సీ్త్రహరి.. ఆయనే మరి!
నాటక రంగానికి ఎందరో మహనీయులను అందించిన అద్దంకి గడ్డపై సీ్త్ర పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారాయన. ఏడు పదుల వయస్సులో కూడా అతివ పాత్రలకు ప్రాణం పోస్తున్నారు. చింతామణి నాటకంలోని శ్రీహరి పాత్రకు పేటెంటుగా.. అభినవ శ్రీహరిగా బిరుదు పొందారు నటుడు అద్దంకి నాగేశ్వరరావు.
అద్దంకి రూరల్: అద్దంకి నాగేశ్వరరావు చింతామణి నాటకంలో కీలక సీ్త్ర పాత్ర అయిన శ్రీహరిగా ఒదిగిపోయి జీవం పోశారు. హాస్య ప్రధానమైన సుబ్బిశెట్టి పాత్రకు దీటుగా చలోక్తులు, హావభావాలతో శ్రీహరి పాత్ర నాగేశ్వరరావే ధరించాలన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఆ పాత్రకు సంబంధించిన మేకప్, వస్త్రధారణ అంతా స్వయంగా ఆయన చూసుకుంటారు. స్టేజీపై ఒక్కసారి సీ్త్ర పాత్రలో నాగేశ్వరరావును చూసిన వారు.. మేకప్ తీసిన తర్వాతే ఆయన్ను గుర్తుపడతారంటే అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు అసలు సీ్త్రయా,పురుషుడేనా.. అని పందేలు కూడా కాసేవారంట! ‘సత్యహరిశ్చంద్ర’లో కేశవుడు, నక్షత్రకుడు, తిరుపతమ్మ మహత్యంలో వెంకమాంబ, శ్రీకృష్ణ రాయబారంలో ద్రోణుడు, రామాంజనేయ యుద్ధంలో సుగ్రీవుడు, విశ్వామిత్రుడు, సాయిబాబా మహత్యంలో సాయిబాబా వంటి ఎన్నో పాత్రలు ధరించారాయన. చింతామణి నాటకంలోని శ్రీహరి పాత్రలోనే 3 వేలకుపైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.
బాలనటుడిగా రంగ ప్రవేశం
చిన్నతనంలో తండ్రి ప్రోత్సాహంతో బండారు రామారావు చక్రం తిప్పిన హరిశ్చంద్ర నాటకంలో లోహితాసుడు పాత్ర ధరించి 8 సంవత్సరాలకే నాగేశ్వరరావు నాటక రంగ ప్రవేశం చేశారు. బండారు రామారావు స్వయంగా అభ్యాసం చేయించారు. తపనతో ఆయన కూడా మెలకువలు నేర్చుకున్నారు. నాటక రంగ ఉద్దండులుగా పేరుగాంచిన పుట్టంరాజు శంకరరావు, బండారు రామారావు, అద్దంకి మాణిక్యాలరావు మార్గదర్శకత్వంలో వారి సరసన నిలిచి శెభాష్ అనిపించుకున్నారు నాగేశ్వరరావు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడులో తెలుగు వారున్న ప్రతి చోటా ప్రదర్శనలు ఇచ్చారు.
పలు బిరుదులు, ప్రశరసలు
సత్తెనపల్లి సమతా ఆర్ట్ వారు నటబ్రహ్మ, నందమూరి కళాపరిషత్తు నుంచి అభినవ శ్రీహరి, ఒంగోలు ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి నట చక్రవర్తి బిరుదులను నాగేశ్వరరావు పొందారు. అనేక స్వచ్ఛంద సంస్థల వారు సత్కారాలు చేశారు. ఈ నెల 16న అద్దంకిలో పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల కళాపురస్కారాన్ని అందుకోనున్నారు.
చింతామణి నాటకంలో శ్రీహరి సీ్త్రపాత్రలో 3 వేల ప్రదర్శనలు అతివ పాత్రకు జీవం పోసిన నటుడు అద్దంకి నాగేశ్వరరావు నేడు పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల కళాపురస్కారం ప్రదానం
ప్రభుత్వం అండగా ఉండాలి
నాటక రంగానికి ఆదరణ కరవైంది. కళాకారులంతా పేదవారే. ప్రభుత్వ పరంగా సహాయం అందించాలి. ఇది ఒక ప్రయోజనకరమైన కళ. దీనిని వాహకంగా తీసుకుని నాటకంలో మార్పుచేర్పులు చేసుకుని అంతరించి పోతున్న రంగానికి మెరుగులు దిద్దే కళాకారులు ప్రస్తుతం అవసరం. నాటక రంగానికి పూర్వవైభవం రావాలి. సంపాదనపై ఆశపడి ఎవరూ నాటక రంగానికి రావద్దు.
– అద్దంకి నాగేశ్వరరావు
సీ్త్రహరి.. ఆయనే మరి!
Comments
Please login to add a commentAdd a comment