డబ్బుల కోసం బామ్మను చంపేశాడు | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం బామ్మను చంపేశాడు

Published Sun, Jan 21 2024 5:12 AM

Minor Boy Along With Friend Kills Grandmother To Steal Money - Sakshi

న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది.

గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది.

అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్‌లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement