Microsoft
-
'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates).. 1975లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినందుకు చాలా బాధపడినట్లు, ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాలేజీ రోజులు చాలా అద్భుతంగా గడిచాయని పేర్కొంటూ.. 'సోర్స్ కోడ్: మై బిగినింగ్' (Source Code: My Beginnings) అనే పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన తరగతులను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతగానో ఆస్వాదించాను. తెలివైన వ్యక్తులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. రాత్రి సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. 1975లో సాఫ్ట్వేర్ కంపెనీ మొదటి సీఈఓగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. యూనివర్సిటీలో చదువు మానేయాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నన్ను బాధించిందని బిల్ గేట్స్ అన్నారు. అయితే డిగ్రీ పూర్తి చేయడానికి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లాలనిపించినా.. అది సాధ్యం కాలేదు.బిల్ గేట్స్.. తన మిత్రుడు 'పాల్ అలెన్'తో కలిసి కంప్యూటర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్వేర్ను సృష్టించగలిగితే, ఆ రంగంలో ముందంజలో ఉండవచ్చని భావించి.. రెండేళ్లు కృషి చేశారు. ఆ సమయంలో చదువును బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. చదువు మానేయాల్సి వచ్చింది. అయితే టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగారు.ఇదీ చదవండి: ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్పై నెటిజన్లు ఫైర్!సోర్స్ కోడ్: మై బిగినింగ్ పుస్తకం విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ మొదటి భాగంలో బిల్ గేట్స్ చిన్న నాటి విషయాలు, యూనివర్సిటీలో చదువు, ప్రయోగాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన విషయాలతో పాటు.. మెలిందా గేట్స్తో వివాహం వంటి మరిన్ని విషయాలు.. ఆ తరువాత వచ్చే పుస్తకాల్లో ఉండే అవకాశం ఉంది.బిల్ గేట్స్ 2000లో పదవీవిరమణ చేసే వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థను ముందుకు నడియాపారు. ఆ సమయంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇదే బిల్ గేట్స్ను ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా నిలబడేలా చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
ఏఐ పాఠాలు.. ఉద్యోగులకు శిక్షణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఐ ఫౌండేషన్ అకాడమీ ‘అడ్వాంటేజ్ తెలంగాణ’కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. పరిపాలన, ప్రజాసేవలోనూ ఏఐ సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ కు 3 కొత్త కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన భవనాన్ని సీఎం గురువారం ప్రారంభించారు. భవిష్యత్తు ఏఐ సాంకేతికతదే.. ‘మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ నడుమ సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయ ఆవిష్కరణలపై హైదరాబాద్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రభావాన్ని చూపింది. సంస్థ కార్యకలాపాల విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభి స్తాయి. వారి సాధికారతకు కూడా ఇది దోహదపడుతుంది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీదే. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘అడ్వాంటేజ్ తెలంగాణ’కార్యక్రమం ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తెలంగాణలో స్టార్టప్ వాతావరణాన్ని బలోపేతం చేస్తాయి. ఏఐ టూల్స్తో, ప్రపంచవ్యాప్త నెట్వర్క్తో అనుసంధానం చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ సిటీలో ‘ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేస్తోంది. ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను ఈ సెంటర్ అభివృద్ధి చేస్తుంది. ఆవిష్కరణలపై మైక్రోసాఫ్ట్కు ఉన్న నిబద్ధత తెలంగాణ పురోగామి విధానాలకు తోడ్పాటును అందిస్తుంది’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అతిపెద్ద డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ‘మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రం, క్వాంటమ్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ తదితరాలతోపాటు మూసీ పునరుజ్జీవ పథకం ద్వారా హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. మూడు దశాబ్దాలుగా హైదరాబాద్తో అనుబంధం కలిగిన మైక్రోసాఫ్ట్ రూ.15 వేల కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ల హబ్గా మారుతోంది. ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది..’అని శ్రీధర్బాబు తెలిపారు. అధునాతన ప్రమాణాలతో కొత్త క్యాంపస్ మైక్రోసాఫ్ట్ గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. ఈ సంస్థకు హైదరాబాద్లో ఇప్పటికే మూడు భవనాలు ఉన్నాయి. కొత్త క్యాంపస్లో 2,500 మంది ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు ఉన్నాయి. భారత్లో మైక్రోసాఫ్ట్కు 20 వేల మంది ఉద్యోగులు ఉండగా, సగం మంది హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారు. కాగా నూతన భవన ప్రారంభం పురస్కరంచుకుని సంస్థ గురువారం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ అందించేందుకు మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ‘అడ్వాంటేజ్ తెలంగాణ’పేరిట 500 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఏఐ పాఠాలతో శిక్షణ ఇస్తుంది. ‘ఏఐ ఇండస్ట్రీ ప్రో’పేరిట 20 వేల మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యంలో తర్ఫీదు ఇస్తుంది. ‘ఏఐ గవర్నర్ ఇనిషియేటివ్’పేరిట సుమారు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టవిటీ వంటి కీలక రంగాల్లో శిక్షణ ఇస్తుంది. ఎక్స్లెన్స్ సెంటర్పై ఎంవోయూ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్తో పాటు ఏఐ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేస్తోంది. హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులు రెట్టింపు చేయడంతో పాటు, రాబోయే రోజుల్లో అదనంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్కు అతిపెద్ద డేటా హబ్ గా అవతరించనుంది. ఇలావుండగా ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్ రాజీవ్కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల ‘సోర్స్ కోడ్’!
మహాకవి పోతన రచించిన ఒక పద్యం ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు’ అని మొదలవుతుంది. శత కోటీశ్వరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాకుడు బిల్ గేట్స్ను ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి ఆయన తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం. రాగల దశా బ్దాల్లో ప్రపంచాన్ని శాసించే సాంకేతికతను ముందే పసిగట్టి, అందుకోసం యాభైయ్యేళ్ల నాడే ఒక సంస్థను స్థాపించిన దార్శనికుడు. మరికొందరికి ఆయన దాతృత్వశీలి. తన స్వచ్ఛంద సంస్థ మెలిందా–గేట్స్ ఫౌండేషన్ ద్వారా వెనకబడిన దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఆరోగ్య పరిరక్షణలో పాటుపడుతున్న మహనీయుడు. కానీ అనేకులకు ఆయన అనుమానాస్పదుడు. ఆయన సేవా కార్యకలాపాల వెనక స్వప్రయోజనాలున్నాయని వారు సంశయిస్తారు. బిల్ గేట్స్ గురించి చాలా పుస్తకాలొచ్చాయి. అందులో ఆయన్ను కీర్తించినవీ ఉన్నాయి, తూర్పారబట్టినవీ ఉన్నాయి. కానీ ఇంతకూ బిల్ గేట్స్ ఎవరు? తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతారు? వీటన్నిటికీ జవాబుగా ఫిబ్రవరి 4న తన స్వీయచరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ పుస్తకం వెలువరించారు. మొత్తం మూడు భాగాలుగా వచ్చే స్వీయచరిత్రలో ఇది తొలి భాగం. ఇందులో బాల్యం నుంచి తొలి పాతికేళ్ల ప్రస్థానం ఉంది. బిల్ గేట్స్ వరకూ పుస్తకం వచ్చిన సందర్భం అనేక విధాల ముఖ్యమైనది. ఆయనకు ఈ సంవత్సరంతో 70 ఏళ్లు వస్తాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతుంది. దివంగతుడైన ఆయన తండ్రికి ఇది శతజయంతి సంవత్సరం. ఏడాదిన్నర క్రితం తన గురించి తాను రాసుకోవాలనిపించిందని,ఇందులో తన ఎదుగుదలకు కారకులైన తల్లితండ్రుల గురించీ, కుటుంబం గురించీ, ఇద్దరు బాల్యస్నేహితుల గురించీ చెప్పాలనిపించిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన సమకాలీకులతో పోలిస్తే ఆయనెప్పుడూ కొన్ని దశాబ్దాల ముందు ఆలోచించేవారని బిల్ గేట్స్ గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు. కానీ ఈ పుస్తకం కోసం ఆయన కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగు దలకైనా, పతనానికైనా కుటుంబ ప్రభావం, పెంపకం ఎలా దోహద పడతాయో ఈ పుస్తకంలో వివరించారు. తండ్రికి కోపం తెప్పించిన సందర్భంస్వీయచరిత్ర రాయదల్చుకున్నవారికి నిజాయితీ ముఖ్యం. తన తప్పొప్పులన్నిటినీ నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఆత్మకథకు పూను కోవాలి. తాను మానవాతీతుడినన్న అహం ఉండకూడదు. తన ఎదు గుదల ఎలా సాధ్యమైందో, జీవితం ఏయే మలుపులు తిరిగిందో, తన ప్రతి అడుగులోనూ ఎవరెవరు అండదండలు అందించారో, ఎవరిపట్ల తాను నిర్దయగా వ్యవహరించాడో, ఆ తప్పును ఏ దశలో గుర్తించాడో, ఎలా సరిదిద్దుకున్నాడో చెప్పగలగాలి. ఈ చట్రంలో ఇమిడే స్వీయచరిత్రలు మనదగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ. బిల్గేట్స్ తన గురించి తాను ఏం చెప్పుకుంటారన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. తొలి భాగం ‘సోర్స్ కోడ్’ ఆ విషయంలో అందరి మన్ననలూ పొందే అవకాశం ఉంది. ఇది బాల్యం గురించే కనుక, ఆ దశలో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టే అవకాశం లేదని అనుకుంటారు. కానీ బాల్య జీవితంలోని కొన్ని అంశాలను నిస్సంశయంగా చెప్పటం ద్వారా బిల్ ఫుల్మార్క్లు కొట్టేశారు. అది అమెరికా కనుక 1970ల నాటికే అందరికీ కంప్యూటర్ గురించి తెలిసిపోయింది. పర్సనల్ కంప్యూటర్ల వాడకమూ మొదలైంది. కాకపోతే ఇప్పటిలా నిత్యావసర వస్తువు కాదు. బాగా ధనవంతులకు మాత్రమే సాధ్యపడే విలాసవంతమైన ఉపకరణం. అలాగని బిల్ గేట్స్ తల్లిదండ్రులు నిరుపేదలు కాదు. వారి కుటుంబం ఇతరు లతో పోలిస్తే సుఖంగానే జీవనం సాగించేది. తండ్రి గేట్స్ సీనియర్ సమాజం పట్లా, కుటుంబం పట్లా ఎంతో నిబద్ధతతో ఉండేవాడని బిల్ గుర్తు చేసుకున్నారు. ఆచితూచి వ్యవహరించేవాడని, పిల్లల పట్ల దయతో, శ్రద్ధాసక్తులతో ఉండేవాడని రాశారు. ఆయన ఒకే ఒకసారి ఉగ్రుడయ్యాడట. అది కూడా తన లోపమేనని ఆయనంటారు.డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్ ముఖంపై చిమ్మారట. ‘థాంక్స్ ఫర్ ద షవర్’ అంటూ అక్కడి నుంచి బిల్ నిష్క్రమించారు. ‘ఎప్పుడూ ఎంతో శాంతంగా, ప్రేమగా ఉండే తండ్రిని నా ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశాను’ అని బిల్ రాశారు. ‘చిన్నప్పుడంతా ‘జటిలమైన కొడుకు’గానే ఉండేవాడిని’ అంటారు. ‘ఇప్పుడైతే ఆ ప్రవర్తన చూసి కచ్చితంగా ఆటిజంతో బాధపడేవాడిగా పరిగణించివుండేవారు’ అని చెబుతారు. చిన్ననాడే మద్యపానం, గంజాయి, ఎల్ఎస్డీ వంటివి అలవా టైన సంగతి, వాటికి దూరమైన సంగతి కూడా బిల్ దాచుకోలేదు. కొన్ని విషయాల్లో తమ పిల్లాడు ఎందుకంత ఆలోచిస్తాడో, ప్రవర్తి స్తాడో తెలుసుకోవటానికి అవసరమైన పుస్తకాలు, ఇతరేతర సమా చారం తల్లితండ్రులకు ఉండేది కాదంటాడు. ‘పెద్దవాళ్లను కలవటం, వారితో చర్చించటం, వారి సలహాలు, సూచనలు పాటించడం అనే సంస్కృతిని అమ్మానాన్న, అమ్మమ్మ అలవాటు చేశారు. అందుకే ఎక్కడికి తీసుకెళ్లినా పెద్దవాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించటం, సంతృప్తికరమైన జవాబు వచ్చేవరకూ ఆ ప్రశ్నల పరంపరను కొనసాగించటం అలవాటైంది. అది జీవితంలో ఎదగటానికి తోడ్పడింది’ అని బిల్ గేట్స్ అభిప్రాయపడతారు. ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ తనలో పోటీతత్వాన్ని ఎంతగానో పెంచారంటారు. తన జీవితంలో చోటుచేసుకున్న ఈ అంశాలను చెప్పటం అవి అందరికీ ఉపయోగపడతాయన్న ఉద్దేశమేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పుట్టుకే అయాచితంగా అదనపు హక్కు (ప్రివిలేజ్)ను ఇచ్చిందని నిజాయితీగా ఒప్పుకోవటం ప్రశసించ దగ్గది. అప్పటికే జాతిపరమైన విభేదాలతో నిలువునా చీలివున్న సియాటెల్ సమాజంలో తాను శ్వేతజాతిలో పుట్టడం, అందులోనూ మగవాడిని కావటం ఎంతో కలిసొచ్చిందని బిల్ స్వీయాభిప్రాయం. పుట్టుకతోనే ప్రతిభావంతులమని స్వోత్కర్షకు పోయేవారికి ఇదొక కనువిప్పు. మేము లేకుండా కంప్యూటర్ విప్లవమా?హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేనాటికి బిల్ గేట్స్కూ, ఆయన బాల్యస్నేహితుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్కూ, 17 యేళ్లవయసులోనే మృత్యు వాత పడిన మరో స్నేహితుడు కెంట్ ఇవాన్స్కూ పర్సనల్ కంప్యూ టర్పై అవగాహన ఉంది. ఎయిత్ గ్రేడ్లో ఉన్నప్పుడు పాఠశాల కొచ్చిన కంప్యూటర్తో ఎక్కువ సమయం గడిపేందుకు కంప్యూ టర్లో బగ్స్ సృష్టించామని, అది కనిపెట్టి తననూ, ఇవాన్స్నూ వెళ్లగొట్టారని బిల్ గేట్స్ చెప్పారు. తర్వాత కాలంలో కంప్యూటర్లలో బగ్స్ గుర్తించి తొలగించే పనికి కుదిరి కొంత డబ్బు సంపాదించిన ఉదంతాలూ ఉన్నాయి. కంప్యూటర్ను నిర్వహించే సీసీసీ కంపెనీ మూతపడటంతో దాని నిర్వహణ భారాన్ని స్కూల్లో తనకు అప్పగిస్తే, మిత్రుడు అలెన్ సాయంతో దాన్ని పూర్తిచేశారు. తన తొలి వ్యాపార భాగస్వామిగా ఇవాన్స్ తనతో జతకట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని, అతని మరణం ఒక్కటే తన బాల్యంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనని ఆయన వివరి స్తారు. తమ ప్రమేయం లేకుండానే కంప్యూటర్ విప్లవం వెల్లువెత్తు తుందేమోనన్న ఆత్రుత గేట్స్కూ, అలెన్కూ ఉండేదంటే... తాము అందులో పాలుపంచుకుని ప్రముఖంగా ఎదగాలనుకున్నారంటే వారి తపన ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఈ ఇద్దరు మిత్రులూ ఎంఎస్–డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ వంటి సాఫ్ట్వేర్ రూపకల్పనలు చేయ గలిగారు.ఇవాళ్టిరోజున మైక్రోసాఫ్ట్లో బిల్ గేట్స్ వాటాల విలువ 10,780 కోట్ల డాలర్లు. ప్రపంచంలో ఆయన 13వ అతి పెద్ద ఐశ్వర్యవంతుడు. 2021లో ఆయనతో విడిపోయిన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ వాటాలు 3,040 కోట్ల డాలర్ల పైమాటే. అన్నట్టు, దీని అనంతరం రాబోయే పుస్తకాల్లో చాలా వివాదాస్పద విషయాలుంటాయి. ‘సోర్స్ కోడ్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు గమనిస్తే ఆయన దేన్నీ దాచదల్చలేదని స్పష్టమవుతుంది. మిత్రుడు అలెన్ను దూరం చేసుకోవటం తప్పేనని అంగీకరించారు. మైక్రోసాఫ్ట్లో కొందరు మహిళా ఉద్యోగినులతో తన వివాహేతర సంబంధాలు, లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణ లొచ్చిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్తో తనకున్న అనుబంధం, 27 ఏళ్ల వివాహబంధం అనంతరం భార్యతో విడాకులు, స్టీవ్ జాబ్స్తో పరిచయం, గొడవలు వంటి వ్యవహారాలపై బిల్ గేట్స్ అరమరికలు లేకుండా మాట్లాడారు. ఇంకా పర్యావరణం, ఏఐ వరకూ అభివృద్ధిపరిచిన సాంకేతికత, కరోనా మహమ్మారి, డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ల తీరుతెన్నులు వగైరాలు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావన కొచ్చాయి. కనుక రాబోయే రెండు భాగాల్లో వీటికి సంబంధించి మరిన్ని వివరాలందిస్తారని తెలుస్తూనే ఉంది. తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
ఆమె నా అదృష్టం.. పెదవి విప్పిన బిల్ గేట్స్
అపర కోటీశ్వరుడు, తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల వార్తల్లో నిలిచారు. మెలిందా ఫ్రెంచ్ నుండి విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, బిల్ గేట్స్ ఇటీవల ది టైమ్స్ ఆఫ్ లండన్తో మాట్లాడుతూ తన నిర్ణయం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. అయితే గతం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. దాతృత్వవేత్త పౌలా హర్డ్తో (Paula Hurd) ఆయన బంధంలో కొనసాగుతున్నారు. ఆమెతో ఉన్న సంబంధం గురించి మొదటిసారిగా బిల్ గేట్స్ పెదవి విప్పారు.తాజాగా ‘టుడే షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పౌలాతో ఉన్న సంబంధాన్ని బిల్గేట్స్ బయటపెట్టారు. "పౌలా వంటి సీరియస్ గర్ల్ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము సరదాగా గడుపుతున్నాం. ఒలింపిక్స్కు వెళ్తున్నాం. ఇంకా మరెన్నో" అంటూ పేర్కొన్నారు. బిల్ గేట్స్ పౌలా హర్డ్ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఈ జంట తరచుగా అనేక కార్యక్రమాలలో కలిసి కనిపించారు.ఎవరీ పౌలా హర్డ్?పౌలా హర్డ్ (62)ను పౌలా కలుపా అని కూడా పిలుస్తారు. ఇది ఈమె తొలి పేరు. పౌలా గతంలో ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ను వివాహం చేసుకోగా 2019లో ఆయన అకాల మరణం చెందారు. పౌలా, మార్క్ వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పౌలా హర్డ్ పరోపకారి. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రసిద్ధి చెందారు. కాగా బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ వివాహం 27 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు.బిల్ గేట్స్ ఆత్మకథ బిల్ గేట్స్(70) స్వీయ చరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ (Source Code: My Beginnings) తాజాగా అమెరికా మార్కెట్లోకి విడుదలైంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతోంది. అదేవిధంగా, తన తండ్రి శత జయంతి సంవత్సరం. ఈ సందర్భాన తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, బాల్య స్నేహితుల గురించీ చెప్పాలనిపించినట్లు ఒక సందర్భంలో ఆయనే చెప్పారు.తన సమకాలికులతో పోలిస్తే బిల్ గేట్స్ ఎప్పుడూ కొన్ని దశాబ్దాలకు ముందు వెళ్లి ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. అటువంటిది, ఆత్మ కథ కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగుదల లేదా పతనాలకు కుటుంబం ప్రభావం ఎలా ఉంటుందో గేట్స్ ఈ పుస్తకంలో వివరించారు. తన స్వీయ రేఖా చిత్రం తాలూకూ స్కెచ్ ఎంతో శ్రద్ధగా గీసి, దానికి అవసరమైన రంగులద్ది ఎంతో ప్రతిభావంతంగా రూపొందించిన పెయింటింగ్లా ఉంది ఈ స్వీయచరిత్ర. తన తండ్రి గేట్స్ సీనియర్ కుటుంబం, సమాజం అంటే ఎంతో నిబద్ధతతో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. పిల్లలంటే ఎంతో దయతో ప్రేమతో వ్యవహరించేవారని చెప్పారు. ఆయనకు ఒకే ఒకసారి బాగా కోపం వచ్చిందట. అది కూడా తన లోపమేనంటారు బిల్ గేట్స్. డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్పై ముఖంపై చిమ్మారట. వెంటనే ‘థాంక్స్ ఫర్ ది షవర్స్’అంటూ బిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ శాంతంగా ఉండే తన తండ్రి తన ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశానని బిల్ రాశారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద వాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించడం, సంతృప్తి కరమైన జవాబు వచ్చే వరకు ప్రశ్నల పరంపరను కొనసాగించడం అలవాటైందని, జీవితంలో ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పుకున్నారు. -
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. (Microsoft layoffs) మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్ యూఎస్లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించడం ప్రారంభించింది.తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది."మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది.ఇది చదివారా? ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..ఇక తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు.గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, సేల్స్, గేమింగ్లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే తొలగింపులు స్వల్ప స్థాయిలోనే ఉండటం, సమీప కాలంలోనే వీటిని భర్తీ చేయనుండటంతో మొత్తంగా కంపెనీ హెడ్కౌంట్లో పెద్దగా తగ్గింపు ఉండకపోవచ్చు.భారత్లో 2587 మంది టెకీలు2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. -
ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది."మైక్రోసాఫ్ట్లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్కు సంబంధించిన ఎక్స్బాక్స్ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్ తొలగింపులు చేపట్టింది.ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్కౌంట్లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.ఏఐలో పెట్టుబడులుభారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని.. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
ఒక్క మ్యాథ్స్ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు (AI) సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. ఏఐకి పునాదుల్లాంటి ఫౌండేషన్ మోడల్స్ను సొంతంగా రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఒక్క కొత్త మ్యాథ్స్ సూత్రం, అల్గోరిథంలాంటిది కనుగొన్నా ఏఐ స్వరూపం మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయని నాదెళ్ల పేర్కొన్నారు.కృత్రిమ మేథను ఉపయోగించి, పరిశ్రమల పనితీరును మెరుగుపర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, అధునాతనమైన ఏఐ సిస్టమ్స్ మీద కసరత్తు చేయాలంటే పెట్టుబడుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంటోందని ఆయన చెప్పారు. కానీ పరిశోధనలతో వ్యయాల భారాన్ని తగ్గించుకోవచ్చని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇండియా ఏఐ టూర్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల వివరించారు.ప్రస్తుతం ఓపెన్ఏఐ, గూగుల్లాంటి టెక్ దిగ్గజాలు తయారు చేసిన ఏఐ ఇంజిన్లనే (ఫౌండేషన్ మోడల్స్) దేశీయంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కార్యక్రమం సందర్భంగా రైల్టెల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా గ్రూప్ మొదలైన సంస్థలతో మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది.ఈ ఒప్పందాల కింద క్లౌడ్, ఏఐ ఆవిష్కరణల ద్వారా ఆయా సంస్థల సిబ్బంది, కస్టమర్లు ప్రయోజనం పొందేందుకు కావాల్సిన తోడ్పాటును మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. అటు దేశీయంగా ఏఐ, కొత్త టెక్నాలజీలను మరింతగా అభివృద్ధి చేసేందుకు, సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఇండియా ఏఐతో కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణఇండియాఏఐతో భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. -
2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl— Satya Nadella (@satyanadella) January 6, 2025ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లు!మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు. -
అగ్రగామిగా హైదరాబాద్.. సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐ, జెన్ (జెనరేటివ్) ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ నేపథ్యంలో వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. సీఎం సోమవారం.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి బంజారాహిల్స్లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై చర్చించారు. రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ వంటి అంశాలను వివరించారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెంచడంపై రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో టాప్ ఫిఫ్టీకి: సత్య నాదెళ్ల తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని సత్య నాదెళ్ల ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచే అంశంలో ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహద పడతాయని, హైదరాబాద్ను ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి నగరాల జాబితాలో చేర్చుతాయని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఇక్కడ పది వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టామని గుర్తుచేశారు. సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేయండి: శ్రీధర్బాబు సీఎం భేటీ అనంతరం మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సత్య నాదెళ్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఇటీవల కొత్తగా మరో 4వేల ఉద్యోగాల కల్పనకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చందనవెల్లిలో రెండు, మేకగూడ, షాద్నగర్లో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తంగా 600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల ఏర్పాటును స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించే ఏఐ సిటీలో ‘ఏఐ సాంకేతికత’కు సంబంధించి ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ), ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఏఐ, జెన్ ఏఐ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వాలని శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. -
సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: ఈ అంశాలపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెక్ సీఈఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఇదే మొదటిసారి. స్కిల్ యూనివర్సిటీ (Skill University), ఏఐ క్లౌడింగ్ (AI Clouding) కంప్యూటింగ్ వంటి వాటి మీద చర్చలు జరపనున్నారు.రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి.. సత్య నాదెళ్లను కోరనున్నారు. తెలంగాణలో మొత్తం 6 డేటా సెంటర్లను కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్ ద్వారా 4,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఒప్పందాలు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.స్కిల్ యూనివర్సిటీరంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేట్లో స్కిల్ డెవలప్మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సుమారు 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. ఇందులో మెషీన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐ అండ్ రోబోటిక్స్, ఐవోటీ, ఇండస్ట్రియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటాసైన్స్ అండ్ అనలిస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, 5జీ కనెక్టివిటీ మొదలైన కోర్సులు ఉండనున్నట్లు సమాచారం. -
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
మైక్రోసాఫ్ట్కు, గూగుల్కు తేడా అదే..
మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్బుక్ సమ్మిట్లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల మాటకేమంటారు..?పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.చాట్జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్బెర్గ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్కు ఆడబోమంటూ బదులిచ్చారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
మైక్రోసాఫ్ట్పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది.సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.జూన్తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. -
మైక్రోసాఫ్ట్ను వీడుతున్న మహిళా ఉద్యోగులు..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో వింత ధోరణి కనిపిస్తోంది. సంస్థను వీడుతున్న ఉద్యోగుల్లో అత్యధికం మహిళలే ఉంటున్నారు. నిష్క్రమిస్తున్న వారిలో లాటిన్స్, నల్ల జాతీయులు ఉండటంతో కంపెనీ శ్రామికశక్తి వైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ అండ్ ఇన్క్లూషన్ నివేదిక ప్రకారం.. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీని వీడివెళ్లిన ఉద్యోగుల్లో మహిళలు 32.7% మంది ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోల్చితే 31% పెరిగింది. స్వచ్ఛంద నిష్క్రమణలు, తొలగింపులు అన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన ఈ రిపోర్ట్ను తాజాగా విడుదల చేశారు.దెబ్బతింటోన్న వైవిధ్యంఅమెరికాకు సంబంధించిన నిష్క్రమణలలో నల్లజాతి కార్మికులు 10% ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఇది 8.7 శాతంగా ఉండేది. ఇక లాటిన్ అమెరికన్ల నిష్క్రమణలు 8% నుండి 9.8 శాతానికి పెరిగాయి. ఇక పురుషులు, ఆసియన్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇది విరుద్ధంగా ఉంది. 2023లో కంటే గతేడాది వీరి నిష్క్రమణలు తక్కువగా నమోదయ్యాయి.ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమలో చాన్నాళ్లకు మారిన పరిస్థితులుప్రత్యర్థి కంపెనీలు అవలంభిస్తున్న పోకడలే ఇందుకు కారణంగా మైక్రోసాఫ్ట్ పేర్కొంటోంది. అలాగే తమ భౌతిక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారాలలో మార్పులు కూడా కొంత మేరకు కారణమైన ఉండచ్చొని చెబుతోంది. పెద్దగా ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఉద్యోగులను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కొనసాగిస్తోందని, అయితే వారిని నిలుపుకోవడానికి మరింత చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే-రే మెక్ఇంటైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. -
మైక్రోసాఫ్ట్తో ఇన్ఫోసిస్ పార్టనర్షిప్ విస్తరణ
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యం విస్తరిస్తున్నట్లు దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది. జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజూర్ల్లో గ్లోబల్ కస్టమర్ల దత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.క్లౌడ్, ఏఐ వర్క్ లోడ్స్లో మైక్రోసాఫ్ట్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్లకు వ్యూహాత్మ సరఫరాదారుగా మద్దతునిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఖర్చు తగ్గించడంతోపాటు చురుకుదనం, స్కేలబిలిటీని సాధించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐతో ఐపీ సొల్యూషన్ల పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది.ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్పోసిస్ కోబాల్ట్, ఇన్ఫోసిస్ ఆస్టర్ వంటి సొల్యూసన్స్ తో మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ ఆఫరింగ్స్ సమ్మిళితం చేస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లయ్ చైన్, టెలీ కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల కస్టమర్ల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వెల్లడించాయి. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్గేట్స్కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్మన్తో ముచ్చటించారు. ఈ సందర్భంలో కంపెనీలో నెలకొన్న సమస్య గురించి ప్రస్తావించారు. ఉత్పాదకలో సమస్యలున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు.కరోనా సమయంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అంకితమయ్యారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత రిమోట్ వర్క్ అమల్లోకి వచ్చింది. ఇది ఉత్పాదకలో సమస్యలకు కారణమవుతోంది. కంపెనీలోని మేనేజర్లు 85 శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో 85 శాతం ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు.ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెబుతున్నారు. మేనేజర్లు ఉద్యోగులు పనిచేయలేదు అంటుంటే.. ఉద్యోగులు చేయాల్సిన పనికంటే ఎక్కువ పని చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి డేటా మరో కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. దీనిని పరిష్కరించడానికి ఒకటే మార్గం. అదేమిటంటే.. మేనేజర్లు ముందున్న లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలి. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొత్త ప్లాన్స్ వేసుకోవాలి, అవి సాధ్యం కాకపోతే కొత్తవాటిని అమలు చేయాలనీ సత్య నాదెళ్ల అన్నారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్ఎలాంటి సమయంలో అయినా.. ప్రపంచానికి నాయకులు చాలా అవసరమని నేను విశ్వసిస్తున్నానని సత్య నాదెళ్ల అన్నారు. నాయకులు తమ ఉద్యోగులను బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని వెల్లడించారు. -
ఆ 'కల' కోసం కాలేజీ వదిలేసి.. చివరకు..
మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.ప్రతి ఇంట్లోని డెస్క్పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. 1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు. -
రూ.520 కోట్లతో స్థలం కొనుగోలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మహారాష్ట్ర పుణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందుకోసం ఏకంగా రూ.520 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ ఎల్ఎల్పీ నుంచి ఈ కొనుగోలు చేసినట్లు పేర్కొంది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కార్యకాలాపాలు సాగిస్తోంది. దేశీయంగా డేటా సెంటర్లను విస్తరిస్తామని కంపెనీ గతంలో పలుమార్లు తెలిపింది. వివిధ నగరాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయనేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల పుణె నగరంలో పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో పుణెలో గడిచిన రెండేళ్లలో రూ.848 కోట్ల పెట్టుబడితో రెండు చోట్ల స్థలాలు తీసుకుంది.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల ద్వారా వివిధ కంపెనీలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ అందించనున్నారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు, స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు.. వంటి వాటికి డేటా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. ఇదిలాఉండగా, మైక్రోసాఫ్ట్ 2025 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం ‘అడ్వాంటేజ్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
రానున్నది మరో మహమ్మారి.. బిల్గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
క్యూట్ కుర్రాడిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. అరుదైన ఫొటోలు
-
ఎక్కువ.. తక్కువ.. నిర్ణయాత్మకంగా..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల(57)నేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి’ అనే నియామాన్ని సత్య ఎక్కువగా నమ్ముతారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్లో ఆగస్టు 19, 1967లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు.సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు రూ.251 లక్షల కోట్లు (3 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు(రూ.8.3 లక్షలు) పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు(రూ.95 లక్షలు) అయ్యేది.బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్కు సీఈఓ కావడం అంటే సత్యకు పెద్ద సవాలే. ఆయన సీఈఓ అవ్వడానికంటే 22 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు. దాంతో చాలామంది సత్య సుధీర్ఘ ప్రస్థానంలో సాధించలేనిది సీఈఓగా బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. నాదెళ్ల చేసే ప్రతి పనిని గత సీఈఓల పనితీరుతో పోల్చేవారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దాంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వచ్చే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!పేరు: సత్య నారాయణ నాదెళ్లతండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్తల్లి: ప్రభావతిభార్య: అనుపమ నాదెళ్లపిల్లలు: 3కుమారుడు: జైన్ నాదెళ్లకుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్లజన్మస్థలం: హైదరాబాద్వయసు: 57 (2024)జాతీయత: భారతీయుడుపౌరసత్వం: యూఎస్ఏచదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీవృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
హై రిస్క్లో విండోస్ యూజర్లు..
మైక్రోసాఫ్ట్కు చెందిన విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్లలో గుర్తించిన రెండు భద్రతా లోపాల గురించి యూజర్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని టార్గెట్ సిస్టమ్పై దాడి చేసే వ్యక్తి 'ఎలివేటెడ్ ప్రివిలేజెస్' పొందేందుకు ఆస్కారం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది.ఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జారీ చేసిన ఒక సూచనలో సమస్య గురించి కొన్ని వివరాలను పంచుకుంది. “వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ (VBS), విండోస్ బ్యాకప్కు మద్దతు ఇచ్చే విండోస్ ఆధారిత సిస్టమ్లలో ఈ లోపాలు ఉన్నాయి. దాడి చేసే వ్యక్తి గతంలో తొలగించిన సమస్యలను తిరిగి ప్రవేశపెట్టడానికి లేదా వీబీఎస్ రక్షణలను చేధించడానికి ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చు" అని పేర్కొంది.తాజా సెక్యూరిటీ ప్యాచ్లో సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు సెర్ట్ఇన్ పేర్కొంది. కాబట్టి విండోస్ యూజర్లు మైక్రోసాఫ్ట్ అందించిన అప్డేట్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని సూచించింది.ప్రభావిత విండోస్ వెర్షన్లు ఇవే..Windows Server 2016 (Server Core installation)Windows Server 2016Windows 10 Version 1607 for x64-based SystemsWindows 10 Version 1607 for 32-bit SystemsWindows 10 for x64-based SystemsWindows 10 for 32-bit SystemsWindows 11 Version 24H2 for x64-based SystemsWindows 11 Version 24H2 for ARM64-based SystemsWindows Server 2022, 23H2 Edition (Server Core installation)Windows 11 Version 23H2 for x64-based SystemsWindows 11 Version 23H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for 32-bit SystemsWindows 10 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for x64-based SystemsWindows 11 Version 22H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for x64-based SystemsWindows 10 Version 21H2 for ARM64-based SystemsWindows 10 Version 21H2 for 32-bit SystemsWindows 11 version 21H2 for ARM64-based SystemsWindows 11 version 21H2 for x64-based SystemsWindows Server 2022 (Server Core installation)Windows Server 2022Windows Server 2019 (Server Core installation)Windows Server 2019Windows 10 Version 1809 for ARM64-based SystemsWindows 10 Version 1809 for x64-based SystemsWindows 10 Version 1809 for 32-bit Systems -
ఉద్యోగులకు నంబర్1 మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ: భారత్లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, అమెజాన్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నట్టు ‘ర్యాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2024’ నివేదిక తెలిపింది. ఆర్థిక సామర్థ్యం, మంచి పేరు, కెరీర్లో చక్కని పురోగతి అవకాశాలు ఈ మూడూ ఉద్యోగులు ప్రధానంగా చూసే అంశాలు. వీటి పరంగా మైక్రోసాఫ్ట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. టాటా పవర్, టాటా మోటార్స్, శామ్సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మెర్సెడెస్ బెంజ్ వరుసగా టాప్–10లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,73,000 మంది ప్రతినిధులు, 6,084 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా ర్యాండ్స్టాడ్ తెలుసుకుంది. భారత్ నుంచి 3,507 మంది అభిప్రాయాలు స్వీకరించింది. -
మైక్రోసాఫ్ట్లో మరో సమస్య.. స్పందించిన కంపెనీ
మైక్రోసాఫ్ట్లో మరో సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు అనేక సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.మైక్రోసాఫ్ట్లో ఏర్పడిన సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి ఇంజినీరింగ్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అజ్యూర్ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కూడా పేర్కొంది.మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్య మొదట యూరోప్లో గుర్తించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు చాలామందే ఉన్నారని పలువురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా తెలిసింది.We're currently investigating access issues and degraded performance with multiple Microsoft 365 services and features. More information can be found under MO842351 in the admin center.— Microsoft 365 Status (@MSFT365Status) July 30, 2024We are investigating an issue impacting the Azure portal. More details will be provided as they become available.— Azure Support (@AzureSupport) July 30, 2024 -
తప్పు చేశాం.. కప్పు కాఫీ తాగండి..!
మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్లో కూపన్ వివరాలు పంపించింది.క్రౌడ్స్ట్రైక్ పంపించిన ఈమెయిల్లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
ఆ నష్టాలు మీరే కట్టండి.. మైక్రోసాఫ్ట్కు షాక్!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా వివిధ కంపెనీలకు కలిగిన నష్టాన్ని చెల్లించడాన్ని పరిగణించాలని మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ సంస్థలను కోరినట్లు మలేషియా డిజిటల్ మంత్రి తెలిపారు.క్రౌడ్ స్ట్రైక్ భద్రతా సాఫ్ట్వేర్కు సంబంధించిన తప్పు అప్డేట్ గతవారం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితమైన కంప్యూటర్లను క్రాష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించింది. విస్తృత శ్రేణి పరిశ్రమలను ప్రభావితం చేసింది.మలేషియాలో ప్రభావితమైన వాటిలో ఐదు ప్రభుత్వ సంస్థలు, విమానయానం, బ్యాంకింగ్, హెల్త్కేర్లో పనిచేస్తున్న తొమ్మిది కంపెనీలు ఉన్నాయని మలేసియా మంత్రి గోవింద్ సింగ్ డియో విలేకరులతో అన్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదికను కోరేందుకు మైక్రోసాఫ్ట్, క్రౌడ్స్ట్రైక్ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, పునరావృత అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంస్థలను కోరినట్లు గోవింద్ చెప్పారు."తమ నష్టాలను భర్తీ చేయాలని బాధిత కంపెనీలు కోరుతున్నాయి. వాటి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించడానికి వారు ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలని నేను వారిని కోరాను" అని గోవింద్ చెప్పారు. సాధ్యమైన చోట క్లెయిమ్లపై ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందన్నారు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. -
ఆటో డ్రైవర్గా మారిన మైక్రోసాఫ్ట్ ఇంజనీర్..ఎందుకంటే..?
ప్రముఖ కంపెనీలో టెక్కీలుగా పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆటో డ్రైవర్గా కెమెరా కంటికి చిక్కాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదేంటీ టెక్కీ ఇలా డ్రైవర్గా పనిచేయడం ఏంటని అందరూ కంగుతిన్నారు. సోషల్ మీడియా ఎక్స్లో వేంకటేశ్ గుప్తా అనే వ్యక్తి కోరమంగళలోని మైకోసాఫ్ట్లో పనిచేస్తున్న వేంకటేశ్ గుప్తా అనే టెక్నీని కలిసినట్లు తెలిపాడు. వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న ఆ టెక్కీతో మాటలు కలిపినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో అతడి వివరాలు ఆరా తీయగా..ఆ టెక్కీ తాను ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. ఆ ఒంటరి తనాన్ని అధిగమించడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు. విచిత్ర ఏంటంటే ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీని కూడా ధరించాడు.. అయితే నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..అతడి ఒంటరితనం పట్ల సానూభూతి చూపగా, ఇంకొందరూ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి సీనియర్ మైక్రో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారాంతాల్లో ఇలా ఆటో డ్రైవర్లగా పనిచేయడం కొత్త విషయం ఏమీ కాదు. కొంతమంది టెక్కీలు కూడా ఇలా గిగ్ వర్కర్లుగా పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో కూడా బెంగుళూరులోని హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్)లో జావా డెవలపర్గా పనిచేస్తునన్న ఉద్యోగి రాపిడో బైక్ టాక్సీని నడుపుతూ దొరికిపోయాడు. దీంతో అతను తన మునుపటి ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అయితే అతను తన తోటి టెక్కీలను కనుగొనడానికి ఇలా బైక్ రైడర్గా మారినట్లు చెప్పడం గమనార్హం. Met a 35 year old staff software engineer at Microsoft in Kormangala driving Namma Yatri to combat loneliness on weekends pic.twitter.com/yesKDM9v2j— Venkatesh Gupta (@venkyHQ) July 21, 2024 (చదవండి: నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!) -
చైనాపై పడని మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?
మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య ప్రపంచంలోనే చాలా దేశాలను అతలాకుతలం చేశాయి. ఇందులో భారత్ సహా అమెరికా, యూరప్ దేశాలు ఉన్నాయి. అనేక దేశాలపై పడిన ఈ మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనాలో మాత్రం అంతంతమాత్రంగానే ఉండటం గమనించదగ్గ విషయం.ప్రపంచవ్యాప్తంగా విమానాలు, ఐటీ వ్యవస్థలు, వ్యాపారాలపై ప్రభావం చూపిన మైక్రోసాఫ్ట్ అంతరాయం చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనాలోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు కూడా సజావుగా జరిగాయి. ఈ విషయాన్ని బీజింగ్కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.ప్రపంచంలోని చాలా దేశాలు మైక్రోసాఫ్ట్ను ఉపయోగిస్తున్నాయి. అయితే చైనా మాత్రం విదేశీ టెక్నాలజీల మీద ఆధారపడటాన్ని తగ్గించి, సొంత దేశ టెక్నాలజీలనే ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగానే చైనాలో మైక్రోసాఫ్ట్ వినియోగం లేదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి చైనాలో రోజూ జరగవలసిన కార్యకలాపాలు నిర్విరామంగా జరిగాయి. -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్గ్రెడేషన్లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్గ్రెడేషన్తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బగ్తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
విండోస్లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్లను బ్యాకప్ చేశాం. విండోస్లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్సైట్ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్స్ట్రయిక్’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్స్ట్రయిక్ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్స్ట్రయిక్ వాల్యుయేషన్లో దాదాపు 16 బిలియన్ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్ విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో యథావిధిగా విమాన సర్వీసులు
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జులై 19) తలెత్తిన సాంకేతిక సమస్య ముగిసిపోయింది. విమానాలు యథావిధిగా వెళుతున్నాయి. అన్నివిమాన సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. ప్రయాణికుల ఆన్లైన్ చెక్ఇన్ సాఫీగా సాగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ విండోస్, క్లౌడ్లో సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఆన్లైన్ చెక్ఇన్ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
Microsoft: బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్!
వాషింగ్టన్/వెల్లింగ్టన్/న్యూఢిల్లీ/ఫ్రాంక్ఫర్ట్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సరీ్వసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయతి్నస్తున్నాం’’అని క్రౌడ్స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. ఆగిన సేవలు.. మొదలైన కష్టాలు విమానయాన సంస్థలు తమ కంప్యూటర్లు/పీసీ స్క్రీన్లను యాక్సెస్ చేయలేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్/చెక్ ఇన్ సేవలను పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్ల వద్ద చాంతాడంత లైన్లలో బారులుతీరారు. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆ్రస్టేలియాలోని విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం గంటల తరబడి విమానాలు ఆలస్యం/క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే నిద్రించారు. అమెరికాలో యునైటెడ్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా, అలీజియంట్ విమానయాన సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వారాంతం ఆనందంగా గడుపుదామనుకున్న శుక్రవారం పలు దేశాల ప్రజలను చేదు అనుభవంగా మిగిలిపోయింది. భారత్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల విమానయాన సంస్థలు మ్యాన్యువల్గా బోర్డింగ్ పాస్లు ఇచ్చి సమస్యను ఒకింత పరిష్కరించుకున్నాయి. రైల్వే, టెలివిజన్ సేవలకూ అంతరాయం బ్రిటన్లో రైల్వే, టెలివిజన్ స్టేషన్లూ కంప్యూటర్ సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశంలోని పోస్టాఫీసులు, ఆస్పత్రుల సేవలు ఆగిపోయాయని ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ తెలిపాయి. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్లోని రెగ్యులేటరీ న్యూస్ సర్వీస్ అనౌన్స్మెంట్స్, నేషనల్ హెల్త్ సర్వీస్లు ఆఫ్లైన్లోకి వెళ్లిపోయాయని బ్రిటన్ ప్రకటించింది. ఆ్రస్టేలియాలో ఏబీసీ, స్కైన్యూస్ వంటి టీవీ, రేడియా చానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. బ్యాంకింగ్ సేవలకూ దెబ్బ తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్ సేవలు స్తంభించిపోయాయని దక్షిణాఫ్రికా తెలిపింది. బ్యాంక్ల వద్దే కాదు, గ్యాస్స్టేషన్లు, సరకుల దుకాణాల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయడం మానేశాయి. ఏఎస్బీ, కివిబ్యాంక్ సేవలు ఆగిపోయాయని న్యూజిలాండ్ తెలిపింది. పేమెంట్ వ్యవస్థలు, వెబ్సైట్లు, యాప్స్ పనిచేయడం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తెలిపాయి. భారత్లో పరిస్థితి ఏంటి? భారత్లో ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్టారా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు ఆన్లైన్ చెక్ ఇన్ సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్పోర్ట్ల వద్ద పలు విమానాల సరీ్వస్లు రద్దయ్యాయి. దాదాపు 200 ఇండిగో విమానసరీ్వస్లు రద్దయ్యాయి. ఆఫ్లైన్లో మ్యాన్యువల్గా లగేజ్ ‘చెక్ ఇన్’, బోర్డింగ్ పాస్లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు. లగేజీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి 40 నిమిషాలు పట్టిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 29 విమానాలు రద్దయ్యాయి.ఇందులో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొల్కత్తాతో పాటు వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలూ ఉన్నాయి. కొన్ని విమానాలు 1–2 గంటలు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దయినప్పటికి విమాయనయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రకటనలు చేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి స్టాక్ఎక్సే్ఛంజ్లు, బ్రోకరేజ్ సంస్థలు, బ్యాంక్ల వంటి ఆర్థికరంగ సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. దేశంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నెట్వర్క్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. పేలిన జోకులు కంప్యూటర్లు మొరాయించడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. శుక్రవారం ఉదయం నుంచే ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘‘ ఇది మైక్రో‘సాఫ్ట్’ కాదు. మాక్రో‘హార్డ్. మైక్రోసాఫ్ట్ వాళ్ల అన్ని సర్వీస్లు ఆగిపోయాయి ఒక్క నా ‘ఎక్స్’ తప్ప’ అని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పోస్ట్చేశారు.ఏమిటీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్?:కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచి్చంది. ఈ ఎర్రర్ కనిపించాక కంప్యూటర్ రీస్టార్ట్ అవడంగానీ షట్డౌన్ అవడంగానీ జరుగుతోంది. విండోస్ అప్డేట్ అడిగితే చేయొద్దని, పొరపాటున చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ను తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాకే కంప్యూటర్లను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ ఉల్లంఘనలు, హ్యాకింగ్ను రియల్టైమ్లో అడ్డుకునేందుకు క్రౌడ్స్ట్రయిక్ సంస్థ తమ సైబర్సెక్యూరిటీ సేవలను మైక్రోసాఫ్ట్కు ఇస్తోంది. సొంతంగా మ్యాన్యువల్గా సమస్య పరిష్కారానికి ప్రయతి్నంచేవాళ్లకు క్రౌడ్స్ట్రయిక్ ఒక చిట్కా చెప్పింది. విండోస్10లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలో వివరింది. సిస్టమ్ను సేఫ్ మోడ్లో లేదా విండోస్ రికవరీ ఎన్విరోన్మెంట్లో ఓపెన్ చేయాలి. తర్వాత C:/W indowsystem32/d rivers/C rowdStrike లోకి వెళ్లాలి. అందులోC-00000291·. sys అనే ఫైల్ను డిలీట్ చేయాలి. తర్వాత సాధారణంగా సిస్టమ్ను బూట్ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్పై ఆర్బీఐ కీలక ప్రకటన
మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపెట్టింది. భారత్లోని విమానయాన, బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. భారత్లోని 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై అది స్వల్ప ప్రభావం చూపినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే, ఇది స్వల్ప అంతరాయమేనని, వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు స్పష్టం చేసింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ వినియోగిస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. -
'బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్' అంటే ఏమిటి? పరిష్కార మార్గమిదే!
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ యూజర్స్ ఈరోజు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్యను ఎదుర్కొన్నారు. ఇంతకీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటిబ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ను.. బ్లూ స్క్రీన్ ఎర్రర్లు, బ్లాక్ స్క్రీన్ ఎర్రర్లు లేదా స్టాప్ కోడ్ ఎర్రర్లు అని కూడా పిలుస్తారు. సిస్టం అనుకోకుండా షట్ డౌన్ అయినప్పుడు లేదా రీస్టార్ట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. అంటే కంప్యూటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటడానికి విండోస్ షట్ డౌన్ అవుతాయి. ఈ సమస్య హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ కారణాల వల్ల కూడా జరిగే అవకాశం ఉంది.విండోస్ బ్లూ స్క్రీన్ సమస్యను ఎలా పరిష్కరించాలివిండోస్ బ్లూ స్క్రీన్ సమస్యను పరిష్కరించుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఖచ్చితమైన మార్గ దర్శకాలను వెల్లడించలేదు. కానీ విండోస్లో గెట్ హెల్ప్ యాప్ ఓపెన్ చేయాలి. అక్కడ ట్రబుల్షూట్ బీఎస్ఓడీ ఎర్రర్ అని టైప్ చేయాలి. ఆ తరువాత మీకు కనిపించే సూచలనను అనుసరించాల్సి ఉంటుంది. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన టెక్ దిగ్గజం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దిగ్గజ కంపెనీలకు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సమస్య స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క సారిగా కంపెనీ 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది.టెక్ దిగ్గజం షేర్ విలువ ఒకేసారి 0.71 శాతం తగ్గింది. దీంతో కంపెనీ దాదాపు 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర నిన్నటి ముగింపు సమయంలో 443.52 డాలర్ల వద్ద ఉండేది. అయితే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఇది 440.37 డాలర్లకు పడిపోయినట్లు ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్ఫారమ్ స్టాక్లిటిక్స్ వెల్లడించింది.స్టాక్లిటిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రముఖ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలపైన గణనీయమైన ప్రభావం చూపాయి. భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది. -
మైక్రోసాఫ్ట్ సమస్య పరిష్కారం.. క్రౌడ్స్ట్రైక్ సీఈఓ ట్వీట్
మైక్రోసాఫ్ట్లో ఏర్పడిన సమస్య పలు రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ సమస్యను పరిష్కరించినట్లు క్రౌడ్స్ట్రైక్ సీఈఓ ట్వీట్ చేశారు.సమస్యను గుర్తించామని, పరిష్కారం కూడా అమలు చేశామని క్రౌడ్స్ట్రైక్ సీఈఓ 'జార్జ్ కర్ట్జ్' వెల్లడించారు. ఈ ప్రభావం మ్యాక్, లినక్స్ హోస్ట్ల మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇది సైబర్టాక్ అటాక్ కాదు. వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ కస్టమర్లను చేరువలో ఉంటామని ఆయన అన్నారు.మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.CrowdStrike is actively working with customers impacted by a defect found in a single content update for Windows hosts. Mac and Linux hosts are not impacted. This is not a security incident or cyberattack. The issue has been identified, isolated and a fix has been deployed. We…— George Kurtz (@George_Kurtz) July 19, 2024 -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఈ రంగాలపైనే ప్రభావం!
మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగించాయి. టికెట్ బుకింగ్స్ నుంచి చెక్ ఇన్ వరకు అన్నింటికీ అవాంతరాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.భారతదేశంలో మాత్రమే కాకుండా.. అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. క్రౌడ్స్ట్రైక్ సమస్యను తామే పరిష్కరిస్తామంటూ వెల్లడించింది. ఈ తరుణంలో అమెరికా ఎమర్జెన్సీ కాలర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.బ్రిటన్లో విమాన సర్వీసులు మాత్రమే కాకుండా.. రైల్వే, హాస్పిటల్ సర్వీసుల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. అక్కడి స్కైన్యూస్ ప్రసారాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేసింది. -
మైక్రోసాఫ్ట్ డౌన్ : మస్క్ సైటైర్, సోషల్మీడియా మీమ్స్, ఫన్సీ ట్వీట్స్ వైరల్
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. అర్థాంతరంగా విండోస్ స్క్రీన్లపై "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ వినియోగదారులంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే అనేక వ్యాపార సంస్థలు బ్యాంకింగ్, విమానయాన రంగ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ సందడి చేశాయి. పనిలో పనిగా టెస్లా అధినే, ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం.మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంపై స్పందించిన సంస్థ 365 యాప్లు, సేవలను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తినట్టు వివరణ ఇచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. మస్క్ రియాక్షన్ మస్క్ ఎక్స్లో స్పందిస్తూ ఒక మీమ్కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ కాదు..మాక్రోహార్డ్ అంటూ సెటైర్ వేస్తూ పాత ట్వీట్ను రీట్వీట్ చేవారు. అంతేకాదు ఎలన్ మస్క్ జోస్యం నిజ మైందంటున్నార నెటిజన్లు.IT departments: #Microsoft #Windows #bluescreen pic.twitter.com/cwO7x4QqF4— NEELKAMAL MEENA NEWAI (@NEELKAMALBhonda) July 19, 2024 Happy Weekend, thank you #Microsoft #Bluescreen pic.twitter.com/P8NywbSv6S— Parmatma Yadav (@yparmatma561) July 19, 2024 కార్పొరేట్ ఉద్యోగులకు వీకెండ్ ముందే వచ్చిందని కొందరు, సంబరాల్లో ఉద్యోగులు అంటూ మరికొందరి మీమ్స్ , ఫన్నీ జోక్లతో ఇంటర్నెట్ సందడిగా మారింది.… https://t.co/X9a2ghyo4P— Elon Musk (@elonmusk) July 19, 2024 -
ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు
సాక్షి, ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య భారత్ సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ఇబ్బందులకు దృష్టిపెట్టుకుని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఇక, మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్య నేపథ్యంలో రామ్మెహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని అందించండి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించినట్టు తెలిపారు.విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో అధికారులు టచ్లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. విశాఖ, శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణీకులకు టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/విశాఖ: మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సమస్య కాస్తా ఎయిర్లైన్స్ సర్వర్లపై ప్రభావం చూపించడంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి.కాగా, విశాఖలో ఎయిర్ లైన్స్లో సాంకేతిక సమస్య కారణంగా విమానాల ఆపరేషన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, ఎయిర్పోర్టు సిబ్బంది మాన్యువల్గా బోర్డింగ్ను క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎయిర్పోర్టులో ప్రయాణికులు రద్దీ పెరిగింది. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణం ఆలస్యమవుతోంది.ఇదిలా ఉండగా.. ఇటు శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వర్లో టెక్నికల్ సమస్య కారణంగా దాదాపు 35 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో అధికారులు మాన్యువల్గా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక, వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గన్నవరంలో ఇదీ పరిస్థితి..మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో గన్నవరం విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గన్నవరం నుండి ప్రతీరోజూ 23 విమాన సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంతో 13 సర్వీసులు మాత్రమే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయి. మరో ఏడు సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులో ఇదే పరిస్థితి ఉంది. గన్నవరంలో టికెట్ కౌంటర్లో ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వడం నిలిపివేయడం జరిగింది. మాన్యువల్గా బోర్డింగ్ పాస్ ఇచ్చి ప్రయాణికులను పంపిస్తున్నామని తెలిపారు. -
మైక్రోసాఫ్ట్లో సమస్య: టచ్లో ఉన్నామంటూ మంత్రి ట్వీట్
మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగిస్తోంది. వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. ఇలా మెసేజ్ వచ్చిన తరువాత రీస్టార్ట్ అవుతున్నాయని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపైన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో ప్రభుత్వం టచ్లో ఉందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యను గుర్తించారని, దాన్ని పరిష్కరిస్తున్నారని.. ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) వంటి వాటిని ప్రభావితం చేయదని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలను అందించే పాన్-ఇండియా కమ్యూనికేషన్ నెట్వర్క్.మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ఒక సాంకేతిక సలహాను జారీ చేసింది. ఇందులో క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్లకు సంబంధించిన విండోస్ హోస్ట్లు.. ఇటీవలి అప్డేట్ల కారణంగా అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని, క్రాష్ అవుతున్నాయని పేర్కొన్నారు.MEITY is in touch with Microsoft and its associates regarding the global outage. The reason for this outage has been identified and updates have been released to resolve the issue. CERT is issuing a technical advisory.NIC network is not affected.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 19, 2024 -
మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్
-
మైక్రోసాఫ్ట్ సర్వీసులో సమస్య.. ట్రేడింగ్ బ్రోకరేజ్లో అంతరాయం
మైక్రోసాఫ్ట్ సర్వీస్లో ఏర్పడిన సమస్య వల్ల ఆన్లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ‘ఎక్స్’లో పోస్ట్లు దర్శనమిచ్చాయి. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థలు ఈమేరకు ప్రభావితం చెందినట్లు ఎక్స్లోని పోస్ట్ల ద్వారా తెలిసింది.మైక్రోసాప్ట్ క్లౌడ్ సర్వీస్లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, విమానాశ్రయ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు ఆన్లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ సేవల్లోనూ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థల ప్లాట్ఫామ్ల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఎక్స్ వేదికగా నివేదించాయి. మైక్రోసాఫ్ట్లోని సమస్య కారణంగా తమ సిస్టమ్లు ప్రభావితమయ్యాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. వీలైనంత త్వరగా ఆ సిస్టమ్లను పునరుద్ధరించడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పాయి.‘బ్రేకరేజ్ సొల్యూషన్ ప్రొవైడర్గా ఉన్న మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్య ఉత్పన్నమవడంతో వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఏంజెల్ వన్ తెలిపింది.పెండింగ్లో ఉన్న ఆర్డర్లు కనిపించకపోవడంతో తమ పొజిషన్లను విక్రయించలేకపోయామని వినియోగదారులు ఎక్స్లో తెలిపారు. ఆ పొజిషన్ల వల్ల తమకు కలిగిన నష్టాలకు బ్రోకర్లు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.You may be facing an intermittent issue due to a global outage faced by one of the solution providers. We are trying to get this resolved at the earliest.— Angel One (@AngelOne) July 19, 2024 -
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..
మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇలా మెసేజ్ వచ్చిన వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ అవుతోంది. దీంతో సమాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన మెసేజ్లు వైరల్ అవుతున్నాయి.భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ టికెట్ బుకింగ్లపై తీవ్రప్రభావం పడుతున్నట్లు సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ముంబయి, దిల్లీ ఎయిర్పోర్ట్ల్లో ఇండిగో, ఆకాశ, స్పైస్జెట్, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థలు ప్రకటించాయి. దిల్లీ ఎయిర్పోర్ట్లోనూ సర్వర్లు డౌన్ అయినట్లు తెలిసింది. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో సిస్టమ్స్ పనిచేయకపోవడంతో మ్యానువల్ చెకింగ్ చేస్తున్నారు.హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ సాంకేతిక సమస్య కొనసాగుతున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ‘మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు, విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేస్తోంది. దయచేసి ప్రయాణికులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో అందరం సహనం పాటించాలి’ అని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.డెన్వర్లోని ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్, ఫ్రాంటియర్ గ్రూప్ హోల్డింగ్స్ ఇంక్ యూనిట్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా విమానాలను నిలిపివేశారు. విమానయాన సంస్థ బుకింగ్, చెక్-ఇన్ సిస్టమ్లతో పాటు బోర్డింగ్ పాస్ యాక్సెస్పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలిపింది.ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లుఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ ‘మాకు ఈ సమస్య గురించి తెలుసు. దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇంటర్నల్గా సమస్యకు గల కారణాన్ని గుర్తించాం’ అని వివరణ ఇచ్చింది.VIDEO | Passengers stranded at Goa airport following a technical glitch with the check-in system. Further details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/XAYjtLRlpJ— Press Trust of India (@PTI_News) July 19, 2024pic.twitter.com/SI8mcURA1H— IndiGo (@IndiGo6E) July 19, 2024@IndiGo6E Stuck at Dubai airport for over an hour now. Check-in servers down, no movement in sight. Frustrating start to travel. @DubaiAirports any updates? #DubaiAirport #TravelTroubles pic.twitter.com/fsU6XesWsD— Sameen (@MarketWizarddd) July 19, 2024 -
ఆఫీసులో ఐఫోన్ మాత్రమే వాడండి!.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' మొబైల్ వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తప్పకుండా ఐఫోన్స్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాలోని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్లను అందించడం ప్రారంభించినట్లు సమాచారం. చైనాలోని ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని సంస్థ స్పష్టం చేసింది.చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేదు. ఆ దేశం మొబైల్ బ్రాండ్స్ అన్నీ సొంత ప్లాట్ఫామ్ కలిగి ఉన్నాయి. కాబట్టి అలాంటి మొబైల్స్ ఉపయోగించడం వల్ల కంపెనీ డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఐఫోన్లలో సెక్యూరీటీ సిస్టం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి డేటా బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.చైనాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ పాస్వర్డ్ మేనేజర్, ఐడెంటిటీ పాస్ యాప్ను ఉపయోగించాలని కంపెనీ పేర్కొంది. ఇవి యాపిల్, గూగుల్ ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ వదిలిపెట్టి.. ఐఫోన్ ఉపయోగించాలని కోరింది.ఐఫోన్ లేని, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ఉద్యోగులకు కంపెనీ కొత్త డివైజ్లను అందజేస్తుంది. ఉద్యోగులకు కొత్త ఐఫోన్ 15 ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడొద్దని, కేవలం ఐఫోన్స్ మాత్రమే వాడండి అని చెప్పడంతో కొందరిలో అనుమానాలు పుడుతున్నాయి. -
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన భయం
ఇప్పుడిప్పుడే టెక్ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. అంతా సజావుగా సాగుతున్న వేళ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్ళీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక.. కంపెనీలోని ఉద్యోగులలో ఒక్కసారిగా భయం మొదలైంది.వైర్డ్ గీక్ నివేదిక ప్రకారం.. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో కోతలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగించనున్నారు, ఎప్పుడు తొలగించనున్నారు అనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. వ్యాపారాన్ని నిర్వహించడంలో శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి. సంస్థ భవిష్యత్తు కోసం ఈ తొలగింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.మైక్రోసాఫ్ట్ 2023లో కూడా లేఆప్స్ కింద ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. గత నెలలో కంపెనీ అజూర్లోని పాత్రలతో సహా దాదాపు 1000 స్థానాలపై ప్రభావం చూపిన రౌండ్ తొలగింపులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా కంపెనీ వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు సంస్థ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో భయాన్ని కలిగిస్తోంది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏంచెప్పారు?
చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కామత్ పాడ్కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు లేదుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్తోపాటు యూఎస్లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. -
ఇదో డిఫరెంట్ ఇంటెలిజెన్స్.. 'ఏఐ'పై సత్యనాదెళ్ళ
టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టింస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ఆ పదమే నచ్చదని అన్నారు. దీనికి ఓ కొత్త పేరు కూడా ప్రతిపాదించారు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే, దాన్ని మనుషులతో పోల్చడం సరికాదని అన్నారు.1950లలో పుట్టుకొచ్చిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే పదం పట్ల సత్య నాదెళ్ల అయిష్టతను వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన పేర్లలో ఒకటి 'కృత్రిమ మేధస్సు' అని నేను అనుకుంటున్నాను, మనం దానిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని పిలువవచ్చు. ఎందుకంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది, కాబట్టి ఏఐ అవసరం లేదని సత్య నాదెళ్ల అన్నారు.టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ మేధస్సుకు సరికాదు. ఎందుకంటే మనిషికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలామంది మనిషి సృష్టించినదాన్ని మనిషి కంటే గొప్పదని అనుకుంటున్నారు. ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే. ఇలాంటి టెక్నాలజీలు భవిష్యత్తులో లెక్కకు మించి రావొచ్చు. ఆ ఘనత మొత్తం మనిషికే చెందుతుంది. ఎందుకంటే వాటిని రూపొంచేది మనిషే కాబట్టి.ఏఐ ఇలా పనికొస్తుందిఏఐ మానవ పరిభాషలో కావలసిన విషయాలను వెల్లడిస్తుందని అంగీకరించారు. సాఫ్ట్వేర్ పనితీరును వివరించడానికి "లెర్నింగ్" వంటి సాపేక్ష పదాలను ఉపయోగించి సాఫ్ట్వేర్ వెనుక ఉన్న అల్గారిథమ్లను అర్థం చేసుకోవడానికి ప్రజలు మార్గాలను అన్వేషిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏఐ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. -
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్మనీ
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రోసాఫ్ట్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ)పై దేశవ్యాప్త ఆన్లైన్ హ్యాకథాన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది.బ్యాంక్ నిర్వచించిన నిర్దిష్ట అంశాల్లో జెన్ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాల్గొనేవారిని ప్రేరేపించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని, హ్యాకథాన్ నుంచి వెలువడే ఉత్తమ ఐడియాలను అమలు చేస్తామని బ్యాంక్ పేర్కొంది.డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, స్టార్టప్స్, ఫిన్టెక్లు వ్యక్తిగతంగా లేదా బృందంగా ఈ హ్యాకథాన్లో పాల్గొనవచ్చు. కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఆడిట్ & కాంప్లయన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేషన్ అనే ఆరు విభాగాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన పరిష్కారాలను కోరుతోంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్నోవేషన్లో ముందంజలో ఉంటుందని, కస్టమర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి జెన్ఏఐ కొత్త మార్గాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఉమ్మడి విజన్ ను పంచుకోవడానికి సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా&దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.కంటెస్టెంట్లు https://bobhackathon.com ద్వారా హ్యాకథాన్లో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా లేదా టీమ్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కో టీమ్లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు ఉండొచ్చు. జూన్ 10 నుంచి 30వ తేదీలోపు ఐడియాలను సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన జట్లు ప్రోటోటైప్ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. -
సత్య నాదెళ్ల సక్సెస్ అయింది ఇలాగేనా..?
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా యాపిల్ను అధిగమించేలా మైక్రోసాఫ్ట్ను సత్య నాదెళ్ల విజయవంతంగా నడిపించారని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.తనను విజయపథంలో నడపడానికి దోహదపడిన అంశాల గురించి సత్య నాదెళ్ల పలు సందార్భాల్లో వెల్లడించారు. వాటిలో 10 మేనేజ్మెంట్, కెరీర్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం..ఏదీ లేనప్పుడు స్పష్టతను సృష్టించగలగడం ఏ నాయకుడికైనా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.విషయాలు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి మన చుట్టూ శక్తిని సృష్టించుకునే నైపుణ్యాలను పెంచుకోవాలి.నాయకుడనే వాడు మితిమీరిన నియంత్రిత ప్రదేశంలోనూ విజయాన్ని సృష్టించగలగాలి.ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి.విధుల్లో మానసిక భద్రతను పెంపొందించడంలో తాను పెద్దవాడినని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ప్రశ్నలు అడిగినందుకు, ఆందోళనలను పంచుకున్నందుకు లేదా తప్పులు చేసినందుకు ఉద్యోగులు శిక్షకు భయపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది.సత్య నాదెళ్ల సహానుభూతిని మృదువైన నైపుణ్యంగా పరిగణించరు. వాస్తవానికి ఇది మనం నేర్చుకునే కఠినమైన నైపుణ్యమని ఆయన నమ్ముతారు.ఎవరూ "పరిపూర్ణ" నాయకుడు కారు. కానీ వారు తమ ఉద్యోగులకు మరింత స్పష్టత, శక్తి లేదా స్వేచ్ఛను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించే వారు ఎల్లప్పుడూ మెరుగుపడతారు.మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీ ప్రస్తుత బాధ్యతల నుంచి నేర్చుకుంటూ ఉండండి. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్లో చేరినప్పుడు సీఈవో అవుతానని సత్య నాదెళ్ల ఎప్పుడూ అనుకోలేదు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా రాణించడంపైనే దృష్టి పెట్టారు.అడాప్టబుల్గా ఉండండి. మైక్రోసాఫ్ట్ లో పనిచేసినంత కాలం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తాను పనిచేసిన బృందాలు, తాను నిర్వహించిన విభాగాలను బట్టి నిరంతరం మారాల్సి వచ్చిందని సత్య నాదెళ్ల చెప్పారు.మీ లక్ష్యం.. మిమ్మల్ని నడిపించేది ఏమిటో తెలుసుకోండి. మనం ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నందున, పనికి లోతైన అర్థం గురించి ఆలోచించడం అవసరం. -
మైక్రోసాఫ్ట్లో మళ్లీ ఉద్యోగాల కోత.. భారీగా తొలగింపులు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగ కోతలను ప్రకటించింది. గత ఏడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లేఆఫ్లు ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది.ఈ తొలగింపుల్లో మైక్రోసాఫ్ట్ మిక్స్డ్ రియాలిటీ విభాగం, అజ్యూర్ క్లౌడ్ యూనిట్తో సహా వివిధ విభాగాలలో సుమారు 1,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. అత్యంత ప్రభావితవుతున్న విభాగాల్లో హోలోలెన్స్ 2 ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ను అభివృద్ధి చేసిన మిక్స్డ్ రియాలిటీ విభాగం ఉంది. ఓ వైపు ఉద్యోగ కోతలు ఉన్నప్పటికీ, హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది.'మైక్రోసాఫ్ట్ మిక్స్ డ్ రియాలిటీ సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించాం. రక్షణ శాఖకు సంబంధించిన ఐవీఏఎస్ కార్యక్రమానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మన సైనికులకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాం. అదనంగా, విస్తృత మిక్స్ డ్ రియాలిటీ హార్డ్ వేర్ ఎకోసిస్టమ్ ను చేరుకోవడానికి మేము W365 లో పెట్టుబడిని కొనసాగిస్తాం. ఇప్పటికే ఉన్న హోలోలెన్స్ 2 కస్టమర్లు, భాగస్వాములకు మద్దతు ఇస్తూనే హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగిస్తాం' అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి క్రెయిగ్ సిన్కోటా 'ది వెర్జ్'కు ఈమెయిల్ ప్రకటనలో తెలిపారు.మిక్స్ డ్ రియాలిటీ విభాగంతో పాటు అజూర్ క్లౌడ్ యూనిట్ ను కూడా గణనీయమైన తొలగింపులు తాకుతున్నాయి. అజూర్ ఫర్ ఆపరేటర్స్, మిషన్ ఇంజనీరింగ్ టీమ్లలో వందలాది ఉద్యోగాలను తొలగించినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారించడానికి 2021లో స్థాపించిన స్ట్రాటజిక్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్ ఆర్గనైజేషన్లో ఈ టీమ్లు భాగంగా ఉన్నాయి. -
వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ నేర్చుకున్న పాఠం ఏంటంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్నెస్కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. -
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సరికొత్త కంప్యూటర్లను ఆవిష్కరించింది. ఈ శక్తివంతమైన ఏఐ టూల్ గురించి సత్య నాదెళ్ల వివరిస్తున్న వీడియో బిలియనీర్ ఇలాన్ మస్క్ దృష్టిని ఆకర్శించింది.వీడియోలో సత్య నాదెళ్ల.. రీకాల్ ఫీచర్ అనే కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు చూసే, మీ కంప్యూటర్లో ప్రదర్శించే ప్రతి వివరాలను రికార్డ్ చేస్తుంది. డివైస్ నుంచి మీ మొత్తం హిస్టరీని సర్చ్ చేయడానికి, మళ్ళీ తిరిగి పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీగా పనిచేస్తుంది. మీ కంప్యూటర్లో మీరు చేసే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్క్రీన్షాట్లను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇది కేవలం కీవర్డ్ సర్చ్ కాదు, డాక్యుమెంట్ కాదు. గతంలోని క్షణాలను రీక్రియేట్ చేస్తుందని అన్నారు.ఈ వీడియో ఎక్స్ (ట్విటర్)లో భారీగా వైరల్ అయ్యింది. 24.3 మిలియన్లకంటే ఎక్కువ వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు.ఈ వీడియోపైన మస్క్ స్పందిస్తూ.. నెట్ఫ్లిక్స్ సిరీస్ 'బ్లాక్ మిర్రర్'ని ప్రస్తావిస్తూ, ఇది వ్యక్తుల జీవితాలపై దృష్టి పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఫీచర్ను ఆఫ్ చేస్తున్నాను అని కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మస్క్ మాత్రమే కాకుండా కొందరు నెటిజన్లు కూడా కొత్త ఫీచర్ను విమర్శించారు.బ్లాక్ మిర్రర్ సిరీస్బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. సమకాలీన సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి సాంకేతికత మరియు మీడియా థీమ్లను ఉపయోగిస్తుంది. ఇది ఒక రకమైన ఊహాజనిత కల్పన. ఇది 2011 నుంచి 2013 వరకు ఆరు సిరీస్లలో 27 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. నెట్ఫ్లిక్స్లో 2016, 17, 19, 23లలో నాలుగు సిరీస్లుగా ప్రసారం చేశారు. 2025లో ఏడో సిరీస్ విడుదలవుతుంది.This is a Black Mirror episode. Definitely turning this “feature” off. https://t.co/bx1KLqLf67— Elon Musk (@elonmusk) May 20, 2024 -
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, లింక్డ్ఇన్ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు. అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు. 66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్, చాట్జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్ అందిస్తున్నాయి. -
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్కు గుడ్బై చెప్పింది. ఇకపై అజ్యూర్ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. -
రూ.80 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి, పూల సాగు..కట్ చేస్తే..!
సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్లో దిగ్గజ టెక్ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్ టూర్లు, వీకెండ్ పార్టీలు.. అయినా మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు. ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.ఉత్తర ప్రదేశ్లో అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యూకేలో అధిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశ ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే కోరిక మరోవైపు అభినవ్ సింగ్ను స్థిమితంగా కూర్చోనీయలేదు. రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఉత్తరప్రదేశ్లో పెళ్లిళ్ల సీజన్లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్ ఉందనీ, కానీ సప్లయ్ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు. ఫిబ్రవరి 2021లో తొలి పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.ప్రారంభించిన కేవలం ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో 100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ, స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు. “ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం, సొంత వూరిలో ఇష్టమైంది, ప్రత్యేకమైనది చేయడం. కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్. -
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో భారీ విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసింది. 48 ఎకరాల భూమిని రూ. 267 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రాప్స్టాక్కు లభించిన పత్రాల ద్వారా తెలిసింది.ఏప్రిల్ 18న సేల్ డీడ్ రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లను బట్టీ తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఉన్న భూమిని ఎకరం సుమారు రూ. 5.56 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అధికారిక సమాచారం రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, 2022లో, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ను స్థాపించడానికి హైదరాబాద్లో సుమారు రూ. 275 కోట్లకు మూడు ల్యాండ్ పార్సెల్లను కొనుగోలు చేసింది. -
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
రూ.14వేలకోట్లతో డేటా సెంటర్లు ప్రారంభం.. ఎక్కడంటే..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇండోనేషియా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి 1.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటాంచారు. ఈ ఇన్వెస్ట్మెంట్తో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్ఫ్లడ్తో సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలుగ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీ చేసిన పరిశోధనలో 2030 నాటికి ఆగ్నేయాసియా జీడీపీలో ఏఐ ద్వారా 1 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ దృష్టి సారిస్తోందని టిమ్ చెప్పారు. -
టైమ్స్ జాబితాలో 'సత్య నాదెళ్ల'కు చోటు
ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు మెరుగైన సేవలిందించేందుకు కృషిచేస్తోంది. సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరితో పదేళ్లు ముగిసింది. ఈ కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఈ సమయంలో ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీపై ఆధారపడటాన్ని తగ్గించారు. ఇదీ చదవండి: గూగుల్లో రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: ముగ్గురు కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
మైక్రోసాఫ్ట్తో టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: బిజినెస్, డేటా నిపుణులకు సులభతరంగా ఉండే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆధారిత వర్క్బెంచ్ను రూపొందించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపినట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వినియోగాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్క్బెంచ్ సిస్టమ్ ఉపయోగపడగలదని, సంక్లిష్టమైన డేటా వర్క్ఫ్లోను సరళతరమైన ఇంటర్ఫేస్తో సులభంగా రూపొందించవచ్చని టెక్ మహీంద్రా వివరించింది. వ్యాపారాల వృద్ధిలో తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొంది. -
'స్టార్గేట్' ఏఐ సూపర్ కంప్యూటర్: టెక్నాలజీలో మరో అడుగు..
ఓపెన్ఏఐ.. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో కలిసి సరికొత్త 'ఏఐ సూపర్ కంప్యూటర్'ను రూపొందించడానికి సన్నద్ధమైంది. 'డేటా సెంటర్ ప్రాజెక్ట్' పేరుతో దీని కోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. 'స్టార్గేట్' పేరుతో రానున్న ఈ ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు 2028 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ట్రెడిషినల్ డేటా సెంటర్ల కంటే కూడా అడ్వాన్డ్ కార్యకలాపాలను నిర్వహించడానికి టెక్ దిగ్గజం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఉన్న కొన్ని అతిపెద్ద డేటా సెంటర్ల కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్కి మైక్రోసాఫ్ట్ నిధులు సమకూరుస్తుంది. ఓపెన్ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ రెండు కంపెనీలు సూపర్ కంప్యూటర్లను ఐదు దశల్లో విస్తరించాయి. ఇందులో స్టార్గేట్ ఐదవ దశలో రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ 2026 నాటికి నాల్గవ దశ సూపర్ కంప్యూటర్ తీసుకురానున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ గత ఏడాది నవంబర్లో కస్టమ్ డిజైన్ కంప్యూటింగ్ చిప్లను కూడా ప్రకటించింది. ఆ తరువాత చిప్లతో పని చేసేలా కొత్త ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఏఐ సామర్థ్యానికి సంబంధించిన సరిహద్దును కొనసాగించడానికి అవసరమైన తదుపరి తరం మౌలిక సదుపాయాల ఆవిష్కరణకు కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ రానుంది. మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళిక కోసం అయ్యే ఖర్చు సుమారు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఇది సర్వర్లు, భవనాలు, ఇతర పరికరాల కోసం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చేసిన ఖర్చు కంటే కూడా మూడు రేట్ల ఎక్కువని తెలుస్తోంది. స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి -
భవిష్యత్తు అంతా ఏఐ మయం.. పీఎంతో బిల్గేట్స్ ఆసక్తికర చర్చ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాతావరణ మార్పులు, మహిళా సాధికారత..వంటి క్లిష్టమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతలో మార్పులు, సుస్థిరత, సామాజిక సాధికారత వంటి అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో భాగంగా ఏఐ ఆవిష్కరణలో దేశం అందిస్తున్న సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రపంచంలో ఘణనీయమైన మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరువురు మాట్లాడుకున్నారు. ఇండియాఏఐ మిషన్ను ప్రోత్సహించేందుకు బడ్జెట్ను కేటాయించడంపట్ల మోదీ దూరదృష్టిని గేట్స్ ప్రశంసించారు. ఈ మిషన్లో భాగంగా కొత్త ఆవిష్కరణలతోపాటు, సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పీఎం మోదీ చెప్పారు. డ్రోన్ పైలటింగ్ నైపుణ్యాలతో మహిళలను సన్నద్ధం చేయడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు, గ్రామీణాభివృద్ధిని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అందులో భాగంగానే ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అందులో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. 2021లో జరిగిన కాప్26 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించిన ‘పంచామృతం’ ప్రతిజ్ఞకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వాతావరణ పరిరక్షణకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పారు. అందుకు ప్రతీకగా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన జాకెట్ను మోదీ ధరించినట్లు చెప్పారు. చర్చలోని ముఖ్యాంశాలు.. జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు విస్తృతమైన చర్చలు చేశామని, అందులోని లక్ష్యాలను చేరే దిశగా చాలా మార్పలు తీసుకురాబోతున్నట్లు మోదీ చెప్పారు. ప్రపంచ ప్రతిష్టాత్మక జీ20 సమావేశాన్ని భారతదేశం నిర్వహించడం అద్భుతంగా ఉందని గేట్స్ చెప్పారు. డిజిటల్ ఆవిష్కరణలతో ఇక్కడి అభివృద్ధిని ఇతర దేశాలకు చేరవేయడంలో కృషిచేస్తామని గేట్స్ అన్నారు. 2023 జీ20 సమ్మిట్ సమయంలో ఏఐ ఎలా ఉపయోగపడిందో చర్చించారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో ఏఐ సాయంతో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఎలా అనువదించబడిందో మోదీ గుర్తు చేసుకున్నారు. నమో యాప్లో ఏఐని ఉపయోగిస్తున్నట్లు పీఎం గేట్స్తో చెప్పారు. చారిత్రాత్మకంగా మొదటి, రెండో పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ వలసరాజ్యంగా ఉందని పీఎం అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా డిజిటలీకరణ ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పారు. అందులో ప్రపంచంలోనే భారత్ ప్రధానపాత్ర పోషిస్తోందన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమ్మను ‘ఆయ్’ అంటారు. బిడ్డ పుట్టగానే శిశువు ముందుగా నేర్చుకునే పదం 'ఆయ్' అని మోదీ అన్నారు. ఆయ్ అనే పదానికి AIకు దగ్గరిపోలిక ఉందని, భవిష్యత్తులో ఆయ్తోపాటు ఏఐ చాలాముఖ్యమని మోదీ సరదాగా చెప్పుకొచ్చారు. దేశంలో 2 లక్షల ఆరోగ్య మందిర్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు పీఎం చెప్పారు. వాటిని ఆధునిక సాంకేతికత సహాయంతో స్థానికంగా ఉన్న ఉత్తమ ఆసుపత్రులతో అనుసంధానించాలని గేట్స్ను మోదీ కోరారు. నమో డ్రోన్ దీదీ పథకం గురించి మాట్లాడారు. ప్రపంచంలో అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండాలని కోరుకున్నట్లు పీఎం చెప్పారు. అందులో భాగంగానే భారత్లో చదువురాని మహిళలకు సైతం సాంకేతికతను పరిచయం చేశామన్నారు. చాలా మంది మహిళలకు సైకిల్ తొక్కడం తెలియదన్నారు. కానీ వారు పైలట్లుగా మారి డ్రోన్లను నడుపుతున్నారని వివరించారు. An insightful interaction with @BillGates. Do watch! https://t.co/wEhi5Ki24t — Narendra Modi (@narendramodi) March 29, 2024 -
మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ చీఫ్గా పవన్ దావులూరి నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తన కొత్త విండోస్, సర్ఫేస్ చీఫ్గా భారత సంతతికి చెందిన పవన్ దావులూరిని నియమించింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. దావులూరి, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. మైక్రోసాఫ్ట్లో 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ డీప్మైండ్ డిపార్ట్మెంట్ మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్ను ఏఐ బ్రాంచ్ హెడ్గా నియమించగా.. తాజాగా పవన్కు కీలక బాధ్యతలను మైక్రోసాఫ్ట్ అప్పగించింది. అయితే, విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. రెండింటి బాధ్యతలను పవన్కే కట్టబెట్టింది. ఇక పవన్ నియామకమంతో అమెరికా దిగ్గం టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్కు సైతం చోటు దక్కింది. ప్రస్తుతం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ స్వయంగా సత్య నాదెళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. కాగ్నిజెంట్కి రవి కుమార్ , ఐబీఎంకు అరవింద్ కృష్ణ, పాలో ఆల్టో నెట్వర్క్స్కు నికేశ్ అరోరా, యూట్యూబ్ నీల్ మోహన్ అడోబ్కి శాంతను నారాయణ్లు సీఈఓలుగా రాణిస్తున్నారు. -
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, బిలియనీర్ భార్య, కానీ బిడ్డలు మాత్రం.. ఎవరీమె?
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, హైదరాబాద్లోనే చదువుకుంది. టెక్ దిగ్గజం భార్య. భర్తకు 450 కోట్ల జీతం. ఆమె స్వయంగా ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్. అయినప్పటికీ, ఉద్యోగంలో రాణించేందుకు అన్ని అర్హతులున్నా పిల్లలు, భర్త కోసం ఇంటికే పరిమితమైంది. వారి బాధ్యతలే ప్రధానంగా భావించింది. ఇంతకీ ఎవరీమె? తెలుసుకుందాం రండి! అమె మరెవ్వరో కాదు ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ప్రియదర్శిని నాదెళ్ల. అనుగా పాపులర్ అయిన ఈమె.. ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కుమార్తె. అనుపమ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లోనే జరిగింది. తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సత్య నాదెళ్ల తండ్రి, అనుపమ తండ్రి కేఆర్ వేణుగోపాల్ ఇద్దరూ బ్యాచ్మేట్స్. వీరిద్దరి స్నేహం వియ్యానికి దారి తీసింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో చేరిన ఏడాదిలోనే (1992)అనుపమ నాదెళ్లను వివాహం చేసుకున్నారు. పెళ్లి నాటికే సత్యనాదెళ్ల అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. అయినా అనుపమ వీసా దరఖాస్తును యుఎస్ తిరస్కరించింది. దీంతో పర్యాటక వీసాతో కొంతకాలం కలసి ఉండాల్చి వచ్చింది. అయితే అనుపమను అమెరికా తీసుకెళ్లేందుకు, ఇమ్మిగ్రేషన్ వ్యవహరాలను సులభంగా పూర్తి చేసుకుందుకుగాను గ్రీన్ కార్డును వదులుకొని, తిరిగి హెచ్-1బీ వీసా తీసుకున్నారు. చివరికి ఇద్దరూ అక్కడ శాశ్వత నివాసితులయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. బిడ్డల కోసం అత్యసవరస్థితిలో సిజేరియన్ ద్వారా తొలి చూరు కాన్పులో మగబిడ్డ జైన్కు జన్మనిచ్చింది. కానీ ఈ దంపతుల సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. గర్భాశయ శ్వాసలోపం కారణంగా శిశువుగా ఎదగలేదు, తీవరమైన సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ క్వాడ్రిప్లెజియాతో జైన్ బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. తరువాత ఇద్దరు కుమార్తెలు తారా,దివ్య పుట్టారు. వీరిలో కూడా ఒకరి లెర్నింగ్ సమస్యలు తలెత్తాయి. దీంతో బిడ్డల కోసం ఆర్కిటెక్ట్గా తన కెరీర్ నుండి తప్పుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అనుపమ నాదెళ్ల సానుకూలంగా తీర్చిదిద్దుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2022లో 26 ఏళ్ల కుమారుడు జైన్ మరణం వారి జీవితాల్లో పెద్ద విషాదం. అప్పటినుంచి ఆమె సీటెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భాగస్వామ్యంతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించారు. అంతేకాదు భర్త సత్యకు దీర్ఘకాల భాగస్వామిగా, నాదెళ్ల కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డారు. సమస్యలతో ఉన్న బిడ్డల్ని సాదుకుంటూ, వారిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వారి అభివృద్ధికి కృషి చేశారు. మైక్రోసాఫ్ట్ బిలియనీర్ సీఈవో భార్యగా ప్రపంచంలోనే అత్యత్తుమ కంపెనీ సీఈవో భార్యగా భర్తకు వెన్నంటి ఉంటూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ జనవరి 11న 2.87 ట్రిలియన్లడాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2024 ఫిబ్రవరి నాటికి సత్య నాదెళ్ల నికర విలువ 974 మిలియన్ డాలర్లు. కాగా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతు కూలీలను ఆదుకునేందుకు అనుపమ పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం కేంద్రంగా నడుస్తోన్న యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్కు ఈ విరాళాన్ని అనుపమ అందచేసిన సంగతి తెలిసిందే. -
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
విజయం YSRCP దే అంటున్న మైక్రోసాఫ్ట్ సర్వే
-
ఇకపై ఆండ్రాయిడ్ యాప్స్ను వాడలేరు!
ఆండ్రాయిడ్ యాప్స్ను మొబైళ్లతోపాటు పర్సనల్ కంప్యూటర్లలో కూడా చాలామంది వినియోగిస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్. విండోస్ 11 పీసీ వినియోగదారులు ఇకపై వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ను వినియోగించలేరని మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్కు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్ను నిలిపివేయనుంది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2025 మార్చి 5 నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ను వినియోగించడం కుదరదు. ఈ మేరకు తన సపోర్ట్ డాక్యుమెంట్లో తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విండోస్ సబ్సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్పై ఆధారపడి పనిచేస్తున్న అప్లికేషన్లు, గేమ్స్ ఎంతమాత్రం పనిచేయవు. అంతేకాదు 2024 మార్చి 5 తర్వాత కొత్త యాప్స్ను డౌన్లోడ్ చేయడం కూడా కుదరదు. ఒకవేళ ఇప్పటికే డౌన్లోడ్ చేసి యాప్స్ను వినియోగిస్తున్నట్లయితే కటాఫ్ డేట్ వరకు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుందని తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: ‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’ గతంలో మొబైల్ యాప్స్ను విండోస్ 11 పీసీల్లో వినియోగించడం సాధ్యమయ్యేది కాదు. 2021లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్స్టోర్ ఒప్పందం కుదుర్చుకుని వీటిని పీసీల్లో వినియోగించేలా ఏర్పాటు చేశాయి. దీంతో అమెజాన్ యాప్ స్టోర్ను డౌన్లోడ్ చేసుకుని, అందులోని పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్ను, గేమ్స్ను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
ప్రధానితో చర్చించిన అంశాలను పంచుకున్న బిల్గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 25 ఏళ్ల తర్వాత ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం సమావేశమయ్యారు. వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల అభివృద్ధి వంటి అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం గురించి మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీని ఆయన విదేశాల్లో చాలాసార్తు కలిశారని తెలిపారు. మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ అవసరాల గురించి మాట్లాడామన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అంశాల్లో ఆవిష్కరణలు సహా భారత్ నుంచి ఎలాంటి అంశాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలో చర్చించామని బిల్ గేట్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో చెప్పారు. గేట్స్ పోస్టుకు మోదీ స్పందించారు. నిజంగా అదో అద్భుత సమావేశమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గతిని మార్చే రంగాల గురించి చర్చించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. It is always inspiring to meet with @narendramodi and there was a lot to discuss. We talked about AI for public good; DPI; women-led development; innovation in agriculture, health, and climate adaptation; and how we can take lessons from India to the world. @PMOIndia pic.twitter.com/Y3REO67gxP — Bill Gates (@BillGates) February 29, 2024 ఇదీ చదవండి: ఇకపై యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ ఇటీవల సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్పూర్లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్లో బిల్గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు బిల్ గేట్స్
సాక్షి,హైదరాబాద్: సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ బుధవారం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఐడీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏఐ, క్లౌడ్, గేమింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు ఐడీసీ కేంద్రం కానుందని చెప్పారు. ఐడీసీలో ఇంజినీర్లను ఉద్దేశించి బిల్గేట్స్ చేసిన ప్రసంగం గొప్పదన్నారు. ఏఐ పవర్డ్ ఇండియాపై బిల్ గేట్స్ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారని చెప్పారు. ఇదీ చదవండి.. ఎనిమిది వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ -
‘మాకు ఓ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే చూడరా’.. వీడియో వైరల్!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఆయా టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. వాళ్లకి ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాలు వంటి వాటిని నిలిపివేస్తున్నాయి (గూగుల్ ఆపని ఎప్పుడో చేసింది). ఈ తరుణంలో ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులతో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాతావరణం ఎలా ఉంటుంది? తమకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే విషయాల్ని వెల్లడించారు. ఆ వీడియోలో ఆహ్లదకరమైన క్యాంపస్, ఫ్రీ స్నాక్స్, ఎన్ఏపీ రూమ్, పని చేసేందుకు అనువైన వాతావరణం ఉన్నాయంటూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు చెప్పారు. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్లో సిబ్బంది కోసం సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన క్యాంపస్లో హైటెక్ భద్రతా వ్యవస్థలతో మూడు భవనాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by twosisterslivingtheirlife (@twosisterslivingtheirlife) ఆఫీస్లోని ప్రతి ఫ్లోర్లో కాఫీ, టీ, పండ్లు, డ్రింక్స్తో పాటు ఇతర వంటలను ఆరగించేందుకు భారీ కిచెన్ రూములు, రెస్ట్ తీసుకునేందుకు గదులు సైతం ఉన్నాయంటూ ఉద్యోగులు వర్క్ ప్లేస్ గురించి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. రీల్కు మైక్రోసాఫ్ట్ స్పందించింది. ఉద్యోగులు వీడియో సంపూర్ణంగా ఉందంటూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ని షేర్ చేసింది. అయితే, ఆ వీడియో చూసిన నెటిజన్లు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. మిమ్మల్ని చూస్తుంటే మాకు అసూయగా ఉంది. మాకు కూడా మైక్రోసాఫ్ట్లో జాబ్స్ ఉన్నాయా? మేం చేరుతాం అంటూ కామెంట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సిబ్బంది మాత్రం మేం క్యాంపస్ వాతావరణాన్ని కోల్పోతున్నామని నిట్టూర్చుతున్నారు. -
సత్య నాదెళ్ల జీతం ఆస్తులు ఎంతో తెలుసా..?