జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు | Gujarat state GST dept identified 30 B2C sectors to track tax evasion and bring unregistered dealers under its ambit | Sakshi
Sakshi News home page

జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు

Jan 3 2025 2:09 PM | Updated on Jan 3 2025 3:08 PM

Gujarat state GST dept identified 30 B2C sectors to track tax evasion and bring unregistered dealers under its ambit

పన్ను పరిధిని విస్తరించడానికి, జీఎ‍స్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాలను అన్వేషిస్తోంది. పన్ను ఎగవేతను గుర్తించి, అధికారికంగా నమోదుకాని డీలర్లను దాని పరిధిలోకి తీసుకురావడానికి గుజరాత్‌ రాష్ట్ర జీఎస్టీ యంత్రాంగం 30 బిజినెస్-టు-కన్స్యూమర్ (బీ2సీ) విభాగాలను గుర్తించింది. చాలా మంది రిజిస్టర్డ్ ట్రేడర్లు తమ ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తున్నారని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరికొందరు తమ వివరాలు నమోదు చేయకుండా పరిమితికి మించి సంపాదిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని కట్టడి చేసేలా 30 బీ2సీ విభాగాలను గుర్తించినట్లు చెప్పారు.

ప్రభుత్వం గుర్తించిన బీ2సీ సెక్టార్లకు సంబంధించి అద్దె పెళ్లి దుస్తుల వ్యాపారులు, పాదరక్షలు, సెలూన్లు, నాన్ క్లినికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్, ఐస్ క్రీం పార్లర్లు, టెక్స్‌టైల్‌ విక్రేతలు, పొగాకు వ్యాపారులు, బ్యాటరీ వ్యాపారులు, మొబైల్ ఫోన్, యాక్సెసరీస్ డీలర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కృత్రిమ పూలు అమ్మకం దారులు, అలంకరణ ఉత్పత్తుల విక్రేతలు, కోచింగ్ క్లాసుల నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు.

పరిమితి దాటినా నమోదవ్వని వివరాలు..

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 12 లక్షల మంది రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వీరి వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం పన్నుదారులను దీని పరిధిలోకి తీసుకురావడంపై దృష్టి సారించామన్నారు. బీ2సీ విభాగంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు వారి పూర్తి ఆదాయాన్ని నివేదించడం లేదన్నారు. కొందరు సరైన బిల్లులను జారీ చేయకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. చాలా మంది వ్యాపారుల టర్నోవర్ జీఎస్టీ పరిమితిని మించినప్పటికీ వివరాలు నమోదు చేయడం లేదన్నారు. పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా కొన్ని విధానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: అంబానీ జెట్‌ పైలట్ల జీతం ఎంతంటే..

రెండు నెలల్లో రూ.20 కోట్లు..

గత రెండు నెలలుగా గుజరాత్ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి రాష్ట్ర జీఎస్టీ విభాగం రూ.20 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. పన్ను పరిధిని విస్తరించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. సరైన బిల్లింగ్ లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. రిజిస్టర్ కాని డీలర్లకు సరుకులు సరఫరా చేసే రిజిస్టర్డ్ ట్రేడర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలోకి వస్తారని తెలియజేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement