
వివరాలు వెల్లడిస్తున్న శ్రావణి
సాక్షి, మహబూబాబాద్ (వరంగల్): ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, భర్త, అత్తమామలు, ఆడబిడ్డపై ఓ యువతి మానుకోట జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీస్ స్టేషన్ వద్ద బాధిత యువతి వివరాలు వెల్లడించింది. మానుకోట జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లఊకల్ గ్రామానికి చెందిన బాషిపంగు శ్రావణి, ఆకుల అశోక్ మూడేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
అనంతరం హైదరాబాద్లో కాపురం పెట్టారు. అక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం మరిపెడకు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా భర్త, ఆయన తల్లిదండ్రులు, బంధువులు తనను కులం పేరుతో దూషిస్తున్నారని, వారి కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రూ.20 లక్షల వరకు కట్నం వచ్చేదని అంటూ తనను హింసిస్తున్నారని ఆరోపించింది.
తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఆయన తల్లిదండ్రులు, బంధువులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గతంలో జరిగిన సంఘటనపై మరిపెడ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శ్రావణి రోదిస్తూ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment