
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సెబీభారీ జరిమానా విధించింది. రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కోటి రూపాయల పెనాల్టీ విధించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో హెచ్డీఎఫ్సీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇవాళ ఈ షేర్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. 2.24 శాతం నష్టంతో 1443 వద్ద కొనసాగుతోంది.
సెబీ చట్టంలోని సెక్షన్ 15హెచ్బీ, ప్రకారం స్టాక్ బ్రోకింగ్ సంస్థ బిఆర్హెచ్ వెల్త్ క్రియేటర్స్ లిమిటెడ్ విషయంలో హెచ్డీఎఫ్సీ నిబంధనలు ఉల్లంఘించినట్టు సెబీ ఆరోపించింది. 2019 అక్టోబర్ 14న డబ్బులు చెల్లించాలని తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పాటించనందుకు కోటి జరిమానా విధించినట్టు సెబీ వెల్లడించింది. అక్టోబర్ 14, 2019 నుంచి ఇప్పటి వరకు వడ్డీతో పాటు రూ.158.68 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.