సినీ ఫక్కీలో.. 5.5 కేజీల బంగారం దోపిడీ | Bengaluru Businessman Looted Five And Half kg Gold | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో.. 5.5 కేజీల బంగారం దోపిడీ

Published Sun, Nov 21 2021 9:09 AM | Last Updated on Sun, Nov 21 2021 9:11 AM

Bengaluru Businessman Looted Five And Half kg Gold - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శివాజీనగర: వ్యాపారిని బెదిరించి సుమారు రూ.రెండున్నర కోట్ల విలువచేసే 5.5 కేజీల బంగారు బిస్కెట్లను దొంగలు దోచుకున్నారు. శుక్రవారం రాత్రి 9:20 సమయంలో బెంగళూరులో హలసూరు గేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వ్యాప్తిలో చోటు చేసుకుంది. వివరాలు.. డీ.కే.మార్కెట్‌లో నగల దుకాణం యజమాని సిద్దేశ్వర్‌ హరిబాసింధ్‌ బాధితుడు. కొన్నేళ్లుగా బంగారం విక్రయాలు నిర్వహిస్తున్నాడు. గుమాస్తా సూరజ్‌ శ్రీకాంత్‌ జాదవ్‌తో కలిసి స్కూటీ మీద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లోని అట్టికా గోల్డ్‌కు వచ్చారు. అక్కడ 5.5 కేజీల బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసి స్కూటీలో ఉంచుకుని బయల్దేరారు. 

రాజ్‌హోటల్‌ వద్ద ఘటన..  
కబ్బన్‌పేట మెయిన్‌ రోడ్డు రాజ్‌ హోటల్‌ వద్ద టర్నింగ్‌ తీసుకునేటప్పుడు బైక్‌మీద ఇద్దరు దుండగులు అడ్డుకొన్నారు. వారిలో వెనుక కూర్చొన్న వ్యక్తి కత్తితో దాడికి యత్నించగా సిద్దేశ్వర్‌ తప్పించుకునే యత్నంలో స్కూటీ నుంచి కిందపడిపోయారు. తక్షణమే దోపిడీదారుడు బంగారు బిస్కెట్లు ఉన్న స్కూటీని లాక్కుని సంజీవ్‌ నాయక్‌ లేన్‌ మీదుగా పరారయ్యాడని ఫిర్యాదులో తెలిపారు.

దొంగల్లో ఒకరు ఎరుపు రంగు లెదర్‌ జాకెట్, మరొకరు బ్లూ జీన్స్‌ ప్యాంట్, నల్లరంగు జాకెట్‌ ధరించాడు. ఇద్దరు హెల్మెట్‌ పెట్టుకున్నందున ముఖాలు కనిపించలేదని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న హలసూరు గేట్‌ పోలీసులు రాత్రి 10 గంటల నుంచి అన్నిచోట్ల నాకాబందీ జరిపినా ఉపయోగం లేకపోయింది. దుండగుల కోసం గాలింపు సాగుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement