
దేశంలో ఉద్యోగులు, యువత ఎంత సేపు కష్టపడాలి.. ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బాటలోకి మరో సీఈవో వచ్చి చేరారు. ఎక్కువ గంటలు పనిచేయడానికి ఏ మాత్రం సంకోచించకూడదని, జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన.. ఇంకా ఏమన్నారన్నది ఇక్కడ తెలుసుకుందాం..
ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ ‘వేఫెయిర్’ సీఈవో నీరజ్ షా (Wayfair CEO Niraj Shah).. ఎక్కువ పని గంటలు పనిచేయాలని తమ కంపెనీ ఉద్యోగులకు సూచించారు. ఎవరైనా సోమరితనంతో విజయం సాధించినట్లు చరిత్రలో లేదని ఉద్బోధించారు. విజయం సాధించాలంటే కష్టపడాల్సిందేనంటూ ఈ భారతీయ-అమెరికన్ బిజినెస్మన్ తమ ఉద్యోగులకు పంపిన ఒక నోట్లో పేర్కొన్నట్లుగా సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ కథనంలో నివేదించింది.
కంపెనీ డబ్బును మీదిగా భావించండి..
"ఎక్కువ గంటలు పని చేయడానికి, మరింత బాధ్యతగా ఉండటానికి, పనిని, జీవితాన్ని మిళితం చేయడానికి సంకోసించాల్సిన, సిగ్గుపడాల్సిన పనిలేదు. సోమరితనంతో ఎవరూ విజయం పొందినట్లు చరిత్రలో లేదు" అని నీరజ్షా ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ ఇటీవలి విజయాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ నెల ప్రారంభంలో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారు. కంపెనీ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయినీ తమదిగా భావించి మరింత బాధ్యతగా పనిచేయాలని ఉద్యోగులను కోరారు.
నారాయణమూర్తి బాటలో..
యువత ఎక్కువ పని గంటలు పనిచేయాలనే భావనను మొదటి సారిగా వెలుబుచ్చిన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. రెండు నెలల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. ఆ తర్వాత చర్చ విస్తృతమైంది. విభిన్న వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమందికి ఆయన భావనను సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు.
Comments
Please login to add a commentAdd a comment