
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రముఖ దిగ్గజ మోటార్ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహానాల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. కాగా ప్రముఖ దిగ్గజ కంపెనీ ఆపిల్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఆపిల్ తన కంపెనీ నుంచి 2024 లోపు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. కాగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఆపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టు కోసం ప్రముఖ దిగ్గజ మోటార్ కంపెనీ బీఎండబ్ల్యూ నుంచి మాజీ ఎగ్జిక్యూటివ్ అధికారి అల్రిచ్ క్రాన్జ్ను నియమించుకుంది. క్రాన్జ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్ కంపెనీ కానూకు సీఈవోగా పనిచేస్తున్నారు. బీఎండబ్ల్యూ ఆల్ ఎలక్ట్రిక్ ఐ3, హైబ్రిడ్ ఐ 8 స్పోర్ట్ కారును తయారుచేయడంలో క్రాన్జ్ కీలక పాత్ర పోషించాడు.
ఎలక్ట్రిక్ స్టార్టప్ కానూతో ఆపిల్ 2020 ప్రారంభంలోనే చర్చలు జరిపింది. కాగా అల్రిచ్ క్రాన్జ్ నియమాకంతో ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం అవుతుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడంలో మొదట్లో కానూ హ్యుందాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా, ప్రస్తుతం ఆ ఒప్పందం విగిపోయినట్లుగా మార్కెట్ నిపుణుల భావిస్తున్నారు.