![Indian govt to recover Rs 469 crore from 7 electric 2W makers for non compliance with FAME II - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/indian-govt-to-recover-rs-469-crore.jpg.webp?itok=FK7lAroF)
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. కావున వాహన తయారీ సంస్థలు ఇలాంటి వెహికల్స్ తయారు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ 2 పథకం కింద ప్రయోజనాలను అందిస్తోంది. దీనిని అదనుగా తీసుకున్న చాలా కంపెనీలు నిబంధనలను పాటించలేదని గుర్తించి మొత్తం రికవరీ చేయాలనీ కేంద్రం ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఫేమ్ 2 నియమాలను అదనుగా తీసుకున్న 7 కంపెనీలు రూ. 469 కోట్లు క్లెయిమ్ చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మోసాన్ని గుర్తించిన కేంద్రం ఫేమ్ 2 కింద పొందిన మొత్తం డబ్బుని తిరిగి వెనక్కి ఇవ్వాలని వెల్లడించింది. మరో 7 నుంచి 10 రోజులలోపు మొత్తం డబ్బుని తిరిగి ఇవ్వని యెడల ఈ స్కీమ్ నుంచి కంపెనీని తొలగించనున్నట్లు పేర్కొంది.
(ఇదీ చదవండి: నోట్ల ఉపసంహరణ గడువుపై కేంద్రం కీలక ప్రకటన - తప్పక తెలుసుకోవాల్సిందే!)
మన దేశంలో తయారైన విడి భాగాలను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు అందించాలని ఫేమ్ 2 నిబంధలు చెబుతున్నాయి. అయితే హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో వంటి కంపెనీలు చైనా విడి భాగాలతో వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది.
(ఇదీ చదవండి: ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చింది, ఎవరు ప్రారంభించారో తెలిస్తే అవాక్కవుతారు!)
ఫేమ్ 2 నిబంధనలను అనుగుణంగా నడుచుకుంటున్నట్లు హీరో ఎలక్ట్రిక్, ప్రభుత్వానికి వివరణాత్మకంగా సమాచారం అందిస్తామని యాంపియర్, మాకు ఇప్పటి వరకు ఎటువంటి నోటీసు అందలేదని లోహియా కంపెనీలు వెల్లడించాయి. కాగా దీనిపైన స్పందించడానికి ఒకినావా & రివోల్ట్ నిరాకరించినట్లు సమాచారం. మొత్తం మీద విదేశాల నుంచి ముడి భాగాలను దిగుమతి చేసుకుని వాహనాలను తయారు చేసినట్లు రుజువైతే ఇప్పటి వరకు ప్రోత్సాహకాల కింద అందుకున్న మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment