
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన దరిమిలా, భారతదేశం ప్రతీకార సైనిక చర్యగా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. దీనిలో పాకిస్తాన్ వైమానిక దళం (పీఏఎఫ్)నకు చెందిన ఆరు యుద్ధ విమానాలు(Fighter jets), రెండు ఎంతో విలువైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమయ్యిదని భారత అధికార వర్గాలు తెలిపాయి.
భారత వైమానిక రక్షణ విభాగాలు పాక్ విమానాలను గగనతల పోరాటంలో నాశనం చేశాయి. పాకిస్తాన్లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో ఈ యుద్ధాలు జరిగాయి. ఈ జెట్ల కూల్చివేతలను రాడార్ ట్రాకింగ్ ద్వారా నిర్ధారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢీకొన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత పాకిస్తానీ విమానం ట్రాకింగ్ గ్రిడ్ల నుండి అదృశ్యమైందని ఆ వర్గాలు వివరించాయి. పాకిస్తాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్వీడిష్కు చెందిన మరో ఏఈడబ్ల్యూ అండ్ సీవిమానం ఎయిర్-టు-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది.
ఐఏఎఫ్ మానవరహిత వ్యవస్థలపై కూడా దాడులు చేసింది. రాఫెల్, ఎస్యూ-30 జెట్లతో కూడిన ఆపరేషన్లో చైనాకు చెందిన ఎలిట్యూడ్, లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్లను కలిగిన హ్యాంగర్ ధ్వంసమయ్యింది. భారత వైమానిక రక్షణ విభాగాలు సంఘర్షణ సమయంలో జమ్ముకశ్మీర్, రాజస్థాన్లోని పలు పాకిస్తాన్ యూసీఏవీలను అడ్డగించి కూల్చివేశాయి. మే ఆరు-ఏడు తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్(Pakistan)లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంతో భారతదేశం తన సైనిక ప్రతిస్పందన ప్రారంభించింది.
బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే-ఎ-తోయిబా శిబిరం, ముజఫరాబాద్, కోట్లి, రావలకోట్, భీంబర్, చక్వాల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను భారత సైన్యం గుర్తించింది. భారత్ తన తొలి దాడుల తర్వాత, పశ్చిమ సరిహద్దు వైపు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కాగా తీవ్రమైన దౌత్యపరమైన ఒత్తిడి అనంతరం పాకిస్తాన్ డిజిఎంఓ, మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా.. భారత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ను సంప్రదించి తక్షణ కాల్పుల విరమణకు అభ్యర్థించారు. తదనంతరం భారత్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తిరిగి భారత్ ప్రతీకార దాడులకు దిగుతుందని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: బీహార్లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల