ముప్పు అంచున మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు.. | Microsoft to lay off underperforming employees Report | Sakshi
Sakshi News home page

ముప్పు అంచున మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్‌

Jan 9 2025 12:25 PM | Updated on Jan 9 2025 1:01 PM

Microsoft to lay off underperforming employees Report

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.

మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉ‍ద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ  స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి  ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది.

"మైక్రోసాఫ్ట్‌లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి,  ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.

మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్‌ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్‌లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్‌ తొలగింపులు చేపట్టింది.

ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్‌కౌంట్‌లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.

ఏఐలో పెట్టుబడులు
భారత్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్‌ 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.

ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్‌ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని..  గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement