
రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ గావించి, స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు తెలియజేశారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం స్వామివారికి అత్యంత వైభవోపేతంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. వినాయక నిమజ్జనం చివరి రోజు సందర్భంగా రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- అమ్మవారికి అభిషేకం..
రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీతాయారమ్మ వారికి శుక్రవారం అభిషేకం చేశారు. ఉదయం పవిత్ర గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, హరిద్రా చూర్ణాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.