
రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ వేడుకను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా, బిర్యానీ చేసుకుని ఆనందంగా విందు ఆరగిస్తారు. ఈ సందర్భంగా నోరూరించే ఆ వంటకాల తయారీ ఎలానో చూద్దామా..!.
షీర్ కుర్మా..
కావల్సినవి: పాలు – అర లీటర్ (3 కప్పులు); నెయ్యి – టేబుల్స్పూన్; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)– అర కప్పు; జీడిపప్పు – 8 (తరగాలి); బాదంపప్పు – 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు – 8 (తరగాలి); ఖర్జూర – 9 (సన్నగా తరగాలి); యాలకులు – 4 (లోపలి గింజలను ΄÷డి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్మిస్ – టేబుల్ స్పూన్; రోజ్వాటర్ – టీ స్పూన్
తయారీ విధానం: సేవియాన్ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి.అదె గిన్నె లేదా పాన్లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి ∙విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు. కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు.
నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.
కచ్చీబిర్యానీ..
కావల్సినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం– వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)
తయారీ విధానం:
బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి.
మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి.
(చదవండి: ప్రేమను పంచే శుభదినం ఈద్)