలో బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు. ఆ పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, అందులో మంచి విషయాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తమకు తులసీదాస్, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. దేశంలో రెండే కులాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే రామాయణంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నారని పురాణ కాలం నుంచి వింటున్నాం. అయితే, మేము కొరికిన పండ్లను మీరు(పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి) తినరు, ముట్టుకోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. #WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, "Ram wasn't a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created 'kavya' & 'mahakavya' with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram.." pic.twitter.com/ayrQvSfdH1 — ANI (@ANI) April 15, 2022 -
రామయ్య!.. ఆ అవతారంతో పాటే నడిసంద్రంలో మునిగిపోయాడా?
సాక్షి, వెబ్డెస్క్: రాముని పాదాల దగ్గర ఆయన పరమ భక్తుడు శ్రీ ఆంజనేయుడు కచ్చితంగా ఉండాల్సిందే!. అలాంటిది ఆ ఆలయంలో మాత్రం ఉండడు!. తెలంగాణ మెదక్ జిల్లా గుమ్మడిదలలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని ‘కళ్యాణ రాముడ’ని పిలుస్తారు. సీతారామకళ్యాణ ఘట్టం సమయానికి.. శ్రీ రామాంజనేయులకు పరిచయం లేదు. కాబట్టే ఇక్కడ మారుతి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాలు చెప్తున్నాయి. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఇది. 45 ఏళ్ల కిందట ఆలయాన్ని పునరుద్ధరించారు. సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు- ఊర్మిళ, భరతుడు-మాండవి, శత్రుఘ్నుడు-శ్రుతకీర్తిల విగ్రహాలు గర్భగుడిలో కనిపించడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తుంటాడు. అందుకే ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు. -------- ► తమిళనాడులోని అతిపెద్ద రామాలయాల్లో ఒకటి తిరువణ్ణమలై జిల్లాలోని నెడుంగుణమ్ శ్రీ రామ టెంపుల్. ఈ గుడిలో రాములోరి చేతిలో బాణం ఉండదు. గుండెపై కుడి చేయి వేసుకుని యోగముద్రతో శాంతమూర్తిగా కనిపిస్తాడు ఇక్కడ. ప్రశాంతతకు నెలవుగా ఈ ఆలయాన్ని భావిస్తారు భక్తులు. హనుమంతుడి విగ్రహం శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూనే.. స్వామి చెబుతున్నది వింటున్నట్లు కనిపిస్తుంది. లక్ష్మణుడు మాత్రం విల్లు ధరించి ఉంటాడు. ఇక సీతమ్మ కుడిచేతితో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తున్నట్లు ఉంటుంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఇక్కడ విడిది చేశాడని, శుక మహర్షిని దర్శించుకున్నాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయ రాఘవన్’ అని అంటారు. రాముడు యోగముద్రతో కనిపించే ఆలయాలు ఇంకా ఉన్నప్పటికీ.. వాటిల్లో బాగా పేరున్నది ఇదే. -------- ► సాధారణంగా సీతారాముల విగ్రహంలో సీతమ్మ రాముడికి ఎడమ వైపు ఉంటుంది. కానీ, తిరుపతి కోదండ రామాలయంలో మాత్రం కుడివైపున సీతమ్మ విగ్రహం, ఎడమవైపున లక్ష్మణుడి విగ్రహం ఉంటుంది. వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా ఉండాలట!. ఆ ప్రకారమే ఈ విగ్రహం కుడివైపు ఏర్పాటు చేయించినట్లు పండితులు చెబుతున్నారు. ఇలా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. తిరుపతి సిటీ సెంటర్లో ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని స్థల పురాణం. అంతేకాదు సీతను అన్వేషించే క్రమంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది. -------- ► త్రిప్రాయర్ శ్రీ రామస్వామి టెంపుల్.. కేరళలోని త్రిస్సూర్లో తీవ్ర నది ఒడ్డున ఉంది. ఎక్కడా కనిపించనట్లుగా ఆ గుడిలో శ్రీరాముడు.. విష్ణుమూర్తి అవతారంతో కనిపిస్తాడు. ‘త్రిప్రా దేవర్’గా ప్రసిద్ధుడైన ఈ శ్రీరాముడికి నాలుగు భుజాలు ఉంటాయి. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో విల్లు, నాలుగో చేతిలో జపమాల ఉంటాయి. వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతంగా భావిస్తారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందుకే త్రిమూర్తుల స్వరూపమైన ఆలయంగా త్రిప్రాయర్ని భావిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, అవతారం ముగిశాక ద్వారకతో పాటు ఈ విగ్రహం కూడా సముద్రంలో మునిగిపోయిందనీ స్థల పురాణం చెబుతోంది. సముద్రంలో దొరికిన విగ్రహానికి మత్స్యకారులు ప్రతిష్ఠ జరిపారని చెప్తారు. -------- ఫొటోల్లో తప్పించి శ్రీరామ పట్టాభిషేకం తరహా విగ్రహాలు ఏ ఆలయంలో కనిపించవు.. ఒక్క తమిళనాడులో తప్ప. సేలంకు దగ్గర్లోని అయోధ్యాపట్నంలోని శ్రీ కోదండపాణి రామాలయం ఉంది. ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు. ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని దర్శనమిస్తాడు. ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా, సైన్యం సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చాడట. అయోధ్య పట్టాభిషేక ముహూర్తం ఆలస్యం అవుతుండడంతో.. ఈ ప్రాంతంలో పట్టాభిషేకం జరిపారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ఊరికి అయోధ్యపట్నం అని పేరొచ్చిందని భావిస్తుంటారు. ::శ్రీరామ నవమి సందర్భంగా.. -
శతక నీతి – సుమతి: మహనీయుల పుస్తకాలే మంచి నేస్తాలు
మనిషి తన జీవన ప్రయాణంలో అనుక్షణం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది...‘త్యజదుర్జన సంసర్గమ్ భజ సాధు సమాగమమ్’.. ప్రయత్న పూర్వకంగా మానేయవలసినది... దుర్జనులతో స్నేహం. అది ఎప్పటికయినా కొంప ముంచేస్తుంది. ఏదో ప్రమాదాన్ని తెస్తుంటుంది. అలాగే కోరికోరి చేయవలసిన పని... మంచి మార్గంలో నడిచేవారితో కలిసి మెలిసి ఉండడం. మంచి మనుషులు అంటే నాకెవరూ అందుబాటులో లేరని అనుకోవద్దు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామిలాంటి మహనీయుల పుస్తకాలు, చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారి అనుగ్రహ భాషణాలవంటివి ఇంట్లో ఉంచుకుని వాటిని చదువుతూ, వింటూఉంటే వారు మనతో ఉన్నట్లే.. మనమూ వారివేలు పట్టుకుని నడుస్తున్నట్టే. సత్పురుషుల మాటలు వినడం, వారి జీవిత చరిత్రలు చదవడం, వారి జీవన విధానాన్ని పరిశీలించడం వంటివి క్రమం తప్పకుండా చేస్తుంటే... మనం మంచి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన స్ఫూర్తిని అవి ప్రతి క్షణం కలిగిస్తుంటాయి. మారీచుడు రావణాసురుడితో ఓ మాటంటాడు – ‘కొన్ని తప్పులు చేస్తే కొన్నే పోతాయి. కానీ మహాత్ముల జోలికి వెళ్ళావనుకో ఎంత ప్రమాదం వస్తుందో తెలుసా! నీ ఒక్కడితో పోదు. నువ్వు పరిపాలిస్తున్న లంకా పట్టణం నాశనమయిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు రాక్షసులు ఒక్కరు కూడా మిగలరు. ఆఖరికి నీ కొడుకులు, నీ తోడబుట్టినవారుకూడా పోతారు. నీ భార్యలతో నువ్వు సంతోషంగా హాయిగా బతకాలనుకుంటే సీతమ్మ జోలికి వెళ్ళకు’ అన్నాడు. రావణుడు వినకపోగా ఏమన్నాడంటే – ‘‘సీతాపహరణానికి సహకారం చేస్తే రాముడి చేతిలో చచ్చిపోతావు. నా మాట వినకపోతే నా చేతిలో చస్తావు. నీకు ఎవరి చేతిలో చావాలనుంది’’ అని అడిగాడు. దుర్మార్గుడయిన నీ చేతిలో చచ్చేకన్నా మహాపురుషుడు రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు మారీచుడు. ఏమయింది చివరకు ...? మారీచుడు చెప్పినట్టే ఒక్క దుర్మార్గుడి వల్ల మొత్తం లంకారాజ్యం అంతా నశించిపోయింది. రాక్షసులు నశించిపోయారు. కొడుకు ఇంద్రజిత్ పోయాడు. ఆఖరికి భార్య రావణాసురుడి శవాన్ని చూసి –‘‘అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు, కాదు. నిజానికి నిన్ను చంపింది ఎవరో తెలుసా! నీ ఇంద్రియాలే, వాటి లోలత్వమే నిన్ను చంపేసాయి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ముందు ఒక మేకల మంద వెడుతుంటుంది. వాటి వెనుక ఒక వ్యక్తి వెళ్లాడనుకోండి. మేకలను రక్షిస్తాడు. అలా కాక ఒక తోడేలో, నక్కో వెళ్లిందనుకోండి. అప్పుడు మేకలకు ప్రమాదం బయటినుంచేమీ ఉండదు. వాటికి రక్షణగా ఉన్నవే వాటిని భక్షించేస్తాయి. నీవు కూడా దుర్మార్గులతో కలిసి ఉంటే నిన్ను పాడుచేయడానికి బయటినుంచి ఎవరూ రానక్కరలేదు. ఆ దుర్మార్గులతో కలిసి ఉన్న కారణమే నిన్ను నాశనం చేసేస్తుంది. అదే ఒక సత్పురుషుడితో కలిసి ఉంటే నీవు మంచి పనులు చేస్తున్నా చేయకపోయినా నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి. సుమతీ శతకకారుడి ఆవేదనాభరిత సందేశం కూడా ఇదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శ్రీరామ నవమి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి?
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ రామనామ వైభవాన్ని ఈశ్వరుడు చెప్పాడు. చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో పగలు పన్నెండుగంటల సమయంలో యజ్ఞఫలంగా శ్రీరామచంద్రుడు దశరథుని భార్య కౌసల్యకు జన్మించాడు. శ్రీరాముడిగా ఆయన అవతరించి నేటికి ఒక కోటీ ఎనబైయొక్క లక్షల ఏడువేలసంవత్సరాలు గడిచాయి. ఆ నాటి నుంచి శ్రీ రామ నవమిని దేశ విదేశాల్లోని భక్తులందరూ పవిత్రమైన పర్వంగా జరుపుకుంటున్నారు. సచ్చీలత, సమర్ధత, బుద్ధి కుశలత, శరణు జొచ్చినవారికి అభయమివ్వడం, పెద్దలను, మిత్రులను గౌరవించటం, అసత్య మాడకుండటం, ఏకపత్నీ వ్రతం మొదలైనవి శ్రీరాముని గుణాలలో పేర్కొన తగినవి. శేషతల్ప సుఖ నిద్రితుడు, సర్వ చరాచర పాలకుడు, శుద్ధబ్రహ్మ పరాత్పరుడు, సమస్త లోకనాథుడు అయిన శ్రీమహావిష్ణువు ధర్మమార్గానికి గ్లాని సంభవించినప్పుడు, దుర్మార్గుల ఆగడాలు మితిమీరినప్పుడు, మంచివారికిరక్షణ కరువైనప్పుడు అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేస్తాడని భగవద్గీతలో స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. ముఖ్యంగా మనకు తెలిసిన దశావతారాలలో వామన, శ్రీరామ, పరశురామ, శ్రీ కృష్ణ అవతారాలు మాత్రం మానవ రూప అవతారాలు. ఎత్తినది మానవావతారమైనా మాధ వుడిగా అతని కీర్తి సర్వ జగత్తులోనూ వ్యాపించింది. యుగాలు గడిచినా శ్రీరామచంద్రుడు ప్రజల మనస్సుల్లో మర్యాదా పురుషోత్తమునిగా నేటికీ నిలిచి ఉన్నాడు. ఆదికవి వాల్మీకి మహాముని ముఖపద్మం నుండి వచ్చిన రామకథా మకరందాన్ని గ్రహించిన వారు జన్మ దుఃఖాన్ని, వ్యాధుల వల్ల వచ్చే బాధలను, ముసలితనంలో కలిగే బాధలను మరణ భయాన్ని పొందరు. శ్రీరామకథా పఠనం వల్ల అంతంలో విష్ణులోక ప్రాప్తి తథ్యమని మన పూర్వులు చెప్పారు. ఈ మహీతలంలో (భూమి) పర్వతాల, నదులూ ఎంత కాలం వరకు నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీరామాయణం కూడా లోకాల న్నింటిలోనూ ప్రచారంలో ఉండగలదు. ఎందుకంటే రామాయణం లో హృదయాన్ని ద్రవింపచేసే చక్కని కథ ద్వారా మానవాళికి మార్గదర్శనం చేసే సుభాషిత రత్నాలు ఎన్నో చెప్పారు. మానవజాతి మనుగడ ఉన్నన్నాళ్ళూ ఈ కథ నిలిచి ఉంటుంది. పాతబడడమంటూ ఏ నాటికీ జరగదు. ఈ గ్రంథం మానవ జీవితాన్ని సుఖప్రదం చేసుకునేందుకు ఇతోధికంగా ఉపకరిస్తుంది. అంతటి మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షికి ధన్యవాదాలు తెలుపవలసిన దినం శ్రీరామ నవమి పర్వదినం. ఈ పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి? ఈ రోజున ఉపవాసవ్రతమాచరించాలి. వీలు కాని పక్షంలో ఏకభుక్తం చేయవచ్చు. ఉదయాన్నే స్నానాదికాలు పూర్తి చేసి ‘నవమ్యా అంగభూతేన ఏకభుక్తేన రాఘవ, ఇక్ష్వాకు వంశ తిలక ప్రీతి భవభవ ప్రియ’ అని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత విధి విధానంగా పూజ చేసి గంధం పుష్పాక్షితలు కలిపిన నీటితో అర్ఘ్యమీయాలి. వడపప్పు పానకం ప్రసాదంగా స్వీకరించాలి. చైత్రశుద్ధ నవ రాత్రులు ఈ తొమ్మిది రోజులు రామాయణ గ్రంథ పఠనం చేయడం ముక్తికి సోపానం. లేదా సుందరాకాండ పారాయణ చేసినా అంతే ఫలితం ఉంటుంది. సుందరకాండ పారాయణం సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం * * * * * * * * సుందరాకాండ మంత్రం కూడా సుందరమైనదే. మహిమాన్వితమైనదే. శ్రీరామాయణ పారాయణం వేద పారాయణంతో సమానం. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడే. ఆపదామపహర్తారం, దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం * * * * * * * * ఆపదలను పోగొట్టి సంపదలను కలిగించే లోకాభి రాముడైన శ్రీరామునికి పదే పదే నమస్కారం. ప్రస్తుతం కరోనా ఉధృతి వేళ ఆలయాలకు స్వయంగా వెళ్లలేని వారు శ్రీరామ కల్యాణ వేడుకలను ప్రసార మాధ్యమాలలో తిలకించడమూ ఫలదాయకమే. – గుమ్మా ప్రసాదరావు -
పవిత్రతా స్వరూపిణి సీత
భారతదేశంలో వివాహితుడు భార్య ప్రక్కన ఉంచుకోకుండా ఏ క్రతువు, వ్రతము చెయ్యకూడదు. భార్య భర్త ప్రక్కన ఉండాలి. సహధర్మచారిణి అనేది పత్నికి వాచకం. గృహస్థుడు అనుష్ఠించాల్సిన కర్మకలాపాలు వందల. సంఖ్యలో ఉన్నాయి. కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు. రాముడి భార్య బహిష్కరింపబడ్డ కారణంగా ఆమె అతని ప్రక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు. " అలా ఎన్నటికీ జరగదు.నా జీవితం సీతదే." అన్నాడు రాముడు. రాజుగా అతడు ప్రజల కోరికను ప్రతిఘటించడం ఇదే మొదలు. యజ్ఞనిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులుగా బంగారంతో ఒక సీత ప్రతిమను రూపొం దించారు. రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు.ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారుసీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. సీత తన శుద్ధిని తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే శపథం చేయాలని దూతల ద్వారా కబురు పంపాడు. వాల్మీకి వెంట సీత సభలో ప్రవేశించింది. సీత చేయబోయె శపథాన్ని వినటానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో ఆ సభ కిక్కిరిసిపోయింది. వాల్మీకి తన తపస్సు సాక్షిగా సీత పరిశుద్ధు రాలని ఉద్ఘోషించాడు. సీత సౌశీల్యం తనకుతెలుసని అయినా లోకాపవాదానకి వెరసితాను సీతను పరిత్యజించినట్లు అంగీకరిం చాడురాముడు.ఈ కలవలిద్దరు తన బిడ్డలేనన్నాడు. సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥ అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమిఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణులయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు. సీతాదేవి పాతివ్రత్యమే! పవిత్రతా సరూపమే! ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొకరి దేహాన్పి స్పృశించదు. "పాతివ్రత్యమే ఆమె పరిశుద్ధత"అని రాముడన్నాడు. సీత అనే మాట భారత దేశంలో శుభం, పరిశుద్ధం,పవిత్రమైనవాటికెల్లా పర్యాయపదం,ఆమె సకల సద్గుణాలరాశి. సీత క్షమాశీలి,సర్వదా పరిశుద్ధ వర్తనం ఉన్న అర్థాంగి! అంతటి బాధను అనుభవిస్తున్నారాముని గురించి ఒక్క పరుషమైన వాక్కు కూడా పలకలేదు. సీత ఏనాడూ హానికి ప్రతిహాని తలపెట్ట లేదు.ప్రతి స్త్రీ సీతాదేవి అవడానికి ప్రయయ్నంచుగాక! - గుమ్మా ప్రసాద రావు -
మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..
హరిద్వార్: భారతీయులు రాముడిని ఎలా కొలుస్తారో, ప్రధాని మోదీ చేసే మంచి పనులకు రాబోయే రోజుల్లో ఆయనను కూడా అలాగే ఆరాధిస్తారంటూ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉత్తరాఖండ్లో నిర్వహించిన నేత్ర కుంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు సమాజం కోసం పని చేశారు. అందుకే రాముడిని ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. అలాగే ప్రధాని మోదీ కూడా సమాజం కోసం పని చేస్తున్నారు, కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనను కూడా రాముడి అవతారంలా భావించి కొలుస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎంగా ఎన్నికయ్యాక పాల్గొన్న తొలి కార్యక్రమంలో తీరత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Lord Ram worked for the same society & people started to believe that He was a God. In the coming time, Narendra Modi will also be seen at par with Him (Lord Ram): Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/xjw04hSsai — ANI (@ANI) March 15, 2021 కాగా, ప్రధాని మోదీ రాముడంతటి గొప్పవాడంటూ గతంలో బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బహిరంగ సభలో మోదీని రాముడితో పోల్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం ఆయన ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
రామతీర్థం విగ్రహాలకు తుది మెరుగులు
తిరుపతి ఎడ్యుకేషన్: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధ్వంసమైన శ్రీరాముని విగ్రహం స్థానంలో నూతనంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ప్రతిమలను ప్రతిష్టించేందుకు ఆ జిల్లా దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విగ్రహాల తయారీకి ఈ నెల 8న టీటీడీ ఉన్నతాధికారులను దేవదాయ శాఖ అధికారులు సంప్రదించారు. అలిపిరిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో ఏఈ మహేందర్రెడ్డి పర్యవేక్షణలో స్థపతి మునిశంకర్, మార్కింగ్ స్థపతి మారుతీరావు నేతృత్వంలో శిల్పులు రమేష్, నాగరాజు, సుబ్రమణ్యం ఆచారీ విగ్రహాల తయారీ పనిలో నిమగ్నమయ్యారు. మూలవిరాట్ తయారీకి కంచి నుంచి కృష్ణశిల(బ్లాక్ గ్రానైట్)ను తెప్పించారు. పీఠంతో కలిపి శ్రీరాముని విగ్రహం 3.6 అడుగులు, సీతా, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులతో మలుస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఈ విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకోనున్నాయి. -
రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?
సాక్షి, అమరావతి/విజయనగరం టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం, కోదండరామస్వామి అలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర స్పష్టంగా బయటపడింది. మహిళలకు ఇళ్ల పట్టాలిస్తూ ముఖ్యమంత్రి జగన్ అనితర సాధ్యమైన రీతిలో ముందుకెళుతుండటంతో విజయనగరంలోని ఆయన బహిరంగ సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే మొదట దీనికి తెగబడినట్లు తెలియవస్తోంది. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు... 20 మందికిపైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అందులో టీడీపీ కుట్ర కోణం స్పష్టంగా బయటపడినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న చంద్రబాబు... తమ పాత్ర బయటపడుతుందన్న భయంతో రెండు రోజులుగా అక్కడ జనాన్ని పోగేస్తూ వచ్చారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి భారీగా జనాన్ని సమీకరించి ఆలయం దగ్గర రచ్చ చేయాలని, తద్వారా తమ పాత్ర బయటపడకుండా చేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. ఇందులో భాగంగానే... అప్పటికే అక్కడికి చేరుకున్న 2,500 మందికి పైగా జనంతో శనివారం ‘షో’ చేయబోయారు. కానీ ఈ విషయం తెలుసుకుని అప్పటికే అక్కడకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వీరిని అడ్డుకోవటంతో బాబు ఆటలు సాగలేదు. అనంతరం పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేసి.. ఇదంతా టీడీపీ నేతలు ఒక పన్నాగం ప్రకారం చేసిందేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అసలు ఏం జరిగిందంటే... రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. ఈ దుశ్చర్యను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు చేస్తుండగా... స్థానిక టీడీపీ నేతలు కొందరు హడావుడి చేసి, కోనేరులో వెదికినట్లుగా వెదికి, అందులోంచి తల భాగాన్ని బయటకు తీయటం వారి అనుమానాల్ని మరింత పెంచింది. అనంతరం ఈ శిరస్సు భాగాన్ని వెనుక నుంచి కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం మళ్ళీ నీలాచలం కొండపైన పరిశీలించారు. మాగ్నెట్లతో కోనేరులో సెర్చ్ చెయ్యగా యాక్సా బ్లేడు దొరికింది. వారు పగులగొట్టిన తాళం కూడా ఆలయం బయట పోలీసులకు దొరికింది. నిజానికి డిసెంబరు 25న కొండపైకి కరెంటొచ్చింది. 29న సిసి కెమెరాలు ఏర్పాటు చేయటానికి అంతా సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి తెల్లారక ముందే విగ్రహాన్ని ద్వంసం చేశారంటే అదంతా పక్కా సమాచారంతోనే జరిగి ఉంటుందనేది పోలీసుల భావన. పైగా 30న గుంకలాంలో 12,301 మందికి ఇళ్లపట్టాలివ్వటానికి సీఎం వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో ఇది జరగటాన్ని బట్టి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారమే చేశారన్నది వారి దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. అనుమానితుల కోసం టీడీపీ యాగీ... విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారున్నారు. మొత్తం 21 మందికి పైగా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హుటాహుటిన రామతీర్థం పర్యటనకు రావటం... రాక ముందే 3 రోజులుగా జనాన్ని పోగేయటం ఇక్కడ గమనార్హం. దీన్నిబట్టి తమ వారి పాత్ర ఏమాత్రం లేదని జనాన్ని నమ్మించడానికే ఈ అక్కర్లేని రాద్దాంతానికి ప్రయత్నించారన్నది తెలియకమానదు. కాగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని, అందుకోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ వారికి చంద్రబాబు సూచించటం గమనార్హం. దీంతోపాటు పోలీసులు విచారణ కోసం పిలిచి 24 గంటలు కూడా గడవకముందే అనుమానితుడైన టీడీపీ నేత భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదంతా టీడీపీ పెద్దలు దగ్గరుండి చేయించడం విశేషం. జరిగింది ముమ్మాటికీ కుట్రేనని, దానివెనుక టీడీపీ వారున్నారని... అయితే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకగానీ ఈ విషయాన్ని నిర్థారించలేమని పోలీసులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా అలజడుల సృష్టికే.. రాష్ట్రంలో వరుసగా ఆలయాలలో ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ ఆ«దీనంలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అన్ని ఆలయాల్లో ఈ ఏర్పాటు ప్రక్రియ పూర్తికావొచి్చంది. 20 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో... శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్థం ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేకపోతే.. అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి కొండపైకి ప్రభుత్వం కొత్త విద్యుత్ లైన్లు వేసింది. ఒక్క రోజులో కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ దుర్ఘటన జరగటం గమనార్హం. ఈ ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్గా ఇప్పటిదాకా టీడీపీ నేత, మాజీ మంత్రి అశోక గజపతిరాజు కొనసాగుతుండగా... ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరాంనగర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయం కూడా దేవాదాయ శాఖ ఆదీనంలో లేని ఒక ప్రైవేట్ ఆలయం. ఇది టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ అజమాయిషీలో ఉండటం గమనార్హం. చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. -
‘విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు పాత్ర’
సాక్షి, విశాఖపట్నం : పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులు ఈ కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు కాగా విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయంపై దుండగుల దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అర్ధరాత్రి ఆలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. అనంతరం జై శ్రీరాం నినాదాల మధ్య శిరస్సును ఆలయానికి చేర్చారు. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
లండన్ నుంచి తిరిగొస్తున్న రాములోరు
లండన్ : 15వ శతాబ్ధం నాటి సీతారాముల వారి విగ్రహాలను లండన్ నుంచి తిరిగి తెప్పించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1978లో తమిళనాడులోని విజయనగర కాలంలో నిర్మించిన ఆలయం నాటి విగ్రహాలు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఇవి ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2019 ఆగస్టులో లండన్లోని భారత హైకమిషన్ ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అంతేకాకుండా దొంగతనానికి గురైన రామలక్షణులు, సీత, హనుమంతుని విగ్రహాలకు సంబంధించిన ఫోటో ఆర్కైవ్లను నిపుణుల మందుంచారు. ఇవి ప్రస్తుతం లండన్లో ఉన్నవేనని దృవీకరిస్తూ సమగ్ర నివేదికను పంపారు. (ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం: రాజ్నాథ్) భారత సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా ఉన్న ఈ విగ్రహాలను భారత్కు తిరిగి పంపాల్సిందిగా కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన యూకే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ విగ్రహాలను కొన్నవ్యక్తి ప్రస్తుతం జీవించిలేరు. అంతేకాకుండా వీటికి చట్టబద్దమైన ఆధారాలు ఏమీ లేనందున ఈ విగ్రహాలను తిరిగి భారత్కు అందించడానికి హైకమిషన్ సముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే వీటిని తమిళనాడుకు బదిలీచేయనున్నారు. గతంలోనూ రాణి-కి వావ్, బుద్ధుడి కాంస్య విగ్రహం, 17వ శతాబ్ధపు కృష్ణుడి విగ్రహం సహా పలు భారత సంపదను తిరిగి స్వదేశానికి చేర్చడంలో హెచ్సిఐ ముఖ్యపాత్ర పోషించింది. రాబోయే రోజుల్లో, ఎఎస్ఐ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, స్వతంత్ర దర్యప్తు సంస్థల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని హెచ్సిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. (చైనాపై దూకుడు కూడా సానుకూలాంశమే) -
శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టు ప్రభావం బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హైదరా బాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతూ సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే గురువారం కత్తి మహేశ్ శ్రీరాముడిపై ఫేస్బుక్లో అనుచిత పోస్టు పెట్టాడు. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా సుమోటో కేసు నమోదు చేసి మహేశ్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. మహేశ్పై గతంలో సైబర్ క్రైమ్ ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఈ కేసులో పీటీ వారెంట్పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. -
మేమే రాములోరి వారసులం..
అయోధ్యలో రామజన్మభూమి– బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాస్పద స్థల యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా శ్రీరాముడి వారసుల అంశం తెరపైకి వచ్చింది. శ్రీరాముడి వారసులెవరైనా ఇంకా అయోధ్యలో ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణలో భాగంగా ఇటీవల ప్రశ్నించడంతో రఘుకుల రాముడి వారసులం మేమేనంటూ కొన్ని రాజవంశాలు ప్రకటించాయి. ఆ వివరాలు.. కుశుడి వంశస్తులం: జైపూర్ యువరాణి దియా కుమారి రాముడి వారసులం తామేమని జైపూర్ యువరాణి, రాజ్ సమంద్ ఎంపీ దియా కుమారి ప్రకటించారు. తమ రాజవంశీకుల చరిత్రను సుప్రీంకోర్టు ఎదుట సాక్ష్యాధారాలతో సహా రుజువుచేసేందుకు సిద్ధమన్నారు. పదేళ్ళ క్రితం జైపూర్ మహారాణి దియా కుమారి తల్లి పద్మినీదేవి కూడా తాము రాముడి వారసులమని ప్రకటించిన విషయం గమనార్హం. జైపూర్ రాజు, తన భర్త భవానీ సింగ్ కుశుడికి 309వ వంశీకుడని ఆ రోజు ఆమె ప్రకటించారు. మాది లవుడి వంశం: సతేంద్రరాఘవ్ ‘రాముడికి నిజమైన వారసులం మేమే’ అని రాజస్తాన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యేంద్ర రాఘవ్ చెప్పారు. అందుకు వాల్మీకి రామాయణం లో కూడా సాక్ష్యాలున్నాయన్నారు. తాము రాము డి కుమారుడైన లవుడి తరువాత మూడవ తరానికి చెందిన బద్గుజార్ గోత్రస్తులమన్నారు. ‘బద్గుజార్ వంశం రాముడి పెద్ద కుమారుడు లవుడి వంశం. ప్రస్తు త అయోధ్యలోని నార్త్ కౌశల్ నుంచి ఛత్తీస్గఢ్లోని సౌత్ కౌశల్ వరకు లవుడి సామ్రాజ్యం విస్తరించి ఉందని వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తోంద’న్నారు. మాదీ శ్రీరాముని వంశమే: మేవార్ రాజకుటుంబం శ్రీరాముడి వంశమైన ఇక్ష్వాక వంశం వారసులం తామని మేవార్ రాజకుటుంబీకులు చెబుతున్నారు. ‘ మేము రాముని వారసులం అనేది చరిత్ర చెప్పే సత్యం. అయితే, మేం రామజన్మభూమిపై హక్కులు కోరబోం. అక్కడ రామాలయం నిర్మించాలన్నదే మా అభిమతం’ అని అరవింద్ సింగ్ మేవార్ ట్వీట్ చేశారు. సూర్యవంశీ రాజ్పుత్లు కూడా.. ‘సూర్యవంశీ రాజ్పుత్లమైన మేం కూడా శ్రీరాముడి వంశస్తులమే. ఇది సత్యం. మా వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కోర్టు కోరితే ఇస్తాం’ అని రాజస్తాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్సింగ్ కచరియావాలా స్పష్టం చేశారు. -
మానవుడిగా పుట్టి... మహనీయుడై
రాముడు పట్టాభిషిక్తుడై, లక్ష్మణ భరత శత్రుఘ్నుల అండదండలతో రాజ్యాన్ని చక్కదిద్ది, ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తూండగా, ప్రజలు అన్నివిధాలా ఆనందిస్తున్నారు. ఒకరోజున విశ్వామిత్రుడు రాముడి కొలువుకు వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక శకుంతుడు అనే రాజు తనను అవమానించాడనీ, కనుక అతనిని తక్షణం వధించవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పటికప్పుడే రాముడు గురువు ఆనతిని తలదాల్చి శకుంతుణ్ణి వధించడానికి బయలు దేరాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి శకుంతుడికి శరణు ఇచ్చింది. హనుమంతుడు తల్లి మాట నిలపడానికి, రామబాణానికి ఎదురొడ్డి రామనామం జపిస్తూ కన్నులు మూసి నిలబడ్డాడు. రాముడు విడిచిన బాణం హనుమంతుడి హృదయంలో లీనమైంది. ఇది చూసిన విశ్వామిత్రుడు దురాగ్రహం విడిచి శకుంతుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళాడు. అలా చాలాకాలం రాజ్యం చేశాక, యమధర్మ రాజు బ్రాహ్మణవేషంతో వచ్చి, అత్యవసరంగా ఒక దేవరహస్యం చెప్పవలసి ఉందనీ, లక్ష్మణుడిని ద్వారం దగ్గిర కావలి ఉంచమనీ, ఎవరినైనా రానిస్తే లక్ష్మణుడు మరణదండన పొందాలనీ, రాముడితో చెప్పి ఒప్పించాడు. లక్ష్మణుడు ద్వారపాలన చేస్తున్నాడు. యముడు నిజరూపంతో కనిపించి రాముడితో ఆయన అవతరించిన పని తీరిందనీ, ఇక వైకుంఠానికి చేరవలసిందనీ చెప్పాడు. అదే సమయంలో దుర్వాసుడు వచ్చి తక్షణం రాముడిని చూడటానికి వెళ్ళనివ్వకపోతే రఘువంశాన్ని శపిస్తానన్నాడు. దుర్వాసుణ్ణి లోనికి వెళ్ళనిచ్చి, లక్ష్మణుడు అలాగే వెళ్లి సరయూనదిలో మునిగిపోయాడు. రాముడు లవకుశులను పట్టాభిషిక్తుల్ని చేసి రాజ్యపాలన చేయించాడు. అది శ్రావణమాసం. సరయూనది నిండుగా ఉరకలెత్తి ప్రవహిస్తూన్నది. ఆనాడు పూర్ణిమ. చంద్రగ్రహణ పర్వదినం. మంగళ తూర్యనాదాలు మోగుతూండగా, భరతశత్రుఘ్నులు ఇరువైపులా అంటిపెట్టుకొని నడుస్తూండగా, రాముడు సరయూనదికి బయలుదేరాడు. అశేష ప్రజానీకం అనుసరించారు. రాముడు నదీజలాల్లో ప్రవేశించాడు. వెనుకనే తమ్ముళ్ళు దిగారు. అప్పుడే గ్రహణం విడిపోయి, నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆకాశం నుండి జలజలా అఖండంగా పూలవాన కురిసింది. వీణాధ్వనులు, దేవదుందుభులతో దిక్కులు మారుమోగుతున్నాయి. అంతటా వెన్నెల మరింత తెల్లగా వెల్లి విరుస్తున్నది, సరయూనది ఉవ్వెత్తు కెరటాలతో వడివడిగా సాగుతోంది. అంతకుముందే క్షీరసాగరంలో లక్ష్మణుడు శేషతల్పంగా, సీత లక్ష్మిగా అమరి ఎదురు చూస్తున్నారు. భరత శత్రుఘ్నులు శంఖచక్రాలు కాగా రామావతారం చాలించి, విష్ణువు లక్ష్మి పాదాలొత్తుతుండగా శేషతల్పాన్ని అలంకరించాడు. లోకకల్యాణం కోసం మానవుడిగా పుట్టి పితృవాక్యపాలనకై వనవాసం చేసి, కార్యసాధకుడై వానరులను కూడగట్టుకొని సముద్రానికి వారధిని కట్టి, లంకను చేరి అజేయుడనని విరవ్రీగిన రావణుడి రాక్షసపాలన అంత మొందించి సీతను తెచ్చి, ఏకపత్నీ వ్రతుడై ఆదర్శపాలన చేసిన రామావతార పరిసమాప్తి అలా జరిగింది. – డి.వి.ఆర్. భాస్కర్ -
అయోధ్యలో నేడు శ్రీరాముడి విగ్రహావిష్కరణ
లక్నో : అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. అయోధ్యలోని శోధ్ సంస్ధాన్ మ్యూజియంలో రోజ్వుడ్తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి రూ 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. రాముడి ఐదు అవతారాల్లో ఒకటైన కోదండరాముని అవతారంలో ఈ విగ్రహం రూపొందింది. మ్యూజియంలో రాముడి గురించిన పలు చారిత్రక ఘట్టాలతో 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. కోదండరామ విగ్రహాన్ని కర్ణాటక స్టేట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎంపోరియం నుంచి కొనుగోలు చేశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో శుక్రవారం మధ్యహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. -
కొండంత కోదండరాముడు
కర్ణాటక, హొసూరు: బెంగళూరు సమీపంలోని విజిపురంలో ప్రతిష్టించేందుకు 64 అడుగుల ఎత్తైన ఏకశిలా విశ్వరూప కోదండరామస్వామి విగ్రహాన్ని భారీ వాహనంలో తరలిస్తుండగా, దారిపొడుగునా భక్తులు హారతులెత్తుతున్నారు. విజిపురంలో ప్రతిష్టించే ఈ విగ్రహానికి తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని కెరకోటకొండపై భారీ ఏకశిలను విగ్రహంగా తొలచి తరలిస్తున్నారు. గత డిసెంబర్ 7వ తేదీ ఏకశిలా విగ్రహాన్ని 240 టైర్లుగల కార్గో ట్రైలర్పై ఉంచి తీసుకొస్తున్నారు. 64 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 300 టన్నుల బరువున్న ఏకశిలను చాలా నెమ్మదిగా తరలిస్తున్నారు. ప్రమాదం వల్ల విగ్రహం ఏమాత్రం దెబ్బతిన్నా ప్రతిష్టించడానికి ఇక పనికిరాదు. విగ్రహంపై ఎండ వర్షం వంటివి పడకుండా పూర్తిగా టార్పాలిన్తో కప్పి ఉంచడం వల్ల దర్శనభాగ్యం దొరకడం లేదు. తరలింపులో ఎన్నో ఇబ్బందులు తిరువణ్ణామలై రోడ్లపై ఇంత బరువు గల ట్రక్కులను తీసుకురావడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య, ఇరుకైన రోడ్లు, టైర్లు పేలిపోవడం వంటి సంఘటనలతో కోదండరాముడు నెమ్మదిగా జిల్లా కేంద్రం క్రిష్ణగిరికి చేరుకొన్నాడు. ఏకశిలలో ఒదిగిన కోదండరామస్వామిని చూసేందుకు దారిపొడుగునా భక్తులు, మహిళలు బారులుతీరి హారతులు పడుతున్నారు. పూలు చల్లుతూ పూజలు నిర్వహించారు. నెలరోజులుగా ఇంజనీర్ల సాయంతో ఏకశిలా విగ్రహాన్ని విజీపురానికి తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లోపు సూళగిరికి చేరుకోనున్నట్లు తెలిపారు. -
కత్తి మహేష్ శ్లోకం.. పరిపూర్ణానంద కామెంట్స్!
సాక్షి, విజయవాడ : కత్తి మహేష్ పాడిన శ్రీరామనామంపై శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శ్రీరాముడిపై కత్తి మహేష్, తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడ్డానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వామిజీకి అధికారులు స్వాగతం పలికారు. అంతేకాక స్వామిజీ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామనామంను కీర్తించడం ద్వారా కత్తి మహేష్లో పరివర్తన ఏర్పడుతోందని చెప్పారు. ఇటీవల కత్తి మహేష్ రామనామంను పలికిన విషయం విదితమే. అతి త్వరలోనే రామనామం గొప్పతనాన్ని కత్తి మహేష్ గుర్తిస్తారని స్వామిజీ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. మత ధర్మాలను హాయిగా ఆచరించే చట్టాలు తేవాలని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులు కత్తి మహేష్, పరిపూర్ణానంద స్వామిలను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. -
శ్రీ రాముడి పాట పాడిన కత్తి మహేష్
-
అమోఘం: కత్తి మహేష్ నోట శ్రీరాముడి శ్లోకం!
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేయడంతో కత్తిపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్లిపోయారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్లో అడుగుపెట్టడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కత్తి దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రీరాముడిని దూషించిన నోటితోటే ఆయనను పొగుడుతూ శ్లోకాలతో కూడిన ఓ పాటను కత్తి మహేష్ పాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కత్తి మహేష్ రాముడి పాటను స్పష్టంగా పాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆయన నోటి వెంట రాముని పాట తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. పశ్చత్తాపంతో రాముడిని స్మరించుకున్నాడా..? లేదంటే శ్రీ రాముడికి తాను వ్యతిరేకిని కాదని చెప్పడానికి పాడాడా..? భయంతో పాడుతున్నాడా.? భక్తితో పాడుతున్నాడా.? లేక వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది అర్థం కావడంలేదని నెటిజన్లు అంటున్నారు. -
బయటకొచ్చిన ‘కత్తి’.. రాముడిపై మళ్లీ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ బయటికొచ్చారు. గత రాత్రి(సోమవారం) బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి విచారణ కోసం స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పటంతో.. వివరణ కోరుతూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారని, దర్యాప్తుకు సహకరించమని కోరారని కత్తి మహేష్ తెలిపారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలి అంటూ ఫేస్బుక్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. అయితే అంతటితో ఆగకుండా మరో పోస్టుతో ఆయన దుమారం రేపారు. ‘శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన రామాయంలోని యుద్ధకాండలోని కొంత భాగాన్ని’ ఆయన పోస్ట్ చేశారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని తన వ్యాఖ్యలను మహేష్ సమర్థించుకుంటున్న విషయం తెలిసిందే. (ఇంతకీ కత్తి ఏమన్నాడంటే...) -
కత్తికి శ్రీరెడ్డి చురకలు
ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. శ్రీరాముడిని దూషించాడని మహేష్పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ‘జై శ్రీరామ్.. దేవుడ్ని దూషించటం మంచిది కాదు. మా హిందూ ధర్మాన్ని హేళన చేయకండి’ అంటూ ఫేస్బుక్లో పరోక్షంగా కత్తిని ఉద్దేశించి ఆమె ఓ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హిందూ సంఘాలు వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేశాయి కూడా. -
వైరలవుతున్న పెళ్లి పత్రిక....
యూపీ, ఫజియాబాద్ : భారతఖండం...‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ ప్రదర్శిస్తుంది. అనాదిగా ఈ భరతభూమిలో మతసామరస్యం వెల్లివిరుస్తుంది. ఇక్కడ హిందూ, ముస్లింలు భాయ్..భాయ్. ఇందుకు నిదర్శంగా ఓ అరుదైన సంఘటన వెలుగు చూసింది. ఓ ముస్లిం సొదరుడు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో సీతారాముల చిత్రాన్ని ముద్రించి మరోమారు హిందూ, ముస్లింలు అన్నదమ్ములనే భావాన్ని ప్రచారం చేశాడు. వివారాల్లోకి వెళ్తే యూపీ ఫజియాబాద్లోని సుల్తాన్పూర్ జిల్లా బాగ్సరాయ్ గ్రామానికి చెందిన మహ్మద్ సలీమ్ కుమార్తె జహన బానోకు వివాహం నిశ్చయమైంది. భారతీయ మతసామరస్యానికి ప్రతీకగా తన కూతురు వివాహ వేడుక జరగాలని సలీమ్ భావించాడు. అందుకే పెళ్లి పత్రికను హిందూ సంప్రదాయం ప్రకారం ముద్రించాడు. ఈ పత్రికలో సీతారాములు పవిత్ర అగ్నిహోమం ముందు నిలబడి ఉన్న ఫోటోను ముద్రించారు. అంతేకాకుండా పూజ సామాగ్రి అయిన కలశం, దీపాలు, అరటి ఆకులతోపాటు పవిత్ర మంగళసూత్రం, కొబ్బరికాయ, పూలు, పండ్లు వంటి అంశాలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. అంతేకాక ఈ ఆహ్వాన పత్రిక చేతితో రాసి ఉన్నట్లు ఉండటం మరో విశేషం. సలీమ్ ఈ పత్రికను తన హిందూ స్నేహితులకు ఇచ్చినప్పుడు వారు చాలా ఆశ్చర్యపోయారని తెలిపాడు సలీమ్. అలానే తన ముసల్మాను బంధువులకు ఇచ్చినప్పుడు వారు ఆనందంగా దీన్ని స్వీకరించడమే కాక తన ప్రయత్నాన్ని అభినందించారని తెలిపాడు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని సలీమ్ను అడగ్గా ‘హిందూ, ముస్లింల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించాలనుకున్నాను, అందుకే నా కుమార్తె పెళ్లి పత్రికను హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రూపొందించాను. హిందూ సోదరుల మత విశ్వాసాలను, వారు కొలిచే దేవతామూర్తులను గౌరవిస్తే వారు కూడా మనస్పూర్తిగా ముస్లిం మతాన్ని గౌరవిస్తారని’ తెలిపాడు. సలీమ్ పక్కంటి వ్యక్తి రాధే శ్యామ్ ‘సలీం తన కూతురు వివాహ ఆహ్వాన పత్రికలో సీతారాముల బొమ్మను ముద్రించి హిందూ మతం పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేసాడు. అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అతడు చేసిన పనిని ఏ ఒక్క ముసల్మాను కూడా వ్యతిరికించలేదు. ఇది నిజంగా అభినందనీయం’ అన్నారు. -
సహజ లక్షణాలు
ఒక వ్యక్తి సుగుణాలతో శోభిల్లితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలుంటాయనడానికి రాముడే ఉదాహరణ. మహిమలు, మహత్యాలు చూపలేదు. కేవలం మానవమాత్రుడిగా మనలో ఒకడిగా కార్య నిర్వహణ చేశాడు. మనిషిగానే సాధించాడు. రాజ వంశంలో జన్మించిన రాముడికి, అవతలి వారు తనను పలకరించే వరకు వేచి చూడక తానే చిరునవ్వుతో పలకరించేవాడట. నవ్వు మనసులను, మనుషులను దగ్గర చేస్తుంది. కాగల కార్యం నెరవేరుస్తుంది. ఇప్పటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పేదదే! రాముడికి తండ్రి మాట వేదం. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటలను శిరసా వహిస్తే, అవే అందరకు ఆశీర్వచనాలు. రాముడిలోని మరో లక్షణం స్థిరచిత్తం. తన తండ్రి మాట నెరవేర్చడంలోనూ, ‘రాజ్యపాలనకు అంగీకరించమ’న్న భరతుని అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించడంలోనూ, సీతాపరిత్యాగంలోనూ, ఏకపత్నీవ్రతంలోనూ, సుగ్రీవునకు మాటిచ్చి వాలిని హతమార్చడంలోనూ, రావణుడిని యుద్ధంలో సంహరించి సీతను తిరిగి తెచ్చుకోవడమనే సందర్భాల్లోనూ రాముని స్థిరచిత్తం స్పష్టంగా గోచరమవుతుంది. మనసు ఊయలలా ఊగులాడకుండా, అంకితభావంతో అనుకున్నది నెరవేర్చుకోవడమే లక్ష్యసాధన. దానికి త్రేతాయుగ కాలంలోనే అంకురార్పణ జరిగింది. హనుమంతుడు రాముని గుణగణాలను సీతకు వర్ణించి చెబుతూ ‘తన నడవడికను తనే సమీక్షించుకునేవాడు’ అని చెబుతాడు. అంటే తనలోని లోటుపాట్లను తెలుసుకుని చక్కదిద్దుకునే గొప్ప వ్యక్తిత్వం గలవాడు రాముడు. మన లోపాలు మనకు తెలిసుండి కూడా అహంకారంతో సంస్కరించుకోకుండా ఉండే వాళ్లకు ఆయన వ్యక్తిత్వం ఓ పాఠం. అదేవిధంగా ఎంత అవసరమో అంతే మాట్లాడడం, ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్రియంగా మాట్లాడకపోవడం, శత్రుశిబిరం నుంచి వచ్చినా (విభీషణుడు) నమ్మి ఆదరించడం, సముద్రుడి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ఎక్కుబెట్టినా, కోపం తగ్గాక మరోవైపు ప్రయోగించడం, తనకు అన్యాయం చేసినా.. కైకను ఒక్క పరుషపు మాట అనకుండా గౌరవించడం ఇవన్నీ రామచంద్రుడి సహజాభరణాలు. భ్రాతృప్రేమను రుచి చూపి లక్ష్మణుని సహవాసిగా చేసుకున్నాడు. గుణ సంపదతో హనుమను ఆకట్టుకుని సేవకుడిని చేసుకున్నాడు. అందుకే ఆయనకు దేవుడని పట్టంగట్టి వదిలెయ్యకుండా మనలో ఒకడిగా చూసుకుంటున్నాం. శ్రీరాముడి గుణసంపదలోంచి మనం కొన్ని గుణాలు అలవర్చుకున్నా, వ్యక్తిత్వ శోభతో సమాజంలో వెలుగొందుతాం. ఇదే శ్రీరాముడు చూపిన మార్గం. -
ఎప్పుడు... ఎలా మాట్లాడాలి ?
ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని ఉద్దేశించే కాబోలు, ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత పుట్టి ఉండవచ్చు. ఉదాహరణకు... రామాయణంలో సుగ్రీవుడి సచివుడిగా మొట్టమొదటిసారి హనుమ రాముడిని కలిశాడు. నాలుగు మాటలు మాట్లాడాడు. వెంటనే రాముడు లక్ష్మణుడితో – ‘‘చూశావా? ఇతను నవ వ్యాకరణ పండితుడు. శాస్త్రాలన్నీ చదివినవాడు. మాటలో తడబాటులేదు. అస్పష్టత లేదు. అసందిగ్ధం లేదు. కొట్టినట్లు లేదు. మృదువుగా, ప్రియంగా ఉంది. ఎంత మాట్లాడాలో అంతే, అర్థవంతంగా, మనసుకు హత్తుకునేలా మాట్లాడుతున్నాడు’’ అని మెచ్చుకున్నాడు. అంటే హనుమ మాటలకే రాముడు మంత్రముగ్ధుడయ్యాడన్నమాట. మరో సందర్భంలో హనుమ మాటలు సీతమ్మకు ఉపశమనంలా అనిపించాయి. అంతులేని నిర్వేదంలో ఉన్న సీతమ్మ, హనుమ మాటలకు దుఃఖం నుంచి తేరుకుంది. అదెప్పుడో చూద్దామా..? అప్పటికి పదినెలలుగా సీతమ్మ కంటికి మంటికి ఏకధారగా విలపిస్తోంది. హనుమ అశోక వనం చేరి – ఆమె సీతమ్మేనని నిర్ధారించుకున్నాడు. ఆమె కూర్చున్న చెట్టుకొమ్మ మీద అంతా గమనిస్తూ ఉన్నాడు. ఈ లోపు తెల్లవారకముందే రావణాసురుడు మందీమార్బలంతో బయలుదేరాడు. రాముడు ఉన్నాడో లేడో, ఉన్నా రాలేడు. ఇక రెండు నెలలు గడువిస్తా. అయినా మనసు మారకపోతే, గడువు తరువాత రోజు ఉదయం ఫలహారంగా సీతను తింటానని – హుంకరించి వెళ్ళిపోయాడు. రావణుడి మాటలతో రాక్షసులు మరింతగా సీతమ్మను ఏడిపించారు. సీతమ్మకు అంతులేని వేదన. తనను తాను చంపుకుందామన్నా తగిన వస్తువు అందుబాటులో లేదు. తన జడనే చెట్టుకొమ్మకు బిగించి, ఆపై మెడకు బిగించుకుందామని సిద్ధం కాబోతోంది. ఇంతలో హనుమ మెరుపులా స్పందించాడు. హనుమంతుడు... రామకథను, గంధర్వగానంగా, మృదువుగా అమ్మకు చైతన్యం కలిగేలా, రాక్షసులకు నిద్రవచ్చేలా, మైథిలీ ప్రాకృత భాషలో, అది కూడా అయోధ్యా మాండలికంలో ప్రారంభించాడు. అమృతపు జల్లువంటి ఆ మాటలతోనే సీతమ్మ ఎంతో సాంత్వన పొందింది. ఆ తర్వాత హనుమ తనకోసం ఎదురు చూస్తున్న వానరులతో, రామలక్ష్మణులతోనూ ‘‘చూశాను సీతను’’ అని చెప్పాడు. అంటే సూటిగా స్పష్టంగా చెప్ప వారికి ఉపశమనం కలిగించాడు. -
మోదీ రూట్లో యూపీ సీఎం కూడా...
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ రాముడి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేయబోతున్నారు. సరయు నది ఒడ్డున ‘నవ్య అయోధ్య’లో భాగంగా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు గవర్నర్ రామ్ నాయక్కు పర్యాటక శాఖ ఓ ప్రతిపాదన పంపగా.. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ అవానిశ్ కుమార్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారంట. సుమారు 100 మీటర్లు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. ఎత్తు విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అది ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు పొందాక సరయుఘాట్ లో రాముడి విగ్రహ నిర్మాణ పనులు మొదలవుతాయని చెబుతున్నారు. అధికారికంగా ఎంత ఖర్చవుతుందో వెల్లడించలేదు. ఇదే సమావేశంలో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించబోయే వేడుకల గురించి కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు. లక్ష దీపోత్సవంతోపాటు అయోధ్య వరకు శోభ యాత్ర నిర్వహించేందుకు ఆదిత్యానాథ్ సర్కార్ సిద్ధమౌతోంది. దేశ ఐక్యతకు చిహ్నంగా మోదీ పేర్కొంటూ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా నదీ తీరంలో నెలకొల్పబోతున్న విషయం తెలిసిందే. 182 మీటర్ల(597 అడుగులు) ఎత్తుతో 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2500 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదన్న మాట. ఈ విగ్రహం నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. -
రాముడిగా రామ్ చరణ్..?
బాహుబలి ఇచ్చిన ఇన్సిపిరేషన్తో చాలా మంది నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లోనూ భారీ చిత్రాలకు సంబంధించిన ఎనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. మెగా నిర్మాత అల్లు అరవింద్ 500 కోట్ల బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటించనున్నారు. అయితే రాముడిగా ఎవరు నటించనున్నారని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. మెగా అభిమానులు మరో అడుగు ముందుకేసి రామ్ చరణ్ రాముడిగా నటిస్తాడనిచెపుతున్నారు. అంతేకాదు. సిక్స్ ప్యాక్ రాముడిగా రామ్ చరణ్ పోస్టర్ను కూడా డిజైన్ చేసి సోషల్ మీడియాలో సర్య్కూలేట్ చేస్తున్నారు. అఫీషియల్ కాకపోయినా.. అభిమానులు భారీ ప్రాజెక్ట్లో తమ అభిమాన నటుణ్ని చూసుకొని మురిపోతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న మెగా రామాయణం ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
రాముడా? రామ నామమా?
రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యానగరానికి విచ్చేసిన రాముడు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజూ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు సామాన్యప్రజానీకంతో సహా పెద్దలు, మునులు విచ్చేసి ధార్మిక విషయాల మీద చర్చలు చేయడం నిత్యకృత్యం. ఓ రోజు అలాగే సభ జరుగుతోంది. ఆ సభకు నారద, వశిష్ట, విశ్వామిత్రులు కూడా విచ్చేశారు. ముందుగా నారద మహర్షి సభలో ఒక సందేహం లాంటి ప్రశ్నను సంధించాడు. భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి నామం గొప్పదా అన్నదే ఆ సందేహం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం అందరూ మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నో తర్జన భర్జనలు చేశారు. ఆఖరికి వశిష్ట విశ్వామిత్రులకు కూడా సరైన సమాధానం ఇదీ అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పడం సాధ్యం కాలేదు. దాంతో అందరూ కలసి నారదుణ్ణే అడిగారు, ‘ఆ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి మహర్షీ!’ అని. ‘రాముని కన్నా, రామనామమే గొప్పది. ఇందులో సందేహించవలసిన పనిలేదు’ అని చెప్పాడు నారదుడు. కావాలంటే నిరూపిస్తాను’ అంటూ హనుమను పిలిచి, ‘‘హనుమా! సభానంతరం నువ్వు ఒక్క విశ్వామిత్రుడికి తప్ప సభలోని అందరికీ నమస్కారం చేయి’’ అని చెవిలో చెప్పాడు. సరేనన్నాడు హనుమ. సభముగిశాక నారదుడు చెప్పినట్లుగానే హనుమ సభలోని పెద్దలందరికీ భక్తి గౌరవాలతో వినయంగా నమస్కరించాడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయనకు నమస్కరించ కుండానే వెనుదిరిగాడు. కాసేపయ్యాక నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘చూశావా విశ్వామిత్రా, ఆ హనుమకు ఎంత పొగరో! అందరికీ నమస్కరించి, నిన్ను మాత్రం విస్మరించాడు’‘ అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా. విశ్వామిత్రుడు కోపంతో మండిపడ్డాడు. రాముడి వద్దకెళ్లి, ‘‘రామా! మదాంధుడైన ఆ హనుమను రేపు సూర్యాస్తమయంలోగా సంహరించు! ఇది నా ఆజ్ఞ’’ అన్నాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు రాముడు. ఎంతటి విపత్కర పరిస్థితి! నాకు ఎంతో ఇష్టుడైన హనుమను నా చేతులతో నేను చంపుకోవడమా!? అదీ నిష్కారణంగా! చంపనంటే గురువాజ్ఞ మీరినట్లవుతుంది. ఇప్పుడేమిటి దారి?’ అంటూ తలపట్టుకు కూర్చున్నాడు. ఈలోగా హనుమను రాముడు చంపబోతున్నాడనే వార్త క్షణాలలో రాజ్యమంతా వ్యాపించింది. ఈ వింత సంఘటన గురించి ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకోసాగారు. హనుమ వెంటనే నారదుడి వద్దకెళ్లాడు. ‘‘మహర్షీ మీ మాట వినే కదా, నేను ఈ పని చేశాను. దానికి ఇంతటి దారుణమైన శిక్షా?’’అని వాపోయాడు. అందుకు నారదుడు ‘‘నీకేం భయం లేదు హనుమా! నేనున్నాను కదా, నువ్వు ఒక పని చెయ్యి, సూర్యోదయానికన్నా ముందే సరయూనదిలో స్నానం చేసి, ‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించకు’’ అని చెప్పాడు.నారదుడు చెప్పిన విధంగానే హనుమ తెల్లారేలోగా సరయూనదిలో స్నానం చేసి, భక్తిశ్రద్ధలతో నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు. తెల్లవారగానే ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా సరయూనది ఒడ్డుకు చేరుకోసాగారు. రాముడు ఒకసారి తన ప్రేమపూర్వక నయనాలతో తనకెంతో ఆప్తుడు, నమ్మిన బంటు, సఖుడు అయిన హనుమను చూస్తూ, నదిలో నడుము లోతు నీటిలో నిలిచి, రామమంత్రాన్ని తదేక దీక్షతో పఠిస్తున్న హనుమపై బాణాన్ని వదిలాడు. ఆశ్చర్యం! ఆ బాణ ం హనుమను ఏమీ చెయ్యలేకపోయింది. అలా సంధ్యా సమయం వరకు నిర్విరామంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు రాముడు. ఆ బాణాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలిపోతున్నాయి కానీ, హనుమకు మాత్రం కించిత్తు కూడా హాని కలగడంలేదు. ఇలా లాభం లేదనుకుని చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు రాముడు. దాంతో ప్రకృతి మొత్తం కంపించిపోసాగింది. ప్రజలంతా హాహాకారాలు చేయసాగారు. ఇంతలో నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘మహర్షీ! చూశారా, రామ నామ మహిమ ఎంత గొప్పదో! ఆ మహిమకు రాముడు కూడా తలవంచక తప్పడం లేదు. బ్రహ్మాస్త్రం గనక నిర్వీర్యం అయిపోయిందంటే ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి. అన్నింటికీ మించి అది నీకూ, నీ శిష్యుడికీ కూడా ఎంతో అవమానకరం. హనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది చెప్పు. నీవే ఇక ఈ అస్త్రప్రయోగం చాలించమని నీ శిష్యుడికి చెప్పు’’ అని సలహా ఇచ్చాడు. విశ్వామిత్రుడు ‘‘ఇక ఆపు రామా!’’ అనడంతో రాముడు ధనుర్బాణాలు కిందపడవేసి, హనుమను ప్రేమతో కౌగలించుకున్నాడు. -
రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి శుక్రవారపు అభిషేకం.. రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీతాయారమ్మ వారికి వైభవంగా అభిషేకం చేశారు. పవిత్ర గోదావరి నది జలాలు, పండ్ల రసాలు, హరిద్రా చూర్ణాలు, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. -
రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ గావించి, స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు తెలియజేశారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం స్వామివారికి అత్యంత వైభవోపేతంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. వినాయక నిమజ్జనం చివరి రోజు సందర్భంగా రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకం.. రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీతాయారమ్మ వారికి శుక్రవారం అభిషేకం చేశారు. ఉదయం పవిత్ర గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, హరిద్రా చూర్ణాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. -
రామయ్యకు నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి బుధవారం ఘనంగా నిత్యకల్యాణం చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్ధ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపానికి తీసుకుని వచ్చి ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనంపై వేంచేయింపజేశారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు వివరించారు. వేద పండితులు స్వామి వారికి వేద విన్నపాలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు తెలియజేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం అత్యంత వైభవోపేతంగా రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?
రామాయణంలో మనం ఇంతవరకు పెద్దగా వినని అంశాలను కూడా నాయకులు గుర్తుచేస్తున్నారు. లంకలో రామరావణ యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు రావణాసురుడి చేతులు, కాళ్లు నరికేశాడని, రథం విరగ్గొట్టేశాడని.. కానీ ఆ తర్వాత కాళ్లు మాత్రం మళ్లీ రప్పించాడని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి అన్నారు. తన కోటలోకి తిరిగి వెళ్లిపోడానికి వీలుగా అలా ఎందుకు చేశాడు అంటూ ట్విట్టర్ జనాలకు ఆయన ఓ ప్రశ్న సంధించారు. సాధారణంగా ఇంతకాలం తెలిసినదాని ప్రకారం, రావణాసురుడి కడుపులో ఉన్న అమృతభాండాన్ని ఛేదించిన తర్వాత రావణవధ జరిగిందంటారు. ఆ రహస్యాన్ని కూడా విభీషణుడు రాముడి చెవిలో వేసిన తర్వాతే రావణాసురుడు నేలకొరిగాడని చెబుతారు. కానీ సుబ్రమణ్యం స్వామి మాత్రం సరికొత్త అంశాలను చెబుతున్నారు. PTs may remember Bhagwan Ram in the Lanka war chopped Ravan's arms, legs and chariot but restored his limbs to walk back to his palace. Why? — Subramanian Swamy (@Swamy39) 22 June 2016 -
పుట్టినరోజు.. వివాదాస్పద పోస్టర్ రిలీజ్..!
గోరఖ్ పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం మరోసారి వివాదాస్పద పోస్టర్ విడుదల చేసింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను రాముడిగా చూపిస్తూ, ఇతర పార్టీల నేతలను రావణుడి తలలుగా ప్రదర్శిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయనడంలో సందేహమే లేదు. బీజేపీ టౌన్ హాలులో కేక్ కట్ చేసి ఎంపీ పుట్టినరోజు నిర్వహించి, ఆ వెంటనే వివాదాస్పద పోస్టర్ ను విడుదల చేశారు. ఎంపీ యోగి ఆదిత్య నాథ్ రాముడి రూపంలో ఉండగా, బీఎస్పీ, కాంగ్రెస్, ఆప్, ఏఐఎంఐఎం, జేడీయూ, ఎస్పీ పార్టీలను రావణుడిగా పేర్కొనేలా తలలపై పార్టీల పేర్లు ముద్రించారు. యూపీ బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ అహ్మద్ మాట్లాడుతూ.. నేడు ఎంపీ ఆదిత్య నాథ్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించాం, కేక్ కట్ చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ పరిస్థితి ఏంటన్నది గ్రహించాలని, వచ్చే ఎన్నకల్లో విజయం బీజేపీదేనని తెలియజేసేందుకు ఆయా పార్టీలను రావణుడితో పోల్చి చూపించామని పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీని గాడిదగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం ఒకటి గోడ పత్రికలు అంటించింది. ఒక్క రాహులే కాదు.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాయావతి, అసదుద్దీన్ ఓవైసీలు గాడిదలు తోలుతున్నారని పేర్కొంటూ.. బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్ ను పులితో పోలుస్తూ ఆయన పులిపై సవారీ చేసే వ్యక్తిగా అభివర్ణిస్తూ పోస్టర్ విడుదల చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. -
ఉడతాభక్తి
నానుడి రామాయణంలోని చిన్న ఉదంతం నుంచి పుట్టిన నానుడి ఇది. లంకలో ఉన్న సీతను తీసుకు రావడానికి రామలక్ష్మణులు సుగ్రీవుని అధీనంలోని వానరసైన్యంతో యుద్ధానికి బయలుదేరతారు. సముద్రానికి ఆవల ఉన్న లంకను చేరుకునే శక్తి వానర యోధుల్లో కొద్ది మందికి తప్ప అందరికీ లేదు. సుగ్రీవుడి సేనాని నీలుడికి సముద్రంపై ఎలాంటి పదార్థాన్నయినా తేలియాడేలా నిలిపే శక్తి ఉంది. లంక వరకు వారధి నిర్మించడానికి వానర యోధులు యథాశక్తి పెద్దపెద్ద బండరాళ్లను సముద్రంలో పడవేస్తుంటారు. అది చూసిన ఓ ఉడతకు రామునికి సాయం చేయాలనిపిస్తుంది. తన శక్తి మేరకు నోటితో చిన్న చిన్న మట్టిబెడ్డలను తీసుకొచ్చి సముద్రంలో పడవేయసాగింది. బృహత్తర కార్యక్రమానికి ఆ స్థాయిలో కాకున్నా, శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేసే తన వంతు సాయాన్ని ఉడతాభక్తి అనడం వాడుకగా మారింది. -
భద్రాద్రి రామయ్యకు.. ముస్లింల సన్నాయి సేవ
నిత్యం భద్రాద్రి రామయ్య వీరి నాదస్వరంతోనే మేల్కొంటాడు. వీరి తియ్యని ‘నాద’స్వరంతో రామాలయ ప్రాంగణం పరవశించిపోతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ముస్లింలు.. కౌసల్యా, సుప్రజా, రామ...అని వేకువజామున వినిపించే సుప్రభాత సేవ నుంచి రాత్రి నిర్వహించే పవళింపు సేవ వరకు వీరు రామయ్య సన్నిధిలోనే గడుపుతారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో దశాబ్దాల కాలంగా ఇద్దరు ముస్లింలు మంగళవాయిద్య బృందంలో నాదస్వరం (సన్నాయి), తాళం వాయించే కళాకారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నల్గొండ జిల్లా మటంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ మౌలాసాహెబ్ 2000 సంవత్సరం నుంచి భద్రాద్రి రామాలయంలో నాదస్వర కళాకారుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన తన తాతగారైన పల్నాడు నాదస్వర విద్వాంసులు హుస్సేన్ వద్ద నాదస్వర వాయిద్య నేర్చుకున్నాడు. మొదట్లో రామాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు మౌలాసాహెబ్ను పిలిపించేవారు. ఈ క్రమంలో 2000 సంవత్సరం నుంచి దేవస్థానం ఆస్థాన నాదస్వర కళాకారుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతని పెద్ద కుమారుడు బాషా కూడా భద్రాద్రి ఆలయంలోనే పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు హుస్సేన్ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం దీపారాధన చేసి రామయ్య సేవకు ఉపక్రమించటం మౌలాసాహెబ్కు నిత్యకత్యమైంది. దేవస్థానంలో జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటాడు. అయితే రంజాన్, బక్రీద్ పండగల సమయంలో మసీద్లకు వెళ్లి నమాజు చేస్తాడు. రామయ్య దయ వల్లే తన కుటుంబం సంతోషంగా ఉందని, జీవితాంతం రాములోరి సేవలోనే తరిస్తానని ఆనందంగా చెపుతున్నాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం గోసవీడుకు చెందిన షేక్ కాశిం బాబు కూడా సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన వారే. ఈయన తండ్రి హసన్ సాహెబ్ 1953 నుంచి భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాలలో నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. అయితే తన చిన్నప్పుడే సంగీతం నేర్చుకున్న కాశిం బాబు కూడా ఉత్సవాల సమయంలో రామయ్య సేవలో తరించేవాడు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడే మంగళవాయిద్య బృందంలో పనిచేస్తున్నాడు. ఈయన నాదస్వరంతో పాటు, తాళం వాయించటంలోనూ దిట్ట. కుల, మత భేదం లేదని, మనసు స్వచ్ఛంగా ఉంటే ఏ దేవుడైనా చల్లగా చూస్తాడని, తాము రామయ్య సన్నిధిలో హాయిగా బతుకుతున్నామని చెపుతున్నారు. -వి.శివకుమార్, భద్రాచలం రూరల్ -
రామభక్త హనుమాన్.. మన బాపు!
ప్రఖ్యాత కార్టూనిస్టు, చిత్రకారుడు, దర్శకుడు, రచయిత అయిన సత్తిరాజు లక్ష్మీనారాయణ.. అదే మన బాపు గారికి శ్రీరాముడన్నా, ఆంజనేయుడన్నా ఎక్కడలేని భక్తి ప్రపత్తులున్నాయి. ఈ విషయం పలు సందర్భాలలో తేటతెల్లం అయ్యింది. తాను గీసిన ఒకానొక పెయింటింగ్లో కూడా శ్రీరాముడు సీతమ్మ వారికి పర్ణశాలలో ఉన్నప్పుడు కుంచెతో పారాణి దిద్దుతున్నట్లు బాపు చూపించారు. అందులోనూ.. ఆంజనేయుడి వేషంలో తాను స్వయంగా ఉన్నట్లు చూపించుకుంటూ తానే స్వయంగా రంగులను శ్రీరాముడికి అందిస్తున్నట్లుగా అందులో చిత్రీకరించారు. 'ఆది చిత్రకారుడైన మా గురువుగారు' అంటూ.. శ్రీరాముడిని తన గురువుగాను, ఆది చిత్రకారుడి గాను ప్రస్తావించారు. ఇక తాను రాసిన 'రామాయణ విషవృక్షం' పుస్తకానికి కవర్ పేజీ బొమ్మ వేయాల్సిందిగా ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ బాపు గారిని కోరుతూ.. ముందస్తుగానే ఒక చెక్కు కూడా పంపించారట. అయితే, ఆ చెక్కు వెనకాల 'రామ.. రామ' అని రాసి బాపు గారు తిప్పి పంపారట. ఈ విషయాన్ని స్వయంగా రంగనాయకమ్మే చెప్పుకొన్నారు కూడా. ఇలా రామభక్తి విషయంలో బాపు ఎలాంటి తరుణంలోనూ వెనుకాడలేదు. -
శ్రీరాముడిలాగే... నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు
బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని శ్రీరాముడితో పోల్చారు. 'రామాయణ ఇతిహాసంలో అయోధ్య రాజుగా శ్రీరాముడి పట్టభిషేకాన్ని అడ్డుకునేందుకు మందర కుట్ర పన్నినట్టుగా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీపై అదే రీతిలో కుట్రపన్నుతోంది" అని రాజ్నాథ్ అన్నారు. ఆదివారమిక్కడ జరిగిన బహిరంగ ర్యాలీలో రాజ్నాథ్ ప్రసంగించారు. మందర కుట్రలు చివరకు ఫలించలేదని రాముడు రాజుయ్యాడని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ కూడా అదే విధంగా ప్రధాని అవుతారని రాజ్నాథ్ పేర్కొన్నారు. మోడీపై కుట్రలు పన్నేకొద్దీ ఆయన మరింత రాటుదేలుతున్నారని చెప్పారు.