
ముంబై: దేశీయంగా వాణిజ్య వాహనాల (సీవీ) పరిశ్రమ రికవరీ బాట పట్టిందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ (వీఈసీవీ) ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. బస్సుల సెగ్మెంట్ కోలుకోవడం, రిప్లేస్మెంట్కు డిమాండ్ పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 4.35 లక్షల స్థాయి దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2018–19లో రికార్డు స్థాయిలో 5.77 లక్షల పైచిలుకు అమ్ముడైన సీవీలు వివిధ కారణల రీత్యా 2020–21లో 2.34 లక్షలకు పడిపోయాయి. 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 3.34 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య వాహనాల అమ్మకాలు 47 శాతం పెరిగి 3.43 లక్షలకు చేరాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, గత నాలుగు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణమాలను బట్టి చూస్తే సీవీల అమ్మకాలు తిరిగి 2019–20 నాటి స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అగర్వాల్ వివరించారు. వచ్చే మూడేళ్లు పరిశ్రమకు మెరుగ్గా ఉండనున్నట్లు పేర్కొన్నారు. స్వీడన్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment