
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 82 పాయింట్లు లేదా 0.11% క్షీణించి 65,719 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లేదా 0.05% క్షీణించి 19,721 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 58 పాయింట్లు నష్టంతో 43,525 వద్ద, నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 168 పాయింట్లు లాభపడి 41,979 వద్దకు చేరాయి.
సెన్సెక్స్లో హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్ స్టాక్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
యూఎస్ మార్కెట్లు గతవారం లాభాల్లో ట్రేడయ్యాయి. యూరప్ మార్కెట్లు కూడా ర్యాలీ అయ్యాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు సోమవారం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ సారాంశం వెలువడుతుంది. దేశీయ మార్కెట్లో టాటా టెక్నాలజీస్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.477 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.565 కోట్లు విలువ చేసే స్టాక్స్ కొనుగోలు చేశారు.