
గాజాలో ఇజ్రాయెల్కు సాయపడేందుకు సంస్థ
టెక్నాలజీని దుర్వినియోగం చేస్తారా?
మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు బిల్గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్లపై భారతీయ మహిళా టెకీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గతవారం జరిగిన సంస్థ 50వ వార్షికోత్సవంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అదే సంస్థ ఉద్యోగిణి వనియా అగ్రవాల్ హఠాత్తుగా వేదిక వద్దకు వచ్చి అక్కడే ఉన్న సంస్థ తాజా, మాజీ సీఈవోలు సత్యా నాదెళ్ల, స్టీవ్ బామర్, బిల్ గేట్స్లనుద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ‘‘మీకెంత ధైర్యం?. యుద్ధంలో ఇజ్రాయెల్కు సాయపడేందుకు మైక్రోసాఫ్ట్కు చెందిన క్లౌడ్, ఏఐ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తారా?. పాలస్తీనియన్ల రక్తంతో సంబరాలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడండి. మైక్రోసాఫ్ట్ అందించిన టెక్నాలజీని ఉపయోగించి ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోంది.
దీంతో యుద్ధంలో గాజాలో 50,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇకనైనా మీరు ఇజ్రాయెల్తో కాంట్రాక్ట్ను తెగతెంపులు చేసుకోండి’’అని వనియా బిగ్గరగా అరిచారు. దాంతో అక్కడి సిబ్బంది వెంటనే ఆమెను వెనక్కి లాక్కెళ్లారు. సంబంధిత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఘటన తర్వాత వాణియా మైక్రోసాఫ్ట్లోని ఏఐ విభాగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అజూర్ క్లౌడ్, కృత్రిమ మేధ టెక్నాలజీలను వాడుకునేందుకు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్తో దాదాపు రూ.1,144 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కుదుర్చుకుందని వనియా ఆరోపించారు.
వనియాపైనా నెటిజన్ల విమర్శలు
సొంత సంస్థపై ఆరోపణలు చేసిన వనియాపై పలువురు నెటిజన్లు విమర్శిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమెను పాలస్తీనాకు పంపించండి. హమాస్ వాళ్లు ఈమెను బాగా చూసుకుంటారు’, ‘ఈమె నకిలీ హిందువు. ఈమెకు జిహాదీతో పెళ్లిచేయాలి’, ‘ఈమెను అమెరికా నుంచి బహిష్కరించి ఇండియాకు పంపేయాలి’, ‘ఇండియాకు వద్దు. పాలస్తీనాకు పంపాలి’, ‘పాలస్తీనాకు పంపేయండి. హమాస్కు మద్దతుగా ఎంచక్కా కొత్త సాఫ్ట్వేర్, ఏఐ వ్యూహాలు సిద్ధంచేస్తుంది’అంటూ వేర్వేరు రకాలుగా విమర్శించారు.