
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్షిప్లలో 35–40 శాతం డీలర్షిప్లను దశలవారీగా అప్గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment