AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు | Sakshi
Sakshi News home page

AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు

Published Sat, Mar 30 2024 2:45 AM

Police saved elderly couple from suicide attempt - Sakshi

అర్ధరాత్రి ఫోన్‌కాల్‌కు స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయూమ్‌ అస్మీ 

గంటల వ్యవధిలోనే క్షేమంగా కాపాడిన వీరవల్లి పోలీసులు 

ఏపీ పోలీసుల పనితీరుకు తెలంగాణ వాసి ప్రశంసలు 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లి­పోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్‌లో నివసిస్తున్న కుమారుడు ఆందో­ళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యా­నికి పాల్పడతారోనని భయపడ్డాడు.

ఆ అర్ధరాత్రి సమయంలో­నే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయూమ్‌ అస్మీకి ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్‌ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్‌ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే  ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్‌ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్‌ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.    

Advertisement
Advertisement