
ఒక వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి, గురువు– ఈ క్రమంలో ఈ ముగ్గురికీ అత్యంత గౌరవనీయమైన, పూజనీయమైన స్థానం ఇవ్వబడింది. జన్మనిస్తుంది కనుక తల్లి, జన్మకు కారకుడై, బాల్య, యవ్వన దశలలో పోషణ భారాన్ని వహించి, రక్షణను కలిగిస్తాడు కనుక తండ్రి, విద్యాబుద్ధులు నేర్పి సత్కార్యోన్ముఖుడిని, ప్రయోజకుడిని చేస్తాడు కనుక గురువు... సదా పూజనీయులనే అభిప్రాయాన్ని పండితులు, పూర్వ సాహిత్యవేత్తలు ప్రజలకు కలిగించారు. ఈ భావాన్ని ధ్రువీకరించిన వ్యాసుడి మహా భారతం, తల్లిదండ్రులను, గురువును పూజించడం వలన సమకూరే అధ్యాత్మిక, పారలౌకిక ప్రయోజనాలను గురించి, అనుశాసనిక పర్వం, సప్తమాధ్యాయంలోని ఈ క్రింది శ్లోకం ద్వారా, స్పష్టం చేసి చెప్పింది.
యేన ప్రీణాతి పితరం తేన ప్రీతః ప్రజాపతిః
ప్రీణాతి మాతరం యేన పృథివీ తేన పూజితా.
యేన ప్రీణాత్యుపాధ్యాయం తేన స్యాద్ బ్రహ్మ పూజితమ్.
ఒక వ్యక్తి తన తండ్రిని ప్రసన్నుడిని చేయడం ద్వారా ప్రజాపతినీ, తన తల్లిని పూజించడం ద్వారా భూదేవినీ, తన గురువును తృప్తి పరచడం ద్వారా బ్రహ్మదేవుడినీ పూజించిన వాడు అవుతున్నాడు అని పై శ్లోకం భావం. అలా, ఏ వ్యక్తి తన తల్లిని, తండ్రిని, గురువును గౌరవించడం, ఆదరించడం అన్న మూడు ధర్మాలను శ్రద్ధగా ఆచరిస్తాడో, ఆ వ్యక్తికి అన్ని ధర్మాలూ సక్రమంగా నిర్వర్తించబడిన ఫలం దక్కుతుందని, అలా కాక ఏ వ్యక్తి ద్వారా ఈ మూడు ధర్మాలు సరిగా ఆచరించబడక, అనాదరించబడతాయో, ఆ వ్యక్తి నిర్వర్తించే యజ్ఞయాగాది క్రియల వలన సమకూరే ఫలములన్నీ నిరుప యోగంగా, నిష్ఫలములుగా మారిపోతాయని కూడా ఆ సందర్భంలోనే పై శ్లోకానికి కొనసాగింపుగా చెప్పబడింది.
మిగతా జీవితం ఎలా గడిచినా, వృద్ధాప్యంలో మనిషి తన సంతానం సహా యాన్నీ, ఆసరానూ కోరుకుంటాడు. ఆ రోజులలో, తాను కని, ప్రేమగా చూసుకుంటూ పెంచి, పెద్దచేసిన తన సంతానం చేతిలోనే అగౌరవానికి, నిర్లక్ష్యానికి గురికావడాన్ని మించిన మానసిక క్షోభ మనిషికి వేరే ఉండదు. వృద్ధాప్యంలో ఏ వ్యక్తికీ ఆ బాధ కలగకూడదన్న సదుద్దేశంతో చేసిన నియమాలు, చెప్పిన విషయాలు పైవి. మానవీయమైన ఈ ధార్మిక విధిని పాటించని సమాజానికి ఆధ్యాత్మిక పురోగతి
ఉండగలదనుకోలేము.
– భట్టు వెంకటరావు