Market
-
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: నెలాఖరుకల్లా..
న్యూఢిల్లీ: వెండార్లతో సంప్రదింపుల వల్ల తలెత్తిన వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు మధ్య వ్యత్యాసాల సమస్యను పరిష్కరించుకోవడంపై ఓలా ఎలక్ట్రిక్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 40 శాతం బ్యాక్లాగ్లను క్లియర్ చేశామని, మిగతా వాటిని నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది.ఓలా ఫిబ్రవరిలో 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు వెల్లడించినప్పటికీ ప్రభుత్వ వాహన్ పోర్టల్లో 8,651 స్కూటర్లు మాత్రమే రిజిస్టర్ అయినట్లు గత గణాంకాల్లో వెల్లడయ్యాయి. మార్చి 20 నాటికి కంపెనీ రిజి్రస్టేషన్లు 11,781 యూనిట్లుగా ఉన్నాయి. వాహనాల గణాంకాల్లో వ్యత్యాసాలను నియంత్రణ నిబంధనలపరమైన సమస్యగా కొన్ని స్వార్ధ శక్తులు దుష్ప్రచారం చేశాయని ఓలా వ్యాఖ్యానించింది.కార్యకలాపాలను క్రమబద్దీకరించుకోవడం, లాభదాయకతను మెరుగుపర్చుకునే క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించే రెండు జాతీయ స్థాయి వెండార్లతో కాంట్రాక్టులను నిలిపివేసిన తర్వాత ఇది మరింత తీవ్రమైందని పేర్కొంది. అమ్మకాలు, రిజి్రస్టేషన్ల మధ్య గణాంకాల్లో వ్యత్యాసాలపై భారీ పరిశ్రమల శాఖ, రహదారి రవాణా.. హైవేస్ శాఖ కంపెనీని స్పష్టత కోరిన నేపథ్యంలో ఓలా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
జీసీసీల్లో 10% వేతనాల వృద్ధి ..
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన ఉద్యోగులు వెళ్లిపోకుండా అట్టే పెట్టుకోవడం, స్థూల ఆర్థిక సమస్యలను అధిగమించడం తదితర సవాళ్ల నేపథ్యంలో దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) మెరుగైన వేతన పెంపుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో వచ్చే 12 నెలల్లో వేతన వృద్ధి సుమారు 9.8 శాతం వేతన వృద్ధి ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి. డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్ఎల్బీ సర్విసెస్ రూపొందించిన ’ఇండియా టాలెంట్ టేకాఫ్ – ది జీసీసీ 4.0 స్టోరీ’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.‘ప్రపంచ జీసీసీల్లో దాదాపు 55 శాతం సెంటర్లు భారత్లో ఉన్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 110 బిలియన్ డాలర్లకు చేరనుంది. వ్యయాలు తగ్గించుకోవడం, పరిస్థితులను బట్టి వేగంగా స్పందించే సామర్థ్యాలను పెంచుకోవడం, విస్తృతంగా ప్రతిభావంతులను అందుబాటులో ఉంచుకోవడం వంటి అంశాలపై కంపెనీలు దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడుంది. ఈ పరిణామంతో వేతనాలు కూడా గణనీయంగా పెరగనుండటమనేది ఉద్యోగులకు కూడా కలిసి రానుంది.ముఖ్యంగా స్పెషలైజ్డ్ నైపుణ్యాలు ఉన్న వారికి గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ నెలకొంది‘ అని ఎన్ఎల్బీ సర్విసెస్ సీఈవో సచిన్ అలగ్ చెప్పారు. ‘ఆర్థిక సేవల విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిస్క్ అనలిస్టులు, కాంప్లయెన్స్ అసోసియేట్స్, సీనియర్ రిస్క్ మేనేజర్లు, ఎఫ్ఆర్ఎం లీడ్స్, కాంప్లయెన్స్ హెడ్స్, గ్లోబల్ ఫైనాన్స్ డైరెక్టర్స్ మొదలైన హోదాల్లో ఉన్నవారికి వార్షికంగా రూ. 6 లక్షల నుంచి రూ. 90 లక్షల శ్రేణిలో వేతనాలు ఉంటున్నాయి.సాంప్రదాయ హోదాలతో పోలిస్తే రిస్క్, ఎఫ్ఆర్ఎం వంటి స్పెషలైజ్డ్ నైపుణ్యాలున్న వారికి వేతనాలు 25–40 శాతం అధికంగా ఉంటున్నాయి. అలాగే, మౌలిక రంగాల పరిధిని దాటి ఆర్థిక విభాగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కొత్త అవకాశాలు వస్తున్నాయి‘ అని అలగ్ వివరించారు. అసమానతలపై దృష్టి పెట్టాలి.. వేతన వృద్ధి పటిష్టంగానే ఉన్నప్పటికీ స్త్రీ, పురుష ఉద్యోగుల జీతభత్యాల మధ్య అసమానతలను తగ్గించేందుకు మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అలగ్ చెప్పారు. పురుష ఉద్యోగుల జీతభత్యాలతో పోలిస్తే మహిళా ఉద్యోగుల వేతనాలు సగటున 75–85 శాతం స్థాయిలోనే ఉంటున్నాయని చెప్పారు. ఇక సీనియర్ హోదాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉందని, లీడర్íÙప్ బాధ్యతల్లో మహిళల ప్రాతినిధ్యం పరిమిత స్థాయిలోనే ఉంటోందని పేర్కొన్నారు. ఆరు నగరాలవ్యాప్తంగా 10 వివిధ రంగాలకు చెందిన 207 జీసీసీల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ⇒ మిగతా సంస్థలతో పోలిస్తే హైదరాబాద్ (19 శాతం), ముంబై (19 శాతం)ల్లోని జీసీసీలు అత్యధికంగా చెల్లిస్తున్నాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ సాఫ్ట్వేర్ .. కన్సల్టింగ్ (22 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్షియల్ సర్వీసుల (18 శాతం) విభాగాలు ఉన్నాయి. ⇒ జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగాల్లో వేతన వృద్ధి పటిష్టంగా ఉండనుంది. ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ నెలకొనడం ఇందుకు కారణం. మరోవైపు, పైస్థాయి ఉద్యోగాల్లో వ్యయాలను నియంత్రించుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తుండటంతో సీనియర్ హోదాల్లోని వారికి వేతనాల పెంపు ఒక మోస్తరుగానే ఉండనుంది. ⇒ రాబోయే రోజుల్లో, 2030 నాటికి దేశీయంగా జీసీసీ రంగం వార్షికంగా 9–12 శాతం వృద్ధి చెందనుంది. దానికి తగ్గట్లుగా వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. -
భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు: కారణం ఇదే!
భారతదేశంలోని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం భారీగా తగ్గాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎదుర్కొంటుందని శనివారం వెల్లడించింది. దివాలా.. దివాలా కోడ్ సెక్షన్ 9 కింద బెంగళూరులోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఈ పిటిషన్ను సమర్పించారు.ఆపరేషనల్ క్రెడిటర్ రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్, అందించిన సేవలకు చెల్లింపులలో డిఫాల్ట్ అయిందని ఆరోపించింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ వాదనలను ఖండించింది. దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామని, వాటాదారుల ప్రయోజనాల కోసం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు పతనమయ్యాయి.దీంతో కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ఉదయం 10.25 గంటలకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 6.14 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకొని.. రూ. 47.41కి చేరుకున్నాయి. కొంతకాలంగా పతనమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూశాయి. -
ఇన్ఫీలో శ్రుతి శిబూలాల్ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఎస్డీ శిబూలాల్ కుమార్తె శ్రుతి కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా 29.84 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. ఇందుకు శ్రుతి శిబూలాల్ దాదాపు రూ. 470 కోట్లు వెచ్చించారు.షేరుకి రూ. 1,574 సగటు ధరలో వీటిని కొనుగోలు చేశారు. ఎస్డీ శిబూలాల్ కుటుంబ సభ్యులలో ఒకరైన గౌరవ్ మన్చందా ఈ షేర్లను విక్రయించారు. కాగా.. మంగళవారం సైతం శ్రుతి శిబూలాల్ రూ. 494 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ వాటాను కొనుగోలు చేయడం గమనార్హం! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
సెబీ మాజీ చీఫ్కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ మార్కెట్ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్ 'మాదభి పురి బుచ్' (Madhabi Puri Buch)కు ఊరట లభించింది. పురి, మరో ఐదుగురిపై పోలీసు కేసు నమోదు చేయాలన్న దిగువ కోర్టు ఆదేశాన్ని, బాంబే హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.స్టాక్ఎక్స్ఛేంజ్లో కంపెనీలను లిస్ట్ చేయడంలో ఆర్ధిక పరమైన మోసం జరిగిందని ఆరోపిస్తూ.. సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇందులో పురి బుచ్ మాత్రమే కాకుండా.. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్లైన అశ్వని భాటియా, అనంత్ నారాయణ్, కమలేష్ చంద్ర వర్ష్నీలు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామమూర్తి, బిఎస్ఇ మాజీ చైర్మన్ & పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ ఉన్నారు.ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల తరువాత.. పురి బుచ్, మిగిలిన ఐదుగురు హైకోర్టులో వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపి.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది.పూర్తిస్థాయి పరిశీలన లేకుండానే.. కింది కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కనిపిస్తోంది. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత వాటిని నిలిపివేస్తున్నాం.. అని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ వరకు వీరిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని కూడా ఏసీబీని ఆదేశించింది.నిజానికి పురి బుచ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అదానీ గ్రూపుకు చెందిన కొన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు.. గతేడాది ఆగస్టులో హిండెన్బర్గ్ ఆరోపించింది. ఆ తరువాత ఒక్కొక్కటిగా.. ఈమెపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన ఆరోపణలన్నీ ఒట్టివే అని పురి బుచ్ కొట్టిపారేశారు. -
ఉలవ రైతు నిలువు దోపిడీ
నల్లమాడ: ఉలవ రైతు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామంటూనే ఆ పంట దిగుబడులను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. గతేడాది రబీలో ప్రత్యామ్నాయ పంటగా రైతులు ఉలవ పంట సాగుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంట నూరి్పడి చేసి దిగుబడిని అమ్మేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం ఉలవకు మద్దతు ప్రకటించకపోగా కొనుగోలు సైతం చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో దళారులను ఆశ్రయించి మోసపోవాల్సిన దుస్థితి నెలకొంది. పెరిగిన సాగు విస్తీర్ణం ప్రధాన వేరుశనగ పంట వల్ల పెద్దగా లాభం లేకపోగా పంట సాగు ఖర్చు తక్కువగా ఉండటం, కలుపు తీయడం, మందులు పిచికారీ చేసే అవసరం లేకపోవడంతో ఉలవ పంట సాగుపై రైతులు దృష్టి సారించారు. సబ్సిడీపై విత్తనం కూడా సరఫరా చేయడంతో గతంలో కంటే రబీ సీజన్లో ఉలవ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 13,606 ఎకరాల్లో రైతులు ఉలవ పంట సాగు చేసినట్లు అధికారుల అంచనా. ఉలవను కొనుగోలు చేయని ప్రభుత్వం రైతు సంక్షేమ తమ ధ్యేయమంటూ బాకా ఊదుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఉలవకు మద్దతు ధర ప్రకటించకపోగా కొనుగోలు ప్రయత్నం కూడా చేయలేదు. ఉలవ పంట నమోదు (ఈ క్రాప్ బుకింగ్) చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని రైతన్నలు నిట్టూరుస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర కోసం రైతులు ఉలవలను సంచుల్లో పోసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రతి గ్రామంలోనూ కన్పిస్తోంది. నెలల తరబడి ఉలవలు అలాగే నిల్వ ఉంచితే పురుగులు పడి పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో నిలువుదోపిడీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటా ఉలవలు రూ.3,500 నుంచి రూ.3,700 వరకు ధర పలుకుతోంది. అయితే నాణ్యత లోపించిందని, తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చూపిపారులు ఒక క్వింటాకు ఎనిమిది నుంచి 10 కిలోల ఉలవలను అదనంగా తీసుకుంపలువురు రైతులు వాపోతున్నారు. ఉలవ పంట సాగుకు ఒక ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు మూడు క్వింటాళ్లు దిగుబడి రావడంతో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే తమకు మిగిలేదేమీ ఉండదని రైతన్నట్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఉంటే క్వింటా రూ.4 వేలకుపైగా ధర లభించేదని చెబుతున్నారు. ఉలవలు కొనుగోలు చేయాలి ఉలవకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అడిగిన ధరకు ఉలవలు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామంటూ వాటి దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం బాధాకరం. అన్ని విధాలుగా రైతుకు నష్టమే జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉలవకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలి. – ఎం. నరసింహులు, రైతు, దొన్నికోట, నల్లమాడ మండలంపంటను గొర్రెలకు వదిలేశా నేను ఐదెకరాల్లో ఉలవ పంట సాగుచేశా. ట్రాక్టర్తో సేద్యం, క్వింటా విత్తన ఉలవలకు రూ.10 వేలకు పైగా ఖర్చు వచ్చింది. పంట నూరి్పడికి వచ్చే సమయానికి మార్కెట్లో క్వింటా ఉలవ ధర రూ.3,500 పలుకుతోంది. నూరి్పడి ఖర్చులు అన్నీ కలిపితే ఏం గిట్టుబాటు కాదని భావించి పంటను గొర్రెలకు వదిలేశా. ప్రభుత్వం స్పందించి ఉలవ రైతులను ఆదుకోవాలి. –దేవళానాయక్, రైతు, గోపేపల్లి తండా, నల్లమాడ మండలం -
మార్కెట్పై దాడి.. 54 మంది హతం
కైరో: సూడాన్లో మిలటరీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న పారామిలటరీ బలగాలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. ఇటీవలే దార్పుర్లోని ఎల్ ఫషెర్లోని ఆస్పత్రిపై దాడి చేసి 70 మంది అమాయకుల్ని బలి తీసుకున్న వీరు శనివారం మార్కెట్పై దాడి చేసి 54 మందికి పైగా చంపేశారు. ఒంబుర్మన్ నగరంలోని సబ్రెయిన్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. ఘటనలో మరో 158 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారంది. ఘటనపై పారా మిలటరీ బలగాలు స్పందించలేదు. మిలటరీ, పారామిలటరీ బలగా లు ఆధిపత్యం కోసం 2023 ఏప్రిల్ నుంచి ముఖాముఖి పోరు సాగిస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన పలు ఘటనల్లో రాజధాని ఖార్టూమ్తోపాటు పొరుగునే ఉన్న ఒంబుర్మన్, తూర్పు, సెంట్రల్ ప్రావిన్స్ల్లోని పలు ప్రాంతాల్లో మిలటరీ పైచేయి సాధించింది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉన్న గెజిరా ప్రావిన్స్ రాజధాని వాద్ మెదానీని కూడా సైన్యం తిరిగి స్వాధీనం పర్చుకుంది. -
మొటిరోజే భారీ నష్టాలు.. మార్కెట్ల దిశా నిర్దేశి బడ్జెట్టే!
కొలంబియాపై టారిఫ్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన పోరు ప్రపంచ మార్కెట్లను గడగడలాడించింది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాలేదు . గతవారం మొత్తం మీద దాదాపు అరశాతం నష్టపోయిన సూచీలు ఈవారం మొదటి రోజునే భారీ నష్టాలను చవిచూశాయి. కిందటి వారంనష్టాలకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. చమురు ధరలు కొంత శాంతిస్తున్నట్లు కనబడుతున్నా, బంగారం ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడం, ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటం, రూపాయి బలహీనతలు కొనసాగడం మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి.గత వారం మొత్తానికి సెన్సెక్స్ 429 పాయింట్లు కోల్పోయి 76190 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 23092 పాయింట్ల వద్ద స్థిరపడగా.. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 75366 వద్ద, నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 22829 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు సైతం భారీ నష్టాల్లోనే సాగాయి. ఈవారంఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణ సోమవారమే కనిపించింది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. మరోపక్క టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.దీనికంటే ముందు మన మార్కెట్ల దశ - దిశ మార్చేది మాత్రం బడ్జెట్టే. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను కిందకు లాగుతూనే ఉంటాయి.ఈవారం ఆర్ధిక ఫలితాల కంపెనీలుమార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో కోల్ ఇండియా, కెనరా బ్యాంకు, టాటా స్టీల్, ఏసీసీ, బజాజ్ ఆటో, సిప్లా, టీవీఎస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్, అదానీ పవర్, ఎల్ & టీ, బజాజ్ ఫిన్ సర్వ్, భెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసి, ఇండస్ ఇండ్ బ్యాంకు, నెస్లే ల ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో పెట్రోనెట్, హిందుస్థాన్ జింక్, బాష్, జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్, ఎస్సారెఫ్ వోల్టాస్, రేమండ్, భారత్ ఎలక్ట్రానిక్స్, గెయిల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, జిందాల్ స్టీల్, బయోకాన్, డాక్టర్ లాల్ పాత్, అజంతా ఫార్మా, మారికో, బంధన్ బ్యాంకు, ఎల్ఐసి హౌసింగ్, జ్యోతి లాబ్స్ ల ఫలితాలపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) కు భారత్లో పెట్టుబడులపై వస్తున్న రిటర్నులు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. మరోపక్క అమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉంది. దీంతో వారు మన మార్కెట్లో భారీ స్థాయిలో విక్రయాలకు పాల్పడుతూ, పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది.గత ఏడాది మొత్తం మీద అధిక స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. నెల మొత్తం మీద ఇప్పటిదాకా వీరు దాదాపు రూ.74,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.73,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ. 5,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేయగా, దేశీయ మదుపర్లు రూ. 6,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ఎక్కడా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఇదే ధోరణి కొనసాగితే సూచీలు మరింత పడిపోవడం ఖాయం. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. సెన్సెక్స్, నిఫ్టీ లు ఏమాత్రం తేరుకునే ప్రయత్నం చేస్తున్నా వెంటనే బేర్స్ రంగంలోకి దిగి వాటిని పడగొడుతూనే ఉన్నారు. మార్కెట్కు 23050 వద్ద మద్దతు లభించాల్సి ఉన్నప్పటికీ, సోమవారం ఉదయమే ఇది బ్రేక్ అయిపొయింది. ఒకవేళ మార్కెట్లు తేరుకుంటే మాత్రం 23350 ప్రధాన నిరోధంగా భావించాలి. దానికంటే ముందు 22950, 23050, 23200, స్థాయిల వద్ద నిఫ్టీ కి నిరోధాలు ఉన్నాయి. పతనాన్ని కొనసాగిస్తే తదుపరి మద్దతు 22750 దగ్గర లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేస్తే 22600, 22500 స్థాయిలను టెస్ట్ చేయవచ్చు. అది కూడా దాటుకుని పడిపోతే... 22200 వరకు భారీ పతనం తప్పదు. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నా సూచీలు మరింత పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది.వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా. మన మార్కెట్కు భవిష్యత్ దిశా నిర్దేశి మాత్రం బడ్జెట్టే. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే చర్యల కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఏమాత్రం తేడా జరిగినా భారీ పతనం తప్పదు. ప్రోత్సాహకరంగా ఉంటే మాత్రం ఇప్పటి స్థాయిల నుంచి తేరుకోవడమే కాక, సూచీలు పరుగులు పెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 8.24 శాతంపెరిగి 18.13 దగ్గర ఉంది. భారీ ఒడుదొడుకులను ఇది తెలియజెబుతోంది.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. త్వరలో తులం గోల్డ్ రేటు రూ.90 వేలకు చేరే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. అయితే రాబోయే బడ్జెట్లో (ఫిబ్రవరి 1) బంగారంపై దిగుమతి సుంకాలను పెంచితే.. ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని, బంగారం రేటు మరింత పెరుగుతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) పేర్కొంది.గత ఏడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపిందని. అంతేలోనే మళ్ళీ ఈ సుంకాలను పెంచితే.. స్మగ్లింగ్లో పెరుగుదల, దేశీయంగా బంగారం ధరలు పెరగడం వంటివన్నీ.. పరిశ్రమను వెనక్కి నెట్టేస్తాయని డబ్ల్యుజీసీ ఇండియా సీఈఓ 'సచిన్ జైన్' (Sachin Jain) వెల్లడించారు.ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలతో సహా వాటాదారులు కూడా.. ఈ బంగారం ధరలు సానుకూలంగా సాగటానికి సహకరించడం చాలా అవసరం. ఇదే జరిగితే బంగారు పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని జైన్ పేర్కొన్నారు.బంగారు పరిశ్రమ భారతదేశ జీడీపీకి 1.3 శాతం సహకరిస్తుంది. అంతే కాకుండా సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. జూలైలో సమర్పించిన బడ్జెట్ 2024లో బంగారంపై మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఈ చర్య అనధికారిక దిగుమతులను తగ్గించడానికి, అధికారిక మార్గాలను స్థిరీకరించడానికి, దేశీయంగా బంగారం కొనుగోలును ప్రోత్సహించడంలో సహాయపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. -
ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,ఖమ్మంజిల్లా: ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం(జనవరి15) అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ షెడ్డులో పత్తిబస్తాలు తగలబడ్డాయి. ఓ లాట్ పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతుండడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి దగ్ధంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంటలను తక్షణమే అదుపులోకి తేవాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్,మార్కెట్ అధికారులతో మాట్లాడి తుమ్మల వివరాలు తెలుసుకున్నారు. -
స్టాక్ మార్కెట్లోకి రావాలా?.. పోవాలా?
స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్లలో వారాంతపు ట్రేడింగ్లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే... 1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.2. ట్రేడింగ్కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
సంకేతాలు ప్రతికూలం.. కన్సాలిడేషన్కే అవకాశం!
గతవారం స్టాక్ మార్కెట్లు బాగా కుదేలయ్యాయి. ప్రధాన సూచీలు దాదాపు 2 శాతం పడిపోయాయి. ఇందుకు మూడు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, పెరిగిన చమురు ధరలు, పూర్తి ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం.. ఈ మూడూ మార్కెట్లను కిందకు నడిపించాయి. టీసీఎస్ ఆర్ధిక ఫలితాలు మార్కెట్లను మెప్పించి ఐటీ కంపెనీలపై కాస్త భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ డోస్ సరిపోలేదు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ప్రెసిడెంట్గా వచ్చే వారం బాధ్యతలు స్వీకరించబోతున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) అనుసరించబోయే విధానాలపై పూర్తి క్లారిటీ లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఇక వారం మొత్తానికి సెన్సెక్స్ 1845 పాయింట్లు కోల్పోయి 77378 వద్ద, నిఫ్టీ 573 పాయింట్లు నష్టపోయి 23432 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.ఈవారంఅక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల సందడి మొదలయ్యింది. ఈవారం మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడం వళ్ళ ఆయా కంపెనీలు ప్రకటించబోయే త్రైమాసిక ఫలితాలే రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేయబోతున్నాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఎల్టీటీఈఎస్, ఎల్టీఐఎమ్, ఇండియన్ హోటల్స్, సియట్, ఐసీఐసీఐ లొంబార్డ్ తదితర ప్రముఖ సంస్థలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోయే జాబితాలో ఉన్నాయి.ఇక క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల తర్వాత మళ్ళీ మార్కెట్లో విదేశీ మదుపర్ల సందడి మొదలైందని గతవారం మార్కెట్ ట్రెండ్ను బట్టే తెలుస్తోంది. గతవారం క్షీణత తర్వాత ఈవారం మార్కెట్లు కొంత మేర కన్సాలిడేషన్ దిశగా సాగే అవకాశం ఉంది. అదే సమయంలో కాస్త ప్రతికూల వార్తలొచ్చినా.. అది మరింత కిందకు లాగేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా మదుపర్లు ఓ కన్నేసి ఉంచాలి.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16982 కోట్ల నికర విక్రయాలు జరపగా.. దేశీయ మదుపర్లు రూ. 34194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ మదుపర్లు రూ.21,357 కోట్ల నికర అమ్మకాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ. 24,215 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్కు అండగా నిలిచారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లో ప్రస్తుతం బేరిష్ సెంటిమెంట్ ఉంది. గత ఏడాది జూన్ తర్వాత నిఫ్టీ మళ్ళీ ప్రస్తుతం ఆ స్థాయిలకు వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గి మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగా సాగుతాయని భావించవచ్చు. ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు బేర్స్ అడ్డుకుంటూ మార్కెట్లను కిందకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కొనుగోళ్ల సహకారం లభిస్తే మాత్రం 23700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. అదికూడా అధిగమిస్తే తదుపరి నిరోధక స్థాయి 23830 దగ్గర ఉంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత నీరసంగా ఉన్నా, సూచీలు పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే జరిగితే మొదట 23270 వద్ద మద్దతు దొరుకుతుంది. దీన్ని కూడా ఛేదించి కిందకు జారితే మాత్రం తదుపరి నిరోధం 23000 వద్ద, ఆపైన 22800 స్థాయి వద్ద సహకారం లభించవచ్చు.ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000 - 24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24500 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22500 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 10 శాతం పెరిగి 14.9 దగ్గర ఉంది.రంగాలవారీగా..గత వారమంతా చాలా బలహీనంగా సాగిన బ్యాంకింగ్ షేర్లు.. ఈవారం కొద్దిగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఈ రంగం సెంటిమెంట్ ను పెంచుతాయి. టెలికాం రంగంలోని సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు.వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగా చలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతీ, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో షేర్లు ప్రతికూలతలను చూడొచ్చు. అదే సమయంలో హీరో, టీవీఎస్ కొంతమేర ప్రోత్సాహకరంగా ఉండొచ్చు. క్షీణిస్తున్న రూపాయి.. ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. గత త్రైమాసికానికి సంబంధించి రూపాయి క్షీణత వాటి ఆర్ధిక ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఒకింత ప్రోత్ససహకమే.మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇక టీసీఎస్ ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈవారం ఫలితాల ప్రకటించబోయే ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటివి ఉన్నాయి. వీటి ఫలితాల మార్కెట్లకు.. ముఖ్యంగా ఐటీ రంగానికి దిశానిర్దేశం చేస్తాయి. సిమెంట్ షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడుvఉండకపోవచ్చు.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
బ్యాంకింగ్, రిలయన్స్ ర్యాలీ
ముంబై: బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల ర్యాలీతో స్టాక్సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 78,199 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు బలపడి 23,708 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వెంటనే తేరుకొని రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 488 పాయింట్లు ఎగసి 78,453 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 23,795 వద్ద గరిష్టాన్ని తాకాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఇంధన, ఆయిల్అండ్గ్యాస్, ఇండ్రస్టియల్, కమోడిటీ, సర్విసెస్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ సూచీ 2% రాణించాయి. ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ హిట్ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.258 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 33% ర్యాలీ రూ.287 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.273 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,310.37 కోట్లుగా నమోదైంది. -
11న తార్నాకలో సేంద్రియ సంత : పిండివంటలు, చేనేత వస్త్రాలు
గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రీయ సంతను నిర్వహిస్తున్నారు. ఆధునిక సమాజంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణపెరుగుతోంది.సేంద్రీయ ఆహారం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే అవగాహన కూడా బాగా పెరిగింది. ఇలా ఆర్గానిక్ ఉత్పత్తులు, సంప్రదాయ రుచులు , సహజ ఆహారాలను ఇష్టపడేవారికి ఈ సంత ఒక అవకాశం కావచ్చు. సికింద్రాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణా హాల్లో ఈ నెల 11 (శనివారం)న ఉ. 10 నుంచి సా. 7 గం. వరకు సేంద్రియ/ప్రకృతి ఆహారోత్పత్తుల మూలం సంత జరగనుంది. దేశీ వరి బియ్యం, చిరుధాన్యాలు, ఇతర ఉత్పత్తులు, సంప్రదాయ పిండివంటలు, చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు సూర్యకళ తెలిపారు. సంప్రదాయ రుచులతో కూడిన ఆర్గానిక్ భోజనం ఈ సంత ప్రత్యేకత. ఇతర వివరాలకు.. 94908 50766. -
బంగారం రూ. 90వేలు?: 2025లో ధరలు..
2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ధరలు పెరగడానికి కారణం ఏమిటి? గోల్డ్ రేటు పెరిగితే కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతుందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. చాలా మంది గోల్డ్ మీదనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం బంగారం ధరలు రోజు రోజుకు గణనీయంగా పెరగడమే. ఇందులో నష్టాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి.ఆర్ధిక పరిస్థితుల అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. 2025లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 85,000 నుంచి రూ. 90,000లకు చేరుకునే అవకాశం ఉంది. 2024 అక్టోబర్ 30న బంగారం రేటు రూ.82400 వద్ద ఆల్టైమ్ గరిష్టాలను తాకింది. కేజీ వెండి ధర కూడా ఏకంగా లక్ష రూపాయల మార్క్ అధిగమించేసింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మాత్రమే కాకుండా.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు వంటివి 2025లో గోల్డ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024తో పోలిస్తే వృద్ధి రేటు 2025లో మితంగా ఉండవచ్చని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది పేర్కొన్నారు. వెండి ధర 2025లో రూ. 1.25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం లేదని సమాచారం.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న మస్క్.. వినడానికే వింతగా ఉంది!సాధారణంగా బంగారం ధరలు ప్రతి ఏటా 2 నుంచి 3 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంతో క్రిప్టో కరెన్సీ వాల్యూ పెరుగుతోంది. దీని వద్ద బంగారం కొనుగోళ్లు కొంత మందగించి అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.మోదీ ప్రభుత్వం జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాలను 6 శాతం తగ్గించింది. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ తరువాత పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆ తరువాత వచ్చిన పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ వంటివి మళ్ళీ బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. కాగా వచ్చే ఏడాది గోల్డ్ రేట్లు మరింత పెరుగుతాయని స్పష్టమవుతోంది. -
Tomato Price: దారుణంగా పడిపోయిన టమాట ధర
-
ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్
దేశీయంగా తొలిసారి రిజిస్టర్డ్ స్మాల్ మీడియం (ఎస్ఎం) రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్) పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. డిసెంబర్ 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. తద్వారా రూ.353 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వెల్లడించింది. సంస్థ నుంచి వెలువడుతున్న తొలి ఎస్ఎం రీట్ పథకం ప్రాప్షేర్ ప్లాటినాకు రూ.10–10.5 లక్షల ధరల శ్రేణిని ప్రకటించింది.ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఎలాంటి యూనిట్లను ఆఫర్ చేయకపోగా.. పూర్తిగా ప్లాటినా యూనిట్లను జారీ చేయనున్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(పీఎస్ఐటీ) పేర్కొంది. ఇష్యూ నిధులను ప్లాటినా ఎస్పీవీకిగల ప్రెస్టీజ్ టెక్ ప్లాటినా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రాప్షేర్ ప్లాటినా తరహా ఎస్ఎం రీట్స్వల్ల ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడులకు వీలు కలగనున్నట్లు ప్రాపర్టీ షేర్ డైరెక్టర్ కునాల్ మోక్టన్ తెలియజేశారు. నిరవధిక అద్దె రిటర్నులు(ఈల్డ్స్), పెట్టుబడుల వృద్ధి ద్వారా హైబ్రిడ్ రాబడులకు వీలున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!ప్రాప్షేర్ ప్లాటినా 2,46,935 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని కలిగి ఉంది. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్వద్ద ప్రెస్టీజ్ టెక్ ప్లాటినాకు చెందిన లీడ్ గోల్డ్ ఆఫీస్ బిల్డింగ్లో ఈ ఆస్థిని కలిగి ఉంది. యూఎస్ టెక్ కంపెనీకి పూర్తిస్థాయిలో 9 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఇందుకు 4.6 ఏళ్ల సగటు వెయిటేజీ లాకిన్తోపాటు ప్రతీ మూడేళ్లకు 15 శాతం అద్దె పెంపు ప్రాతిపదికను ఎంపిక చేసుకుంది. వెరసి తాజా పథకం 2026లో ఇన్వెస్టర్లకు 9 శాతం పంపిణీ ఈల్డ్ను అంచనా వేస్తోంది. 2027లో 8.7 శాతం, 2028లో 8.6 శాతం చొప్పున రిటర్నులకు వీలుంది. యూనిట్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
మార్కులు కొట్టి... ‘మార్కెట్’ పట్టి...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అనుకోకుండా లభించిన అవకాశాన్ని ఓ మహిళ సద్వినియోగం చేసుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మెప్పించేలా సమాధానం ఇచ్చారు. ఏకంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. మార్కెట్ కమిటీ పదవికి ప్రశ్నలేంటి? జవాబులేంటి? చైర్ పర్సన్ను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది కదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయా? అలాంటి సందేహాలు నిజమే..అలాగే ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం ద్వారా చైర్ పర్సన్ పదవికి ఎంపికైంది కూడా వాస్తవమే. కామారెడ్డి జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ వినూత్న ప్రయోగం చేశారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎంపికకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన యువతిని పదవికి ఎంపిక చేశారు. ప్రశ్నపత్రం రూపొందించి.. పరీక్ష నిర్వహించి.. సాధారణంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు ను అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఆ పార్టీ ముఖ్య నాయకులో ప్రభుత్వానికి ప్రతిపాదించి నామినేట్ చేయిస్తారు. కానీ లక్ష్మీకాంతారావు ఇందుకు భిన్నంగా ఈ పదవికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఎక్కువ మార్కులు సాధించిన వారినే చైర్మన్గా నియమిస్తామని ప్రకటించారు. దీనికి మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ మండలాల నాయకులు కూడా సరే అన్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ పదవికి నిర్వహించిన మౌఖిక పరీక్షకు స్థానిక నేతల కుటుంబాలకు చెందిన 15 మంది మహిళలు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక పార్టీ నేతలతో కలిసి ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. మార్కెట్ కమిటీల విధులు, బాధ్యతలు, అభివృద్ధికి సంబంధించిన 15 ప్రశ్నలను పొందుపరిచారు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ఈ పరీక్షకు ఆ 15 మందీ హాజరయ్యారు. వీరిలో జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అయిల్వార్ సౌజన్య అత్యధిక మార్కులు సాధించారు. దీంతో ఆమె పేరును ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వానికి పంపించారు. ఆ మేరకు ప్రభుత్వం తాజాగా సౌజన్యను చైర్ పర్సన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 ప్రశ్నలకు 12 సరైన జవాబులిచ్చిన సౌజన్య సౌజన్య ఎంఎస్సీ బీఈడీ చదివారు. పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ పరీక్షకు ఆయా మండలాలకు చెందిన పూజా సందే, నమేవార్ పద్మ, జి.పార్వతి, వాగ్మారే ప్రియాంక, నమేవార్ అనిత, వాగ్మారే సోని, సంగీత తుకారాం, గైక్వాడ్ రాజాబాయి, కర్మల్కార్ సంగీత, అర్పిత అంజనీకర్, ఎడికే రాంబాయితో పాటు మరో ముగ్గురు హాజరయ్యారని సమాచారం. కాగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును, చైర్ పర్సన్గా నియమితులైన అయిల్వార్ సౌజన్యను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు మంత్రిని కలిశారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయతి్నస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం: సీఎం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా సౌజన్య ఎంపిక కావడంపై సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం.. పదవుల ఎంపికలో నయా దృక్పథం..ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం..ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మద్నూర్ మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. తొలిసారిగా ఇంటర్వ్యూ పద్ధతిలో, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల చదువుకు.. ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించింది..’అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక విధానంలో ఈ పదవికి సౌజన్యను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అభినందనలు తెలిపారు. -
గాజువాక మార్కెట్ లో మహిళల కొట్లాట
-
సామాన్యులకు సందడి.. ఆదివారం అంగడి..
నగరంలోని ఆదివారం అంగడికి కేరాఫ్ అడ్రస్గా మారుతోంది ఎర్రగడ్డ మార్కెట్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ షాపింగ్ చేసేలా కాటుక బరణి నుంచి కార్ టైర్ల వరకూ అన్నీ లభ్యమవుతాయి. దీంతో ఈ మార్కెట్కు రాను రానూ క్రేజ్ పెరిగిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత సామాన్యులు, మధ్యతరగతి పాలిట ‘సంత’సాన్ని నింపుతోంది. ఈ ఓపెన్ మాల్.. శ్రీమంతులకు ఆటవిడుపు.. ఆదివారం సూర్యోదయం కాకమునుపే ‘గిట్టుబాటు’ అంకెలను గుక్కతిప్పుకోకుండా పలకడంలో అక్కడ వ్యాపారులు పోటీపడుతుంటారు. ఆ రోజు అందరికీ సెలవు. కానీ, వారికి ఈ సెలవు రోజే బతుకు దెరువు. ఎర్రగడ్డ చౌరస్తా మొదలు.. ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకూ విస్తరిస్తూ పోతోంది..దీని గురించిన మరిన్నివివరాలు.. – సనత్నగర్శతాబ్దం కాలం క్రితం 15–20 దుకాణాలతో మొదలైన సంత నేడు దాదాపు వెయ్యి మంది చిరువ్యాపారులకు బతుకుదెరువుకు కేంద్రంగా మారింది. రోడ్డే ఈ సంతకు అడ్డా. నాడు ఎర్రగడ్డ చౌరస్తాకే పరిమితమైన వ్యాపారాలు నేడు కిలోమీటరు పొడవున తమ షాపులను విస్తరించారు. చౌరస్తా నుంచి మొదలుకొని సనత్నగర్ బస్టాండ్ వరకూ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఆల్ ఇన్ వన్ అంగడి.. చిన్నా.. పెద్దా మాల్ అనే తేడా లేదు.. వాటిల్లో ఉండే ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది. స్రూ్కడ్రైవర్ నుంచి సూట్కేస్ వరకూ.. రెడీమేడ్ దుస్తుల నుంచి రేబాన్ గ్లాసెస్ వరకూ, వంటింటి పాత్రల నుంచి వయ్యారాలు ఒలకబోసే అందమైన ఆట»ొమ్మల వరకూ, నాటి గ్రామ్ఫోన్ల నుంచి నేటి స్మార్ట్ఫోన్ల వరకూ.. ఇలా ప్రతిదీ ఈ సంతలో దొరుకుతాయి. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఈ మార్కెట్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎరగ్రడ్డ–సనత్నగర్ మార్గం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతూ సందడిగా మారుతోంది.‘సెకండ్స్’కు పెట్టింది పేరు.. ఎర్రగడ్డ సంత అంటే వస్తువులు ‘సెకండ్స్’లో అమ్ముడుపోతాయన్నది వ్యాపార వర్గాలతో పాటు వినియోగదారుల నుంచి వినిపించే మాట. షర్టులు, ఫ్యాంట్లు, గొడుగులు, సీడీలు, ఎలక్ట్రికల్, ఐరన్ వస్తువులు.. ఇలా ఎన్నో రకాల వస్తువులు సెకండ్ హ్యాండ్లో లభిస్తాయి. ఇక ప్రొక్లెయినర్ నుంచి మొబైల్ ఫోన్ వరకూ.. ఎలాంటి యంత్రాలు, వస్తువులకైనా కావాల్సిన విడి భాగాలు (స్పేర్పార్ట్స్)కు ఈ సంత ఫేమస్. అందుకే ఎర్రగడ్డ సంతకు ఇంత క్రేజ్. నగరం నలుమూలల నుంచి..కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, అమీర్పేట నుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి ఈ మార్కెట్ను సందర్శించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుని మరీ వెళ్తుంటారు. ప్రతి వారం 30–40 వేల మంది వినియోగదారులు ఈ మార్కెట్ను సందర్శిస్తుంటారని ఓ అంచనా. సీజనల్ వ్యాపారాలకు ఊపునిస్తూ..చలికాలం మొదలైతే ఇక్కడ స్వెట్టర్లు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు, షాల్స్ అమ్మకాలు భారీగా జరుగుతాయి. ధాన్యపు రాశులు పోసినట్లు రోడ్లపై గుట్టలు పోస్తారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు, రంగురంగుల గొడుగులతో మార్కెట్ నిండిపోతుంది. వేసవి వచి్చందంటే కాటన్ దుస్తుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి.వందేళ్ల చరిత్రకు సాక్ష్యం..రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ వందేళ్ల చిత్రకు సాక్ష్యంగా ఇక్కడ మార్కెట్ నిలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వరకూ పశువుల సంత కూడా ఇక్కడే జరిగేది. వివిధ జిల్లాల నుంచి విభిన్న జాతుల ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను, వివిధ రకాల పంటలను రైతాంగం ఇక్కడ క్రయవిక్రయాలు జరిపేది. అయితే నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడి పశువులను సంతను మోతీనగర్ సమీపంలోని బబ్బుగూడకు తరలించారు. సాధారణ మార్కెట్ మాత్రం ఇక్కడే కొనసాగుతూ వస్తోంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు..వివిధ జాతులకు చెందిన పిల్లులను తెచ్చి అమ్ముతుంటాను. ఎప్పటికప్పుడు తన వద్దకు వచ్చే కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు పెంపుడు జంతువులు తెస్తుంటాం. ఆదివారం వచి్చందంటే ఇక్కడ వ్యాపారం తప్పనిసరి. ఇదే మా కుటుంబ పోషణ.– ఖాన్, వ్యాపారిస్పేర్ పార్ట్స్ కోసం.. మొబైల్ ఫోన్కు అవసరమైన స్పేర్పార్ట్స్ కోసం ఎల్బీనగర్ నుంచి వచ్చా. ఇక్కడ మార్కెట్లో ఏది కావాలన్నా దొరుకుతుంది.. మొదటిసారి ఇక్కడికి రావడంతో ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ ఇక్కడ చూశాను. – మహేష్ ఎల్బీనగర్ -
మార్కెట్.. ‘ట్రంపె’ట్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో బుధవారం దలాల్ స్ట్రీట్ ఒకశాతానికిపైగా లాభపడింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 80,378 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు బలపడి 24,484 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రంప్ ఆధిక్యంతో పాటు పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,094 పాయింట్లు పెరిగి 80,570 వద్ద, నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 24,538 వద్ద గరిష్టాలు తాకాయి. బీఎస్ఈలో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2.28%, రెండుశాతం రాణించాయి. రంగాల వారీగా అత్యధికంగా బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 4% లాభపడింది. టెక్ 3%, రియల్టీ 3%, ఇండ్రస్టియల్ 3%, సరీ్వసెస్ ఇండెక్సులు 2.50% రాణించాయి.అమెరికాలో అధికారం చేజిక్కించుకున్న రిపబ్లికన్ల పార్టీ ‘ట్రంప్ సరిచేస్తారు’ నినాదం అక్కడి మార్కెట్లనూ ప్రతిధ్వనించింది. యూఎస్ డోజోన్స్ 3%, ఎస్అండ్పీ 2%, నాస్డాక్ 2.5% లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ వైఖరి ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సుంకాల మోత ఖాయమనే అంచనాలతో ఆసియాలో చైనా, హాంగ్కాంగ్, థాయ్లాండ్, కొరియా సూచీలు 2.5% నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 2% వరకు పెరిగాయి. యూరప్లో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్టీఎస్ సూచీలు 1% నష్టపోయాయి. ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?ట్రంప్ గెలుపు ఆధిక్యం కొనసాగుతున్న వేళ డాలర్ల రూపంలో ఆదాయాలు ఆర్జించే దేశీయ ఐటీ కంపెనీల షేర్లకు డిమాండ్ లభించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ షేర్లు 4% లాభపడ్డాయి. సెన్సెక్స్లో అత్యధికంగా పెరిగిన షేర్లు ఇవే. పెర్సిస్టెంట్ 6%, ఎల్టీఐమైండ్టీ 5%, విప్రో షేర్లు 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ రెండురోజుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఎగసింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.10.47 లక్షల కోట్లు పెరిగి రూ.452 లక్షల కోట్లకు చేరింది.రూపాయి ఆల్టైమ్ కనిష్టండాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 22 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 84.31 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్కు మార్గం సుగమం కావడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో యూఎస్ కరెన్సీ డాలర్ బలపడటం దేశీయ కరెన్సీ కోతకు కారణమైంది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడమూ ప్రతికూలంగా మారింది.జీవితకాల గరిష్టానికి బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమనే వార్తలతో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ 8% ఎగసి జీవితకాల 75,000 డాలర్లకు చేరింది. క్రిప్టో కరెన్సీలకు ట్రంప్ సానుకూలత కలిసొచి్చందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో 77% ర్యాలీ చేసింది. ఎన్నికల సందర్భంగా అమెరికాను క్రిప్టోల రాజధానిగా మార్చడంతో పాటు వ్యూహాత్మక రిజర్వ్గా బిట్కాయిన్ను తీర్చిదిద్దుదామని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లపై జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికార వర్చువల్ ట్రేడింగ్ లేదా గేమింగ్ ప్లాట్ఫామ్లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేవలం రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీల (మధ్యవర్తిత్వ సంస్థలు) ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సూచించింది. యాప్లు/వెబ్ అప్లికేషన్లు/ప్లాట్ఫామ్లపై లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరల ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ లేదా ఫాంటసీ గేమ్లు ఆఫర్ చేస్తున్నట్టు సెబీ దృష్టికి వచ్చింది.ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీస్ చాంట్రాక్ట్ (రెగ్యులేషన్స్) చట్టం, 1956, సెబీ చట్టం 1992కు విరుద్ధమని, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్టు సెబీ తెలిపింది. రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే పెట్టుబడులు, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. ‘‘అనధికారిక పథకాల్లో పాల్గొనడం, వ్యక్తిగత కీలక సమాచారాన్ని పంచుకోవడం ఇన్వెస్టర్ల సొంత రిస్క్, పైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలకు ఇన్వెస్టర్లే బాధ్యులు. ఎందుకంటే ఆయా సంస్థలు సెబీ వద్ద నమోదైనవి కావు. కనుక ఆయా సంస్థలతో నిర్వహించే లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు పెట్టుబడిదారుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కార విభాగం తదితర సెబీ యంత్రాంగాలు అందుబాటులో ఉండవు’’ అని స్పష్టం చేసింది.విదేశీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విషయంలో సెబీ కొంత ఉపశమనాన్ని కల్పించనుంది. భారత సెక్యూరిటీల్లో విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన మేరకు.. ఆయా విదేశీ పథకాల్లో భారత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ తాజాగా ప్రకటించింది. అయితే ఆయా విదేశీ ఫండ్స్ భారత పెట్టుబడులు వాటి నిర్వహణ ఆస్తుల్లో 25 శాతానికి మించకూడదని పేర్కొంది.మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు సెబీ తాజా నిర్ణయం వీలు కల్పించనుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. ఫండ్స్ పెట్టుబడుల విలువ సెబీ పరిమితులను మించితే నిబంధనలకు అనుగుణంగా తగ్గించుకునేందుకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది. -
ఆరేళ్లలో ఈ2ఈ షేర్ ప్రభంజనం: రూ. 57 నుంచి రూ.5000కు!
స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చిన్న కంపెనీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్ఫామ్లో లిస్టయిన కంపెనీ ఈ2ఈ నెట్వర్క్స్. తాజాగా డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ పెట్టుబడుల రూపంలో 21 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. అయితే అతిచిన్న కంపెనీగా ప్రారంభమైన ఈ షేరు ప్రస్తుతం మిడ్క్యాప్ స్థాయికి చేరుకోవడం విశేషం!ప్రస్థానమిలా..2018 మే 15న ఎన్ఎస్ఈ ఎమర్జ్లో షేరుకి రూ. 57 ధరలో ఐపీవోకు వచ్చిన కంపెనీ ఈ2ఈ నెట్వర్క్స్. తాజాగా ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 4,978 వద్ద ముగిసింది. వెరసి వరుసగా ఏడో రోజు అప్పర్ సర్క్యూట్ వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రూ. 8,404 కోట్లకు చేరింది. గత 8 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు 48 శాతం జంప్చేసింది. గత నెల రోజుల్లో చూస్తే 70 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 3 శాతం నీరసించడం గమనార్హం!ఇటీవల ధూమ్ధామ్ గత 9 వారాలను పరిగణిస్తే అంటే సెపె్టంబర్ 2నుంచి ఈ2ఈ షేరు రూ. 2,332 నుంచి 113 శాతం ఎగసింది. నిజానికి 2024 జనవరి నుంచి 621 శాతం దూసుకెళ్లింది. ఈ సమయంలో నిఫ్టీ 10 శాతం మాత్రమే బలపడింది. ఇక 2023 ఆగస్ట్ 4న రూ. 285 వద్ద కదిలిన ఈ షేరు గత 15 నెలల్లో 17 రెట్లు లేదా 1,644 శాతం పురోగమించింది. కాగా.. 2024 సెపె్టంబర్30న సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా 1.05 శాతం వాటాకు సమానమైన 1,77,043 షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ2ఈ కంపెనీ షేరు మెయిన్బోర్డ్లో ట్రేడవుతోంది.కంపెనీ ఏం చేస్తుందంటే?ఈ2ఈ నెట్వర్క్స్ సీపీయూ, జీపీయూ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ను అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉంది. తద్వారా కస్టమర్లకు భారీస్థాయి జనరల్ అండ్ ఏఐ వర్క్లోడ్స్ను నిర్వహించడంలో సహకారమందిస్తుంది. చిప్ దిగ్గజం ఎన్విడియా సాంకేతిక సహకారం ఇందుకు కంపెనీకి తోడ్పాటునిస్తోంది. ఈ బాటలో చిప్ తయారీ దిగ్గజాలు ఎన్విడియా, ఇంటెల్, ఏఎండీసహా హెచ్పీఈ, మైక్రోసాఫ్ట్, డెల్తో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఓపెన్సోర్స్ టెక్నాలజీ ద్వారా ప్రొప్రయిటరీ వర్చువలైజేషన్, క్లౌడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్(ఐపీ) అభివృద్ధి చేస్తోంది. -
బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?
విజయదశమి నుంచి ప్రారంభమైన బంగారం ధరల పెరుగుదల.. ధన త్రయోదశి, దీపావళి పండుగల నాటికి జీవితకాల గరిష్టాలను తాకింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 82వేలుకు చేరువలో ఉంది. ఆంటే ఒక్క గ్రామ్ పసిడి కొనుగోలు చేయాలంటే రూ. 8,200 చెల్లించాల్సిందే అని స్పష్టమవుతుంది. ఇలాంటి సమయంలో బంగారం మీద పెట్టుబడులు సురక్షితమేనా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం భారీగా పెరుగుతున్న బంగారం ధరలు, మళ్ళీ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంటుందా అని పెట్టుబడిదారులు కొంత గందరగోళానికి గురి కావచ్చు. అయితే గత ఐదేళ్లలో పసిడి ధరలు భారీగా పెరగడం బహుశా ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశాలు లేదు.బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలని తెలుస్తోంది. అంతే కాకుండా యుద్ధం లాంటి పరిస్థితి ప్రపంచ వృద్ధి రేటును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతోంది. భారతదేశంలో బంగారంపై కస్టమ్స్ డ్యూటీలో కోత.. ధరల పెరుగుదలకు హేతువు అయింది. ఇదీ చదవండి: 102 టన్నుల బంగారం.. ఆర్బీఐ సీక్రెట్ ఆపరేషన్!డిమాండ్ అనేది సరఫరాను మించి ఉన్నప్పుడు.. ధరల పెరుగుదల సర్వసాధారణం. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారంపైన నిశ్చింతగా పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పసిడిపై పెట్టిన పెట్టుబడులు తప్పకుండా లాభాలను తెచ్చిపెడతాయని చెబుతున్నారు. -
కుళ్ళిపోతున్న ఉల్లి.. రైతుల ఆవేదన
-
ముడి చమురుకు కొరత లేదు
చండీగఢ్: అంతర్జాతీయంగా ముడి చమురుకు ఎలాంటి కొరత లేదని.. దేశీయ అవసరాలను తీర్చేందుకు వీలుగా తగినంత రిఫైనరీ సామర్థ్యం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ అవి కుదుటపడతాయన్న స్వీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.చండీగఢ్లో రోజ్గార్ మేళా సందర్భంగా మీడియా ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ పరిణామాలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 105 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రోజువారీగా ఉత్పత్తయ్యేది. ఓపెక్ కూటమి రోజువారీగా 5 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నది. అనంతరం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా చమురు రవాణాకు భిన్న మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగిపోయాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినా మన దగ్గరే పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఉన్నాయి.2021 నవంబర్లో, 2022 మే నెలలో రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నేడు చమురుకు కొరత లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ బ్యారెల్ చమురు ధర 72–73 బ్యారెళ్ల వద్దే ఉంది’’అని మంత్రి వివరించారు.దేశీయంగా 270 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీ సామర్థ్యం ఉండగా, దీన్ని 310 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 4 లక్షల బ్యారెళ్ల చమురు బ్రెజిల్ నుంచి మార్కెట్లోకి వస్తోందని, యూఎస్ సైతం మరింత పరిమాణాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి పురి చెప్పారు. -
నవంబర్ 6న స్విగ్గీ ఐపీవో!
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతిపాదిత రూ. 11,300 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 371 నుంచి 390 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూ నవంబర్ 8న ముగుస్తుందని, యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తేదీ నవంబర్ 5గా ఉంటుందని వివరించాయి.ఐపీవో కింద రూ. 4,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో రూ. 6,800 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, నార్త్వెస్ట్ వెంచర్స్ వాటాలను విక్రయించడం ద్వారా తమ పెట్టుబడులపై 35 రెట్లు రాబడులు పొందనున్నట్లు తెలిపాయి.తాజా ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 137 కోట్ల మొత్తాన్ని అనుబంధ సంస్థ స్కూట్నీ రుణాలను తీర్చేందుకు, రూ. 982 కోట్లను క్విక్ కామర్స్ సెగ్మెంట్లో డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ వేల్యుయేషన్ ఈ ఏడాది ఏప్రిల్లో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 మార్చి 31 నాటికి వార్షికాదాయం 1.09 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
మార్కెట్ నిండా ఉల్లి.. రైతులకు కష్టాల లొల్లి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్కు గ్రహణం పట్టింది. నాలుగు రోజులుగా సర్వర్ పనిచేయక వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారమయ్యేది. తొలిసారి నాలుగు రోజులుగా సర్వర్ మొండికేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ–నామ్ సాంకేతిక సమస్య కారణంగా ఉల్లి మినహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రేయింబవళ్లు యార్డుల్లోనే నిరీక్షణ ప్రస్తుతం ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో వారం రోజుల ముందే పంటను కోసి రైతులు మార్కెట్కు తెస్తున్నారు. ఫలితంగా మార్కెట్కు ఉల్లి వెల్లువెత్తుతోంది. విక్రయాలు ఒకరోజు ఆలస్యమైతే ధర పడిపోతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇదే సందర్భంలో ఈ–నామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా మాన్యువల్గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి.. ధరలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లాలంటే రైతులు రేయింబవళ్లు మార్కెట్ యార్డులోనే నిరీక్షించాల్సి వస్తోంది. నిత్యం 20 వేల టన్నులు రాక రాష్ట్రంలో ఉల్లి క్రయవిక్రయాలకు ఏకైక ఆధారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ మాత్రమే. పశి్చమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతున్నా.. అది పూర్తిగా ప్రైవేట్ మార్కెట్. కర్నూలు మార్కెట్ ప్రభుత్వం అ«దీనంలో ఉన్నందున రైతులు 60 శాతం పంటను కర్నూలు మార్కెట్కే తీసుకొస్తారు. ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే ఉల్లిని తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ ఏడాది మొదటి నుంచి ఉల్లి ధరలు మెరుగ్గా ఉండటం వల్ల సాగు పెరిగింది. 2023 ఖరీప్లో ఉమ్మడి కర్నూలు జిల్లాఓ 39,431 ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. ఈ ఏడాది 43,875 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు సగటున 5 టన్నుల చొప్పున ఈ ఏడాది 2,19,375 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఉల్లి పంటను కోసి రబీ పంటగా శనగ విత్తుకోవాలనే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. మరోవైపు పెరిగిన ధర ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో వారం, 10 రోజుల ముందుగానే పంటను కోసి మార్కెట్కు తెస్తున్నారు. దీంతో కర్నూలు మార్కెట్కు ఉల్లి పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు 20 వేల క్వింటాళ్లు వస్తుండటం విశేషం. గతంలో అత్యధికంగా రోజుకు 8 వేల క్వింటాళ్ల వరకే వచ్చేది. ఎటూ చూసినా ఉల్లి వాహనాలే మార్కెట్ యార్డు విస్తీర్ణం 26 ఎకరాలు. మార్కెట్ మొత్తం ఉల్లి పంటతో నిండిపోయింది. మ్యాన్యువల్ టెండర్ల కారణంగా ధరల నిర్ణయం ఆలస్యమవుతోంది. కాటాల్లోనూ జాప్యం జరుగుతోంది. కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు తరలించేందుకు తగినన్ని లారీలు లభ్యం కావడం లేదు. దీంతో యార్డులోని స్థలమంతా ఉల్లి వాహనాలతో నిండిపోయింది.అమ్ముకోవడానికి తెచ్చిన ఉల్లి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. అన్ని ప్రధాన రహదారుల్లో కిలోమీటర్కు పైగా ఉల్లి వాహనాలు బారులు తీరి ఉండిపోతున్నాయి. ఆ వాహనాలు అతి కష్టం మీద మార్కెట్లోకి వెళితే స్థలం దొరకడం లేదు. మరోవైపు అన్లోడ్ చేయడానికి హమాలీలు ఉండటం లేదు. పంటను అమ్ముకోవాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రమంతటా ఈ–నామ్ సమస్యే గతంలో ఈ–నామ్లో ఎటువంటి సమస్య ఏర్పడినా యుద్ధప్రాతిపదిక పరిష్కరించేవారు. తొలిసారిగా రోజుల తరబడి సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ సమస్య ఒక్క కర్నూలు మార్కెట్కే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లతోపాటు దేశవ్యాప్తంగా ఈ–నామ్ విధానం అమలవుతున్న అన్ని మార్కెట్లలో ఇదే సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తొలిసారి ఈ–నామ్ అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఎప్పుడు సమస్య వచ్చినా ఒకటి, ఒకటిన్నర రోజుల్లోనే పరిష్కారమయ్యేది. మొదటిసారిగా రోజుల తరబడి సమస్య ఉండిపోయింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. ఇది రైతులకు శాపంగా మారింది. ఉల్లి మినహా అన్నిరకాల పంట క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. – కట్టా శేఖర్, అధ్యక్షుడు, కమీషన్ ఏజెంట్ల సంఘం, కర్నూలు రైతులకు నరకమే పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు నరకం చూపిస్తున్నారు. పంటను ఆమ్ముకునేందుకు వస్తే.. మార్కెట్లోకి ప్రవేశించేందుకే తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ–నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యాన్యువల్గా టెండర్ వేయడం వల్ల ఆలస్యమవుతోంది. ధరలను ప్రకటించే సరికి సాయంత్రమైంది. పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లేది ఎప్పుడో తెలియడం లేదు. సర్వర్ సమస్య ఏర్పడినపుడు సత్వరం పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. – తిప్పారెడ్డి, బేతపల్లి, దేవనకొండ మండలం -
బంగారం ధర జిగేల్ జిగేల్!
బంగారం.. ఓ సింగారం.. ఓ ఆచారం..ఓ అవసరం.. ఓ ఫ్యాషన్.. ఇలా పేరు ఏదైనా నిత్య జీవితంలో దీనితో పెనవేసుకున్న బంధం వెలకట్టలేనిది.ఇంతగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ పసిడి ధర ఇప్పుడు కొండెక్కింది. కొండంటే మామూలు కొండ కాదు.. ఏకంగా ఎవరెస్టే ఎక్కి జిగేల్ జిగేల్మంటోంది.బంగారు కొనాలంటేనే భయం వేస్తోంది. గోల్డ్ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్షాపులకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. – నవిత, కిడ్స్ స్టూడియో నిర్వాహకులు, కర్నూలుసాక్షి ప్రతినిధి కర్నూలు: చరిత్రలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్ను దాటింది. బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ.80,070కి చేరింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలపై మరోసారి చర్చ మొదలైంది. చాలా వేగంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని కొందరు అంటుంటే.. ఇంకొందరు త్వరలోనే రూ.80 వేలు కాస్త రూ.లక్షకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు.. ఆశ్వీయుజ మాసంలో పెళ్లిళ్లకు సిద్ధమైన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. -
గార్ధభ సంరంభం
గాడిదల సంతలు దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి గాని, రాజస్థాన్లో జైపూర్ సమీపంలోని లునియావాస్ గ్రామంలో జరిగేది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద గాడిదల సంత. ఏటా దసరా నవరాత్రుల్లో ఇక్కడ గాడిదల సంత జరుగుతుంది. దాదాపు ఐదువందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పురాతనమైన గాడిదల సంతగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ సంత జైపూర్–ఆగ్రా రహదారిపై ఏకంగా 22 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. నవరాత్రుల రోజుల్లో ఈ మార్గంలో ప్రయాణించేవారికి ఎటుచూసినా గాడిదలే కనిపిస్తాయి. ఈ సంతకు వివిధ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తమ గాడిదలను తీసుకు వస్తారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ సంతను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు రాజస్థాన్ పర్యాటక శాఖ ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనివల్ల ఈ సంతకు దేశ విదేశాల పర్యాటకులు కూడా వస్తుండటం విశేషం. మొఘల్ సామ్రాజ్య కాలంలో అప్పటి రాజస్థాన్ పాలకుడు దులేరాజ్ సింగ్ హయాం నుంచి ఇక్కడ గాడిదల సంత జరుగుతూ వస్తోందని చెబుతారు. ఈ సంత జరిగే సమయంలో ‘ఖాలాకానీ’ అని స్థానికులు పిలుచుకునే ‘కాళరాత్రి’ అమ్మవారి పూజ కూడా విశేషంగా జరుపుతారు. కాళరాత్రి అమ్మవారి వాహనం గార్ధభం కనుక ఇక్కడ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సంతలో గాడిదల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాకుండా, గాడిదల అందాల పోటీలు, గాడిదల పరుగు పందేలు, గాడిదలు లాగే బళ్ల పందేలు కూడా జరుగుతాయి. ఈ సంతలో స్వదేశీ జాతులకు చెందిన కథియవాడీ, మార్వాడీ గాడిదలకు, అఫ్గాన్ గాడిదలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విచిత్రంగా ఈ సంతలో గాడిదలకు బాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టి మరీ అమ్ముతుంటారు. గత ఏడాది ప్రియంకా చోప్రా పేరు ఉన్న గాడిదకు ఏడువేల రూపాయల ధర పలికినట్లు ఒక వర్తకుడు చెప్పాడు. ఈ సంతలోని గాడిదల ధరలు మూడువేల రూపాయల నుంచి పదిహేనువేల రూపాయల వరకు ఉంటాయి. అఫ్గాన్ గాడిదలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. గాడిదల అందాల పోటీలు, పరుగు పందేలు వంటి వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన గాడిదల యజమానులకు వేర్వేరు దశల్లో ఐదువందల నుంచి పదివేల రూపాయల వరకు నగదు బహుమతులు కూడా ఉంటాయి. -
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
ఐపీవోల సందడే సందడి
సెకండరీ మార్కెట్లను మించుతూ ప్రైమరీ మార్కెట్ సైతం సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తోంది. జనవరి నుంచి ఇప్పటికే 62 కంపెనీలు ఐపీవోలకురాగా.. తాజాగా ఒకే రోజు 13 కంపెనీలు సెబీని ఆశ్రయించాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్డెస్క్రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను, సెకండరీ మార్కెట్ల జోష్ పలు అన్లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. దీంతో నిధుల సమీకరణతోపాటు.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు క్యూ కడుతున్నాయి. వెరసి తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఒకే రోజు 13 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ఈ జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్ తదితరాలు చేరాయి. ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ ఏడాది(2024) ఇప్పటివరకూ 62 కంపెనీలు రూ. 64,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2023) మొత్తంగా 57 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 49,436 కోట్లతో పోలిస్తే ఇది 29% అధికం! జాబితా ఇలా తాజాగా సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసిన కంపెనీల జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్, అజాక్స్ ఇంజినీరింగ్, రహీ ఇన్ఫ్రాటెక్, విక్రన్ ఇంజినీరింగ్, మిడ్వెస్ట్, వినే కార్పొరేషన్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, అల్ టైమ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, స్కోడా ట్యూబ్స్, దేవ్ యాక్సిలరేటర్ చోటు చేసుకున్నాయి. ఈ సంస్థలన్నీ కలసి రూ. 8,000 కోట్లవరకూ సమీకరించనున్నట్లు అంచనా. విస్తరణ ప్రణాళికలు, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, ప్రస్తుత వాటాదారుల వాటా విక్రయం తదితర లక్ష్యాలతో కంపెనీలు ఐపీవో బాట పడుతున్నట్లు నిపుణులు వివరించారు. సమీకరణ తీరిదీ ఐపీవోలో భాగంగా సోలార్ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.74 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇక వరిండెరా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ బాటలో ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా.. రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. కారణాలున్నాయ్ ప్రైమరీ మార్కెట్ల జోరుకు పలు సానుకూల అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, రంగాలవారీగా అనుకూలతలు, నిధుల లభ్యత, రిటైల్సహా సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి తదితరాలను ప్రస్తావించారు. దేశీ మ్యూచువల్ ఫండ్స్లోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తుండటం, యూఎస్లో వడ్డీ రేట్ల కోత సైతం ఇందుకు తోడ్పాటునిస్తున్నట్లు ఈక్విరస్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలియజేశారు. కోవిడ్–19, సబ్ప్రైమ్ సంక్షోభం, 2011 సెపె్టంబర్ ఉగ్రదాడి తదితర అనూహ్య విపరిణామాలు సంభవిస్తే తప్ప మార్కెట్లు పతనంకాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో 2025లో మార్కెట్ సరికొత్త రికార్డులను నెలకొల్పడంతోపాటు.. మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు తెలియజేశారు. -
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
సెబీ కొత్త రూల్స్.. డెట్ సెక్యూరిటీల నిబంధనలు మార్పు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రుణ(డెట్) సెక్యూరిటీల జారీ విధానాలను క్రమబద్ధీకరించేందుకు నడుం కట్టింది. ఇందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీంతో ఇక డెట్ సెక్యూరిటీల జారీ వేగవంతంకానుంది.తద్వారా పబ్లిక్కు సెక్యూరిటీలను జారీ చేసే సంస్థలకు నిధులు త్వరగా అందనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సెబీ పబ్లిక్ నుంచి స్పందన కోరే ముసాయిదా డాక్యుమెంట్ల గడువును ప్రస్తుత 7 రోజుల నుంచి 1 పనిదినానికి సవరించింది. ఇది ఇప్పటికే లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు వర్తించనుంది. ఇతరత్రా సెక్యూరిటీల జారీని చేపట్టే సంస్థలకు 5 రోజులుగా వర్తించనుంది.జాతీయస్థాయిలో టెర్మినళ్లు కలిగి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు ఫైలింగ్ తదుపరి ఒక రోజులోనే ముసాయిదా పత్రాలను దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో కనీస సబ్స్క్రిప్షన్ గడువును సెబీ 3 నుంచి 2 రోజులకు తగ్గించింది. -
కొంటున్నారు.. వింటున్నారు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆడియో డివైజ్ల ఆఫ్లైన్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. జూన్తో ముగిసిన పన్నెండు నెలల వ్యవధిలో మూవింగ్ యాన్యువల్ టర్నోవర్ (ఎంఏటీ) ప్రాతిపదికన 32 శాతం పెరిగి రూ. 3,400 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల స్థాయికి చేరింది. మరింత మెరుగైన అనుభూతినిచ్చే సౌండ్ టెక్నాలజీలు రావడం, వ్యక్తిగత–గృహ కేటగిరీల్లో అత్యంత నాణ్యమైన ఆడియో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఈ విభాగ వృద్ధికి తోడ్పడుతున్నాయి.పర్సనల్ ఆడియో సెగ్మెంట్లో అమ్మకాల పరిమాణం 61 శాతం మేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్, కన్జూమర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎన్ఐక్యూలో భాగమైన జీఎఫ్కే రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆడియో డివైజ్లపై భారతీయ వినియోగదారుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు, సౌకర్యవంతంగా వినేందుకు వారు మొగ్గు చూపుతున్నారు.మార్కెట్లో ఇప్పటికీ కాంపాక్ట్ స్టీరియో సిస్టమ్స్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, హోమ్ థియేటర్, స్మార్ట్ ఆడియో విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జెన్ జెడ్ కస్టమర్లకు హెడ్ఫోన్లు, హెడ్సెట్లు, మినీ/బ్లూటూత్ స్పీకర్లు తప్పనిసరి డివైజ్లుగా మారాయి. పాడ్కాస్ట్లు, ఆడియో సిరీస్ల్లాంటి కొత్త రకం కంటెంట్ ఫార్మాట్లు పెరుగుతుండటం కూడా ఈ ఉత్పత్తులకు దన్నుగా ఉంటోంది.నివేదికలోని మరిన్ని విశేషాలు..» వైర్లెస్, ట్రూ వైర్లెస్ డివైజ్లకు, నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లకు డిమాండ్ పెరిగింది. సగటు అమ్మకం ధర సుమారు 18 శాతం తగ్గింది. » పర్సనల్ ఆడియో సెగ్మెంట్లో ట్రూ వైర్లెస్ హెడ్సెట్స్కి గణనీయమైన ఆదరణ నెలకొంది. దీంతో ఈ విభాగంలో వాటి వాటా 38 శాతానికి పెరిగింది. » మినీ/బ్లూటూత్ స్పీకర్ల అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. రూ. 2,000 వరకు ధర ఉండే ఎంట్రీ లెవెల్ ప్రోడక్టుల విక్రయాలు 3 శాతం పెరిగాయి.» లౌడ్స్పీకర్ అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది రూ. 1,100 కోట్లకు చేరాయి. ఇందులో సౌండ్బార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 70 శాతం అమ్మకాలు బడా రిటైల్ చెయిన్ల ద్వారా ఉంటున్నాయి. ఇందులోనూ సౌత్ జోన్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు లౌడ్స్పీకర్ల డిమాండ్కి హాట్స్పాట్లుగా మారాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో అమ్మకాలకు ఈ విభాగంలోని విక్రయాల్లో దాదాపు 30 శాతం వాటా ఉండటమనేది, మెట్రోపాలిటన్యేతర ప్రాంతాల్లో కూడా ఈ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను సూచిస్తోంది. -
మెటాకు కీలక మార్కెట్గా భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలకమైన మార్కెట్లలో భారత్ కూడా ఒకటని సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్య దేవనాథన్ తెలిపారు. దేశీయంగా రీల్స్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాధనాలకు గణనీయంగా ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి రీల్స్కి ఉందని గుర్తించిన బ్రాండ్లు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు తమ ప్రచార కార్యక్రమాల్లో వాటిని తొలినాళ్ల నుంచే వినియోగించడం ప్రారంభించాయని సంధ్య చెప్పారు. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఓనమ్ వరకు వివిధ అంశాల గురించి సమాచారం కోసం భారతీయ యూజర్లు ఏఐ ఆధారిత చాట్బాట్ వైపు మళ్లుతున్నారని వివరించారు.ఈ నేపథ్యంలో దేశీయంగా వ్యాపారావకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మరింతగా పెట్టుబడులు పెట్టడాన్ని కంపెనీ కొనసాగిస్తుందని ఆమె చెప్పారు. జెన్ జడ్, యువ జనాభా, ప్రైవేట్ రంగం పుంజుకోవడం, పటిష్టమైన వృద్ధి అవకాశాలు, నవకల్పనలు, స్టార్టప్ వ్యవస్థ, పటిష్టమైన క్యాపిటల్ మార్కెట్లు మొదలైనవి భారత మార్కెట్కి సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.పరిశ్రమ వర్గాల్లోనూ ఆశాభావం నెలకొందని సంధ్య వివరించారు. ఇవన్నీ కూడా భారత్ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దాఖలాలను సూచిస్తున్నాయన్నారు. వాస్తవానికి చాలాకాలం క్రితమే దేశానికి ఈ హోదా దక్కాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. -
లాభాలు కొనసాగే వీలు
దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనా వార్తలు ఈక్విటీ మార్కెట్లను ముందుకు నడిపించవచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు దలాల్ స్ట్రీట్కు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.‘‘అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉంది’’ అని మెహ్తా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.యూఎస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడంతో పాలసీ సర్దుబాట్లకు సమయం ఆసన్నమైందంటూ ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో గతవారం సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సైతం సెంటిమెంట్ను బలపరిచాయి. ముఖ్యంగా విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 1,280 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాల వెల్లడి కారణంగా ఆటో రంగ షేర్లలో కదలికలు గమనించవచ్చు. ఇవాళ(సోమవారం) భారత్ పాటు చైనా, యూరోజోన్లు ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల చేయనున్నాయి. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటాను మంగళవారం ప్రకటించనుంది.దేశీయ సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం(సెప్టెంబర్ 4న) విడుదల అవుతాయి. ఆగస్టు 31తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(సెప్టెంబర్ 6న) విడుదల చేస్తుంది. ఇదే వారాంతాపు రోజున యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ అంచనా డేటా, అమెరికా నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్ను ప్రభావితం చేయగలవు. ఆగస్టులో రూ.7,320 కోట్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో రూ.7,320 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అధిక వాల్యుయేషన్ ఆందోళనలతో పాటు జపాన్ వడ్డీరేట్ల పెంపుతో యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆగస్టులో అమెరికా ఆర్థిక మాంద్య భయాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కూడా విదేశీ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అయితే జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం విశేషం. ఇదే నెలలో డెట్ మార్కెట్లో రూ.17,960 కోట్ల పెట్టుడులు పెట్టారు.‘‘ఎఫ్ఐలు సెప్టెంబర్లో కొనుగోళ్లు చేపట్టే వీలుంది. దేశీయ రాజకీయ స్థిరత్వం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు, మార్కెట్ వాల్యుయేషన్లు, రంగాల ప్రాధాన్యత, డెట్ మార్కెట్ ఆకర్షణ అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
పుట్టిన రోజుకు కొత్త బట్టలు తెచ్చా లే నాన్నా!
ఉరవకొండ: ‘ఆజీం లే నాన్నా.. ఈ రోజు నీ పుట్టిన రోజు.. కొత్త బట్టలు తెచ్చాం. నీ స్నేహితులు, టీచర్లకు చాక్లెట్లు పంచిపెట్టాలి’ అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. పుట్టిన దినం రోజే ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉరవకొండ పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక పాత మార్కెట్ సమీపంలో చాపదేవుని గుడి వద్ద నివాసముంటున్న అయ్యర్ బాబా ఫకృద్దీన్ ఉరవకొండ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు భార్య హుమేరా ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆజీంబాషా (14) సంతానం. బాలుడు ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రయివేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఉరవకొండలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ క్రమంలోనే రక్త కణాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అత్యవసరంగా అనంతపురంలోని కార్పొరేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక బుధవారం ఉదయం అజీంబాషా కన్నుమూశాడు. శోకసంద్రం.. : బుధవారం అజీంబాషా జన్మదినం. కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఇప్పటికే తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. కుమా రుడికి కొత్త దుస్తులు కూడా తెచ్చారు. సంతోషంగా ఉన్న సమయంలో ఆజీంబాషా మృతితో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఎంతో ఉల్లాసంగా, అందరితో కలివిడిగా ఉండే ఆజీంబాషా మృతితో పాత మార్కెట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉరవకొండ రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఏఎస్ఐ గురికాల శివ, కానిస్టేబుళ్లు కులశేఖర్రెడ్డి, ఓబుళేసు తదితరులు సంతాపం తెలిపారు. -
ఈక్విటీ కరెక్షన్తో తిరిగి బ్యాంకుల్లోకి డిపాజిట్లు
ముంబై: ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటుతో బ్యాంక్లు తిరిగి డిపాజిట్లను ఆకర్షించగలవని ఎస్బీఐ ఎండీ అశ్విని తివారీ అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ డిపాజిట్ల వృద్ధికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలను కీలకంగా చూస్తున్నట్టు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్లలో ర్యాలీతో బ్యాంకుల్లోని డిపాజిట్లు అధిక రాబడులను ఇచ్చే ఇతర సాధనాల్లోకి మళ్లేలా చేసినట్టు పేర్కొన్నారు.కాలక్రమేణా మార్కెట్ కరెక్షన్కు లోనైతే గతంలో తమ వద్ద డిపాజిట్లుగా ఉండే కొంత మొత్తం తిరిగి వెనక్కి వస్తుందన్నారు. తక్కువ విలువైన, చిన్న ఖాతాల ద్వారా డిపాజిట్లు పెంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు తివారీ తెలిపారు. జన్ధన్ యోజన ఖాతాలపై గతంలో ప్రత్యేక దృష్టి ఉండేది కాదంటూ, ఇక మీదట ఆ ఖాతాలను కూడా కీలకంగా చూస్తామన్నారు. గడిచిన 18 నెలలుగా బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే రుణాల వృద్ధే అధికంగా నమోదవుతుండడం గమనార్హం. దీంతో డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు రేట్లను పెంచడం లేదంటే రుణ వృద్ధిలో రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.దేశ ఈక్విటీ మార్కెట్ గడిచిన ఏడాదిన్నర పాటు గణనీయమైన వృద్ధిని చూడడం గమనార్హం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచవుల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న ధోరణి నెలకొంది. ఈ క్రమంలో అశ్విని తివారీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అన్సెక్యూర్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచడం, ప్రాజెక్టు రుణాలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం వంటివి డిపాజిట్లలో వృద్ధి నిదానించడానికి సంకేతంగా తివారీ పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా అవసరమైతే డిపాజిట్ల రేట్లను సైతం పెంచుతామని ప్రకటించారు. ప్రత్యామ్నాయాలు.. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో 90 శాతం మేర రుణ అవసరాలకు సరిపడా నిధులు డిపాజిట్ల రూపంలోనే వస్తుంటాయని.. ఇన్ఫ్రా బాండ్లు వంటి ఇతర సాధనాలవైపు చూడక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్ల వాటా తగ్గొచ్చని తివారీ చెప్పారు. సూక్ష్మ రుణాల పోర్ట్ఫోలియో చెల్లింపుల్లో ఎలాంటి వైరుధ్యాలు లేవన్నారు. -
దేశీ స్టీల్ పరిశ్రమకు చైనా ముప్పు!
న్యూఢిల్లీ: చైనాలో డిమాండ్ పడిపోవడంతో ఆ దేశం నుంచి ఉక్కు దిగుమతులు దేశాన్ని ముంచెత్తుతున్నాయంటూ కేంద్ర ఉక్కు శాఖ మాజీ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా తెలిపారు. ‘‘ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల పరంగా చూస్తే దిగుమతులు పెద్ద సమస్యగా ఉంది. చైనాలో వినియోగం పడిపోవడం మన మార్కెట్ను కుదిపేస్తోంది’’అని సిన్హా పేర్కొన్నారు.‘ఇండియన్ ఐరన్ ఓర్, పెల్లెట్’ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరిగిపోతున్న దిగుమతులతో స్థానిక ఉక్కు ఉత్పత్తుల ధరలపై, స్టీల్ తయారీ సంస్థల లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. ‘‘చైనా నుంచి అనుచితంగా దిగుమతులు వచ్చి పడుతున్నాయి. దీని పట్ల భారత ప్రభుత్వం సకాలంలో స్పందించాలి’’ అని అన్నారు. చైనా తదితర దేశాల నుంచి ముంచెత్తుతున్న చౌక స్టీల్ దిగుమతులను అడ్డుకోవాలంటూ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం గమనార్హం.ప్రపంచ ఉక్కు ఎగుమతుల కేంద్రంగా భారత్ మారాలన్న లక్ష్యానికి విరుద్ధంగా.. మన దేశం నికర దిగుమతుల దేశంగా మారుతుండడం పట్ల పరిశ్రమ ఆందోళనను వ్యక్తం చేసింది. దిగుమతులపై సంకాల విధింపునకు ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటే, అది దేశీ పరిశ్రమకు మేలు చేయబోదని సిన్హా అభిప్రాయపడ్డారు. -
ఉల్లి రేటు.. మహా ఘాటు
కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక వర్షాలకు పంట దెబ్బతినడం.. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వంటి పరిస్థితుల్లో ఉల్లి ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో రూ. 60కి పైగా ధర పలుకుతుండటంతో ఉల్లి కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు నిషేధించి ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకోవడంతో పాటు నాఫెడ్ ఆధ్వర్యంలోని నిల్వలను కూడా మార్కెట్లోకి పంపితేనే ధరలు తగ్గు ముఖం పడతాయంటున్నారు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉల్లి సాగవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా 87,500 ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి సాగు చేస్తుండగా.. 5.25 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు కేవలం 20,382 ఎకరాల్లోనే ఉల్లి సాగు చేస్తుండగా.. ఐదేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీంతో ఉత్పత్తి కూడా తగ్గుతోంది. రైతుల నుంచి మార్కెట్ యార్డుకు ఉల్లి రావడం భారీగా తగ్గింది. నాలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంట ఉల్లి ధరలు పెరగడానికి మహారాష్ట్రలో గత నెలలో కురిసిన భారీ వర్షాలే కారణమని తెలుస్తోంది. జూలై 24, 25 తేదీల్లో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 శాతం పంట నష్టం వాటిల్లింది. ఒక్క నాసిక్ జిల్లాలోనే 48 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తారు. కేవలం ఆ జిల్లానుంచే సుమారు 7 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉల్లి ఎక్కువగా సాగవుతుంది. జూలై మూడు, నాలుగో వారంలో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రాల్లోనూ పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉల్లిలో తేమ శాతం, ఘాటు ఎక్కువ. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఏపీలో పండే ఉల్లిని ఉత్తర భారతదేశంలో పెద్దగా ఇష్టపడరు. అందుకే ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ ఉల్లిని విక్రయిస్తారు. మిగిలిన రాష్ట్రాల్లో పండించే ఉల్లిలో తేమ శాతం, ఘాటు తక్కువ. వాటిని ఏడాది నుంచి రెండేళ్లపాటు నిల్వ చేయొచ్చు. అందుకే ఈ ఉల్లిని దేశీయంగా వినియోగించడంతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏపీలో వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. ఉత్తర భారతదేశంలో వర్షాలతో పంట దిగుబడులు తగ్గాయి. దీంతో మార్కెట్కు ఉల్లి రావడం లేదు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. రూ.5 వేలకు చేరే అవకాశం ఈ ఏడాది మే నెలలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా రూ.316 ఉంటే.. గరిష్టంగా రూ.1,617 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ.3,700కు పెరిగింది. మార్కెట్లో నిల్వలు తగ్గిపోతుండటంతో సెప్టెంబరులో ఉల్లి ధర క్వింటాల్కు రూ.4,500–రూ.5 వేల వరకూ చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 50 శాతం కొనుగోళ్లు తాడేపల్లిగూడెం నుంచే.. కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు జరుగుతాయి. మిగిలిన 80 శాతం పంటను తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ఇక్కడ దళారులను నియమించుకుని, వారి ద్వారా రైతులకు ముందుగానే అప్పులు ఇచ్చి, పంట చేతికి రాగానే మార్కెట్ ధల ప్రకారం తమకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యాపారులు కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 50 శాతం కొనుగోలు చేస్తారు. అక్కడి ప్రైవేట్ మార్కెట్లో విక్రయాలు సాగించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతులపై నిషేధం విధిస్తేనే ధరలకు కళ్లెం ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉల్లి రూ.120 నుంచి రూ.150 వరకూ ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఎగుమతులు నిషేధించడంతో పాటు నాఫెడ్లోని నిల్వలను కేంద్రం మార్కెట్లోకి విడుదల చేస్తే ధరలు దిగొస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. 2019లోఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధర క్వింటాల్ రూ.13,010 పలికింది. అప్పట్లో రిటైల్లో కిలో ఉల్లి రూ.150కి చేరింది. వినియోగదారులు ఇబ్బంది పడకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించింది. ఇప్పుడు కూడా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
Raksha Bandhan 2024: ఎక్కడ చూసినా మోదీ రాఖీలే..
అనుబంధాలను పంచుకునే పండుగ రక్షా బంధన్. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగ. రాఖీ నాడు సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, ఆశీర్వాదం పొందుతారు. ఈసారి రక్షాబంధన్ ఆగస్టు 19న వచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విక్రయాల కోసం రాఖీలను అందుబాటులో ఉంచారు. ఈసారి పిల్లల కోసం వెరైటీ రాఖీలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చిన్నారులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే ఛోటా భీమ్, హల్క్, డోరేమాన్, సూపర్మాన్, షించెన్, మోటు-పత్లు లాంటి అనేక కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.ఉత్తరాఖండ్లోని అల్మోరాకు చెందిన దుకాణదారు భాస్కర్ సాహ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున మార్కెట్లోకి వివిధ రకాల రాఖీలను తీసుకువస్తుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీకి అమితమైన డిమాండ్ ఏర్పడిందని, ఎక్కడ చూసినా ఇటువంటి రాఖీలు కనిపిస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో రూ.10 నుంచి రూ.50 వరకు ఖరీదు కలిగిన రాఖీలు విరివిగా విక్రయమవుతున్నాయన్నారు. -
నిరసనకు సిద్ధమైన సెబీ ఉద్యోగులు!
భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిరసన సెగ ఎదుర్కోబోతోంది. సంస్థలో ఏ, బీ, సీ గ్రేడ్లలో పనిచేసే సుమారు 700 మంది ఉద్యోగులు సోమవారం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయం, సెబీ భవన్ వన్ వద్ద నిరసనకు సిద్ధమైనట్లు ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదించింది.సంస్థ నాయకత్వంపై గత రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తే ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది. ఇక నిరసనకు ఆజ్యం పోసిన ప్రధాన అంశాలు మరికొన్ని ఉన్నాయి. సెబీ అందిస్తున్న అలవెన్సులు, ఆర్బీఐ అధికారులకు అందించే వాటి స్థాయిలో లేవనే అసంతృప్తి సెబీ అధికారుల్లో ఉంది.దీంతోపాటు కీ రిజల్ట్ ఏరియాస్ (KRA) అప్లోడ్ చేయడానికి ప్రవేశపెట్టిన కొత్త సిస్టమ్తో కొంత మందికి అలవెన్స్లు ఆగిపోయే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల అసంతృప్తులను చల్లార్చేందుకు క్షమాపణలు కోరుతూ సెబీ నాయకత్వం ఈమెయిల్ పంపినప్పటికీ ఉద్యోగులు నిరసనను విరమించుకోలేదని తెలిసింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ ముగింపు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం రికార్డ్ మార్కులు తాకిన బెంచ్ మార్క్ సూచీలు రోజంతా అదే దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ రికార్డ్ గరిష్టాన్ని కోల్పోకుండా అదే మార్క్ వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ 126.38 పాయింట్లు 0.15% పుంజుకుని 81,867.73 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 52.85 పాయింట్లు లేదా 0.21% లాభపడి 25,004.00 షెషన్ను ముగించింది.నిఫ్టీ సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయినర్స్గా లాభాలను అందుకున్నాయి. మహీంద్రా&మహీంద్రా, హీరో మోటర్ కార్ప్, టాటా స్టీల్, ఎస్బీఐ, టాటా మోటర్స్ షేర్లు టాప్ లూజర్స్గా నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 55.15 పాయింట్ల లాభంతో 81,410.99 వద్ద, నిఫ్టీ 1.85 పాయింట్ల లాభంతో 24,837.95 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్ వంటివి చేరాయి. ఎల్టీఐమైండ్ట్రీ (LTIMindtree), సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన టెక్ దిగ్గజం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దిగ్గజ కంపెనీలకు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సమస్య స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క సారిగా కంపెనీ 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది.టెక్ దిగ్గజం షేర్ విలువ ఒకేసారి 0.71 శాతం తగ్గింది. దీంతో కంపెనీ దాదాపు 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర నిన్నటి ముగింపు సమయంలో 443.52 డాలర్ల వద్ద ఉండేది. అయితే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఇది 440.37 డాలర్లకు పడిపోయినట్లు ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్ఫారమ్ స్టాక్లిటిక్స్ వెల్లడించింది.స్టాక్లిటిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రముఖ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలపైన గణనీయమైన ప్రభావం చూపాయి. భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది. -
తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. -
దిగ్గజ ఐపీవోలకు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. రూ. 5,500 కోట్లకు రెడీ ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్అండ్డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్కు, రూ. 1,600 కోట్లు ఆర్అండ్డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్కు పెట్టుబడులున్న ఎమ్క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281 ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. -
చల్ ‘వాహన’ రంగా..!
ప్యాసింజర్ వాహనాలకు (పీవీ) సంబంధించి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్గా భారత్ ఎదిగింది. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) వాటా ఇందులో దాదాపు సగం స్థాయిలో ఉంటోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 43 లక్షల యూనిట్లుగా ఉన్న పీవీల మార్కెట్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి అరవై లక్షలకు చేరొచ్చని, ఇందులో 20–21 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే (ఈవీ) ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాల డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం, పర్యావరణ అనుకూల కొత్త టెక్నాలజీలను వినియోగంలోకి తేవడంపై ఆటోమొబైల్ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఇందుకోసం దాదాపు రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.ఈవీలు, ఐసీఈలపై మారుతీ కసరత్తు.. మారుతీ సుజుకీ ఎస్యూవీ కేటగిరీలో తొలి ఈవీని గతేడాదే ఆవిష్కరించనున్నట్లు తొలుత ప్రకటించినా అది ఈ ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడింది. 2029–30 నాటికి మొత్తం ఆరు ఈవీలను భారత్లో ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 50 శాతం మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకునే క్రమంలో సామర్థ్యాల పెంపు, కొత్త మోడళ్ల అభివృద్ధి మొదలైన వాటిపై 2024–25లో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో సి ంహభాగం వాటా హరియాణా నాలోని ఖార్ఖోడా ప్లాంటుపైనే వెచ్చించనుంది. 2025 నాటికి ఇందులో ఉత్పత్తి ప్రారంభం కానుండగా, సంస్థకు ఏటా 2,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం జత కానుంది. ఎంఎస్ఐఎల్ ప్రస్తుతం గురుగ్రామ్, మానెసర్, హన్సల్పూర్ (గుజరాత్) ప్లాంట్లలో ఏటా 23.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు, మోడళ్ల శ్రేణిని 28కి పెంచుకునేందుకు 2030–31 నాటికి రూ. 1.25 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. టాటా మోటార్స్ 6 ఈవీలు... టాటా మోటార్స్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీలపై రూ. 16,000–18,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ విక్రయిస్తున్న కంపెనీ 2026 మార్చి నాటికి మరో ఆరు ఈవీలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. 2030 నాటికి పీవీ మార్కెట్లో 20 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.ఎంఅండ్ఎం రూ. 12,000 కోట్లు.. ఈవీల విభాగం మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్పై వచ్చే మూడేళ్లలో రూ. 12,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనకు ఎంఅండ్ఎం బోర్డు ఆమోదముద్ర వేసింది. 2025 తొలి త్రైమాసికంలో కంపెనీ తమ తొలి ‘బార్న్ ఈవీ’ శ్రేణిని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. 2027 నాటికి ఎంఅండ్ఎం అమ్మకాల్లో ఈవీల వాటా 20–30% ఉంటుందని అంచనా. 2030 నాటికి తొమ్మిది ఎస్యూవీలను, ఏడు బార్న్ ఎలక్ట్రిక్ వాహనాలను, ఏడు తేలికపాటి వాణిజ్య వాహనాలను ప్రవేశపెట్టేందుకు 2024–25 నుంచి 2026–27 మధ్య కాలంలో రూ. 27,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. ఇందులో ఐసీఈ వాహనాల కోసం రూ. 8,500 కోట్లు వెచ్చించనుంది.హ్యుందాయ్.. సై.. త్వరలో భారీ పబ్లిక్ ఇష్యూకి వస్తున్న కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వచ్చే 10 ఏళ్లలో రూ. 32,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తమిళనాడు ప్లాంటు సామర్థ్యాల పెంపు, విడిభాగాల వ్యవస్థ, ఈవీల తయారీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు మొదలైన వాటిపై రూ. 26,000 కోట్లు, జనరల్ మోటార్స్ నుంచి కొనుగోలు చేసిన తాలేగావ్ ప్లాంటుపై రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.లిస్టులో మరిన్ని కంపెనీలు.. » జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్త తరహా ఎనర్జీ వాహనాలను (ఎన్ఈవీ), ఐసీఈ వాహనాలను అభివృద్ధి చేసేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉంది. » కియా ఇండియా 2025లో ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం రూపొందించిన ఈవీని ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. » ఆరు వాహనాల అభివృద్ధి కోసం భారత్లో రూ. 5,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు నిస్సాన్, రెనో గతేడాది ప్రకటించాయి. వీటిలో రెండు ఈవీలు కూడా ఉండనున్నాయి. » ఇక ద్విచక్ర వాహనాలు, ఈవీల కోసం అవసరమయ్యే పరికరాల ఉత్పత్తి కోసం విడిభాగాల తయారీ సంస్థలు వచ్చే మూడు–నాలుగేళ్లలో రూ. 25,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఇందులో 45–50 శాతం మొత్తాన్ని బ్యాటరీ సెల్స్ తయారీపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. -
నామినీ నిబంధనలు సడలించిన సెబీ
డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్ఫోలియోలో నామినీ పేరును జతచేయాలనే నిబంధనను సడలిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.గతంలో సెబీ జారీ చేసిన నియమాల ప్రకారం..డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్ఫోలియోలో నామినీ పేరును తప్పకుండా జతచేయాలి. నామినీ అవసరం లేనివారు (ఆప్ట్ ఔట్ ఆఫ్ నామినేషన్) అని ఎంచుకోవాలి. ఇందులో ఏదో ఒకటి జూన్ 30లోపు తెలియజేయాల్సి ఉంది. ఆయా వివరాలు సమర్పించని వారి డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు జూన్30 తర్వాత పనిచేయవని సెబీ గతంలో చెప్పింది.ఈ నిబంధనలను మరోసారి పరిశీలించాలని సెబీకి మార్కెట్ వర్గాల నుంచి భారీగా అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని సెబీ తన పాత ఆదేశాలన్ని సడలిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మదుపు చేస్తున్న డీమ్యాట్ ఖాతాదారులు, ఫండ్ మదుపరులు నామినేషన్ వివరాలు తెలియజేయకపోయినా వారి ఖాతాల విషయంలో ఎలాంటి చర్యలుండవని సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు భౌతిక రూపంలో షేర్ల సర్టిఫికెట్లు ఉన్న వారికీ డివిడెండ్, వడ్డీ, ఇతర చెల్లింపులతోపాటు, అవసరమైన సేవల విషయాలన్నీ నామినేషన్తో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది.నామినీ జత చేయడంపై సెబీ సడలింపు ఇచ్చినా తప్పకుండా డీమ్యాట్, ఫండ్ పెట్టుబడిదారులు ఆయా వివరాలు నమోదు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కాబట్టి ఏక్షణం ఏదైనా జరగొగ్గచ్చు. మనం ఉన్నా..లేకపోయినా మనం కష్టపడి సంపాదించికున్న పెట్టుబడులు, లాభాలను నామినీకు చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. -
అన్నదాత అడిగేదొకటి..మార్కెట్లో ఉన్నదొకటి..
సాక్షి, హైదరాబాద్: అధిక దిగుబడులు వచ్చే పత్తి విత్తనాల కోసం రైతులు కోరుతుంటే.. ఆ విత్తనాలు అందుబాటులో లేకుండా ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. తమకు కావాల్సిన విత్తనాల కోసం రైతులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ క్యూలలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రాస్తారోకోలు సైతం చేస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను సరఫరాలో చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోరుకునే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. డిమాండ్ ఉన్న విత్తనాలను కొందరు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విత్తనాల కొరత లేదని చెబుతున్న అధికారులు... డిమాండ్ ఉన్న విత్తనాల కొరత విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పెద్దగా కొనుగోలు చేయని విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి కొందరు అధికారులు వాటిని మార్కెట్లో ప్రోత్సహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఏ రకం విత్తనాలకు డిమాండ్ ఉంటుందో వ్యవసాయశాఖకు తెలుసు.. కానీ వాటిని మార్కెట్లో ఎందుకు అందుబాటులో ఉంచలేదో అధికారులు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీజన్ ముంచుకొస్తున్నా...రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి. చినుకు పడితే చాలు రైతులు తక్షణమే పత్తి విత్తనాలు చల్లేస్తారు. ఇప్పుడు రైతులకు అత్యంత కీలకమైనవి పత్తి విత్తనాలే. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభానికి ముందుగా అధికారులు ప్రణాళిక రచించలేదు. రాష్ట్రంలో ఈసారి 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని భావించారు. గురువారం నాటికి 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే, మిగతా ప్యాకెట్లు కూడా వచ్చే నెల 5 నాటికి జిల్లాలకు చేరతాయని, అందువల్ల కొరతే లేదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఇతర కంపెనీల విత్తనాలనూ కొనుగోలు చేసుకోవాలని పిలుపునిస్తున్న అధికారులు.. దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు నిలదీస్తున్నారు. దిగుబడి తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాల ప్రవాహం...ప్రభుత్వం అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇదే అదనుగా భావించిన విత్తన దళారులు మూకుమ్మడిగా నకిలీ విత్తనాలను అన్నదాతకు అంటగడుతున్నారు. నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెలంగాణ జిల్లాలకు తరలించారు. ప్రభుత్వం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినా నకిలీ విత్తనాల బెడద వేధిస్తూనే ఉంది. ఇదిలావుంటే, పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేదు. 1.38 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలైన డయాంచ, సన్హెంప్, పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పటివరకు కేవలం 79 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాలకు చేరాయి. వ్యవసాయశాఖ లోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లేమి ఈ సమస్యకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక ఉన్నతాధికారి ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాల ని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశిస్తుంటే... మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్లుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఒక ఏఈవోను ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరుగా ఆదేశిస్తూ మరింత గందరగోళపరుస్తున్నారని వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేత ఆరోపించారు. ఐదో తేదీ నాటికి మిగతా పత్తి విత్తనాలుమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ మేరకు ఆయన విత్తన కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే, కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విత్తన కంపెనీలన్నీ ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేయాలని చెప్పారు. కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని, అన్ని విత్తనాల దిగుబడి ఒక్కటేనని ఆయన వివరించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి కూడా అన్నారు. -
ఫలితాలపై బెట్టింగ్ మార్కెట్ ప్రకంపనలు
2024 లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి దశ ఓటింగ్ జూన్ ఒకటిన జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం తమదేననే నమ్మకంతో ఉంది. ప్రధాని మోదీ కూడా బీజేపీకి 400కు పైగా లోక్సభ స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పారు. అయితే ‘బెట్టింగ్ మార్కెట్’ దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది.ముంబైకి చెందిన టాప్ బుకీ ఒకరు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభంలో అంటే మొదటి దశ ఓటింగ్కు ముందు, బీజేపీకి దక్కే సీట్లు అధికంగా ఉంటాయనే అంచనాలున్నాయన్నారు. అయితే అయితే మూడు దశల ఓటింగ్ తర్వాత బీజేపీకి ఆదరణ తగ్గిందన్నారు. ఇప్పుడు ఆరు దశల ఓటింగ్ తర్వాత బీజేపీ పరిస్థితి తారుమారయ్యిదన్నారు.బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ 295 నుంచి 305 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్కు 55 నుంచి 65 సీట్లు వస్తాయనే అంచానాలున్నాయి. మార్కెట్ ఎప్పుడూ బీజేపీ చెప్పిన 400 లెక్కకు మద్దతునివ్వలేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం బీజేపీకి 350 సీట్లు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ముంబై బుకీ తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్ మార్కెట్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు దక్కే లోక్సభ సీట్లపై వేసిన అంచనాలిలా ఉన్నాయి.ఫలోడి బెట్టింగ్ మార్కెట్ (రాజస్థాన్)🔹కాంగ్రెస్ - 117🔹ఇండియా - 246🔹బీజేపీ - 209🔹ఎన్డీఏ - 253పాలన్పూర్ (గుజరాత్)🔹కాంగ్రెస్ - 112🔹ఇండియా - 225🔹బీజేపీ - 216🔹ఎన్డీఏ - 247కర్నాల్ (హర్యానా)🔹కాంగ్రెస్ - 108🔹ఇండియా - 231🔹బీజేపీ - 235🔹ఎన్డీఏ-263బెల్గాం (కర్నాటక)🔹కాంగ్రెస్ - 120🔹ఇండియా - 230🔹బీజేపీ - 223🔹ఎన్డీఏ-265కోల్కతా 🔹కాంగ్రెస్ - 128🔹భారతదేశం - 228🔹బీజేపీ - 218🔹ఎన్డీఏ - 261విజయవాడ 🔹కాంగ్రెస్ - 121🔹ఇండియా- 237🔹బీజేపీ - 224🔹ఎన్డీఏ - 251ఇండోర్ 🔹కాంగ్రెస్ - 94🔹ఇండియా - 180🔹బీజేపీ - 260🔹ఎన్డీఏ - 283అహ్మదాబాద్ 🔹కాంగ్రెస్ - 104🔹ఇండియా - 193🔹బీజేపీ - 241🔹ఎన్డీఏ-270సూరత్ 🔹కాంగ్రెస్ - 96🔹ఇండియా - 186🔹బీజేపీ - 247🔹ఎన్డీఏ - 282దేశంలోని పలు బెట్టింగ్ మార్కెట్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ జరిగాక, జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ సత్తా ఎంతో తేలిపోనుంది. -
దొడ్డురకం వడ్లకూ బోనస్ ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం, దొడ్డురకం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు గేటు ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రేవంత్రెడ్డి తన మేనిఫెస్టోలో పేర్కొన్నారని, కానీ ఇటీవల కేబినేట్ సమావేశంలో మాత్రం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే ఇవ్వా లని నిర్ణయించడం సరైంది కాదని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తుతూ కొందరు రైతులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుబంధు నిధులను కూడా సకాలంలో అందించాలని, సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం మొండివైఖరిని విడనాడాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు భిక్షం, లక్ష్మయ్య, సుధాకర్ తదితరులు హెచ్చరించారు. -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్/ జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన అంశంపై సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అద నపు కలెక్టర్ రోహిత్ సింగ్కు నా అభినందనలు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. ముగ్గురు ట్రేడర్లపై కేసులు జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తు న్నారంటూ రైతులు బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ రోహిత్సింగ్.. మార్కెట్ కార్యదర్శి భాస్క ర్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకున్నాక కార్యదర్శిపై చర్యలు చేపడతామన్నారు. మరోవైపు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ రఘు పతిరెడ్డి తెలిపారు. ప్రైవేటు మార్కెట్లో ధాన్యానికి రూ.1,800కన్నా ఎక్కువ ధర ఇవ్వాలని అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు కేవలం రూ.30 పెంచి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. -
‘గ్యాప్’ పంటలకు ధరహాసం
సాక్షి, అమరావతి: మంచి వ్యవసాయ పద్ధతులు (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్–గ్యాప్) సర్టిఫికేషన్ రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పండించిన పంటలకు మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తోంది. పంట ఉత్పత్తుల్ని నచ్చినచోట నచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు లభించడంతో రైతుల ఆనందం అవధులు దాటుతోంది. నాణ్యమైన ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని నియంత్రిస్తూ నాణ్యమైన ఉత్పాదకతను పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకోసం పొలం బడులు, తోట బడులæను నిర్వహిస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని రైతుల ముంగిటకు చేరుస్తోంది. ఫలితంగా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా అవుతుండగా.. దిగుబడులు 9 నుంచి 20 శాతం పెరిగి రైతులకు గణనీయమైన ఆదాయాన్ని ఇస్తోంది. పంట ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్వాలిటీ కౌన్సిల్ గుర్తింపుతో గ్యాప్ సర్టిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా దేశంలోనే తొలి అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్ పొందేందుకు సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా, వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా, తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వారిని ఇంటర్నెల్ ఇన్స్పెక్టర్స్గా ప్రభుత్వం నియమించింది. సర్టిఫికేషన్ జారీ కోసం అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు, సిబ్బందికి రైతులు పాటించాల్సిన ప్రమాణాలపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. క్వింటాల్కు రూ.7,500 లభించింది రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి తగిన మోతాదులో ఎరువులు వినియోగించాను. ఒకే ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేశాను. ఎకరాకు రూ.19,400 పెట్టుబడి అయ్యింది. రెండెకరాలకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్యాప్ సర్టిఫికేషన్తో వేరుశనగ క్వింటాల్కు రూ.7,500 చొప్పున ధర లభించింది. పెట్టుబడి పోగా రూ.66 వేల నికర ఆదాయం వచ్చింది. – బి.రామ్మోహన్, ఎం.వేముల, అన్నమయ్య జిల్లా నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మీదేవి నాలుగేళ్లుగా పొలంబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటల్ని పండిస్తోంది. ఖరీఫ్–2023 సీజన్లో రెండెకరాల్లో కొర్రలు సాగు చేసింది. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున మాత్రమే దిగుబడులొచ్చాయి. కానీ.. ఈమె గ్యాప్ సర్టిఫికేషన్ పొందటం వల్ల క్వింటాల్ కొర్రలకు రూ.7 వేలకు పైగా ధర లభించిందని సంతోషంతో చెబుతోంది. ఇప్పటికే 1,673 మంది రైతులకు లబ్ధి ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాలో గ్యాప్ క్లస్టర్స్ ఎంపిక చేశారు. ఆయా క్లస్టర్లలో 990 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ వంటి వ్యవసాయ.. 2,534 ఎకరాల్లో మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల వంటి ఉద్యాన పంటలను గుర్తించారు. 1,673 మంది రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇండిగ్యాప్ సరి్టఫికేషన్కు అనుసరించాల్సిన విధి విధానాలు, ఆహార ప్రమాణాలపై కృషి గ్యాప్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చారు. నాణ్యత పర్యవేక్షణకు సాంకేతిక బృందం ద్వారా దశల వారీగా తనిఖీలు, అంతర్గత ఆడిట్ నిర్వహించారు. సేకరించిన నమూనాలను పరీక్షించి పురుగు మందుల అవశేషాల గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్టుగా నిర్ధారించిన పంట ఉత్పత్తులకు ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేశారు. సర్టిఫికేషన్ పొందిన రైతులు వారి పంట ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే మిన్నగా ప్రీమియం ధరకు విక్రయించుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించగలిగారు. గ్యాప్ సర్టిఫికేషన్తో వ్యాపారులూ పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోతకొచ్చిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరల కంటే అధిక ధరలకు రైతులు అమ్ముకోగలిగారు. కొర్రలకు మద్దతు ధర రూ.2,500 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్ కొర్రల్ని ధర రూ.7 వేలకు అమ్ముకోగలిగారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.2,203 కాగా.. రైతులు రూ.4 వేలకు పైగా పొందగలిగారు. వేరుశనగ మద్దతు ధర రూ.5,850 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్తో రూ.8,300కు పైగా ధర లభించింది. రాగుల మద్దతు ధర క్వింటాల్కు రూ.3,846 ఉండగా.. సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్కు రూ.5 వేలకు పైగా ధర పొందగలిగారు. -
అమెరికాలో మన రైతుబజార్లకు సమానంగా ఏమున్నాయి?
హాలీవుడ్ సినిమాలకు ప్రసిద్ధిగాంచిన లాస్ ఏంజిల్స్ మహానగరంలో నేను చూసిన ప్రదేశాల్లో నాకు సినిమా స్టూడియోల కన్నా కూడా బాగా నచ్చింది ఈబీ గిల్మోర్ ఫార్మర్స్ మార్కెట్. ఎందుకంటే..? నాకు వ్యవసాయ సహకార రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా పనిచేసిన అనుభవం ఉంది. ఎర్లీబెల్ గిల్మోర్ 1934 లో ప్రారంభించిన ఈ రైతుబజారులో వ్యవసాయ సంబంధమే కాదు అన్ని వస్తువులు పిల్లల ఆటవస్తువులు, గిఫ్ట్ ఐటమ్స్ (అవీ వారి ఉత్పత్తులేనంటారు ) వంటివి కూడా దొరకడం విశేషం. రుచికరమైన ఆహార పానీయాలు అందించే రెస్టారెంట్లకు లెక్కేలేదు. ఇక్కడికి వచ్చే జనం కొనుక్కుపోయే వాటికన్నా ఇక్కడ తినేవే ఎక్కువ. నేను గమనించిందేంటంటే, అమెరికన్లు తినేదానికన్నా వృధాగా పడేసేదే ఎక్కువ. పొద్దున్నుండి రాత్రివరకు పనిచేసే ఈ మార్కెట్ మామూలు రోజుల్లోనే కిటకిట లాడుతుంది, ఇక వీకెండ్స్లో చెప్పే పని లేదు. బయటి నుండి వచ్చే యాత్రీకుల రద్దీ కూడా ఎక్కువే. హాలీవుడ్ సినిమాల వాళ్ళు కూడా తరచుగా ఈ మార్కెట్ కు వస్తుంటారన్నది మరో ఆకర్షణ. ఈ ఫార్మర్స్ మార్కెట్ ప్రత్యేకత ఉత్పత్తిదారులే ఇక్కడ స్వయంగా తమ ఉత్పత్తులు అమ్ముకోవడం , ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయదారులు, అవి చౌక ధరలకు లభిస్తాయన్న వినియోగదారుల నమ్మకం. అంతేకాదు ఈ మార్కెట్కు సరాసరి ఫామ్ నుండి సరఫరా ఔతాయి కాబట్టి పండ్లు, కూరగాయలు తాజాగా ఉండడం. అమ్మకం దారుల మధ్య నున్న తీవ్రమైన పోటీవల్ల ఇక్కడ ఏది కొన్నా బయటి మార్కెట్ కన్నా తక్కువ ధరలకే లభిస్తాయి. అమెరికాలో ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా మనకు లభించే కనీస సౌకర్యాలు పార్కింగ్, రెస్ట్ రూంలు, ఈ మార్కెట్లో ఏటీఎం, టెలిఫోన్ బూత్, పోస్ట్ ఆఫీసు వంటివి కూడా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యం సందర్శకుల రక్షణ, ఎప్పుడు ఏ టెర్రరిస్ట్లు ఎటునుండి వచ్చి దాడి చేస్తారోనని అమెరికా వాళ్ళు నిరంతరం జాగ్రత్తగా ఉంటుంటారు, అది ఈ మార్కెట్లో స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి రైతుల మార్కెట్లకు అమెరికాలో ఈ మధ్యకాలంలో గిరాకీ ఎక్కువ అవుతుందని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. డైరెక్ట్ సేల్స్ వృద్ధి 9.6 శాతం ఉందని ఆ దేశ వ్యవసాయశాఖ వారి గణాంకాలు తెలుపుతున్నాయి. 1994 నాటికి అమెరికాలో రిజిస్టరై నడపబడుతున్న రైతుబజార్లు 1744 కాగా, 2012 నాటికి వాటి సంఖ్య 7864కు చేరింది. ఇందుకు ముఖ్య కారణం రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పండించబడిన ఆహారపదార్థాలతో విసిగిపోయినవారు ఆర్గానిక్ ఫుడ్స్ కోసం రైతు బజార్ల వైపు చూస్తున్నారట, ఇలాంటి వాటికి ఎక్కువ ధర అయినా చెల్లించడానికి వారు వెనకాడడం లేదట. మన దేశంలో మన రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రారంభించిన రైతు బజార్లలో రైతులకు బదులు దళారులు ఎక్కువగా కనిపిస్తారు. రైతులే తమ పంటలు అమ్ముకుంటారనుకుంటే అందులో కూడా సేంద్రియ, పర్యావరణ, జీవసంబంధ పంటల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు వారి స్థానాల్లో మధ్య దళారులు కాస్తా దుకాణాలను కబ్జా చేయడం, ఏది పడితే అది అమ్మడం వల్ల బయటి మార్కెట్లకు వీటికి తేడా లేకుండాపోవడం.. ఇవన్నీ ఇక్కడి అనుభవాలు. మరి అమెరికాలో.. ఇలాంటి మార్కెట్లలో చాలా వసతులతో పాటు కొత్త విషయాలెన్నో ఉన్నాయి. ముందు ముందు మనం కూడా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుందాం. --వేముల ప్రభాకర్ -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం మునుపటి ముంగింపు దగ్గరే ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 వరకు నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 22,064కు చేరింది. సెన్సెక్స్ 4 పాయింట్లు లాభపడి 72.602 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలోని నాస్డాక్ 0.3శాతం నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడోరోజు ఈ సూచీ నష్టాలభాట పట్టినట్లు తెలిసింది. ఫెడ్ మినట్స్ మీటింగ్లో ప్రధానంగా మార్చి 2024లో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు సెంట్రల్ బ్యాంక్లు అచితూచి వ్యవహరించనున్నాయని తెలుస్తుంది. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్లు 4.8 పాయింట్లు పెరిగి 4.32 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.08శాతం నష్టపోయి 103.97కు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.284.66 కోట్ల విలువ చేసే స్టాక్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.411.57 కోట్లు విలువైన స్టాక్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నో ఫ్యాట్, నో షుగర్.. మార్కెట్లోకి ‘నీలకంఠ’ ఆలూ!
మనం పలు రకాల బంగాళ దుంపలను(ఆలూ) చూసేవుంటాం. అయితే ఇప్పుడు తాజాగా నీలకంఠ ఆలూను మార్కెట్లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగు బంగాళాదుంప. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మూడేళ్లలో 17 బిలియన్ డాలర్లకు!
నాస్కామ్–బీసీజీ నివేదిక ముంబై: దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ ఏటా 25–35% వృద్ధి చెందుతోంది. కంపెనీలు టెక్నాలజీపై మరింతగా ఖర్చు చేస్తుండటం, ఏఐ నిపుణులు.. ఏఐపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2027 నాటికి ఇది 17 బిలియన్ డాలర్లకు చేరనుంది. టెక్నాలజీ, లీడర్ షిప్ ఫోరం 2024 సందర్భంగా సంయుక్త నివేదికలో టెక్ సంస్థల సమాఖ్య నాస్కామ్, బీసీజీ ఈ మేరకు అంచనా వేశాయి. అంతర్జాతీయంగా ఏఐపై పెట్టుబడులు 2019 నుంచి ఏటా 24% వృద్ధి చెందాయి. 2023లో 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా డేటా అనలిటిక్స్, జెన్ఏఐ, ఎంఎల్ అల్గోరిథమ్స్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. వినూత్న సొల్యూషన్స్ .. టెక్నాలజీ సర్విస్ ప్రొవైడర్లు సాంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధిని దాటి ఏఐ ఆధారిత వినూత్న సేవలు, సొల్యూషన్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ టూల్స్, డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్తో పాటు హెల్త్కేర్, బ్యాంకింగ్ .. ఫైనాన్స్, రిటైల్ వంటి నిర్దిష్ట రంగాల అవసరాలకు అనుగుణమైన ప్రొప్రైటరీ ఏఐ.. జనరేటివ్ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. ► ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా ఏఐ నైపుణ్యాలున్న ప్రతిభావంతులు మూడు రెట్లు అధికంగా ఉన్నారు. గత ఏడేళ్లుగా చూస్తే ఏఐ నిపుణుల సంఖ్య 14 రెట్లు పెరిగింది. ఏఐ నిపుణుల విషయంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ► ఏఐలో పెట్టుబడులు పెరిగే కొద్దీ భారత్లో కృత్రిమ మేధ నిపుణుల సంఖ్య 2027 నాటికి వార్షికంగా 15 శాతం మేర వృద్ధి చెందనుంది. -
హీటింగ్, వెంటిలేషన్, ఏసీలకు డిమాండ్
నోయిడా: మౌలికరంగ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తుండడంతో రానున్న రోజుల్లో హీటింగ్, వెంటిలేషన్, ఏసీ (హెచ్వీఏసీ) రంగానికి అసాధారణ వృద్ధి అవకాశాలు రానున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మౌలిక రంగానికి 2024–25 మధ్యంతర బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే. యాక్రెక్స్ ఇండియా 23వ ఎడిషన్ కార్యక్రమం సందర్భంగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై 1.45 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేయనుండడంతో అసాధారణ వృద్ధికి అవకాశాలున్నట్టు హెచ్వీఏసీ పరిశ్రమ మండలి ‘ఐఎస్హెచ్ఆర్ఏఈ’ ప్రెసిడెంట్ యోగేష్ ఠాకూర్ తెలిపారు. సీ, రిఫ్రిజిరేషన్ రంగంలో పర్యావరణ అనుకూల విధానాల అమలుకు ఈ కార్యక్రమ తోడ్పడుతుందని ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ పేర్కొన్నారు. ఐఎస్హెచ్ఆర్ఏఈ ప్రెసిడెంట్గా ఎన్నికైన అనూప్ బల్లే మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గింపునకు, నైపుణ్యాల అభివృద్ధికి పరిశ్రమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 2030 నాటికి 10 లక్షల జనాభాను మించిన పట్టణాలు 42 నుంచి 68కి పెరుగుతాయని, ఇది సీ సిస్టమ్లకు డిమాండ్ను పెంచుతుందని క్యారియల్ ఇండియా ఎండీ సంజయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ వంటి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రస్తుతం దేశ ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ రంగం 9 బిలియన్ డాలర్ల మేర ఉన్నట్టు వోల్టాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకందన్ మీనన్ పేర్కొన్నారు. -
ఉద్రిక్తత.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ను లాక్కెళ్లిన రైతులు
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి ఛైర్మన్ ఛాంబర్లోకి దూసుకెళ్లిన రైతులు.. ఛైర్మన్ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు. -
దేశంలో అత్యంత విలువైన సంస్థగా ఎల్ఐసీ
ప్రముఖ జీవిత బీమా ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. ఎల్ఐసీ డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఇక మార్కెట్ క్యాప్ చార్ట్లో అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,టాటా కన్సల్టెన్సీ సర్వీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత విలువైన కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్ను ఎల్ఐసి అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది. -
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్తో సహా అన్ని చైన్ రిటైల్లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
ఇదేం ఆఫర్ సామీ! ఇల్లు కొంటే భార్య ఉచితమా?
చైనాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే.. దీంతో అక్కడ ఆస్తుల విలువల ఆర్థిక వ్యవస్థపై ఘోరంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ సంకోభం చైనా ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలుచేసింది. చాలా తిరోగమనంలో సాగుతోంది. దీంతో కొందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులురకరకాల మార్కెట్ వ్యూహాలతో ఇళ్లను అమ్మే పనిలో పడ్డారు. ఈ ప్రకటనల విషయంలో వారిలోంచి ఎంతలా క్రియేటివిటీ బయటకొస్తుందంటే..నిర్ఘాంతపోయేంత విచిత్రమైన స్థితిలో ఉన్నాయా ప్రకటనలు. వింటే మాత్రం..వామ్మే ఇదేం ఆఫర్ అని నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం! తాజగా టియాంజన్లోని ఓ కంపెనీ ఎంత విచిత్రమైన రీతీలో అడ్వర్టైస్మెంట్ చేసిందంటే..ఛీ అని కచ్చితంగా అంటారు. మరి ఇంత ఘోరమా! అని అనుకుండా ఉండలేరు. ఇళ్లు అమ్ముడుపోవాలని ఏకంగా 'ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి' అని అడ్వర్టైస్మెంట్ ఇచ్చింది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని మరో కంపెనీ ఏకంగా బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించిందట. ఇల్లు కొనడానికి ఏదైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు గానీ మరీ ఇలా భార్యలేంటి అని అందరూ సీరియస్ అయ్యారు. పైగా ఇది చైనీస్ రెగ్యులేటర్లకు కూడా నచ్చలేదట. ఇలా ప్రకటన ఇచ్చినందుకగానూ సదరు కంపెనీకి రూ. 3 లక్షల దాక జరిమాన విధించింది. గత రెండేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ పడిపోవడం ప్రారంభించింది. ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. దీంతో అనేక మల్టీ బిలయన్ డాలర్ల కంపెనీ కుప్పకూలాయి. దీని ప్రభావంతో చైనాలో నాలుగు సంపన్న నగరాల్లో గృహాల ధరలు దారుణంగా పడిపోయాయి. అలాగే కొత్త ఇళ్లు విక్రయాలు కూడా తగ్గిపోయాయి. అంతేగాదు ఈ రియల్ ఎస్టేట్ తిరోగమనం మరో రెండేళ్ల పాటు కొనసాగుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మాజీ హెడ్ షెంగ్ సాంగ్చెంగ్ అంచనా వేశారు. పైగా దశాబ్దం క్రితం రెండంకెల వృద్ధిని సాధించిన చైనా ఆర్థిక వ్యవస్థ నాలుగో త్రైమాసికంలో కేవలం 5.2% వృద్ధితో ఆర్థికవేత్తల అంచనాలను సైతం అందుకోలేకపోయింది. (చదవండి: మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!) -
మార్కెట్ నుంచి రూ.9.5 లక్షల కోట్లు - ప్రైమ్డేటాబేస్ రిపోర్ట్
ముంబై: దేశీ కార్పొరేట్ సంస్థలు గతేడాది (2023) మార్కెట్ నుంచి రూ. 9.58 లక్షల కోట్ల నిధులు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 26 శాతం అధికం. అప్పట్లో కార్పొరేట్ బాండ్ల ద్వారా కంపెనీలు రూ. 7.58 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైమ్డేటాబేస్ క్రోడీకరించిన గణాంకాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో 863 సంస్థలు బాండ్లను జారీ చేయగా 2023లో ఈ సంఖ్య 920కి పెరిగింది. రుణాలకు డిమాండ్ పెరగడం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీపరంగా సవాళ్లు నెలకొనడంతో మార్కెట్ బాట పట్టే కార్పొరేట్ల సంఖ్య పెరిగిందని ప్రైమ్డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా తెలిపారు. గతేడాది ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అత్యధికంగా రూ. 4.72 లక్షల కోట్లు సమీకరించాయి. 2022లో నమోదైన రూ. 3.66 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ఇక ప్రైవేట్ రంగం నిధుల సేకరణ రూ. 3.18 లక్షల కోట్ల నుంచి 40 శాతం పెరిగి రూ. 4.45 లక్షల కోట్లకు చేరినట్లు హల్దియా చెప్పారు. మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 41 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2022లో ఇది 38 శాతమేనని వివరించారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. 2023లో మార్కెట్ నుంచి అత్యధికంగా నిధులు సమీకరించిన సంస్థల్లో హెచ్డీఎఫ్సీ (రూ. 74,062 కోట్లు), నాబార్డ్ (రూ. 63,164 కోట్లు), పీఎఫ్సీ (రూ. 52,575 కోట్లు), ఆర్ఈసీ (రూ. 51,354 కోట్లు), ఎస్బీఐ (రూ. 51,080 కోట్లు) ఉన్నాయి. ఈ ఐదు సంస్థలు కలిసి మొత్తం రూ. 2.92 లక్షల కోట్లు సేకరించాయి (గతేడాది మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 31 శాతం). 2022లో టాప్ 5 ఇష్యూయర్లు రూ. 1.96,276 కోట్లు సేకరించాయి (ఆ ఏడాది కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 26 శాతం). రూ. 5.61 లక్షల కోట్ల మొత్తానికి (దాదాపు 59 శాతం) కూపన్ రేటు 7–8 శాతంగా ఉండగా, 16 శాతం నిధులకు (రూ. 1.55 లక్షల కోట్లు) 8–9 శాతం శ్రేణిలో ఉంది. 2023లో 404 సంస్థలు తొలిసారి మార్కెట్ నుంచి సమీకరించాయి. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 408గా నమోదైంది. పబ్లిక్ బాండ్ల ఇష్యూలు 175 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు 44 ఇష్యూల ద్వారా రూ. 18,176 కోట్లు సమీకరించాయి. 2022లో 29 ఇష్యూల ద్వారా రూ. 6,611 కోట్లు సమీకరించాయి. దేశీ కంపెనీలు విదేశీ మార్కెట్ల నుంచి రూ. 3.29 లక్షల కోట్లు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 4 శాతం అధికం. -
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market Closing Update: ఈ రోజు (బుధవారం) నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల భారీ నష్టంతో 71515.13 వద్ద, నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నేడు నష్టాల్లోనే ముగిసినట్లు స్పష్టమైంది. టాప్ గెయినర్స్ జాబితాలో HCL టెక్నాలజీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి టెక్నాలజీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయ. HDFC బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు రేట్లు పెరుగుదల వైపు పయనించాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో పాటు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5770.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6295గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57700, రూ. 62950గా ఉంది. నిన్నటి కంటే కూడా ఈ రోజు ధరలు రూ.100, రూ.120 పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రూ. 100 పెరిగింది.. 24 క్యారెట్ల ధరలు ఏకంగా రూ. 880 తగ్గి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో నేడు 10 గ్రామ్స్ గోల్డ్ రేట్లు ఢిల్లీలో రూ. 57850 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63100 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. చెన్నైలో కూడా నేడు బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ మీద రూ. 100, 24 క్యారెట్ ధర మాత్రం రూ. 110 పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన తులం పసిడి ధరలు రూ. 58200, రూ. 63490కు చేరింది. ఇదీ చదవండి: గుజరాత్ సమ్మిట్లో కనిపించని 'ఎలోన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి? వెండి ధరలు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడలో కూడా వెండి ధరలు ఈ రోజు పెరలేదు. -
కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..
2024 జనవరి 3 నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇప్పటి వరకు కూడా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5760.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6283గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57600, రూ. 62830గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 120 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో బంగారం ధరలు ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గి తులం రేటు రూ.58100 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63380 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. ఢిల్లీలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రూ. 100 తగ్గినప్పటికీ.. 24 క్యారెట్ల ధరలు ఏకంగా రూ. 880 పెరిగి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో నేడు 10 గ్రామ్స్ గోల్డ్ రేటు ఢిల్లీలో రూ. 57750 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63980 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. వెండి ధరలు వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న వెండి రేటు రూ. 500 వరకు తగ్గి కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. -
2024లో ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలి - వీడియో చూడండి
మార్కెట్ ఇప్పటికే ఆల్టైమ్హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి? దానికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి, స్టాక్ మార్కెట్ లీడ్ అనలిస్ట్ 'కౌశిక్ మోహన్'తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావు' ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి - నేటి ధరలు ఇలా..
గత కొన్ని రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్వల్ప తగ్గుదలను నమోదు చేసి.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై & ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58550, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 63870గా ఉంది. చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం రేటు రూ. 5910, 24 క్యారెట్ల ఒక గ్రామ్ పసిడి విలువ రూ. 6447గా ఉంది. దీని ప్రకారం తులం బంగారం ధర వరుసగా రూ. 59100, రూ. 64470గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 5870 (22 క్యారెట్స్ ఒక గ్రామ్), రూ. 6397 (24 క్యారెట్ ఒక గ్రామ్)గా ఉంది. అంటే నిన్న ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ వెండి ధరలు నిన్న ఒకేసారి రూ. 1200 తగ్గిన వెండి ధర ఈ రోజు మళ్ళీ రూ. 300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ఒక కేజీ వెండి ధర మళ్ళీ రూ. 80000 దాటేసింది. రానున్న పండుగ సీజన్ల దృష్ట్యా ఈ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
చాలా రోజుల తరువాత తగ్గిన బంగారం, వెండి - కొత్త ధరలు ఇలా..
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. నేడు తులం ధరల మీద రూ. 350 నుంచి రూ. 380 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం ప్రాంతల్లో 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 5855, కాగా 24 క్యారెట్ల ధర రూ. 6387గా ఉంది. ఈ లెక్కన ఒక తులం బంగారం ధరలు వరుసగా రూ. 58550, రూ. 63870గా ఉన్నాయి. నిన్న రూ.400 నుంచి రూ.430 పెరిగిన పసిడి ధరలు నేడు రూ.350 నుంచి రూ.380 వరకు తగ్గాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉంటాయి. చెన్నైలో కూడా బంగారం ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. నేడు చెన్నైలో బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే రూ.350 నుంచి రూ.380 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59100 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64470 వద్ద ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే? దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 5870 (22 క్యారెట్ల ఒక గ్రామ్), రూ. 6397 (24 క్యారెట్ల ఒక గ్రామ్)గా ఉన్నాయి. ఈ లెక్కన తులం బంగారం ఢిల్లీలో రూ. 58700, రూ. 63970గా ఉన్నట్లు సమాచారం. నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 350, రూ. 430 తక్కువ. వెండి ధరలు గత కొన్ని రోజులుగా పడిలేస్తున్న వెండి ధరలు ఈ రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఒక కేజీ బంగారం ధర మీద రూ.1300 తగ్గినట్లు తెలుస్తోంది. -
ఇలా అయితే బంగారం కొనడం కష్టమే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొన్ని రోజులుగా ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న బంగారం ధరలు, ఈ రోజు కూడా పెరుగుదలవైపే అడుగులు వేసాయి. న్యూ ఇయర్ లేదా సంక్రాంతికి బంగారం కొనాలనుకునే వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం ప్రాంతల్లో 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 5850, కాగా 24 క్యారెట్ల ధర రూ. 6382గా ఉంది. ఈ లెక్కన ఒక తులం బంగారం ధరలు వరుసగా రూ. 58500, రూ. 63820గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 100, రూ. 110 ఎక్కువని స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉంటాయి. చెన్నైలో కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు. ఈ రోజు చెన్నైలో బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 50 ఎక్కువని తెలుస్తోంది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64360 వద్ద ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 5865 (22 క్యారెట్ల ఒక గ్రామ్), రూ. 6396 (24 క్యారెట్ల ఒక గ్రామ్)గా ఉన్నాయి. ఈ లెక్కన తులం బంగారం ఢిల్లీలో రూ. 58650, రూ. 63960గా ఉన్నట్లు సమాచారం. నిన్నటి కంటే ఈ రోజు ధరలు రూ.100 ఎక్కువ. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే? వెండి ధరలు ఈ రోజు కేవలం బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి, నేడు రూ. 300 తగ్గుదలను నమోదు చేసింది. రానున్న రోజుల్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూ ఇయర్ సమీపిస్తోంది, పండుగలు కూడా రానున్నాయి. ఈ తరుణంలో బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకుండా.. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు బంగారం ధరలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. ఈ రోజు విజయవాడ, హైదరాబాద్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ రేటు రూ. 5820 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 6319గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58200, రూ. 63190గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలో కూడా బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5835.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6364గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58350, రూ. 63640గా ఉంది. ఇదీ చదవండి: సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం! చెన్నైలో నేడు గోల్డ్ రేటు ఏ మాత్రం తగ్గలేదు. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5875 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6409గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58750, రూ. 64090గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. వెండి ధరలు ఈ రోజు కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి, నేడు నిన్నటి ధరలతోనే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్పనష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 276.77 పాయింట్లు లేదా 0.39 శాతం క్షీణించి 71,206.98కి చేరుకోగా, నిఫ్టీ 72.40 పాయింట్లు లేదా 0.34 శాతం తగ్గి 21,384.30 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, సిప్లా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య నిఫ్టీ ఇటీవల భారీగా పుంజుకుంది. ఇంతలా పెరిగిన మార్కెట్ కొంత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ దీర్ఘకాలంగా మాత్రం సూచీలు మరింత లాభపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు వారాల్లో దాదాపు నిఫ్టీ 700 పాయింట్లు లాభపడింది. గత వారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 7.2% పెరిగింది. ఇది మూడేళ్లలో వారాల పరంగా అధిక పెరుగుదల. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఆర్ఎన్ఆర్ ధాన్యం @ రూ.3,545
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టించింది. క్వింటాల్ ధర రూ.3,545 పలికింది. మహబూబ్గర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయి లో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత్రమే పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,203 ఉండగా... మార్కెట్లో రూ. వెయ్యి నుంచి రూ.1,200 అధికంగా వస్తున్నది. బీపీ టీని అంతగా సాగు చేయకపోవడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోంది. అన్ని మార్కెట్లలోనూ పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరకే ఈ సీజన్లో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్కు క్యూ కట్టారు. దీంతో మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున అమ్మకానికి వస్తోంది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్ఎన్ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనె శాతం తక్కువ, షుగర్ పేషంట్లకు బాగుంటుందని డిమాండ్ పెరింగింది. గతంలో వేసే బీపీటీ (సోనా రకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు డిమాండ్ అధికంగా వస్తున్నది. అయితే యాసంగిలో ఎక్కువశాతం 1010 దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వచ్చే సీజన్ను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. -
వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభించిన నటుడు బాలకృష్ణ
-
IPO: పబ్లిక్ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్ ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ ఇండియా, మోతిసన్స్ జ్యుయలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా గ్రూప్ నుంచి 2004 తర్వాత (టీసీఎస్) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్ బాగా సందడిగా ఉందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐపీవోలు ఇవీ.. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ (ఐఎస్ఎఫ్), డోమ్స్ ఇండస్ట్రీస్ ఇష్యూలు డిసెంబర్ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్ సీవీఏ పూర్తిగా ఓఎఫ్ఎస్ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్ ఇ ష్యూ డిసెంబర్ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్ లీజర్ (మలీ్టప్లెక్స్ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్ గ్రూ ప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్ లీజర్.. పీవీఆర్ గ్రూప్లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మోతీసన్స్ జ్యుయలర్స్ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. -
వచ్చేవారం స్టాక్మార్కెట్ సూచీల పయనం ఎటు?
వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో ఒడుదొడుకులకు లోనయిన స్టాక్మార్కెట్లు పుంజుకుంటాయా? లేదా ఇంకా పడుతాయా..యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ ఎలా ఉండబోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరల ప్రభావం మార్కెట్పై ఏమేరకు ఉంటుంది. దాని పర్యవసనాలు దేశీయ మార్కెట్పై ఎలా ఉండబోతాయనే వివరాలపై ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. ఎట్టకేలకు నిఫ్టీ జీవితకాల గరిష్టానికి చేరింది. నిఫ్టీ ఇండెక్స్ గతంలో సెప్టెంబర్ 15న ఆల్ టైమ్ హైని తాకింది. సగటు కంటే ఎక్కువ వాల్యూమ్లతో డిసెంబర్ 1న తాజా రికార్డు నెలకొంది. వచ్చే వారంలో కొంత ఒడుదొడుకులు ఎదురైనా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇండెక్స్ 20,000 నుంచి 19,800 మధ్య కదలాడే అవకాశం ఉంది. కానీ రాబోయేరోజుల్లో 20,500 మార్కును చేరుతుందని తెలుస్తోంది. నిఫ్టీ శుక్రవారం 20,194 వద్ద అధిక ప్రారంభమైంది. రోజు గడిచేకొద్దీ వేగంగా పుంజుకుంది. మధ్యాహ్నం 20,292 వద్ద తాజా రికార్డును తాకింది. వీక్లీ చార్ట్లో నిఫ్టీ50 బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ను ఏర్పరిచింది. ఈ వారంలో 2.4 శాతం లాభపడింది. ఇది ఈ సంవత్సరం జూన్ తర్వాత వారాల వారీగా అధికలాభంగా ఉంది. నిఫ్టీ ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతుంది. రాబోయే వారంలో మరింత పైకి ఎగబాకవచ్చు. 2023లో ఇప్పటివరకు నిఫ్టీ 50 దాదాపు 11 శాతం పెరిగింది. మెరుగైన ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఆదాయాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఇన్ఫ్లోలు (మార్చి-ఆగస్టు 23), రిటైల్ భాగస్వామ్యం మార్కెట్ను లాభాల్లో నడిపిస్తున్నాయి. తాజాగా ఆర్బీఐ భారతదేశ జీడీపీ వృద్ధి సూచీను ప్రకటించింది. ముందుగా 6.5-7 శాతం ఉంటుందని భావించిన వృద్ధి.. 7.6 శాతానికి చేరడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దాంతోపాటు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో మరింత పుంజుకునే వీలుంటుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో భాజాపా అధికారంలోకి రాబోతుందనే ఎగ్జిట్పోల్స్ ఫలితాలతో మార్కెట్ సూచీలు మరింత జోష్ అందుకున్నాయి. రాజస్థాన్లో కొన్నేళ్లుగా ప్రతిసారి వేర్వేరు పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. దాంతో ఈసారి భాజపా గెలువబోతుందని ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయి. స్పష్టమైన ప్రభుత్వం వస్తే మార్కెట్లు మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల లిస్ట్ అయిన ఐదు ఐపీఓలు మంచి లాభాలు అందుకున్నాయి. అయితే ఐపీఓ దక్కని ఇన్వెస్టర్ల డబ్బు దాదాపు రూ.2.5 లక్షల కోట్లు అందులో ఉండిపోయింది. మదుపరులకు వెనక్కి వచ్చిన సొమ్మును కొందరు తిరిగి మార్కెట్లోనే పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. దాంతో తిరిగి నిఫ్టీలో మంచి ర్యాలీ కనిపించనుందని తెలుస్తోంది. గత కొన్ని నెలల్లో గ్లోబల్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికాలో బాండ్ఈల్డ్లు తగ్గుముఖం పట్టాయి. బ్యాంకింగ్, ఆటో, హెల్త్కేర్, కొన్ని లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్లు మంచి వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. మే 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు మార్కెట్లో ర్యాలీకి అనుకూలంగా ఉంది. గత ఐదు వరుస లోక్సభ ఎన్నికల (1999 నుండి 2019 వరకు) ఫలితాలు ప్రకటించే వరకు (నవంబర్-మే) ఆరు నెలల వ్యవధిలో నిఫ్టీ 10-35 శాతం ర్యాలీ అయినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ముందు, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ సమస్యలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
అమ్మకానికి అందమైన ఐలాండ్ - ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా వ్యవసాయ భూములు, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, విల్లా వంటివి వాటిని అమ్మడం లేదా కొనటం అనేది జరగటం సర్వసాధారణం. అయితే చాలా అరుదుగా ఐలాండ్ (ద్వీపాలు) అమ్మకానికి వస్తాయి. బాగా డబ్బున్న వారు, ఏకాంతంగా.. ప్రశాంతంగా బతకాలనుకునే వారు మాత్రమే ఇలాంటి ఐల్యాండ్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి బేరమే ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాన్ ఫ్రాన్సిస్కో బేలో ప్రైవేట్ యాజమాన్యంలోని ద్వీపం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దీనిని కొనాలంటే 25 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ద్వీపాన్ని కొనాలంటే సుమారు రూ. 200 కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సుమారు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందమైన 'రెడ్ రాక్ ఐలాండ్' సొంతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. 2015లో ఓ సారి ఈ ఐలాండ్ను విక్రయించడానికి ప్రయత్నించారు, అప్పుడు దీని కేవలం 5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఆ తరువాత దీని ఓనర్ 2011లో మరోసారి విక్రయించడానికి పూనుకున్నాడు. ఆ సమయంలో దీని ధర రూ. 22 మిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి ఎర్ర రాళ్లతో, మట్టితో ఉండటం వల్ల దీనిని రెడ్ రాక్ ఐలాండ్ అని పిలుస్తారు. దీని ఓనర్ 'బ్రాక్ డర్నింగ్' ప్రస్తుతం అలాస్కాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఇది తన తండ్రి నుంచి వారసత్వంగా లభించింది. కానీ అతడు గత 22 సంవత్సరాలుగా అక్కడికి రాకపోవడం గమనార్హం. బ్రాక్ తల్లి వృద్ధురాలు కావడంతో.. ఆమె సంరక్షణకు కావలసిన సంరక్షణ కోసం దీనిని అమ్మటానికి సిద్దమైనట్లు సమాచారం. -
ఐపీవో.. హాట్ కేక్ - తొలి రోజే మంచి స్పందన
దేశీ స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులు చవిచూస్తున్నప్పటికీ ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కళకళలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో పలు కంపెనీలు లిస్టింగ్ బాట పడుతున్నాయి. తాజాగా టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకాగా.. తొలి రోజే అధిక స్థాయిలో స్పందన లభించడం గమనార్హం! వివరాలు ఇలా.. టాటా టెక్నాలజీస్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ ఐపీవో తొలి రోజే అధిక సబ్స్క్రిప్షన్ను సాధించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో ప్రారంభమైన వెంటనే భారీగా బిడ్స్ దాఖలయ్యాయి. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 6.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 29.43 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. వెరసి 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 4 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 11.7 రెట్లు, రిటైలర్ల నుంచి 5.4 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. మొత్తం 6.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 4.63 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఫ్లెయిర్ రైటింగ్ పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో తొలి రోజే పూర్తి సబ్స్క్రిప్షన్ను సాధించింది. షేరుకి రూ. 288–304 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 2.17 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 1.44 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 3.13 కోట్లకుపైగా షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 53%, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.78 రెట్లు, రిటైలర్ల నుంచి 2.86 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా రూ. 292 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 301 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచాయి. 24న ముగిసే ఇష్యూ ద్వారా రూ. 501 కోట్ల వరకూ అందుకోనుంది. గాంధార్ ఆయిల్ ప్రైవేట్ రంగ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ(ఇండియా) ఐపీవో తొలి రోజే అధిక సబ్స్క్రిప్షన్ను సాధించింది. షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 5.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 2.12 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 11.72 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 1.3 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.7 రెట్లు, రిటైలర్ల నుంచి 6.9 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 501 కోట్లవరకూ అందుకోనుంది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. -
పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
ప్రతి ఏటా ఉల్లి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధరలు రూ. 10 నుంచి రూ. 20 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి ఢిల్లీలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది రూ. 100కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉల్లి ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డిమాండ్. డిమాండ్ పెరిగినప్పుడు అవసరమైనన్ని అందుబాటులో లేనప్పుడు తప్పకుండా ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా కొందరు రైతులు తమ పంటను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం వల్ల, దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఉల్లి ధరలు పెరగటానికి మరో ప్రధానమైన కారణం పంట ఆలస్యం. ఖరీఫ్ పంట ఆలస్యం వల్ల సాగులో జాప్యం ఏర్పడుతుంది. అప్పుడు చేతికి అందాల్సిన సమయానికి పంట రాకపోతే కొరత ఏర్పడుతుంది. తద్వారా ధరలు పెరుగుదల జరుగుతుంది. ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే? ఉల్లి ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఆగస్టు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి 'రోహిత్ కుమార్ సింగ్' వెల్లడించారు. ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం రిటైల్ పంపిణీని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా కేజీ ఉల్లి ధరలను రూ. 25కే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 లక్షల టన్నుల ఉల్లి స్టాక్ను నిర్వహిస్తోంది, రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. -
సాక్షి మనీ మంత్ర: ఎన్నికల నేపథ్యంలో ఈ మార్కెట్ స్ట్రాటజీతో లాభాలు!
దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా తీవ్ర ఒడుదుడుకుల్లో పయనిస్తున్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకవిలువ పడిపోతుంది. యూఎస్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందనే భయాలు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో రాబోతున్న పండగ నేపథ్యంలో మార్కెట్లు ఎలా కదలాడుతాయో ఫండమెంటల్ బిజినెస్ అనలిస్ట్ కౌశిక్మోహన్తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కరుణ్యరావు మాట్లాడారు. కారుణ్యరావు: దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొన్నిరోజుల నుంచి వారి నగదును ఉపసహరించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికవరకు కొనసాగే అవకాశం ఉంది? కౌశిక్మోహన్: ఈక్విటీ మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. అమెరికాలోని ఫెడ్ కీలక వడ్డీరేట్లను పెంచుతుంది. దాంతో ఎఫ్ఐఐలు అప్రమత్తం అవుతున్నారు. ఒడుదొడుకులులేని అక్కడి డెట్ మార్కెట్లో మదుపుచేసేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో భారత్ మార్కెట్లో వారి నగదును ఉపసహరించుకుని అమెరికా వంటి వడ్డీ అధికంగా ఉంటే మార్కెట్లో మదుపు చేస్తున్నారు. వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చేంత వరకు ఈపరిస్థితి కొనసాగనుంది. కారుణ్యరావు: మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు మాత్రం అంతగా స్పందించడం లేదు. పైగా అవి కొంతమేర పెరుగుతున్నాయి. అందుకుగల కారణం ఏమిటి? కౌశిక్మోహన్: మార్కెట్లో ప్రస్తుతం మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలకంటే లార్జ్క్యాప్ సూచీల్లో మదుపుచేసేందుకు మంచి అవకాశంగా కనిపిస్తుంది. మిడ్, స్మాల్క్యాప్ కంపెనీలు వాటి త్రైమాసిక ఫలితాలను మెరుగుపరుస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో రిటైలర్లు ఎక్కువగా వస్తుఆధారిత సేవలపై ఖర్చు చేస్తారు. దాంతో ఆ సూచీలు మరింత పెరిగే అవకాశం ఉంది. కారుణ్యరావు: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సెక్టార్లో మదుపుచేయాలి? కౌశిక్మోహన్: అభివృద్ధి చెందుతున్న ఇండియాలో రానున్న రోజుల్లో అన్ని రంగాలు పుంజుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కెమికల్ సెక్టార్ మరింత మెరుగుపడే పరిస్థితులు ఉన్నాయి. చాలా కెమికల్ కంపెనీలు వాటి వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పారాసిటమోల్లో పారాఅమినోఫినాల్ను విరివిగా వాడుతారు. పారాసిటమోల్ను మనదేశంలోనే అధికంగా తయారుచేస్తారు. కానీ పారాఅమినోఫినాల్ను మాత్రం ఏటా 80వేల మెట్రిక్ టన్నుల మేర చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం చైనాలోని అనిశ్చితుల కారణంగా ప్రపంచం చూపు భారత్పై పడింది. దేశీయంగా ఉన్న కొన్ని కంపెనీలు నైట్రో బెంజీన్ నుంచి పారాఅమినోఫినాల్ను తయారుచేస్తున్నారు. దాంతో మరింత అవకాశాలు ఉండే వీలుంది. కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా మరింత లబ్ధిచేకూరే అవకాశం ఉంది. కారుణ్యరావు: ప్రస్తుతం ఫార్మాసెక్టార్లోని స్టాక్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ ధరలనుంచి ఈ సెక్టార్ మరింత పుంజుకునే అవకాశం ఉందా? కౌశిక్మోహన్: దేశీయ మార్కెట్లో ఫార్మాసెక్టార్ మరింత లాభాల్లోకి వెళుతుంది. మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా రానున్న రోజుల్లో మాత్రలు, ఇంజెక్షన్లు, వైద్య పరికరాలకు మరింత ఖర్చుచేస్తారు. శరీరంలోని కొవ్వు కరిగించే మందులు తయారుచేసే కంపెనీలు వాటి పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. దాంతోపాటు ఆయా కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. సంస్థల భవిష్యత్తు కార్యాచరణను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మెరుగైన లాభాలు పొందే వీలుంది. కారుణ్యరావు: దీపావళి పండగ నేపథ్యంలో జరిగే మూరత్ ట్రేడింగ్లో భాగంగా ఏ స్టాక్ల ద్వారా లాభాలు సంపాదించవచ్చు? కౌశిక్మోహన్: దీపావళి పండగను పురస్కరించుకుని ప్రధానంగా కన్జూమర్ డ్యురబుల్ కంపెనీల్లో మంచి ర్యాలీ కనిపించనుంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతాయని నమ్ముతున్నాను. కారుణ్యరావు: ఆటోమొబైల్ రంగంలోని సూచీలు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అందుకు కారణాలు? కౌశిక్మోహన్: అక్టోబరు నెలలో ఆఫర్ల నేపథ్యంలో చాలా మంది కొత్త వాహనాలు తీసుకుంటారు. దాంతో ఆ నెలలో ర్యాలీ కనిపిస్తుంది. వచ్చే డిసెంబరులో అంతగా ర్యాలీ ఉండకపోవచ్చు. చివరి నెలలో వాహనాలు తీసుకుంటే ఆ ఏడాది రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక నెల తర్వాత అదే జనవరిలో వాహనాలు కొనుగోలు చేస్తే వచ్చే ఏడాది రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంతో సాధారణంగా ఒడుదొడుకులు ఉంటాయి. కారుణ్యరావు: దేశంలోని ఫైనాన్స్ మార్కెట్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? కౌశిక్మోహన్: ఫైనాన్స్ రంగంలో సేవలు అందిస్తున్న ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రివర్స్ మెర్జర్ అవుతున్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉన్న సంస్థలను ఎంచుకుని ముదుపు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. కారుణ్యరావు: ఎన్నికల నేపథ్యంలో రానున్న మూడు నెలలకుగాను మార్కెట్లో లాభాలు పొందాలంటే ఎలాంటి స్ట్రాటజీ పాటించాలి? కౌశిక్మోహన్: గరిష్ఠంగా మరో ఆరునెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. త్వరగా స్పందించి ఇప్పుడే మదుపుచేస్తే ఎన్నికల సమయం వరకు వచ్చే ర్యాలీలో లాభాలు పొందొచ్చు. మదుపు చేసే ముందు కంపెనీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉందో తెలుసుకోవాలి. త్రైమాసిక ఫలితాలు, బోర్డు సమావేశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. (Disclaimer:సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగించాయి. ఉదయం ఊగిసలాటతో మొదలైన బెంచ్ మార్క్ సూచీలు చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టపోగా.. నిఫ్టీ కేవలం 5 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 119 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 113 పాయింట్ల మేర నష్టపోయాయి. అలాగే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం మేర లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, నెస్లే, ఐషర్ మోటార్స్, టైటాన్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఎయిర్ టెల్, టీసీఎస్, యూపీఎల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, విప్రో కంపెనీల షేర్లు నష్టాల బాటపట్టాయి. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన భారత స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 181 పాయింట్లు లాభపడి 19411 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 594 పాయింట్లు లాభపడి 64,958కు చేరుకుంది. సెన్సెక్స్ సంస్థలలో, లార్సెన్ & టూబ్రో లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. అదే సమయంలో ఎస్బీఐ, హెచ్యూఎల్, టైటాన్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మినహా అన్ని ఇతర రంగాల సూచీలు ఎఫ్ఎంసీజీ, చమురు & గ్యాస్, మీడియా, రియల్టీ రంగ షేర్లు బాగా పుంజుకున్నాయి. భారతదేశ మధ్యకాలిక స్థూల జాతీయవృద్ధి అంచనాను ఫిచ్ 70పాయింట్లు పెంచి 7శాతానికి చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా సానుకూల సంకేతాలు ఉంటుండడంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికా మార్కెట్లు స్పష్టమైన లాభాలతో పయణించాయి. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ జూన్ నుంచి స్థిరంగా మొదటి ఐదు రోజుల లాభాలను చూసింది. డౌ జోన్స్ ఇండెక్స్ 200 పాయింట్లు లాభపడగా, నాస్డాక్ ఇండెక్స్ 1.4% పెరిగింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే వరకు నిఫ్టీ 97 పాయింట్లు లాభాపడి 19230 వద్దకు చేరింది. సెన్సెక్స్ 282 పాయింట్లు పుంజుకుని 64363 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, జేఎస్డబ్ల్యూ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్ స్టాక్లు లాభాల్లో పయనించాయి. బజాజ్ ఫిన్సర్వ్, టాటాస్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, ఎన్టీపీసీలు నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడ్ ఛైర్మన్ గతంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే సూచనలు చేస్తూ వ్యాఖ్యనించారు. దాంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. అనంతరం అమెరికా బాండ్ల రాబడులు 10ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. కానీ బుధవారం రాత్రి జెరొమ్పావెల్ ఇకపై వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని తెలపడంతో మార్కెట్ పుంజుకుంది. దాంతో అమెరికాలో ప్రభుత్వ బాండ్ల రాబడులు దిగొచ్చిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లు గురువారం రాణించాయి. ఐరోపా సూచీలు సైతం లాభాల్లోనే స్థిరపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీ రేటును 15 ఏళ్ల గరిష్ఠమైన 5.25 శాతం వద్ద ఉంచింది. నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లూ సానుకూలంగా ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.1,261.19 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను అమ్మారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,380.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో శుభారంభం పలికాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 364 పాయింట్ల భారీ లాభంతో 64444.90 వద్ద, నిఫ్టీ 107.70 పాయింట్ల లాభంతో 19241.10 వద్ద ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు ప్రారంభం నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో దూసుకెళ్తున్న దూసుకెళుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బ్రిటానియా, హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్స్ కంపెనీలు చేరాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఫెడ్ మీటింగ్ ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడయ్యాయి. డాలర్ పడిపోవడంతో బెంచ్మార్క్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 156.80 పాయింట్లు లేదా 0.83% లాభపడి 19,145.95 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 533.44 పాయింట్లు లేదా 0.84% పెరిగి 64,124.77 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. హీరో మోటోకార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ నష్టాల్లో ముగిశాయి. ప్రభుత్వ బ్యాంక్లు, రియల్ ఎస్టేట్, ఆయిల్ & గ్యాస్, మెటల్, రియల్ ఎస్టేట్ రంగాల సూచీలు దాదాపు 2 శాతం వరకు పెరిగాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక వడ్డీ రేట్లకు సంబంధించి సానుకూల ప్రకటన చేశారు. పెడ్ వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వడ్డీ రేట్ల పెంపు దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆర్థిక వృద్ధిపై సానుకూల ప్రకటన చేయడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. ప్రపంచ మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
నష్టాల్లోకి వెళ్లడానికే రిస్క్ తీసుకుంటున్న మదుపర్లు!
స్టాక్మార్కెట్ మదుపర్లు కొన్నిసార్లు నష్టపోతుంటారు. ఇంకొన్నిసార్లు లాభాల్లో ఉంటారు. కానీ నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్లే స్టాక్లను మాత్రం వెంటనే అమ్ముతుంటారు. నష్టాల్లో ఉన్న స్టాక్లను మాత్రం ఎప్పటికైనా లాభాల్లోకి రాకపోతుందా అని అట్టే పెట్టుకుంటారు. అలా తాత్కాలికంగా నష్టాలు వచ్చే వాటిల్లో బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ఉంటే ఫరవాలేదు. కానీ సరైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించకుండా నష్టాలను పోస్ట్ చేస్తున్న కంపెనీలకు చెందిన స్టాక్లను కూడా అలాగే ఉంచుకోవడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా మార్కెట్ను గమనిస్తున్న ఆర్థికవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. వారు ప్రతిపాదించిన యుటిలిటీ థియరీ ప్రకారం..మదుపర్లు వివిధ స్వభావాలు కలిగి ఉంటారు. రిస్క్ తీసుకుని కొందరు లాభాల్లోకి వెళితే, మరికొందరు అదే రిస్క్ తీసుకుని నష్టాల్లోకి వెళ్తున్నారు. మొదటి నియమంతో మంచి కంపెనీలు మదుపు చేయడం వల్ల లాభాల్లోకి వెళ్లవచ్చు. ఇదీ చదవండి: బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా కానీ రెండో నియమం ప్రకారం రిస్క్ తీసుకున్నా నష్టాల్లోకి వెళ్లడం ఏమిటనే అనుమానం ఉంటుంది. అయితే కంపెనీపై సరైన అవగాహన, దానికి సంబంధించి ఎలాంటి పరిశోధన చేయకుండా మార్కెట్లో పెట్టుబడి పెట్టి కొందరు నష్టాల్లోకి జారుకుంటారు. కొద్దిగా నష్టాలు ఉన్నపుడు స్టాక్లను అమ్మకుండా రిస్క్ తీసుకుని వాటిని అలాగే తమ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటారు. ఫలితంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా మరింత నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. మదుపు చేసేముందు కంపెనీ పూర్వాపరాలు ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ, ఫలానా రంగంలోని పోటీలో ఉన్న సంస్థలు, ముడిసరుకు, మార్కెటింగ్, కంపెనీ అప్పులు తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర: రెండు రోజుల లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
భారతీయ బెంచ్మార్క్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 19,100 దిగువకు చేరింది. సెన్సెక్స్ 237.72 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 63,874.93 వద్ద, నిఫ్టీ 61.30 పాయింట్లు లేదా 0.32 శాతం క్షీణించి 19,079.60 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే వరకు అదే తంతు కొనసాగించింది. అంతకుముందు గడిచిన రెండు సెషన్ల్లో మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో మదుపర్లు కొంత జాగ్రత్త వహిస్తున్నారు. దాంతో మంగళవారం మార్కెట్లో లాభాలు స్వీకరించినట్లు తెలుస్తుంది. రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లల్లో అమ్మకాలు కొనసాగాయి. నిఫ్టీలో ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎల్టీ మైండ్ట్రీ, ఓఎన్జీసీ అత్యధికంగా నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో స్థిరపడ్డాయి. సెక్టార్ వారీగా అయితే మాత్రం రియాల్టీ మినహా ఆటో, బ్యాంక్, హెల్త్కేర్ విభాగాల్లోని అత్యధిక స్టాక్లు ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి పుంజుకుని లాభాల్లోకి చేరుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 330 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 257 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 33 పాయింట్ల లాభంతో వారం మెుదటి రోజు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. మార్కెట్లో వచ్చే తాత్కాలిక ర్యాలీ నిత్యం కొనసాగుతుందని భావించకూడదు. మార్కెట్లు గత వారం బాగా పడిపోవడంతో గతంతో పోలిస్తే స్టాక్లు కొంత డిస్కౌంట్లో దొరుకుతున్నాయని భావన ఉంటుంది. కానీ కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు కార్యాచరణ తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అయితే ఏడాది చివరి నాటికి కూడా నిఫ్టీ మళ్లీ 20,000 పాయింట్ల కంటే దాటదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లు పశ్చిమాసియా వివాదానికి సంబంధించిన సంఘర్షణలను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు తీవ్రం అవుతుంటే మాత్రం ఆ ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. సోమవారం మార్కెట్లు రికవరీ కావటంతో ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. ఈ క్రమంలో రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, ఓఎన్జీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, నెస్లే, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కదలాడాయి. యూపీఎల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, హెచ్యూఎల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో పయనించాయి. -
RIL: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 29.7 శాతం పెరిగింది. దాంతో రూ.19,878 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు జియో, రిటైల్ వ్యాపారం మంచి పనితీరు కారణంగా కంపెనీ లాభాల్లో పయనిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫామ్లు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,297 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729 కోట్లుగా ఉంది. కొత్తగా చేరే సబ్స్క్రైబర్ బేస్లో 7.5 శాతం పెరుగుదల నమోదైంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.77,148 కోట్లుగా నిలిచింది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణను కొనసాగిస్తామని చెప్పారు. ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ ఆయిల్2కెమికల్ విభాగానికి డిమాండ్ పెరిగిందన్నారు. -
మార్కెట్ పడిపోవడం మంచి అవకాశం
వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో కుప్పకూలిన మార్కెట్లు పుంజుకుంటాయా లేదా ఇంకా పడుతాయా..యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధర పెరుగుతుంది. దాని పర్యవసనాలు దేశీయ మార్కెట్పై ఎలా ఉండబోతాయని వివరాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు మాట్లాడారు. దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ భయాలు ఉన్నా.. ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల జోక్యం చేసుకోనంత వరకు మార్కెట్లపై పెద్దగా ప్రభావం ఉండదు. యుద్ధానికి సంబంధించి వేరే దేశాలు నిర్ణయాలు తీసుకున్నా, వాటి విధానాలు మార్చుకున్నా మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే చమురు ధరలు పెరిగాయి. రూపాయితో పోలిస్తే డాలర్ ఇంకా బలపడుతుంది. దాంతో ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్లను విక్రయించి రూపాయి ఇంకా పడిపోకుండా చేసే వీలుంది. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదం పొంచిఉంటుంది. యూఎస్ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి. ఇటీవల ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యల ద్వారా అమెరికాలో రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో దేశీయ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉంది. అయితే కేంద్రం అందిస్తున్న ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్మార్కెట్లు బలంగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం ఉంటుంది. గతవారం మార్కెట్లు పతనం తర్వాత ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న జోన్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది నిత్యం మారుతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం గ్లోబల్గా ఆర్థిక వ్యవస్థను మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దాంతో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. పెట్టుబడిదారులు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫండమెంటల్స్పై దృష్టి పెట్టాలి. మార్కెట్ కదలికలను అంచనా వేయడానికి బదులుగా ప్రాథమికంగా బలమైన కంపెనీలను విశ్లేషించాలి. మంచి ఫండమెంటల్ కంపెనీలను ప్రతి మార్కెట్ డిప్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
క్వింటా పత్తి రూ. 7,711
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర రూ.7,711గా నమోదైంది. గత వారంలో రూ.7,500 ధర ఉండగా.. ఈ వారం రోజురోజుకు రూ.50, రూ.100 చొప్పున పెరుగుతూ రూ.7,711కు చేరుకుంది. శుక్రవారం మార్కెట్కు 2,626 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ట ధర రూ.7,711, మధ్య ధర రూ.7,389, కనిష్ట ధర రూ.5,169 పలికింది. అలాగే, వేరుశనగ 1,437 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,969, కనిష్ట ధర రూ.3,849.. ఆముదాలకు గరిష్ట ధర రూ.5,475, కనిష్ట ధర రూ.4,500, పూల విత్తనాలకు గరిష్ట ధర రూ.4,212, కనిష్ట ధర రూ.3,926 లభించింది. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల తర్వాత లాభాల్లో దేశీయ మార్కెట్లు
వరుస నష్టాల తర్వాత దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 63782 వద్దకు చేరింది. నిఫ్టీ 190 పాయింట్లు ర్యాలీ అయి 19047 వద్ద స్థిరపడింది. యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మరకపు విలువ రూ.83.234కు చేరింది. సెన్సెక్స్ 30లోని యాక్సిక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, విప్రో, భారతీ ఎయిర్టెల్ భారీగా లాభపడ్డాయి. ఆల్ట్రాటెక్ సెమెంట్, ఐటీసీలు స్పల్ప నష్టాలతో ట్రేడయ్యాయి. దేశీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో భారత రూపాయి శుక్రవారం స్వల్పంగా 2 పైసలు పెరిగింది. డాలర్ బలపడడం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి రూపాయిపై స్వల్ప ప్రతికూల ప్రభావాన్ని కలిగించాయి. విదేశీ సంస్థగత పెట్టుబడుల తరలింపు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా రూపాయిపై ఒత్తిడిని కలిగించాయి. సిరియాలో యూఎస్ మిలిటరీ, ఇరాన్లమధ్య అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రానున్నరోజుల్లో రూపాయి కొంత దిగువ స్థాయుల్లోకి వెళ్లనుందనే అంచనాలు ఉన్నాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..
ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్సోల్డ్ జోన్లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ గడిచిన ట్రేడింగ్తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్ బ్యారెల్ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.32శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 30 లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా అన్ని స్టాక్లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్ ఎం, బజాజ్ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్లు నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ప్రారంభ లాభాలు ఆవిరి..నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ సూచీలు బుధవారం భారీ నష్టాల్లోకి ట్రేడయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసేనాటికి నష్టాల్లో జారుకున్నాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 522 పాయింట్ల మేర నష్టపోయి 64,049వద్దకు చేరింది. కాగా నిఫ్టీ 159 పాయింట్లు కుంగి 19,122కు చేరుకుంది. మార్కెట్లు ఒక్కసారిగా తలకిందులు కావటంతో దేశీయ పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.15 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ప్రారంభంలో 65,619 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. కాసేపటికి నష్టాల్లోకి జారుకుని చివరి వరకు అలాగే కొనసాగించి. నిఫ్టీ 19286 వద్ద ప్రారంభమయింది. ఒకానొక సమయానికి 19074కు చేరుకుంది. చివరకు 19122 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.174గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, మారుతీసుజుకీ, నెస్లే మిగతా అన్ని స్టాక్లు నష్టపోయాయి. ఇజ్రాయెల్-హమాస్ వివాదం కారణంగా ఉత్పన్నమయ్యే అనిశ్చితి మార్కెట్లపై ప్రభావం చూపుతూనే ఉంది. దాంతో బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుదేలయ్యాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కనిష్ఠ స్థాయికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా మార్కెట్లు బలహీనంగా మారాయి. దాంతో మదుపర్లు అమ్మకాలకు పూనుకున్నారు. ఈ పరిస్థితులపై కొంత స్పష్టత వచ్చే వరకు పెట్టుబడిదారులు మార్కెట్ను జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. నెలవారి డెరివేటివ్ల ముగింపునకు రేపు చివరితేది కావడంతో కూడా మార్కెట్లు నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
Onion Prices: మళ్లీ ఉల్లి లొల్లి షురూ..!
కొన్ని వారాల కొందట టొమాటో ధరలు ఏ స్థాయిని చేరుకున్నాయో చూశాం. కేజీ రూ.250 వరకు పలికిన వాటి ధరలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. ఇప్పుడు ఉల్లి రేట్లు పెరగడం ప్రారంభమైంది. దాంతో వీటి ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నిత్యం వంటల్లో వాడే ఉల్లి ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కిలో నాణ్యమైన ఉల్లిపాయలు రూ.40-50 మధ్య విక్రయిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్) దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ధరల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై విధించే పన్నును ఆగస్టులో 40శాతం మేర పెంచింది. ఈ పన్ను ఏడాది చివరివరకు అమలవుతుంది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠస్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు. కొన్ని చోట్లు ఉల్లిసాగు చేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో నేలకొరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దేశీయంగా ప్రతి నెలా సగటున 13లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే, నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40శాతం కోల్పోతాయి. కుళ్ళిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార ధరలు నియంత్రణలో ఉండాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ధర కేజీకి రూ.50కి మించకుండా ఉండాలని చూస్తుంది. ఈ సారి ఖరీఫ్ పంట ఆలస్యంగా చేతికి రావటంతో పాటు పంట దిగుబడి తగ్గడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను అరికట్టడానికి కేంద్రం మరింత జోక్యం చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. -
బొమ్మా? బొరుసా? నిర్ణయించండిలా..!
క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందా లేదా? వర్షం వస్తుందా రాదా? పేకలో జోకర్ మనకే పడుతుందా? అన్నీ అనుమానాలే! ఏమో.. కచ్చితంగా కావచ్చు.. కాకపోవచ్చు. కానీ దాన్ని తేల్చుకోవాలంటే కాయిన్ను పైకి వేసి ఏదో ఓ వైపు ఎంచుకుంటాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తే కొంత ఆనందాన్ని పొందుతుంటాం. అయితే కాయిన్ పైకి వేసినపుడు ఫలితం మనకూ, పోటీదారులకు అనుకూలంగా వచ్చే అవకాశం సమానంగా ఉంటుందని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ అది తప్పని కొన్ని పరిశోధనలు తేలుస్తున్నాయి. ఆమ్స్ట్రడమ్లో 48 మంది పరిశోధకులు 46 వివిధ కాయిన్లతో చేసిన ప్రయోగం సారాశం ప్రకారం..గాలిలో ఎగరేసిన కాయిన్పై బొమ్మా-బొరుసులు రావడానికి 50-50ఛాన్స్ ఉండదు. కాయిన్లోని బొమ్మని పైకి ఉంచి టాస్ వేస్తే అది గాల్లోకి వెళ్లి కిందకు చేరి తిరిగి బొమ్మపడే అవకాశం 51శాతం ఉందని తేలింది. దాదాపు 3లక్షల 50వేల సార్లు కాయిన్ గాల్లో ఎగరేసి ఈ ప్రయోగాన్ని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. (ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా) ఇదిలా ఉండగా.. స్లాక్మార్కెట్లో పెట్టుబడులు అంతర్జాతీయ బౌగోళిక వ్యవహారాలు, కంపెనీ వ్యాపార స్వరూపం, అది విడుదల చేసేఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు యాజమాన్యం తీసుకుంటున్న అనేక అంశాలపై ఆధారపడి పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. గాల్లోకి విసిరిన కాయిన్ ఫలితం మనకు అనుకూలంగా రావొచ్చు..రాకపోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారి పెట్టుబడులకు రాబడులు రావొచ్చు..రాకపోవచ్చు. కంపెనీ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని పెట్టుబడులు పెడితే ఫలితం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
సాక్షి మనీ మంత్ర: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది. ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
రాష్ట్రంలో దసరా అమ్మకాల జోష్
సాక్షి, అమరావతి: దసరా పండుగ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మరో ఇరవై రోజుల్లో దీపావళి పండుగ ఉంది. దీంతో రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ప్రజలు జోరుగా పండగ షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్రస్తాలు, బంగారం, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, వాహనాల షోరూమ్లు కిటకిటలాడుతున్నాయి. పలు వ్యాపార సంస్థలు వివిధ రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ప్రజల్లో కొనుగోళ్ల శక్తి పెరిగిందనడానికి ఈ అమ్మకాలే నిదర్శనమని వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు తోడు పెళ్లిళ్ల సీజన్ జత కావడంతో ఊహించిన దానికంటే అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని నెల్లూరుకు చెందిన రుక్మిణి సిల్్క్స ప్రతినిధి మురళి ‘సాక్షి’కి తెలిపారు. ‘బంగార’మైనా కొనాల్సిందే.. పండుగలకు తోడు పెళ్లిళ్లు కూడా ఉండటంతో బంగారం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పలు జ్యూవెలరీ సంస్థలు భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు తగ్గిపోవడంతో ప్రజలు పండుగ, పెళ్లిళ్ల కొనుగోళ్లు ముందుగానే చేసినట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 నుంచి రూ.53,000కు పడిపోయిందని, అందువల్ల అప్పుడు ఎక్కువగా నగలు కొన్నారని బంగారం వ్యాపారి మోహన్ రెడ్డి తెలిపారు. మళ్లీ ధర పెరగడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాలు వెలువడుతుండటంతో తిరిగి అమ్మకాలు పెరుగుతున్నాయని మోహన్ రెడ్డి చెప్పారు. రిటైల్ సంస్థల భారీ ఆఫర్లు రిటైల్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటించడమే కాకుండా భారీగా ప్రచారం చేపట్టాయి. గతేడాదికంటే ఈ ఏడాది అమ్మకాలు బాగున్నాయని ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజరేటర్లు వంటి వస్తువులకు భారీగా డిమాండ్ ఉందని సోనోవిజన్ ప్రతినిధి తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో ఏసీల అమ్మకాలు తక్కువగా ఉంటాయని, కానీ ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటికి డిమాండ్ ఉందని తెలిపారు. ఇదే సమయంలో అమెజాన్, ఫ్లిఫ్కార్ట్ వంటి ఆన్లైన్ రిటైల్ సంస్థలు కూడా భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆన్లైన్ అమ్మకాలు కూడా జోరుమీద కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరి్థక వ్యవస్థను పరుగులు పెట్టించే విధంగా తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేలా పలు పథకాలను ప్రవేశపెట్టడంతో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని, దీనికి రాష్ట్ర జీఎస్టీలో నమోదవుతున్న రెండంకెల వృద్ధి రేటే నిదర్శనమని రాష్ట్ర పన్నుల ప్రధాన అధికారి గిరిజా శంకర్ చెప్పారు. దూసుకుపోతున్న ఆటోమొబైల్ మార్కెట్ దసరా–దీపావళి పండుగల సీజన్లో ఆటోమొబైల్ మార్కెట్ దూసుకుపోతోందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి సీజన్లో 73,240 ద్విచక్ర, 7,772 కార్ల అమ్మకాలు జరిగాయని, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే ఈ సీజన్లో అమ్మకాలు భారీగా జరిగే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 33,094 బైక్లు, 4,212 కార్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ రెండు పండుగల సమయంలో బైక్ల అమ్మకాలు లక్షకు పైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్ తర్వాత దెబ్బతిన్న మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందంటున్నారు. -
మదుపర్లను ఆకర్షించని గోల్డ్ ఈటీఎఫ్లు
ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో మదుపర్లు బంగారంపై మొగ్గుచూపుతుంటారు. దాంతో గోల్డ్ ఈటీఎఫ్ల్లో మదుపు చేస్తుంటారు. ఆగస్టు నెలలో ఈ ఈటీఎఫ్ల్లో గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత నెలలో పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి నికరంగా రూ.175 కోట్ల మేరకే పెట్టుబడులు వచ్చాయని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (ఏంఎఆఫ్ఐ) వెల్లడించింది. ఆగస్టులో ఈ పెట్టుబడులు 17 నెలల గరిష్ఠమైన రూ.1028 కోట్లకు చేరాయి. జులైలో ఈ మొత్తం రూ.456 కోట్లుగా ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీలుండటం, ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగడం, వృద్ధి రేటు మందగించడంలాంటి కారణాల వల్ల ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగానే మదుపరులు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య సగటున నెలకు రూ.298 కోట్ల మేరకు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్లలోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టులోనూ వీటిల్లోకి రూ.1,100 కోట్ల మేరకు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి గోల్డ్ ఈటీఎఫ్లలో మదుపు చేస్తున్న పోర్ట్ఫోలియోల సంఖ్య 48.06 లక్షలుగా ఉంది. -
వచ్చేవారం మార్కెట్లు ఎలా ఉంటాయంటే?
వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. వారంతంలో అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది.. దసరా పండగ సీజన్లో మార్కెట్ ఎలా ఉంటుందనే అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. అదే తీరు కొనసాగనుంది. దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్గా విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంది. గడిచిన వారంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరుగుతుండడంతో రూపాయి మారకం పడిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారాలు, పండగ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం ఉండదు. కేంద్రం అందిస్తున్న ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్మార్కెట్లు బలంగా ఉన్నాయి. దేశంలో యువత ఎక్కువగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. యూఎస్ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి. అమెరికా ట్రూప్లపై డ్రోన్లు దాడిచేసేందుకు ప్రయత్నించాయనే వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్కు మాత్రమే యుద్ధం కొనసాగితే మార్కెట్లు పెద్దగా స్పందించే స్థితిలో లేవు. కానీ వాటికి మద్ధతు ఇస్తున్న దేశాల స్పందించే విధానం వల్ల యుద్ధ భయాలు చెలరేగితే మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యూఎస్ 10 ఏళ్లు ట్రెజరీ బాండ్లు ఏప్రిల్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన వారంలో గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఈ అన్ని కారణాల వల్ల వచ్చేవారం మార్కెట్లు కొంత ఒడుదుడుకులకు లోనవచ్చు. గతవారంలో నిఫ్టీ 19850 వద్దకు చేరి అక్కడి నుంచి ప్రతికూలంగా స్పందించింది. వారం మధ్యలో బెంచ్మార్క్ సూచీల్లో అమ్మాకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు రెండూ వారంలో ఒక శాతం కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
Amazon: అమెజాన్ వేర్హౌజ్లో రోబోలు!
అమెజాన్ సంస్థ తన వేర్హౌజ్ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టింది. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్హౌజ్లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. డిజిట్ అనే రెండు కాళ్ల రోబో అవలీలగా వస్తువులను తీసుకుని లిఫ్ట్ చేస్తుందని అమెజాన్ చెప్పింది. డిజిట్ 5.9 అడుగులు. 65 కిలోల బరువు ఉండి రెండు కాళ్లతో నడుస్తుంది. ప్రస్తుతం వేర్హౌస్లో ఖాళీగా ఉన్న బాక్సులను తరలించేందుకు ఈ రోబోలను వాడుతున్నారు. ప్రస్తుతం అమెజాన్లో 15లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, రోబోల ప్రవేశంతో వారి భరోసాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది. అయితే రోబోల ఎంట్రీతో కొన్ని ఉద్యోగాల అవసరం లేకపోయానా, ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టెక్నాలజిస్ట్ టై బ్రాడీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆటోమేషన్పై అమెజాన్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అమెజాన్ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల కొలువుల్లో కోత పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఫుల్ఫిల్మెంట్ సెంటర్లలో వందలాది ఉద్యోగాలు కనుమరుగయ్యాయని బ్రిటన్ ట్రేడ్ యూనియన్ జీఎంబీ నిర్వాహకులు స్టువార్ట్ రిచర్డ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డిజిట్ రోబోను ఆరేగాన్కు చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. -
Stock Market: రూ.435కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్ల విక్రయం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్, కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కంపెనీలో రూ.435 కోట్ల విలువైన తమ వాటాలను విక్రయించారు. అక్టోబర్ 19న ఓపెన్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లను అమ్మినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపారు. ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్ వద్ద ఉన్న 2,37,04,350 ఇన్ఫోసిస్ షేర్లలో 23,70,435 షేర్లను ఒక్కో షేరుకు రూ.1,433.51 చొప్పున విక్రయించారు. దాని విలువ రూ.339.80 కోట్లు. దాంతో ప్రస్తుతం తన వద్ద 2,13,33,915 ఇన్ఫీ షేర్లు ఉన్నాయి. ఎస్డీ శిబులాల్ కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కలిగిఉన్న 66,79,240 షేర్లలో 6,67,924 షేర్లను రూ.1,432.96 చొప్పున అమ్మారు. దాని విలువ మొత్తం రూ.95.71 కోట్లు. ఇద్దరు విక్రయించిన షేర్ల విలువ దాదాపు రూ.435 కోట్లుగా ఉంది. అయితే ఈ షేర్లను ఎవరు కొనుగోలు చేశారో తెలియరాలేదు. ఎస్డి శిబులాల్ స్వయంగా 58,14,733 షేర్లను కలిగి ఉన్నారు. ఆయన భార్య కుమారి షిబులాల్ వద్ద 52,48,965 షేర్లు, కుమార్తె శృతి శిబులాల్ వద్ద 27,37,538 షేర్లు ఉన్నాయి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమై అదేచోట ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన మూడు రోజులుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం దాదాపుగా ప్రారంభ స్థాయిల వద్దే ముగిశాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. పావెల్ ప్రకటనతోపాటు వారంతంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గ్లోబల్ ఇండియన్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 231.36 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82.05 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 32 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 454 పాయింట్లు పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం మేర నష్టపోయింది. ఎన్ఎస్ఈలో కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, ఎన్టీపీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీ ల్యాబ్స్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, యూపీఎల్, హిందాల్కొ, ఎస్బీఐ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఆరంభం నుంచి నష్టాల్లో ట్రేడయిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభం నుంచి మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65629 వద్ద.. నిఫ్టీ 46.4 పాయింట్లను కోల్పోయి 19624 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 34.55 పాయింట్లు నష్టపోయాయి. హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ భయాలు మార్కెట్లను నష్టాల్లో పయనించేలా చేశాయి. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు ఆందోళనలకు కారణమౌతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే 3.4శాతం, ఆల్ట్రా టెక్ సిమెంట్ 2.8శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.9శాతం, ఎల్ అండ్ టీ 0.2శాతం లాభాల్లో ముగిశాయి. విప్రో 3 శాతం, సన్ఫార్మా 1.5శాతం, టెక్ మహీంద్రా 1.4శాతం, ఎన్టీపీసీ 1.3శాతం, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.1శాతం, భారతీఎయిర్టెల్ 1 శాతంమేర నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల బాటపట్టాయి. సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి భారీ నష్టాలపాలయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 521 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్లు నష్టపోయాయి. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్న వేళ మార్కెట్ నిపుణులు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉంటాయని అంచనాలు వేసిన వేళ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు భారీ నష్టాలకు దారితీశాయి. బ్యాంకింగ్, పవర్ రంగాల్లోని కంపెనీలు ప్రధానంగా మార్కెట్లను నష్టాలోకి లాగాయి. ఫార్మా స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, మారుతీ, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో పయణించాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, విప్రో, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
బైక్పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!
ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో, సామాజిక్ మాధ్యమాల్లో ఫేమస్కావాలని యువతకు ఎంతో ఆశగా ఉంటుంది. అందుకు ఎన్నో మార్గాలను ఎంచుకుని ప్రయత్నాలు చేస్తారు. అందుకు అనుగునంగా కొందరు అనుకున్న విధంగా సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకుంటారు. అయితే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో పేరును వాడుకొని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, పాపులర్ అయ్యేందుకు వింత ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి జనాల దృష్టిని ఆకర్షించాలని జొమాటో డ్రెస్ కోడ్లో యమహా R15 బైక్తో రోడ్డుపై చక్కర్లు కొట్టిన సంఘటన ఇండోర్లో జరిగింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో జొమాటో పాపులర్ అయింది. అయితే జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వారు ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం ఓ స్టైలిష్ బైక్పై జొమాటో బ్యాగ్, డ్రైస్ ధరించి రోడ్లపై రౌండ్లు వేస్తూ నెట్టింట్లో వైరల్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగినట్లుగా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారడంతో ఇది జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ దృష్టికి వెళ్లింది. ఈ వీడియోకు సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. జొమాటోకు దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. హెల్మెట్ లేని బైక్ రైడింగ్ను తాము ప్రోత్సహించబోమని చెప్పారు. తమకు ఇండోర్లో మార్కెటింగ్ హెడ్ లేరన్నారు. అయితే మహిళలు ఇలా ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా మారడంలో తప్పు లేదని చెప్పారు. View this post on Instagram A post shared by I N D O R E - R E E L G R A M (@indore_reelgram.official) -
Infy New Campus: సీఎం జగన్ తోడ్పాటు హర్షణీయం: ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్
ఆంధ్రప్రదేశ్లో సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ అన్నారు. సీఎం జగన్ వైజాగ్లోని రుషికొండలో సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలంజన్ రాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న మద్దతుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్ వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ భవనాన్ని 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,000 మంది ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ కోసం అన్ని వసతులు కల్పించేలా దీన్ని రూపొందించామన్నారు. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిసిన గత వారం మార్కెట్తో పోలిస్తే సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 66,166 వద్దకు చేరింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731లో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.29 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, యాక్సిక్ బ్యాంక్, పవర్గ్రిడ్, ఎం అండ్ ఎం, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్స్లో వచ్చిన అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగింది. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్ల్లోనే స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలూ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తోందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం ఇటీవలి ధోరణికి భిన్నంగా రూ.317.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.102.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సియెట్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై బాలాజీ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓరియెంట్ హోటల్స్, యాత్రా ఆన్లైన్ కంపెనీలు ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
పెట్టుబడుల ఆకర్షణకు సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం: లారస్ సీఈఓ
పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషి అభినందనీయని లారస్ సీఈఓ చావ సత్యనారాయణ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలోని లారస్- 2 యూనిట్ను సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లారస్ సీఈఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు దేశానికే ఆదర్శమన్నారు. అచ్యుతాపురంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్ - 2 ద్వారా 1200 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా రూ.850 కోట్లతో నిర్మించే రెండు యూనిట్లు ద్వారా రానున్న రోజుల్లో మరో 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతానికి లారస్ లో సుమారు ఐదువేల మంది ఉన్నారని, కొత్తగా 2000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా రాష్ట్రంలో వివిధ రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు ఆదర్శప్రామంటున్న లారస్ ల్యాబ్స్ సీఈఓ చావ సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. -
పీఎల్ఐ ద్వారా ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు రూ.1000 కోట్లు
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) సాధికార కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలకు రూ.1000 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద మొత్తం రూ.3,400 కోట్ల క్లెయిమ్లు రాగా.. 2023 మార్చికి ప్రభుత్వం రూ.2,900 కోట్లు పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇదే తొలి నగదు పంపిణీ. ఎలక్ట్రానిక్ తయారీ, వైట్ గూడ్స్, జౌళి, ఔషధ పరికరాల తయారీ, వాహన, స్పెషాలిటీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, సోలార్ పీవీ మాడ్యుల్స్, అడ్వాన్డ్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్స్, ఔషధ వంటి 14 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశీయ తయారీ, ఉద్యోగాల సృష్టి, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు 2021లో ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది. పీఎల్ఐ పథకం కింద ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న 32 భారీ సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో 10 కంపెనీలు మొబైల్ తయారీ సంస్థలే. ఈ పథకం కింద అదనంగా రూ.10లక్షల కోట్ల ఉత్పత్తి; 7 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా. -
TCS Recruitment Scam: లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!
దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 16 మందిపై వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగించింది. కంపెనీతో వ్యాపారం సాగిస్తున్న ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారనే స్కామ్లో వీరి పాత్ర ఉన్నట్లు సంస్థ గుర్తించింది. జూన్ 23న ప్రారంభమైన విచారణ నివేదిక ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మొత్తం 19 మంది ఉద్యోగులు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం అయినట్లు టీసీఎస్ తెలిపింది. అయితే వీరిలో 16 మందిని తొలగించారు. మరో ముగ్గురిని సంస్థ రీసోర్స్ మేనేజ్మెంట్ విధుల నుంచి బదిలీ చేసింది. దాంతోపాటు ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్లో ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున డబ్బు ముట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారానే ఈ సమాచారం బయటకు వచ్చింది. కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొన్నేళ్లుగా సిబ్బంది నియామకాలకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు కమీషన్ల ద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించవచ్చని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్కు లేఖలు అందాయి. దాంతో ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ..జూన్ 23న సమగ్ర విచారణకు కమిటీని నియమించింది. సదరు కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది. ఈ స్కాంతో కంపెనీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కుంభకోణంలో మేనేజర్ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు వెల్లడించింది. భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ సంస్థ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. హెచ్ఆర్ అండ్ టాలెంట్ అక్విజేషన్, రిసోర్స్ అలోకేషన్ గ్రూప్ ద్వారా 55 దేశాల్లో దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, వర్క్ఫ్రంహోంకు స్వస్తి పలికినట్లు టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ గతంలో ఆఫర్ లెటర్లు ప్రకటించిన వారిని తప్పకుండా ఉద్యోగంలోకి తీసుకుంటుందని చెప్పింది. -
రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..?
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.2625 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా మాట్లాడుతూ..ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయన్నారు. రూపాయి మారకపు విలువ కనిష్ఠస్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది. రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్బీఐ జోక్యం చేసుకుని.. అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని అంచనా. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్లు శుక్రవారం దాదాపు 6శాతం పెరిగాయి. మిడిల్ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బ్యారెల్ ముడిచమురు ధర 91 యూఎస్ డాలర్లకు చేరింది. ప్రభావం ఇలా.. రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్లో ఊగిసలాటలు తగ్గుతాయి. అంతే తప్ప విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది. ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..! కారణాలివే.. 1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 2. ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. 4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి పతనం ఆగుతుంది. -
కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ - ఏ కాలంలో అయినా మెరుగైన రాబడి ఇచ్చిన చరిత్ర!
మార్కెట్లో చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలు ఎన్నో ఉంటాయి. ఇన్వెస్టర్లు కేవలం మెరుగైన రాబడుల దృష్టితోనే కంపెనీలను ఎంపిక చేసుకోకూడదు. పెట్టుబడులకు రక్షణ ఉండాలి. అదే సమయంలో దీర్ఘకాలంలో కాస్తంత మెరుగైన రాబడులు ఆశించాలి. ఈ దృష్ట్యా చూస్తే ఫ్లెక్సీక్యాప్ పథకాలు అనుకూలమైనవి. ఇవి లార్జ్క్యాప్ స్టాక్స్కు ఎక్కువ కేటాయింపులు చేస్తూ.. అదే సమయంలో అధిక రాబడుల కోణంలో మిడ్, స్మాల్క్యాప్ స్టాక్స్కు సైతం కొంత చొప్పున కేటాయింపులు చేస్తుంటాయి. ఈ విభాగంలో కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. తమ పెట్టుబడులకు కొంత రిస్క్ ఉన్నా ఫర్వాలేదని భావించే వారికి ఈ విభాగం అనుకూలంగా ఉంటుంది. రాబడులు అన్ని కాలాల్లోనూ మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. గడిచిన ఆరు నెలల్లో ఈ పథకంలో రాబడి 15 శాతంగా ఉంది. ఏడాదిలో 21 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే పెట్టుబడులపై వార్షిక ప్రతిఫలం 21 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో ఏటా 15.52 శాతం చొప్పున, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో ఏటా 17.63 శాతం చొప్పున ఈ పథకం ఇన్వెస్టర్లకు రాబడిని తెచ్చి పెట్టింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకం పదేళ్ల కాలంలో మెరుగ్గా పనిచేసింది. బీఎస్ఈ 500 టీఆర్ఐతో పోలిస్తే ఏడాది, పదేళ్ల కాలంలో మెరుగైన రాబడిని అందించింది. గత మూడేళ్లలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురైన పరిస్థితులు చూశాము. పైగా ఈక్విటీల్లో కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూచన. కనుక ఐదేళ్లు, అంతకుమించి కాలానికి రాబడులనే ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఈ పథకం మెరుగైన పనితీరును చూపించింది. పెట్టుబడుల విధానం/పోర్ట్ఫోలియో మల్టీక్యాప్ ఫండ్స్ అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే లార్జ్క్యాప్తోపాటు, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో ఎప్పుడూ అన్ని విభాగాలు ఒకే రీతిలో పని చేస్తాయని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ర్యాలీ ఉండొచ్చు. గడిచిన ఆరు నెలల్లో చూసినట్టు.. కొన్ని సందర్భాల్లో మిడ్, స్మాల్క్యాప్ కంపెనీలు లార్జ్క్యాప్ కంటే అధిక రాబడులు ఇస్తుంటాయి. దీర్ఘకాలంలోనూ వీటి మధ్య రాబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. కనుక మల్టీక్యాప్ ఫండ్స్ అన్నింటి మిశ్రమంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.40,685 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 76 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్క్యాప్ కంపెనీలకు 23.49 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్క్యాప్లో పెట్టుబడులు ఒక శాతంలోపే ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో 52 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 27 శాతం మేర ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీలకు 11.60 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 8.77 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 7.48 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 6.82 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
గెలాక్సీ గ్రానైట్లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్డిస్క్లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్హెచ్సీ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో అదానీ కాపర్ ఫెసిలిటీ
గుజరాత్లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.1 బిలియన్ డాలర్లతో గ్రీన్ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని మార్చి 2024లో ప్రారంభించనుంది. ఏటా 10లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందిచనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్ కేథోడ్లు, రాడ్లను ఉత్పత్తి చేయనుంది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్తో సల్ఫ్యూరిక్ యాసిడ్ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్మెంట్తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతొ భవిష్యత్తులో కాపర్కు చాలా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి. దేశీయ కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఈ ప్లాంట్కు సంబంధించిన ముడిసరుకును లాటిన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్ను ఉత్పత్తి చేస్తున్నాయి. పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిపింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో కదలాడిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ మార్కెట్లకు కొనుగోళ్ల అండ లభించలేదు. వారాంతం కావడంతో మదుపర్ల అమ్మకాలు, రూపాయి బలహీన పడడం, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, కీలక స్టాక్స్లో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 66,068 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,895.41 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు కొంద పుంజుకుని 66,282.74 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,654 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,800 మార్క్ దగ్గర ఎగువ స్థాయికి చేరుకుంది. చివరకు గురువారం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్లు నష్టపోయి 19,751 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, మారుతిసుజుకీ, టీసీఎస్, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, బజాన్ ఫైనాన్స్, హెచ్యూఎల్, ఎల్ అండ్ టీ, పవర్గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ , ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈలో మొత్తం 3,820 షేర్లు ట్రేడ్ అవగా, 1,804 స్టాక్లు లాభాలతో ముగిశాయి. గతంతో పోలిస్తే 156 షేర్లు యథాతథంగా ఉన్నాయి. రోజులో 317 షేర్లు వాటి ఎగువ సర్క్యూట్ను తాకగా, 157 షేర్లు లోయర్ సర్క్యూట్ స్థాయిలో ట్రేడయ్యాయి. జై కార్ప్, ఐటీఐ, ఏడీఎఫ్ ఫుడ్స్ 20 శాతం చొప్పున పుంజుకోగా, స్పైస్జెట్ 19 శాతానికి పైగా లాభపడింది. టెక్స్మాకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోల్డింగ్స్ 16 శాతం ర్యాలీ కాగా, ఏజీఐ గ్రీన్పాక్ 15 శాతం పెరిగింది. ఆంధ్రా పెట్రోకెమికల్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు 10 శాతం పెరిగాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
స్టాక్ ఫలితాల వేళ ఇవి పాటిస్తే మేలు
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. • మన పోర్ట్ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. • ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. • కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. • గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. • చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్లుక్ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. • ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. • ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
సాక్షి మనీమంత్ర: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో కీలక స్టాక్స్లో మదుపర్లు లాభాలను స్వీకరించారు. మరోవైపు నిన్న వెలువడ్డ ఇన్ఫోసిస్ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. నిఫ్టీలో దీని వాటా అధికంగా ఉండడంతో ఇది సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠమైన 5.02 శాతంగా నమోదైంది. ఇది ఒకింత మార్కెట్కు పాజిటివ్ విషయం. అయినప్పటికీ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. నిఫ్టీ గత ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లు నష్టంతో ప్రారంభమై ఉదయం 9:37 వరకు కొంత పుంజుకుని 19721 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టపోయి 66,121.52 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిక్బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అక్కడ వెలువడిన సెప్టెంబరు నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మదుపర్లను నిరాశపర్చాయి. ఐరోపా సూచీలు మాత్రం లాభాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 86.48 డాలర్లకు చేరింది. టాటా స్టీల్ లాంగ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సాయి సిల్క్స్ కళామందిర్, డెన్ నెట్వర్క్స్, ఆదిత్య బిర్లా మనీ, మిత్తల్ లైఫ్ స్టైల్ కంపెనీలు ఈరోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
Q2 Results: ఆదాయవృద్ధి మార్గదర్శకత్వాన్ని తగ్గించనున్న ఇన్ఫోసిస్
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో సుమారు రూ.7కోట్లు రెవెన్యూ వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. ఇక కంపెనీ కార్యకలాపాల వల్ల వచ్చిన ఆదాయం రూ.36,538 కోట్ల నుంచి రూ.38,994 కోట్లకు పెరుగుతందని సమాచారం. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్ కోత పెట్టనుంది. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1 - 3.5 నుంచి 1-2.5 శాతంగా ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ వద్ద 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈఓ సలీల్పరేఖ్ చెప్పారు. జూన్ త్రైమాసికంలో 17.3 శాతంగా ఉన్న వలసల రేటు 14.6 శాతానికి తగ్గుతుందని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ షేర్ ధర గురువారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందే 2.8శాతం పడిపోయింది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లో జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64.66 పాయింట్ల నష్టంతో 66408 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17.35 పాయింట్ల నష్టంతో 19794.80 పాయింట్లకు చేరింది. బీపీసీఎల్, కోల్ ఇండియా, మారుతి సుజుకీ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, బజాజ్ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎం అండ్ ఎం కంపెనీలు లాభాల్లో ట్రేడయ్యాయి. నష్టాల జాబితాలో టెక్ మహింద్రా, అపోలో హాస్పటల్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఎల్టీ మైండ్ట్రీ, సిప్లా, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, విప్రో కంపెనీలు ఉన్నాయి. రూపాయి: నేడు రూపాయి డాలర్తో పోలిస్తే స్వల్ప నష్టంలో 83.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Disney: డిస్నీ కొనుగోలుకు బ్లాక్స్టోన్తో చర్చలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్స్టోన్.. భారతదేశంలోని వాల్ట్డిస్నీ స్ట్రీమింగ్, టెలివిజన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్అంబానీతోపాటు ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే భారత మార్కెట్పై ఆసక్తి ఉన్న బ్లాక్స్టోన్.. డిస్నీ కొనుగోలుకు సిద్ధం అవుతుదని నివేదిక తెలుపుతుంది. ఒకవేళ బ్లాక్స్టోన్తో ఈ ఒప్పందం కుదరకపోయినా డిస్నీ భారతదేశంలో తన డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకా బ్లాక్స్టోన్, డిస్నీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ సబ్స్క్రైబర్ అట్రిషన్ను ప్రభావం చేసేలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్ఫోన్లో ఉచిత క్రికెట్ కంటెంట్ను అందించడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. -
Oxfam: దేశంలో 77శాతం సంపద ఎక్కడుందంటే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత జీడీపీ వృద్ధి ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఒక వైపు మన జీడీపీ పెరుగుతుంటే, మరోవైపు ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆక్స్ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం దేశ సంపదలో 77శాతం కేవలం 10శాతం ధనవంతుల చేతిలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో 119 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద గత పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. రోజుకు కనీసం 70 మంది కొత్తగా మిలియనీర్లు అవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు విద్య, వైద్య ఖర్చులు భరించలేక దేశీయంగా ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. ఇండియాలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపైనా సరైన దృష్టి సారించాలి. లేకుంటే, ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయి, దేశ ఆర్థిక పురోగతి దెబ్బతింటుందని నివేదిక చెబుతుంది. -
సాక్షి మనీ మంత్ర: 19,800 పాయింట్లు వద్దే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ అయిన నిఫ్టీ గురువారం మునుపటి రోజుకంటే స్వల్పంగా 11 పాయింట్లు పెరిగి 19,822 వద్ద ప్రారంభమయింది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 66500 వద్ద ప్రారంభమయి 66437 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండసింద్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. TCS, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, HCL టెక్నాలజీస్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు మాత్రం కొంత నష్టంలోకి జారుకున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ భయాల నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటాన్నాయినే సంకేతాలు ఉన్నాయి. బుధవారం బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 85.82 డాలర్లకు చేరింది. -
టీసీఎస్ రిజల్ట్స్..స్వల్పంగా పెరుగనున్న ఆదాయం
ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలు బుధవారం రానున్నాయి. మరికాసేపట్లో మార్కెట్ టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ క్యూ2 ఫలితాలు విడుదలవుతాయి. అయితే ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ విలువ దాదాపు రూ.13.29 లక్షల కోట్లుగా ఉంది. వివిధ బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్ ఫలితాలను అంచనా వేశాయి. దాని ప్రకారం..టీసీఎస్ ఆదాయం త్రైమాసికంలో 1.4శాతం వృద్ధితో రూ.60,218 కోట్లకు చేరుతుంది. వార్షిక వారీగా ఆదాయం దాదాపు 9% పెరుగుతుంది. నికర లాభం త్రైమాసికంలో 3%, వార్షిక వారీగా 9% పైగా పెరిగి రూ.11,404 కోట్లుగా ఉంటుందని అంచనా. టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్ QoQలో 30-90 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ సేవలపై క్లయింట్స్ వ్యయాలు మందగించినప్పటికీ, టీసీఎస్ డీల్ విన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ కూడా కాసేపట్లో జరుగనుంది. క్యూ2 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్స్ బైబ్యాక్ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత షేర్ల బైబ్యాక్కు సంబంధించిన మరింత సమాచారం వెలువడనుంది. -
హైదరాబాద్లో ఎక్స్ఫెనో రిక్రూట్మెంట్ డెలివరీ కేంద్రం ప్రారంభం
ఇండియన్ స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీల్లో ఒకటైన ఎక్స్ఫెనో హైదరాబాద్లో రిక్రూట్మెంట్ డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్తో పాటు విదేశాల్లో సేవలు అందించనున్నారు. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ టి-హబ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యం అతిథిగా పాల్గొని ఆర్డీసీని ప్రారంభించారు. అలాగే టీపాజిటివ్ (బిల్డింగ్ అండ్ సస్టేనింగ్ ఏ టాలెంట్ పాజిటివ్ తెలంగాణ) పేరుతో వివిధ కంపెనీల్లోని సీఎక్స్ఓ, హెచ్ఆర్ పరిశోధన నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన సంస్థలతో పాటు, యునికార్న్లు, స్టార్టప్లు తమ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్ను ఎంచుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా టెక్ ఉద్యోగుల ఉన్న హైదరాబాద్కు ఈ నివేదిక ఎంతో ఉపయోగమని అన్నారు. ఎక్స్ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ మాట్లాడుతూ.. దేశంలో తమ టెక్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైనదని అన్నారు. తెలంగాణలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఎక్స్ఫెనో హైదరాబాద్ ఆపరేషన్స్ విభాగాధిపతి సతీష్ మన్నె అన్నారు. ‘ఉమెన్ ఇన్ ది వర్క్ఫోర్స్’ అనే అంశంపై ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిల్ ఏతానూర్, పెగా సిస్టమ్స్ హెచ్ఆర్ స్మృతి మాథుర్, ది స్టార్ ఇన్ మీ సహ వ్యవస్థాపకుడు ఉమా కాసోజీ, హెచ్ఆర్ఎస్ఎస్ డీఎస్ఎం గ్లోబల్ డైరెక్టర్ డా.దినేష్ మురుగేశన్ పాల్గొన్నారు. ఎక్స్ఫెనో ఇప్పటి వరకు 12,000 మంది ఇంజినీర్లను నియమించింది. ఆర్డీసీ ద్వారా స్పెషలిస్ట్ టాలెంట్ సోర్సింగ్, లీడర్షిప్ హైరింగ్, టాలెంట్ డిప్లాయ్మెంట్, మేనేజ్మెంట్ సేవలు అందిస్తుంది. టాలెంట్ ఎంగేజ్మెంట్కు సంబంధించిన అనేక ఆన్ డిమాండ్ ఆఫర్లను కూడా కల్పిస్తుంది. -
తగ్గుతున్న పారిశ్రామిక రుణాలు.... వ్యక్తిగత రుణాలు పైపైకి...
బ్యాంకులు ఎక్కువగా కార్పొరేట్ రుణాల ద్వారానే అధికంగా లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా బ్యాంక్ రుణాల సరళిమారుతోంది. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీయల్ రంగానికి అధికంగా రుణాలు ఇస్తున్న బ్యాంకులు..ప్రస్తుతం వాటి వాటా తగ్గిస్తున్నాయి. అందుకు బదులుగా వ్యక్తిగత రుణాల ఇవ్వడంలో మొగ్గు చూపుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ నివేదిక ప్రకారం.. బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో దాదాపు 32.1శాతం వ్యక్తిగత రుణాలు, సర్వీస్ సెక్టార్కు 28.4శాతం, ఇండస్ట్రీ రంగానికి 26.2 శాతం, 13.3శాతం వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. హౌజింగ్, వెహికిల్, క్రెడిట్ కార్డు రుణాలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో ఇండస్ట్రీ రంగానికి ఇచ్చే రుణాలు 46శాతం నుంచి 26శాతం మేర క్షీణించాయి. అదే వ్యక్తిగత రుణాలు మాత్రం 18శాతం నుంచి 32శాతానికి పెరిగాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల సంఖ్య పెరగడంతో అవి సర్వీస్ రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువగా రుణాలు కల్పిస్తున్నాయి. (తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..) ఇండస్ట్రీయల్ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించడంతో కార్పొరేట్ కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. అయితే కంపెనీలు రుణ సమీకరణతో పాటు సంస్థ ఆర్థికవృద్ధిపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుదని బ్యాంకింగ్ రంగ నిపుణులు వి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి బదులుగా డెట్మార్కెట్ ద్వారా నగదును పెంచుకుంటున్నాయి. తమ బ్యాలెన్స్షీట్లో నగదు ఎక్కువగా ఉన్న కొన్ని సంస్థలు రుణం తీసుకోవలసిన అవసరం ఉండడం లేదు. ఎన్బీఎఫ్సీ, బ్యాంకు నిబంధనల ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించిన నియామాలు మార్చడం వల్ల కూడా ఇండస్ట్రీయల్ రుణాలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
రూ.100 కోట్ల అపార్ట్మెంట్ డీల్: షాక్ అవుతున్న మార్కెట్ నిపుణులు
ఆర్థిక పరిస్థితులు ఎలా న్నప్పటికీ రానున్న పదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేదన్న నిపుణుల అంచనాల మధ్య ఢిల్లీలో 100కోట్ల రూపాయల తాజా అపార్ట్మెంట్ డీల్ మార్కెట్ వర్గాలను విస్మయ పరుస్తోంది. గుర్గావ్ , ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో అత్యాధునిక అపార్ట్మెంట్ల ధరలు ఒక రేంజ్లో పెరిగినట్టు తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ గోల్ఫ్ కోర్స్ రోడ్లోని DLF ద్వారా ది కామెలియాస్ వద్ద 10వేలచదరపు అడుగుల అపార్ట్మెంట్ ఏకంగా రూ.100 కోట్లకు అమ్ముడు బోయింది. దీనికి సంబంధించిన వార్తల ఇపుడు బిజినెస్ వర్గాల్లో సందడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అదే స్థలంలో అదే పరిమాణంలో ఉన్న అపార్ట్మెంట్ రూ.60 కోట్లకు విక్రయించారు. గత నాలుగు నెలల్లో ఈ అడ్రస్కి చదరపు అడుగుకి ధరలు గణనీయంగా పెరగడమే ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. (కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) "చాలా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎంఎన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసముండటమే కారణమని ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ అభిప్రాయం. ముఖ్యంగా స్టార్ క్లాస్ ఎమినిటీస్, పర్యావరణ వ్యవస్థ కారణంగా ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారు అందుకే DLF గోల్ఫ్ లింక్స్లో అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంకా పూర్తికాని 10వేల చదరపు అడుగుల యూనిట్ ధర రూ.85 కోట్లకు విక్రయిస్తుంది డీఎల్ఎఫ్. అయితే దీనికితోడు అత్యాధునిక డిజైన్లు, ఇంటీరియర్స్ కోసం తహ తహలాడుతున్న కొనుగోలుదారులు వీటిన్నంటికి కలిపి రూ.100 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అత్యంత ఖరీదైన కండోమినియంలలో ఒకటి ఈ ప్రాంతాన్ని పేర్కొంటున్నారు. గుర్గావ్, ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో నైరుతి సబర్బ్లోని అత్యాధునిక అపార్ట్మెంట్లు , లుటియన్స్ జోన్లోని మాన్షన్ల ధరలు పెరిగాయి. ఫలితంగా ముంబైలోని పాపులర్ ఏరియాల్లో ధరలకు పోటీగా ఇక్కడ చదరపు అడుగు ధర రూ.1 లక్ష దాటిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. (Amazon Layoffs: అమెజాన్ మళ్లీ షాక్ ఇచ్చింది: ఈసారి ఎవరంటే..!) ఆగస్ట్ నాటి నైట్ ఫ్రాంక్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరేడెకో) సంయుక్త నివేదిక ప్రకారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా. ది ఇప్పటికే ఉన్న 7.3శాతం వాటా నుండి GDPకి 15.5శాతం దోహదం చేస్తుంది.‘ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ నివేదిక ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్కు అధిక వాటా ఉంటుంది. "2047 నాటికి,వందేళ్ల స్వతంత్ర్య భారతావని ఆర్థిక వ్యవస్థ పరిమాణం 33-40 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు వెల్లడించింది.. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..
Hurun India Rich List: దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతేడాది టాప్లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో అయిదుగురు మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం రూ.76 వేల కోట్లు జమైనట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్లో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి.పార్థసారధి రెడ్డి కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపద, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.5700 కోట్లు. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో కదలాడుతున్న దేశీయ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్ల లాభంతో 66413 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,787 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమై.. చివరకు అవే లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు మాత్రం స్పష్టమైన లాభాలతో స్థిరపడ్డాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ భయాల నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటాన్నాయినే సంకేతాలు ఉన్నాయి. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం కలవరపెడుతోంది. మంగళవారం బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 87.91 డాలర్లకు చేరింది. -
శాట్కామ్ సేవలకు ఇన్-స్పేస్ అనుమతి కోరిన అమెజాన్
Amazon IN Space: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. స్పేస్ నుంచి వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనుమతి కోరింది. వన్వెబ్, జియో శాటిలైట్, ఎలాన్మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్లింక్ వంటి ప్రాజెక్ట్లకోవలోకి అమెజాన్ అడుగులేయనుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అమెజాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో భాగంగా ఉన్న గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం కూడా దరఖాస్తు చేసుకోనుందని తెలుస్తుంది. అయితే స్టార్లింక్ జీఎంపీసీఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పటికే జియో శాటిలైట్, వన్వెబ్ ఈ జీఎంపీసీఎస్ లైసెన్స్ను పొందాయి. భారతదేశ అంతరిక్ష విధానం 2023 ప్రకారం.. లోఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ ద్వారా శాటిలైట్ కాన్స్టెలేషన్ ఆపరేటర్లకు వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ అందించేలా నిబంధనలు ఉన్నాయి. దాంతో పాటు విదేశీ కంపెనీలు దేశంలో స్పేస్ నుంచి బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించేలా వీలు కల్పిస్తున్నారు. అయితే కంపెనీలు ఇన్స్పేస్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. శాట్కామ్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం అమెజాన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. -
మూడు నెలల కనిష్ఠానికి చేరనున్న సీపీఐ ద్రవ్యోల్బణం!
భారత గణాంకాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్కు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటాను, ఆగస్టులోని పారిశ్రామిక ఉత్పత్తి డేటాను అక్టోబరు 12న విడుదల చేయనుంది. అందుకు నిపుణులు కారణాలను విశ్లేసిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. కానీ సెప్టెంబరు నెలకు అది 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా. పారిశ్రామికోత్పత్తి సూచీ జులైలో 5.7తో పోలిస్తే ఆగస్టులో 9.1కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది గడిచిన 14 నెలల్లో అత్యధికం. సెప్టెంబర్లో టమాటా ధరలు సాధారణ స్థితికి రావడంతో నెలవారీగా ఖర్చుల శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్ మార్కెట్లు జీవితకాలపు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. అయితే అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో ఉల్లి ధరలు 12 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 8.8శాతం పెరిగినప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొంత ఊరట కలిగించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం దాదాపు ఒకటిన్నర శాతం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..లాభాల్లో డిఫెన్స్ స్టాక్స్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో డిఫెన్స్ రంగ స్టాక్లు కొంత లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన వాటితోపాటు ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయిన డిఫెన్స్స్టాక్లో ర్యాలీ కనబడుతుంది. యుద్ధంలో వాడే వార్హెడ్ల్లో ఉపయోగించే టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు సహా ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో లిస్టయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మజగావ్డాక్ షిప్బిల్డర్స్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వంటి రక్షణరంగ స్టాక్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ డెఫెన్స్ స్టాక్స్లో మంచి ర్యాలీ కనిపించింది. అయితే కొన్ని విమానయాన కంపెనీలు ఇజ్రాయెల్కు రాకపోకలను నిలిపివేయడంతో ఎయిర్లైన్ స్టాక్స్ పడిపోయాయి. బ్లూమ్బెర్గ్ వరల్డ్ ఎయిర్లైన్స్ ఇండెక్స్ మార్చి తర్వాత 2.6శాతం మేర క్షీణించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ఇంక్, యునైటెడ్ ఎయిర్లైన్స్ హోల్డింగ్స్ ఇంక్, అమెరికన్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఇంక్ కంపెనీలు ఇజ్రాయిల్కు తమ సేవలను రద్దు చేసుకున్నాయి. -
బ్యాటరీ టెక్నాలజీల్లో భారత్ మరింత ముందుకు
నోయిడా: బ్యాటరీ టెక్నాలజీల్లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) మార్కెట్ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల మార్కెట్ 128 గిగావాట్–అవర్ (జీడబ్ల్యూహెచ్) స్థాయికి చేరవచ్చనే అంచనాలు ఉన్నట్లు రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోలో పాల్గొన్న సందర్భంగా ఇన్ఫర్మా మార్కెట్స్ ఆఫ్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిలకడైన రీసైక్లింగ్ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ విద్యుత్ డిమాండ్లో చైనా, భారత్ సారథ్యంలోని ఆసియాకి ప్రస్తుతం 60 శాతం వాటా ఉందని ఉడ్ మెకెంజీ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ విట్వర్త్ తెలిపారు. రాబోయే రెండు దశాబ్దాల్లో సాంకేతిక పురోగతి వల్ల పవన, సౌర విద్యుత్ సామర్థ్యాలు నాలుగింతలు పెరగనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దకాలంలో ఈ రంగంలో 3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపారు. 700 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 900 పైగా బ్రాండ్లు ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. 40,000 మంది సందర్శకులు ఈ ఎక్స్పోను సందర్శించే అవకాశం ఉంది. -
సైబర్ బీమాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ బీమాకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్లో సైబర్ బీమా మార్కెట్ పరిమాణం 50–60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది. ‘సైబర్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్ వంటి డిజిటైజేషన్ అధికంగా ఉండే విభాగాలు సైబర్ క్రిమినల్స్కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది. పలువురు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ (రిస్క్ అడ్వైజరీ) ఆనంద్ వెంకట్రామన్ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రాబోయే మూడేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు. ► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్ ఇన్ఫ్రా బడ్జెట్లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ► దేశీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్ .. కఠినతరమైన సైబర్ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి. ► సైబర్ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి. ► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా కంపెనీలు కృషి చేయాలి. ► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి. -
రీజెన్సీ సెరామిక్స్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ మార్కెట్లోకి రీజెన్సీ సెరామిక్స్ రీఎంట్రీ ఇచ్చింది. చెన్నై విపణిలో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ను గురువారం ప్రవేశపెట్టింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంలో రీజెన్సీ సెరామిక్స్కు తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంటు పునరుద్ధరణకు సంస్థ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. 2023 చివరినాటికి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అలాగే పలు కంపెనీలతో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రిటైల్లో విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. దీర్ఘకాలిక చరిత్ర కలిగిన తమ బ్రాండ్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో మంచి పేరుందని రీజెన్సీ హోల్–టైమ్ డైరెక్టర్, సీఎఫ్వో సత్యేంద్ర ప్రసాద్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్ల ఆదాయం ఆర్జిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన నగరాల్లో షోరూంలను ఏర్పాటు చేస్తామన్నారు. రీజెన్సీ సెరామిక్స్ను 1983లో డాక్టర్ జి.ఎన్.నాయుడు స్థాపించారు. కార్మిక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం చివరకు రక్తసిక్తం కావడంతో 2012లో ప్లాంటు మూతపడింది. -
నిత్యావసర ధరలకు రెక్కలు.. కిందకు దిగని కందిపప్పు
హైదరాబాద్: నిరంతరం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. తాజాగా బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ. 200కు చేరుకుని, సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. తరచూ పప్పు తినేవారు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా సామాన్యులకు కందిపప్పు అందించేవారు. కానీ ఈ మధ్య అది కూడా అరకొరగానే అందుతోంది. దీంతో సామాన్యులు పప్పు లేకుండా పూట గడిచేది ఎలా? అని తల పట్టుకుంటున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటితే పప్పులతో సరిపెట్టుకునేవాళ్లమని.. కానీ ఇప్పుడు వాటి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని వాపోతున్నారు. -
కొబ్బరికాయలతో గణనాథుడు
-
ధాన్యంలాగే కొబ్బరీనూ..
సాక్షి అమలాపురం/ అంబాజీపేట : కొబ్బరి కొనుగోలులో దళారుల వ్యవస్థను తొలగించడంతోపాటు రైతులకు రవాణా, కూలి ఖర్చుల భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొబ్బరి ధరలు తగ్గిన నేపథ్యంలో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ఆధ్వర్యంలో శనివారం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఈ కేంద్రాల్లో కూడా కొబ్బరి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో మార్కెట్ యార్డుల కేంద్రంగా కొబ్బరి కొనుగోలు చేయగా, ఈసారి ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో ఇలా.. గతంలో రైతులు మార్కెట్ యార్డులకు ఎండుకొబ్బరిని తీసుకువెళ్లాల్సి వచ్చేది. రోజుంతా అక్కడే కళ్లాలలో ఎండబెట్టేవారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే కొనేవారు. లేదంటే వెనక్కి తెచ్చుకోవాల్సిందే. ఇది రైతులకు నష్టాన్ని కలగజేసేది. ఒకవేళ కొనుగోలు చేసినా నాఫెడ్కు తీసుకువెళ్లడానికి రవాణా ఖర్చుతోపాటు ఎండబెట్టడం, మూటలు కట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చేది. ప్రస్తుతం రోజుకు కూలి ఖర్చు రూ.600లు కాగా.. యార్డు వరకు తీసుకొస్తే రూ.వెయ్యి వరకు కూలి ఇవ్వాల్సి వచ్చేది. అధికారులే కళ్లాలు వద్దకు వచ్చి నాణ్యత నిర్ధారించి, అక్కడే కొనుగోలు చేయనున్నారు. ఇలా కొన్న కొబ్బరిని రైతులే సమీపంలోని నాఫెడ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. రైతులపై ఈ భారం మాత్రమే పడనుంది. కూలి ఖర్చులు కలిసిరావడం అంటే రైతులకు క్వింటాల్కు రూ.500ల నుంచి రూ.800లు వరకు మిగలనుంది. రైతులే సొంతంగా ఎగుమతి చేస్తే కూలి ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ విధానంవల్ల దళారుల పాత్ర దాదాపు లేనట్లే. గతంలో ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన కొబ్బరి 90 శాతం దళారులదే. ఇప్పుడు రైతులు నేరుగా లబ్ధిపొందనున్నారు. ♦ నాఫెడ్ కేంద్రాలు సేకరించిన కొబ్బరిని ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ♦ రైతులు ముందుగా ఆర్బీకేల్లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేల ద్వారా కళ్లాల్లోనే కొనుగోలు.. ♦ ఎకరాకు నెలకు రెండు కొబ్బరి బస్తాల (క్వింటాల్) చొప్పున కొనుగోలుకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు రైతులకు ధ్రువీకరణ పత్రాలిస్తారు. ♦ రైతుల వివరాలతో పాటు, కొబ్బరి విక్రయాలకు సంబంధించి కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైనిస్ అండ్ ప్రొక్యూర్మెంట్ (సీఎం యాప్)లో నమోదు చేస్తారు. ♦ దీని ఆధారంగా నాఫెడ్కు ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉన్న ఆయిల్ ఫెడ్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి కొబ్బరి కొనుగోలు చేస్తారు. సర్కారు ప్రత్యేక చొరవతో కేంద్రం అనుమతి.. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ సగటున 106.90 కోట్ల కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి పోటీవల్ల ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడంతో కొబ్బరి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. వెయ్యి కాయల ధర రూ.7 వేలు ఉంది. ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకొచ్చింది. జిల్లాలో తొలుత అంబాజీపేటలోను, తరువాత కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ముమ్మిడివరం, తాటిపాక, రావులపాలెం, నగరం మార్కెట్ యార్డుల్లో వీటిని ప్రారంభించనున్నారు. మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ని క్వింటాల్కు రూ.10,860లు, బాల్కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఎండు కొబ్బరి ధర రూ.8 వేలు, కురిడీ కొబ్బరి గుడ్డు రూ.తొమ్మిది వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఈ కేంద్రాల ఏర్పాటువల్ల బహిరంగ మార్కెట్లో కొబ్బరికాయకు ధర వస్తోందని, స్థానికంగా నిల్వ ఉన్న కొబ్బరి మార్కెట్కు వెళ్తే వచ్చే దసరా, దీపావళికి డిమాండ్ వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం కొనుగోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేస్తాం. రైతులు మార్కెట్ యార్డుల వద్దకు వచ్చి కొబ్బరి ఎండబెట్టి అమ్మకాలు చేయాల్సిన అవసరం ఉండదు. మేం కొనుగోలు చేసిన తరువాత సమీపంలో యార్డుకు తరలిస్తే సరిపోతోంది. సీఎం యాప్లో నమోదును బట్టి ఆయా ఆర్బీకేలకు ఒక షెడ్యూలు పెట్టుకుని కొబ్బరి కొనుగోలు చేస్తాం.– యు. సుధాకరరావు, మేనేజర్, ఆయిల్ఫెడ్ -
సూడాన్లో డ్రోన్ దాడి..43 మంది మృతి
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్లోని ఓ మార్కెట్పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 43 మంది చనిపోయారు. మరో 55 మంది గాయాలపాలయ్యారని మానవీయ సాయం అందిస్తున్న సంస్థలు వెల్లడించాయి. దేశంలో మిలటరీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నేత జనరల్ మహ్మద్ హమ్దాన్ దగాలో మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతంలో నివాసాల్లో పారా మిలటరీ బలగాలు తిష్టవేసి పోరాట సాగిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మిలటరీ వైమానిక దాడులకు దిగుతోంది. రెండు వర్గాల మధ్య పోరులో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ఈ పోరులో 4 వేల మందికి పైగా మరణించినట్లు ఐరాస చెబుతోంది. -
మార్కెట్ యార్డుల్లో విద్యుత్ ఆదాకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డుల్లో ఇంధన సామర్థ్య చర్యల ద్వారా విద్యుత్ను, డబ్బును ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. గుంటూరు యార్డును ఆసియాలోనే అతిపెద్ద విద్యుత్ ఆదా మిర్చి వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖతో భాగస్వామి అయ్యేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని మరికొన్ని కీలక మార్కెట్ యార్డుల్లో కూడా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయనుంది. వ్యవసాయ వాణిజ్యానికి మార్కెట్ యార్డులు కీలక కేంద్రాలు. ఇక్కడ లైటింగ్, శీతలీకరణ, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ కోసం విద్యుత్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్ పొదుపు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవితో ఈఈఎస్ఎల్ కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ సీజీఎం అనిమేష్ మిశ్రా ఆదివారం భేటీ అయ్యారు. విద్యుత్ ఆదా చర్యలకు సంబంధించిన నివేదికను చిరంజీవికి అందజేశారు. అనంతరం ఈఈఎస్ఎల్ అధికారులు, మార్కెటింగ్, సహకార శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. తొలుత గుంటూరు మిర్చి యార్డులో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేస్తా మన్నారు. ఈఈఎస్ఎల్ ప్రతినిధులు నితిన్ భట్, సావిత్రి సింగ్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. -
ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది?
ప్రతి వ్యక్తి వివిధ కూరలతో నిండిన ప్లేట్లోని ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాడు. దీని వెనుక రెండు కారణాలున్నాయి. మొదటిది ఇది కళ్లకు ఇంపుగా కనిపించడం. రెండవది మన శరీరానికి అవసరమైన రీతిలో పోషకాలను అందించడం. అయితే ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఎక్కడుందనే ప్రశ్న మీ మనస్సులో ఎప్పుడైనా తలెత్తితే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అతిపెద్ద కూరగాయల మార్కెట్ కలిగిన ఘనత భారత్ ఖాతాలోనే ఉందని తెలిస్తే ఎవరైనా చాలా సంతోషిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్పూర్లో ఉంది. ఆ మార్కెట్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని చాలామంది రైతులు ఆ మార్కెట్లో వ్యాపారం చేయాలని తపన పడుతుంటారు. 90 ఎకరాల్లో విస్తరించిన మార్కెట్ ఈ మార్కెట్ విస్తీర్ణం దాదాపు 90 ఎకరాలు. ఆజాద్పూర్ మండికి వెళ్లగానే ముందుగా పెద్ద గేటు కనిపిస్తుంది. దానిపై ‘చౌదరి హరి సింగ్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్పూర్’ అని రాసివుంటుంది. అక్కడ ప్రతిరోజూ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. భారతదేశంలో లభించే అన్ని రకాల కూరగాయలు ఇక్కడ కనిపిస్తాయి. చిన్న, పెద్ద వ్యాపారులు ఇక్కడ విరివిగా కనిపిస్తారు. డీల్ కుదుర్చుకున్న తర్వాత కొందరికి లాభం చేకూరుతుంది. మరికొందరు గిట్టుబాటు ధర లభించక డీలా పడుతూ కనిపిస్తారు. ఈ మార్కెట్లో మహిళలు కూడా అధికసంఖ్యలో కనిపిస్తారు. ఇంటి బాధ్యతలతో పాటు వారు కూరగాయల వ్యాపారాన్ని కూడా చక్కబెడుతుంటారు. 1977లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ మండి కమిటీల వివిధ కార్యకలాపాలు, సంక్షేమ పథకాలను నిర్వహించడానికి, నియంత్రించడానికి, మార్గనిర్దేశం చేయడానికి 1977లో ఆజాద్పూర్ మండిలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ ఏర్పాటయ్యింది. మండి పరిషత్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వివిధ చట్టాలను రూపొందించింది. ఇది కూడా చదవండి: దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది? -
G20 Summit: వృద్ధి విధానాలకు మద్దతు
న్యూఢిల్లీ: అందరికీ వృద్ధి, శ్రేయస్సు కారకాలుగా పనిచేయడానికి వాణిజ్యం, పెట్టుబడిని అనుమతించే విధానాలకు మద్దతు ఇవ్వాలని జీ–20 సభ్య దేశాలు అంగీకరించాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రంగా ఉన్న నిబంధనల ఆధారంగా వివక్షత లేని, న్యాయ, బహిరంగ, కలుపుకొని, సమాన, స్థిర, పారదర్శక బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ అనివార్యం’ అని జీ–20 వేదికగా నాయకులు ప్రకటించారు. రక్షణవాదం, మార్కెట్ను వక్రీకరించే పద్ధతులను నిరుత్సాహపరచడం ద్వారా అందరికీ అనుకూల వాణిజ్యం, పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి న్యాయమైన పోటీ వాతావరణాన్ని సృష్టించాలన్న నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. 2024 నాటికి సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా పూర్తి, మెరుగ్గా పనిచేసే వివాద పరిష్కార వ్యవస్థను కలిగి ఉండాలనే ఉద్దేశంతో చర్చలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. వాణిజ్యం, పర్యావరణ విధానాలు ప్రపంచ వాణిజ్య సంస్థ, పర్యావరణ ఒప్పందాలకు అనుగుణంగా పరస్పరం మద్దతునిచ్చేవిగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
చాందినీ చౌక్ చరిత్ర ఏమిటి? ఈ మార్కెట్ ఎలా ఏర్పాటయ్యింది?
ఎవరిమధ్యనైనా ఢిల్లీకి సంబంధించిన ప్రస్తావన వచ్చిప్పుడు చాందినీ చౌక్ను తప్పక తలచుకుంటారు. చాందినీ చౌక్ పలు సినిమాల్లో కూడా కనిపించింది. చాందినీ చౌక్ పేరుతో ఒక చిత్రం కూడా విడుదలయ్యింది. చాందినీ చౌక్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు దుస్తులు, ఆభరణాలు.. ఇలా ఒకటేమిటి ఏ వస్తువైనా ఇక్కడ చిటికెలో దొరుకుతుంది. షాపింగ్తో పాటు రుచికరమైన తినుబండారాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. చాందినీ చౌక్ ఎంతో పురాతనమైన మార్కెట్. దీనికి 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్లోని ఇరుకైన వీధులను కత్రా అని పిలుస్తారు. మార్కెట్ నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. పాత ఢిల్లీలో ఉన్న ఈ చాందినీ చౌక్ మార్కెట్ ఢిల్లీకి గర్వకారణంగా నిలుస్తుంది. ఇక్కడ అన్ని వయసుల వారికి వారు కోరుకున్న వస్తువులు లభ్యమవుతాయి. షాజహాన్ తన కూతురి కోసం.. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని షాజహానాబాద్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె అభిరుచిని నెరవేర్చేందుకు చక్రవర్తి తన ఎర్రకోట ముందు మార్కెట్ను ఏర్పాటు చేశాడు. దీంతో షాజహాన్ కుమార్తె ఇక్కడ షాపింగ్ చేసేది. 1650లో షాజహాన్ ఈ మార్కెట్ను నిర్మించాడు. క్రమంగా ఈ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ప్రత్యేక మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మత సామరస్యానికి ఉదాహరణ చాందినీ చౌక్ను షాజహాన్ స్థాపించినప్పటికీ, ఇక్కడ అందరికీ షాపింగ్ చేసే అవకాశం ఉంది. చాందినీ చౌక్ ఏరియా అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రముఖ గౌరీ శంకర్ ఆలయం, ఫతేపురి మసీదు ఉన్నాయి. అంతే కాదు ప్రసిద్ధ సిక్కు గురుద్వారా శిష్గంజ్ కూడా చాందినీ చౌక్లో ఉంది. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి కూడా ఇక్కడ ఉంది. చాందినీ చౌక్ మార్కెట్ వెండి, బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివాహ షాపింగ్ చాలా చౌకగా చేయవచ్చని పలువురు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 8 ఉగ్రదాడులు -
తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?
కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధాల తయారీ తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు Did you know? Scorpions farms do exist. Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicines [📹 King Scorpion / efre812]pic.twitter.com/PGdbpdpG8h — Massimo (@Rainmaker1973) September 2, 2023 -
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.