
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్ పాయింట్ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.
నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్ టచ్పాయింట్ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్ నెట్వర్క్ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.
మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్ సెంటర్ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్ టచ్పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్ టచ్పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment