ఏముంధరన్నో..! | - | Sakshi
Sakshi News home page

ఏముంధరన్నో..!

Published Wed, Feb 19 2025 1:30 AM | Last Updated on Wed, Feb 19 2025 1:28 AM

ఏముంధ

ఏముంధరన్నో..!

సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: రాష్ట్రంలో ఈ ఏడాది ఉమ్మడి గుంటూరు (పల్నాడు, గుంటూరు) జిల్లాతోపాటు ప్రకాశం, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో సుమారు 1.96 లక్షల హెక్టార్లలో మిర్చి సాగైంది. 11.67 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఏడాది దిగుబడులు దారుణంగా పడిపోయాయి. ఎకరాకు పది నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మాత్రం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తామర, జెమినీ వైరస్‌ల ప్రభావంతోపాటు వాతావరణ మార్పులే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడి

గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు పెట్టుబడులూ భారీగా పెరిగాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీలు, రవాణా ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఫలితంగా ఎకరాకు రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులైతే పెట్టుబడి మరింత పెరుగుతుంది. పెట్టుబడి పెరిగి దిగుబడి సరిగా రాక సతమతమవుతున్న రైతులపై ఇప్పుడు గోరుచుట్టుపై రోకటిపోటులా ధరలు మంట పుట్టిస్తున్నాయి. యార్డులో పలుకుతున్న ధరలను చూసి కర్షకులు కన్నీరు కారుస్తున్నారు. నాలుగైదు నెలలుగా ఇదే దుస్థితి ఉండంతో ఆవేదన చెందుతున్నారు.

మిర్చి రకాలు 2020–24 ప్రస్తుతం

(క్వింటాకు రూ.వేలల్లో) (క్వింటాకు రూ.వేలల్లో)

తేజ 21–26 10–13

డీలక్స్‌ 20–25 10–12

సింజెంటా బ్యాడిగ 25– 36 10–13

341, 273 18–25 9–12

మిర్చి రైతుల గగ్గోలు దారుణంగా పతనమైన ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తున్న వైనం దిగుబడులూ అంతంతమాత్రమే యార్డులో దోపిడీకి గురవుతున్న కర్షకులు పట్టించుకోని కూటమి సర్కారు కనీసం కూలీల ఖర్చూ మిగలని దుస్థితి వైఎస్సార్‌ సీపీ హయాంమిరప పంటకు స్వర్ణయుగం నేడు మిర్చి యార్డుకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్షకుల కష్టాలు అడిగి తెలుసుకోనున్న జననేత

ధరలు ఎందుకు తగ్గాయంటే..

జగనన్న పాలనలో రికార్డు స్థాయిలో ధరలు..

వైఎస్సార్‌ సీపీ, కూటమి ప్రభుత్వాల హయాంలోమిర్చి ధరల వ్యత్యాసమిలా..

ఘాటైన మిర్చి సాగుకు గుంటూరు ప్రసిద్ధి అయితే.. దీటైన ధర ఇవ్వడంలో మిర్చి యార్డు పెట్టిందిపేరు. ఇక్కడి పంటకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. గత నాలుగేళ్లూ లాభాలు చూసిన రైతుల కన్నులు.. ఇప్పుడు కనీస ధర లేక చెమరుస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ధరలు రోజురోజుకూ నేలచూపులు చూస్తుండడంతో కర్షకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా యార్డులో రైతులు దోపిడీకి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మిర్చి యార్డుకు రానున్నారు. కర్షకుల కష్టాలు అడిగి తెలుసుకుని అండగా నిలవనున్నారు. రైతుల తరఫున కూటమి సర్కారు అలక్ష్యంపై గళమెత్తనున్నారు.

తెలుగు రాష్ట్రాల మిర్చిని కొనుగోలు చేసే థాయిలాండ్‌, వియత్నాం, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, బర్మా తదితర దేశాల్లోనూ కొంతమేర మిర్చి సాగు చేస్తుండడంతో గిరాకీ తగ్గింది. దీనికితోడు గత ఏడాది సాగు చేసిన 27 లక్షల బస్తాల మిర్చి శీతల గిడ్డంగులలో నిల్వ ఉండిపోవడం కూడా ధరలు తగ్గుదలకు ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ పెట్టిన మిర్చికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ సరుకును తక్కువ ధరకు అమ్ముకోవడానికి రైతులు సుముఖంగా లేరు. కొత్త సరుకుకు అనుకున్న మేర డిమాండ్‌ లేదు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌న్‌రెడ్డి పాలనలో నాలుగేళ్లు మిర్చి రైతులకు స్వర్ణయుగమని చెప్పాలి. రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. వైఎస్సార్‌ సీపీ హయాంలో దిగుబడులు బాగా వచ్చాయి. ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అప్పట్లో రైతులు సీజన్‌కు ఐదు నుంచి ఆరు కోతలు కోసేవారు. ఈ ఏడాది రెండు, మూడు కోతలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి.

20 రోజుల్లో క్వింటాకు రూ.3 వేలు తగ్గుదల

నేను 10 ఎకరాల్లో తేజ రకం సాగు చేశాను. ఎకరాకు కౌలుతో కలుపుకుని సుమారు రూ.2 లక్షల పెట్టుబడైంది. 20 రోజుల కిత్రం 70 క్వింటాళ్లు యార్డుకు తెచ్చా. క్వింటా రూ.15 వేలు ధర పలికింది. సోమవారం మరో 90 బస్తాలు తీసుకువచ్చా. కానీ రూ.10 వేలు నుంచి రూ.12 వేలు మాత్రమే అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. 20 రోజుల్లో క్వింటాకు రూ.3 వేలు ధర తగ్గింది. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.

–కె.దేవేంద్ర, రైతు, నల్లచెలిమిల, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా

గత ఏడాది క్వింటా రూ.25 వేలు

నేను రెండు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గత ఏడాది ఎకరాకు 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 15 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితులు లేవు. ఎకరాకు రూ.2.30 లక్షలు వరకు ఖర్చు చేశాను. ప్రస్తుతం 17 బస్తాలు ఎరుపు కాయలు తెచ్చా. క్వింటాకు రూ.13,400 ధర పలికింది. ఇవే కాయలు గతేడాది క్వింటా రూ.25 వేలు వరకు పలికాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి.

–వై.దేవదాసు, రైతు, నీలగంగవరం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా

గిట్టుబాటు ధర కల్పించాలి..

నేను రెండెకరాల్లో తేజ రకం సాగు చేశా. రెండు ఎకరాలకు ఇప్పటి వరకు రూ.3.50 లక్షల వరకు పెట్టుబడైంది. గత ఏడాది ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 10 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది క్వింటా రూ.25 వేలు పలికిన ధర ఇప్పుడు రూ.13 వేలు మించి పలకడం లేదు. పెట్టుబడులు భారీగా పెరిగాయి. యార్డుకు 10 క్వింటాళ్ల మిర్చిని తెచ్చా. క్వింటా రూ.13 వేలు వేశారు. క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.22 వేలు వస్తే పెట్టుబడి వస్తుంది. లేదంటే భారీ నష్టం తప్పదు.

–జి.సుబ్బయ్య, రైతు, మంగన్నపల్లే, పోరుమామిళ్ళ మండలం, కడప జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
ఏముంధరన్నో..! 1
1/4

ఏముంధరన్నో..!

ఏముంధరన్నో..! 2
2/4

ఏముంధరన్నో..!

ఏముంధరన్నో..! 3
3/4

ఏముంధరన్నో..!

ఏముంధరన్నో..! 4
4/4

ఏముంధరన్నో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement