టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్‌ ప్లాంటులో తయారీ | Suzuki to Supply Electric SUV to Toyota | Sakshi
Sakshi News home page

టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్‌ ప్లాంటులో తయారీ

Nov 3 2024 9:05 AM | Updated on Nov 3 2024 10:06 AM

Suzuki to Supply Electric SUV to Toyota

న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని టయోటా మోటార్‌ కార్పొరేషన్‌కు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్‌ను 2025 ప్రారంభంలో గుజరాత్‌ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్‌ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్‌ఫామ్‌లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికల్‌) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్‌–న్యూట్రల్‌ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్‌ తోషిహిరో సుజుకీ తెలిపారు.

ఇదీ చదవండి: టీవీఎస్‌ రికార్డ్‌.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!

ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్‌ కార్పొరేషన్, సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్‌కు దాదాపు 58 శాతం వాటా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement