
ఆవాసాల మధ్య అపరిశుభ్రత ప్రబలుతున్న అనారోగ్య సమస్యలు
బల్దియా, శివారు జిల్లాల్లో తప్పని పాట్లు పట్టించుకోని జీహెచ్ఎంసీ,
పురపాలికలు ఖాళీ స్థలాల్లో పేరుకుపోతున్న చెత్త, మురుగు
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురుగు నీటితో గుంతలుగా మారి కంపు కొడుతున్నాయి. ఓనర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఇటీవలి వర్షాలతో నగరంతో పాటు శివారు మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలోని పురపాలికల్లో మురుగు సమస్య తీవ్రంగా పరిణమిచ్చింది. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం, మురుగు నీరు పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. కాలనీల వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో
అపరిశుభ్రతకు నిలయాలుగా..
పురపాలిక చట్టం ప్రకారం ఖాళీ స్థలాల్లో ఎలాంటి ముళ్ల పొదలు పెరగకుండా, అపరిశుభ్రత లేకుండా స్థల (ప్లాట్ల) ఓనర్లు చూసుకోవాలి. లేదంటే పుర అధికారులు స్థలం యజమానికి నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలి. కానీ.. శివారు జిల్లాల పరిధిలోని జీహెచ్ఎంసీ సర్కిళ్లతో సహా 29 పురపాలికల్లోని పలు కాలనీల్లో ఖాళీ ప్లాట్లు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. భావి అవసరాల దృష్ట్యా కొందరు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి అలాగే ఖాళీగా వదిలేస్తున్నారు.
ఆయా కాలనీల్లో గృహ నిర్మాణాలు ఊపందుకుని, ప్లాట్లకు విలువ పెరిగిన తర్వాత చూద్దాంలే అనుకొని ఏళ్ల తరబడి వదిలేయడంతో చెత్త, ముళ్లకంప చెట్లు పెరిగి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. నగర శివారు జిల్లాల్లోని మేడ్చల్, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్ తదితర మున్సిపల్ సర్కిళ్లతో పాటు జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, తూముకుంట తదితర 29 పురపాలక సంఘాల్లో ఇటీవల కురిసిన వర్షం జల్లులతో కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచి దోమలు పెరగడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ స్థలాల్లోనూ..
ప్రైవేటు ప్లాట్ల సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు,డంపింగ్ యార్డులు అంతర్గత, ప్రధాన రహదారుల వెంట ఉన్న గ్రీన్ బెల్టు తదితర స్థలాలు చెత్తకుండీలుగా, మురుగునీటి నిలయాలుగా మారుతున్నాయి. పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నిర్మాణ వ్యర్ధాలను, భోజన, ప్లాస్టిక్ వ్యర్థాలను డంపు చేస్తున్నారు. ప్రతి ఏటా పట్టణ ప్రగతి, ఇతర ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు సందర్భంగా వీటిని శుభ్రం చేసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది.
కరువైన పర్యవేక్షణ..
స్థల యజమానులు తమ ప్లాట్లలో మురుగు, వర్షం నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన్నప్పటికీ, పట్టించుకోవటం లేదు. దీన్ని పర్యవేక్షించాల్సిన పురపాలిక అధికారులు.. అటువైటు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్తాచెదారంతో ఖాళీ ప్లాట్లు మురుగు కూపాలుగా మారుతున్నాయి. సంబంధిత ఓనర్లకు పురపాలక సంఘాలు అడపాదడపా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నాయి. కొందరి పాట్ల ఓనర్ల వివరాలు తెలియక నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.