
సాక్షి, అమరావతి : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నార’’ని పేర్కొన్నారు. ( జనం గుండెల్లో రాజన్న సంక్షేమం )
అంతకు క్రితం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.