![Too much regulatory guardrails could impede growth rate - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/03/6/UDAY%20KOTAK.jpg.webp?itok=kmd3gfxD)
రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా ఉండకూడదు
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్
న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థలు జాగ్రత్త చర్యలు అతిగా అమలు చేస్తే ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా, అతిజాగ్రత్తగా వ్యవహరించకూడదన్నారు. అయితే, ఏ రంగంలోనైనా ‘ప్రమాదాలు’ చోటు చేసుకుంటే సత్వరం స్పందించే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోటక్ ఈ విషయాలు తెలిపారు. ‘భారత్ భవిష్యత్తుపై నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను. అదే సమయంలో తగిన జాగ్రత్త లేకుండా కేవలం అవకాశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్లడమనేది రిసు్కతో కూడుకున్న వ్యవహారం. అలాగని, మరీ అతిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అక్కడికి (సంపన్న దేశం కావాలన్న లక్ష్యానికి) చేరుకోలేం‘ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్ల పాటు 7.5–8 శాతం జీడీపీ వృద్ధి రేటును కొనసాగించాలంటే సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ చెప్పారు.