
కొలంబో: అన్నిరకాలుగా సంక్షోభం కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. లీటర్ పెట్రోల్ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. పెట్రో ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం పెరిగాయి. దీంతో జనం మండిపడుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు తప్పుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సెంట్రల్ లంకలోని రంబుక్కన వద్ద హైవేను, రైల్వే ట్రాక్ను దిగ్బంధించారు. వారిపై పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలనని అధ్యక్షుడు గొటబయ రాజపక్స అన్నారు. దేశ దుస్థితికి తన తప్పిదాలూ కారణమేనని అంగీకరించారు. రసాయన ఎరువులపై నిషేధం దారుణంగా బెడిసికొట్టిందన్నారు.
సంక్షోభ పరిష్కార చర్యల్లో భాగంగా అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసి, పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కల్పించాలని ప్రధాని మహింద రాజపక్స ప్రతిపాదించారు. 41 మంది ఎంపీలు తాము పాలక సంకీర్ణానికి దూరమవుతున్నట్టు సభలోనే ప్రకటించారు.
చదవండి: (దద్దరిల్లుతున్న డోన్బాస్)
Comments
Please login to add a commentAdd a comment