రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి | Engineering Student Died In A Karimnagar | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజే మృత్యు ఒడికి..! 

Published Mon, Mar 8 2021 7:59 AM | Last Updated on Mon, Mar 8 2021 8:33 AM

Engineering Student Died In A Karimnagar - Sakshi

మణిదీప్‌ (ఫైల్‌)

ఆదివారం తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన మణిదీప్‌..వేగంగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

హుజూరాబాద్‌: పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది. బర్త్‌ డే సందర్భంగా స్నేహితులతో కలిసి డిన్నర్‌ చేసి వస్తానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరిన విషాద ఘటన హుజూరాబాద్‌లో  చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుజూరాబాద్‌ పట్టణంలోని ఆరెవాడకు చెందిన రాజూరి రాజు–అనిత దంపతుల కుమారుడు మణిదీప్‌ (22) మండలంలోని సింగాపూర్‌ కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన పుట్టినరోజు కావడంతో మణిదీప్‌తోపాటు పట్టణానికి చెందిన అతని స్నేహితులు శివనాథుని సంకీర్త్, కటకం గోపీచంద్, గర్రెపల్లి సాయిచరణ్, మేరుగు రోహిత్‌లు కారులో ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట సమీపంలో గల ఓ దాబాకు బయలుదేరారు. పర్కాల్‌ క్రాస్‌ రోడ్‌ సమీపంలో హుజూరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీని ఓవర్‌ టేక్‌ చేశారు.

ఈ క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడంతో కారు ముందు సీట్లో కూర్చున్న మణిదీప్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సంకీర్త్, గోపిచంద్, సాయిచరణ్‌లకు తీవ్ర, రోహిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వారి కుటుంబీకులు వరంగల్‌ తీసుకెళ్లారు. అయితే ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మణిదీప్‌ తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ మాధవి తెలిపారు. 

చదవండి : (పాకిస్తాన్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య!)
(నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement