
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
– ఐదుగురిపై ఫిర్యాదు, కేసు నమోదు
కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్టప్ సర్కిల్ వద్ద పులివెందుల రోడ్డులో మద్యం దుకాణం వద్ద అత్యంత కిరాతకంగా సాదిక్ వలి(30) అనే వ్యక్తిని మరియాపురానికి చెందిన రాయప్ప అలియాస్ పెద్దోడు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజీలను సేకరించారు. హత్య చేసిన వారిలో రాయప్పతో పాటు, కాలియా, బాలస్వామి అలియాస్ బాలదాసులు, మరో ఇద్దరు ఉన్నట్లు సాదిక్వలీ భార్య యాస్మిన్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మహిళపై దాడి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మాలెపాడు గ్రామానికి చెందిన కుప్పన్నగారి సుబ్బమ్మపై భూమి సమస్య విషయమై కె.క్రిష్ణారెడ్డి అనే వ్యక్తి దాడి చేసి బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు బుధవారం తెలిపారు. సుబ్బమ్మ, క్రిష్ణారెడ్డిల మధ్య భూ విషయంపై సమస్య ఉంది. సుబ్బమ్మ భర్త ఉషిరెడ్డి చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. ఇంటిలో సుబ్బమ్మ ఒంటరిగా ఉంటోంది. అయితే భూ సమస్య విషయంపై సుబ్బమ్మ ఇంటిపై క్రిష్ణారెడ్డి దాడి చేసి బెదిరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాళ్లమాపురంలో
చోరీ యత్నం
– అడ్డు వచ్చిన యువతిపై దాడి చేసిన దుండగులు
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామంలో దుండగులు ఓ ఇంట్లో చోరీ యత్నం చేశారు. అయితే దుండగుల అ ్చటకిడిని గ్రహించి కుటుంబ సభ్యులు నిద్రలేవడంతో వారు పారిపోయారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లమాపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబ సభ్యులతో కలిసి అతను ప్రతిరోజు రాత్రి ఆరుబయట పడుకుంటాడు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటి ప్రహరీ దూకారు. అక్కడే ఉన్న కుక్క వారిని చూసి మొరగడంతో సుబ్బారెడ్డి కుమార్తె వెంకటలక్ష్మి నిద్ర లేచింది. దుండగులను చూసి ఆమె దొంగా దొంగా అంటూ గట్టిగా కేకలు వేసింది. దీంతో దుండగులు అక్కడే ఉన్న కట్టె తీసుకొని ఆమె తలపై కొట్టి పారిపోయారు. రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వెంకటలక్ష్మిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గాలివానకు కూలిన
విద్యుత్ స్తంభాలు
కురబలకోట : మండలంలో బుధవారం రాత్రి గాలి వానకు దొమ్మన్నబావి ప్రాంతంలో లెవన్ కేవీ లైన్కు చెందిన మూడు విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. వెంటనే విద్యుత్ సరఫరాను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పరిసర ప్రాంతాలతో పాటు నాయనబావి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంగళ్లులో కూడా విద్యుత్ వైర్లపై కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. హుటాహుటిన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్కో ఏఈ తెలిపారు.