IPO: పబ్లిక్‌ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు | ipos this week 5 companies Rs 4200 crores | Sakshi
Sakshi News home page

IPO: పబ్లిక్‌ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు

Dec 13 2023 8:01 AM | Updated on Dec 13 2023 8:06 AM

ipos this week 5 companies Rs 4200 crores - Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్, డోమ్స్‌ ఇండస్ట్రీస్, ఐనాక్స్‌ ఇండియా, మోతిసన్స్‌ జ్యుయలర్స్, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

టాటా గ్రూప్‌ నుంచి 2004 తర్వాత (టీసీఎస్‌) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్‌ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్‌ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్‌ బాగా సందడిగా ఉందని ఆనంద్‌ రాఠీ అడ్వైజర్స్‌ డైరెక్టర్‌ వి. ప్రశాంత్‌ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు.  

ఐపీవోలు ఇవీ..  

  • ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ (ఐఎస్‌ఎఫ్‌), డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఇష్యూలు డిసెంబర్‌ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్‌ షేర్‌హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. 
  • క్రయోజెనిక్‌ స్టోరేజ్‌ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్‌ సీవీఏ పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్‌ ఎస్టేట్స్, ఐకానిక్‌ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్‌ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్‌ ఇ ష్యూ డిసెంబర్‌ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్‌ లీజర్‌ (మలీ్టప్లెక్స్‌ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్‌ గ్రూ ప్‌ నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్‌ లీజర్‌.. పీవీఆర్‌ గ్రూప్‌లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్‌ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది.  
  • మోతీసన్స్‌ జ్యుయలర్స్‌ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్‌ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement