జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
చిత్తూరు, కలెక్టరేట్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని మూడు నెలలు పాటు మార్చి 01, 2025 నుంచి మే 31 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 28, 2025 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేస్తున్న పాత్రికేయులకు మాత్రమే మార్చి 01,2025 నుంచి మే 31 వరకు అక్రిడిటేషన్ పొడి గింపు సౌకర్యం కొనసాగుతుందని తెలిపారు.
తెలుగు భాషాభ్యున్నతికి కృషి
తిరుపతి సిటీ: తెలుగు భాషాభివృద్ధికి సమష్టి కృషి, నిరంతర ప్రణాళికలు అవసరమని ఎస్వీయూ వీసీ సీహెచ్.అప్పారావు తెలిపారు. ఎస్వీయూ తెలుగు అధ్యయనశాఖ, ప్రాచ్య పరిశోధనా సంస్థ, బెంగళూరుకు చెందిన తెలుగు సంపద సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీయూ వేదికగా మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతీయ భాషల్లో తెలుగుకు ప్రత్యేక స్థానం, విశిష్టత ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విదేశీ భాషల పట్ల వ్యామోహం పెరుగుతోందని, తెలుగు భాష అంతరిస్తూ ఉందనే విషయం సత్య దూరమైనదని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బోధన, అధికారిక కార్యకలాపాల్లో తెలుగు ప్రాధాన్యం పెరగాలన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్.కృష్ణమూర్తి, విశ్రాంత ఆచార్యులు శలాక రఘునాథశర్మ, సదస్సు సంచాలకులు ఆచార్య రాజేశ్వరమ్మ, నిర్వహణ కార్యదర్శి ఆచార్య పీసీ వేంకటేశ్వర్లు, సలహాదారు డాక్టర్ రేమిళ్ల మూర్తి, పరిశోధకులు రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment