
ఒడిశా రైలు ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారాన్ని వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆదివారం జరిగిన ప్రార్థనల్లో చనిపోయిన 275 మంది మృతికి సంతాపాన్ని తెలిపారు.
"ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం అత్యంత విషాదకరం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. గాయాల బారిన పడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అండగా మా ప్రార్ధనలు ఉంటాయి." -ఆంటోనియో గుటెర్రెస్
వాటికన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం జరిగిన ప్రార్థనల్లో ప్రత్యేకంగా ఒడిశా ప్రమాదం గురించి ప్రస్తావించి మృతులకు సంతాపాన్ని తెలియజేశారు.
" ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మలను పరలోకంలో ప్రభువు అంగీకరించును గాక. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలోని బాధితులకు నా ప్రార్ధనలు తోడుగా ఉంటాయి. గాయపడినవారికి, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను." - పోప్ ఫ్రాన్సిస్
బాలాసోర్ ఘటనలో 275 మంది మరణించగా వెయ్యికి పైగా గాయపడ్డారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ఈ
ట్రైన్ యాక్సిడెంట్ మిగిలిపోతుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపి, మరెందరినో దిక్కులేని వారిగా మిగిల్చిన ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment