
లే అవుట్ల క్రమబద్ధీకరణ
నిబంధనల మేరకే
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్బాబు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ 2019 నుంచి మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్లను గుర్తించాలని అన్నారు. మున్సిపాలిటీ, బావుడా పరిధిలోని తొమ్మిది మండలాలలో మొత్తం 183 లే అవుట్లను గుర్తించి వాటి వివరాలను డీటీసీపీకి పంపినట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. వివరాలను పత్రికలలో ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. అందులో 86 లే అవుట్లను 22–ఎ కింద గుర్తించి రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కు పంపినట్లు తెలిపారు. మిగిలిన లే అవుట్లను సబ్ డివిజన్లుగా చేసి పంపాలని వాటిని తిప్పి పంపారని వారు కలెక్టర్కు వివరించారు. 183 లే అవుట్ల క్రమబద్ధీకరణకు సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. కొత్త లేఅవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ల్యాండ్ కన్వర్షన్కు, ఇంటి నిర్మాణాలకు సంబంధించి మునిసిపాలిటీ, బావుడా, పంచాయతీ పరిధిలోని నిబంధనలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతుందని, తద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గుతుందని, బాపట్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, వాటిని వీలైనంత త్వరలో నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్గౌడ్, డీపీఓ ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి, బావుడా ప్లానింగ్ అధికారి షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు.