క్రికెట్ బెట్టింగ్లో 12 మంది అరెస్టు
రాజానగరం: జాతీయ రహదారిని ఆనుకుని చక్రద్వారబంధం సమీపంలో ఉన్న బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్లో 12 మందిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న ఈ క్రికెట్ బెట్టింగ్లో పట్టుబడిన వారంతా కర్నాటక, భీమవరం వారేనన్నారు. ఈ వివరాలను సోమవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. భీమవరం మండలం బలుసుముడికి చెందిన దండు వెంకటవర్మ అలియాస్ సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్కు చెందిన ఇమ్మంది భరత్కుమార్(34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకున్నాడు. కొంతమందిని ఆఫీసు బుక్కీలుగా, కాంట్రాక్ట్ స్టాఫ్గా తీసుకుని కొన్ని నెలలు ఆన్లైన్ ద్వారా పంటర్స్(కస్టమర్స్)తో గెలుపు, ఓటములపై గేమింగ్ నడుపుతున్నాడు. ఈ బెట్టింగ్ ప్రక్రియ దుబాయ్ కేంద్రంగా జరుగుతోంది. భీమవరానికి చెందిన వినీత్ అనే వ్యక్తి దుబాయ్కి వెళ్లి, అక్కడి నుంచి కన్నడ, ఏపీబుక్.బర్లారి.కామ్లనే వెబ్సైట్లను నిర్వహిస్తుంటే, ఇద్దరు నిందితులు ఇక్కడి నుంచి అతనికి ఆడ్మిన్లుగా ఉన్నారు. గతేడాది జూలైలో అడ్మిన్లు ఇద్దరికీ కన్నడ 24.కామ్ అనే వెబ్సైట్ ద్వారా వైజాగ్లో 20 రోజుల శిక్షణ కూడా ఇచ్చాడు. ఆ తరువాత బి.కామ్ వెబ్ సైట్ని కొత్తగా ప్రారంభించి, ఈ బ్రిడ్జి కౌంటీలో అద్దెకు తీసుకున్న విల్లా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్పై మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు బెట్టింగ్లు నిర్వహించారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఎస్సై నాగార్జున ఆకస్మిక దాడి చేసి, నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 12 మంది నిందితుల్లో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా, మిగిలిన 10 మంది బుక్కీలు(ఆఫీస్ స్టాఫ్). వీరి నుంచి ఏడు ల్యాప్టాప్లు, 42 సెల్ఫోన్లు స్వాధీనపర్చుకున్నామని డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్లకు వినియోగిస్తున్న వెబ్సైట్లను క్లోజ్ చేయించడంతో పాటు, వారి బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు మనోహర్, నాగార్జున, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
నిందితులు కర్నాటక, భీమవరం వారే..
దుబాయ్ నుంచి కీ రోల్ పోషిస్తున్న వినీత్
నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment