
ఐటీ హబ్గా విశాఖపట్నం వడివడిగా అడుగులు వేస్తోంది. వైజాగ్లో బీచ్ ఐటీని ప్రమోట్ చేస్తూ దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచుకున్న ఆలోచనలకు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఫిదా అయ్యింది. విశాఖ నుంచి తమ సంస్థ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుమారు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని వివరించారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ)తో పాటు ఇన్ఫోసిస్, డబ్ల్యూఈఎఫ్ హెల్త్కేర్తో పాటు ఇన్ఫోసిస్, ఐబీఎం, హెచ్సీఎల్ మొదలైన ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. సముద్రం వ్యూ కనిపించేలా.. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేస్తే అద్భుత ఫలితాలు రాబట్టుకునేలా వైజాగ్ బీచ్–ఐటీ కాన్సెప్ట్ గురించి ఏపీ పెవిలియన్లో ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్లో తమ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
టైర్–2 సిటీల్లో వైజాగ్ ది బెస్ట్
ఇటీవల కాలంలో ఐటీ రంగంలోకి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి చాలా మంది రిక్రూట్ అయ్యారు. టాలెంట్ పూల్కి దగ్గరగా.. ప్రతిభను ఆకర్షించేలా టైర్–2 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీతో పాటు బీచ్ ఐటీని ప్రమోట్ చేయడంతో.. త్వరితగతిన వైజాగ్లో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో ఉన్న ద్వితీయ శ్రేణి నగరాల్లో అన్ని వసతులు, వనరులున్న విశాఖ ది బెస్ట్ సిటీగా ఉండటంతో.. ప్రముఖ సంస్థలు ఇటువైపుగా తమ కార్యకలాపాలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్నాయి.
చదవండి: (ఎంఎస్ఎంఈలతో భారీ ఉపాధి)
సెప్టెంబర్లోగా విస్తరణ
ఇన్ఫోసిస్ విశాఖలో కార్యాలయాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రారంభించాలని భావిస్తోంది. కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తే.. దాదాపు 1000 మందికి ఉద్యోగావకాశాలు కలిగే సూచనలున్నాయి. వైజాగ్ వంటి టైర్–2 నగరాలు భవిష్యత్లోను ప్రతిభకు కేంద్రాలుగా ఉంటాయని, అందుకే అక్కడ తాము పెట్టుబడులను కొనసాగిస్తున్నామని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఆలోచనలు చేస్తున్నామని సంస్థ హ్యూమన్ రిసోర్సస్ డెవలప్మెంట్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment