8.3 శాతం వృద్ధికి అవకాశం | Sakshi
Sakshi News home page

8.3 శాతం వృద్ధికి అవకాశం

Published Sat, Oct 9 2021 6:36 AM

India Expected To Grow By 8. 3 percent In 2021-22 - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 8.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని తాజాగా అంచనా వేసింది. పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు, తయారీని పెంచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వృద్ధికి తోడ్పడతాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కరోనా రెండో విడత ప్రబలడానికి ముందు ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనాల కంటే ఇది తక్కువేనని తెలిపింది. కరోనా రెండో విడత ప్రభావంతో ఆర్థిక రికవరీ నిలిచిపోయిందని.. వాస్తవానికి రికవరీ క్షీణించినట్టు కొన్ని సంకేతాల ఆధారంగా తెలుస్తోందని ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్‌ టిమ్మర్‌ అన్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదికలో భారత్‌ జీడీపీ వృద్ధి 2021–22లో 7.5–12.5 మధ్య ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌–మే నెలల్లో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం తెలిసిందే. దీంతో తన తాజా అంచనాల్లో దిగువ స్థాయికి వృద్ధి అంచనాలను సవరించినట్టు టిమ్మర్‌ పేర్కొన్నారు.  కరోనా రెండో విడత ప్రభావం ఆర్థిక వ్యవస్థమీద ఎక్కువే ఉందన్నారు.

కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరం
కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరానికి అనుగుణంగానే ఉన్నాయని టిమ్మర్‌ అభిప్రాయపడ్డారు. ఇవి ఆర్థిక వ్యవస్థలో వెలుగు చూడని సామర్థ్యాలని బయటకు తీసుకొస్తాయని చెప్పారు. సామాజిక భద్రతా వ్యవస్థల కోసం నిధులను ఏర్పాటు చేయడం వంటివి సంఘటిత రంగంలోని కారి్మకులకే కాకుండా.. అసంఘటిత రంగంలోని వారికీ మేలు చేస్తుందన్నారు. ‘‘భారత్‌లో అమలు చేస్తున్న ఎన్నో స్వల్పకాలిక ఉపశమన చర్యలు దీర్ఘకాలం కోసం కాదు. దేశం మొత్తానికి సంబంధించి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సంస్కరణలు (కారి్మక, వ్యవసాయ) ఆ దిశలోనే ఉన్నాయి. కానీ, అదే సమయంలో చేయాల్సింది ఎంతో ఉంది’’ అని టిమ్మర్‌ వివరించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement